Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Tuesday, January 7, 2014

 అమెరికా - అణు ఒప్పందం - క్రయోజనిక్ ఇంజన్

మనకు క్రయోజనిక్‌ పరిజ్ఞానం ఇవ్వకపోవడం వెనుకా, అణు రియాక్టర్లు ఇవ్వడం వెనుకా కూడా అమెరికా ప్రయోజనాలు దాగున్నాయిగానీ, భారత్‌ ప్రయోజనాలు లేవు. ఇద్దరికీ పరస్పర ప్రయోజనాలు అనేవి రెండు దేశాల సంబంధాల్లో లేవు. భారత్‌కు క్రయోజనిక్‌ పరిజ్ఞానం అందిస్తే పదేళ్ల ముందే ఇస్రో ఉపగ్రహ వాణిజ్య రంగంలో అమెరికా కంపెనీలతో పోటీపడేది. అంతరిక్ష పరిశోధనలోనూ, రాకెట్‌ పరిజ్ఞానంలోనూ ఇతర అగ్రరాజ్యాలకు భారత్‌ సవాలుగా మారేది. దాన్ని అడ్డుకోవడానికి అమెరికా శతవిధాలా ప్రయత్నించింది. అమెరికా సృష్టించిన అడ్డంకులను అధిగమించి ముందుకుపోయిన మన శాస్త్రవేత్తల కృషికి నేడు దేశమంతా జేజేలు పలుకుతోంది.




   ఆదివారం సాయంకాలం శ్రీహరికోట నుంచి జిఎస్‌ఎల్‌వి రాకెట్‌ జిశాట్‌ ఉపగ్రహాన్ని మోసుకుంటూ అంతరిక్షంలోకి దూసు కుపోతుంటే చూసి ఆనందిరచని భారతీయుడు ఉండడు. మన శాస్త్రవేత్తలు 20 ఏళ్లు శ్రమించి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్‌ ఇంజన్‌ ఎట్టకేలకు జయప్రదం కావడం మన అంతరిక్ష కార్యక్రమానికి పెద్ద ఊపు తెస్తుంది. దీనివల్ల శాస్త్ర-సాంకేతిక, వాణిజ్య, సైనికపరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మొదటిది, రానున్న కాలంలో మన కమ్యూనికేషన్స్‌ అవసరాలకు కావలసిన ట్రాన్స్‌పాండర్స్‌ కోసం విదేశాల మీద, ముఖ్యంగా ఇప్పటిలా ఐరోపా స్పేస్‌ ఏజెన్సీ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. రెండోది, మన అంతరిక్ష కార్యక్రమం ఇప్పటికన్నా విస్తరించాలంటే, అంటే మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలూ, స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం వంటి కార్యకాలాపాలకు వెళ్లాలంటే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పిఎస్‌ఎల్‌వి రాకెట్‌ శక్తి సరిపోదు. పిఎస్‌ఎల్‌వి ఘన, ద్రవ ఇంధన ఇంజన్లతో కూడిన రాకెట్‌. జిఎస్‌ఎల్‌వికి ఈ ఇంజన్లతోబాటు అదనంగా క్రయోజనిక్‌ ఇంజన్‌ తోడవుతుంది. క్రయెజనిక్‌ ఇంజన్‌ అత్యంత శీతల స్థితిలో ఉన్న ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ వాయువులను తగు మోతాదులో కలపడం ద్వారా అంతరిక్షంలో రాకెట్‌ను వేగంగా ముందుకు తీసుకుపోయే శక్తిని సమకూరుస్తారు. ఇది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ.
   క్రయోజనిక్‌ రాకెట్‌ పరిజ్ఞానం మనకు రాకుండా అడ్డుకున్న అమెరికాకు మన శాస్త్రవేత్తలు చెంపదెబ్బ కొట్టి మరీ ఈ ఘనకార్యం సాధించారని దాదాపు మీడియా అంతా రిపోర్టు చేసింది. నిజమే మనకు అమెరికా లేక ఇతర పశ్చిమ దేశాలు సహకరించి ఉంటే పదిహేనేళ్ల క్రితమే మనం ఈ తరహా రాకెట్లు ఉపయోగించేవాళ్లం. కానీ అమెరికా మనకీ క్రయోజనిక్‌ పరిజ్ఞానం ఇవ్వకపోగా మనకు రాకుండా అడ్డుకోడానికి అన్ని విధాలా ప్రయత్నించింది. ఏ దేశమూ మనకు క్రయోజనిక్‌ పరిజ్ఞానం ఇవ్వకపోతే 1991లో మన అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' రష్యాకు చెందిన గ్లావ్‌కాస్మోస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడు క్రయోజనిక్‌ రాకెట్లను సాంకేతిక పరిజ్ఞానంతో సహా మనకు అందజేయాలన్నది ఈ ఒప్పందం సారం. కానీ 1993 జులైలో రష్యన్‌ కంపెనీ ఒప్పందం నుంచి వైదొలగింది. కారణం అమెరికా విధించిన ఆంక్షలు. మనకు గనుక రష్యా క్రయోజనిక్‌ పరిజ్ఞానాన్ని అందజేస్తే క్షిపణి సాంకేతిక పరిజ్ఞాన నియంత్రణ ఒప్పందం (ఎంటిసిఆర్‌)ను ఉల్లంఘించినట్లవుతుందని అమెరికా గగ్గోలు పెట్టి ఆంక్షలకు దిగింది. దాంతో అప్పటికే బలహీనపడిన రష్యా భారత్‌తో ఒప్పందం నుంచి వెనక్కు తగ్గింది. దాంతో ఇస్రోకి మార్గాంతరం లేక స్వంతంగా ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవలసి వచ్చింది.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఇటీవల మనం అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పం దంతో పోల్చి పరిశీ లించాలి. అంతరిక్ష పరిశోధ నలాగే అణు పరిశోధన విష యంలో కూడా అమెరికా మనపై ఆంక్షలు పెట్టింది. వివక్షతతో కూడిన అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై భారత్‌ సంతకం చేయలేదు కాబట్టి మనకు అణు ఇంధనం, సాంకేతిక పరిజ్ఞానం రాకుండా అడ్డుకుంది. అణు ఇంధన ఎగుమతి దేశాల కూటమి ఏకమై భారత్‌కు ఎటువంటి అణు సాంకేతిక పరిజ్ఞానం రాకుండా చేశాయి. దాంతో క్రయోజనిక్‌ పరిజ్ఞానం విషయంలో మాదిరిగానే అణు సాంకేతిక పరిజ్ఞానంలో కూడా భారత శాస్త్రవేత్తలు స్వయంగా ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో భారజల అణు రియాక్టర్లు రూపొందించారు. ఫాస్ట్‌ బ్రీడర్‌ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ పరిజ్ఞానం ద్వారా అణు వ్యర్ధాలను తిరిగి ఇంధనంగా మార్చే సైకిల్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. కల్పక్కంలోని ఇందిరా గాంధీ అణు పరిశోధనా శాల దీనికి వేదిక.
   భారత దేశంలో యురేనియం నిల్వలు తక్కువ. థోరియం నుంచి అణు ఇంధనం తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకుంటే అణు ఇంధనంలో మనం అగ్రరాజ్యంగా మారతాం. దానిపై మన దేశంలోనూ, చైనాలోనూ విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. అమెరికా ఈ రంగంలో పరిశోధనలో బాగా వెనుకబడి ఉంది. కల్పక్కంలో థోరియంను అణు ఇంధనంగా ఉపయోగించేందుకు ఒక చిన్న ప్రోటోటైపు అణు రియాక్టరును కూడా నిర్మించారు. క్రయోజనిక్‌ ఇంజన్‌ మాదిరిగానే అణు ఇంధనం, అణు పరిజ్ఞానం విషయంలో కూడా భారత్‌ స్వయం సమృద్ధి సాధించగలదన్న నమ్మకం ఏర్పడింది.
   సరిగ్గా ఈ సమయంలో, అమెరికా-భారత్‌ అణు ఒప్పందం కుదిరింది. వామపక్షాలు అణు ఒప్పందానికి వ్యతిరేకంగా యుపిఎ-1 ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాయి. మన్మోహన్‌ సింగ్‌గారు ప్రభుత్వం పడిపోయినా ఫరవాలేదు అణు ఒప్పందం కుదరాల్సిందే అన్నారు. మన యువరాజు రాహుల్‌ గాంధీ పార్లమెంటులో మొట్టమొదటిసారిగా నోరు తెరుస్తూ కళావతి కథ చెప్పారు. అమెరికాతో అణు ఒప్పందం కుదరకపోతే ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న కళావతి ఇంట్లో కాంతులు ఎలా వస్తాయని ప్రశ్నించారు? మన అభివృద్ధికి అమెరికా అణు ఇంధనం, అణు రియాక్టర్లు అత్యవసరమని పాలక పక్షాలూ, కార్పొరేట్‌ మీడియా ఇల్లెక్కి ప్రచారం చేశాయి.
ఇక్కడ ఒక్క ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకోవాలి. ఇరవై ఏళ్లుగా భారత్‌కు క్రయోజనిక్‌ పరిజ్ఞానం ఇవ్వడానికి నిరాకరించిన అమెరికా అణు ఇంధనం, అణు రియాక్టర్లు ఇవ్వడానికి ఎందుకు ముందుకొచ్చింది. తిరగేసి చెప్పుకోవాలంటే అణు ఇంధన పరిజ్ఞానం ఇవ్వడానికి ఇష్టపడ్డ అమెరికా క్రయోజనిక్‌ ఇంజన్‌ను ఎందుకు ఇవ్వలేదు. సరికదా ఇతరులు ఇస్తే కూడా ఎందుకు అడ్డుకున్నది? దీనికి సమాధానం చెప్పలేనంత అమాయకత్వంలో మన పాలకులు ఉన్నారా? గత ఇరవై సంవత్సరాలుగా భారత్‌-అమెరికా సంబంధాలు ఉరకలు పరుగులతో ముందుకు సాగుతుంటే, మనకు అమెరికా నుంచి అణు సరఫరాలు, సైనిక సరఫరాలు, పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా అందుతుంటే ఈ క్రయోజనిక్‌ పరిజ్ఞానం విషయంలో అమెరికా ఎందుకు ముందుకు రాలేకపోయింది?
   మనకు క్రయోజనిక్‌ పరిజ్ఞానం ఇవ్వకపోవడం వెనుకా, అణు రియాక్టర్లు ఇవ్వడం వెనుకా కూడా అమెరికా ప్రయోజనాలు దాగున్నాయిగానీ, భారత్‌ ప్రయోజనాలు లేవు. ఇద్దరికీ పరస్పర ప్రయోజనాలు అనేవి రెండు దేశాల సంబంధాల్లో లేవు. భారత్‌కు క్రయోజనిక్‌ పరిజ్ఞానం అందిస్తే పదేళ్ల ముందే ఇస్రో ఉపగ్రహ వాణిజ్య రంగంలో అమెరికా కంపెనీలతో పోటీపడేది. అంతరిక్ష పరిశోధనలోనూ, రాకెట్‌ పరిజ్ఞానంలోనూ ఇతర అగ్రరాజ్యాలకు భారత్‌ సవాలుగా మారేది. దాన్ని అడ్డుకోవడానికి అమెరికా శతవిధాలా ప్రయత్నించింది. అమెరికా సృష్టించిన అడ్డంకులను అధిగమించి ముందుకుపోయిన మన శాస్త్రవేత్తల కృషికి నేడు దేశమంతా జేజేలు పలుకుతోంది.
కానీ అమెరికాతో అణు ఒప్పందం కుదిరిన తరువాత మన అణు పరిశోధన ఏమైంది? మన ఫాస్ట్‌బ్రీడర్‌ పరిశోధన గురించి గత ఎనిమిదేళ్లలో ఒక్క మాట కూడా పత్రికల్లో రావడం లేదెందుకు? మన పాలకులు దీని గురించి అస్సలు మాట్లాడ్డం లేదెందుకు? భారత్‌కు ఏడు లక్షల కోట్ల రూపాయల విలువైన అణు రియాక్టర్లు, ఇంధనం అమ్ముకుని లాభాలు దండుకుపోవడానికి పశ్చిమ దేశాలు ఒక దానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఒకవేళ అవి సరఫరా చేసే రియాక్టర్లలో ప్రమాదం జరిగితే దానికి తమది బాధ్యత కాదనీ, కష్టం నష్టం భారత దేశమే భరించాలనీ అవి మన చేతనే చట్టాలు చేయిస్తున్నాయి. వీటన్నిటి వెనుక అమెరికా ప్రయోజనాలున్నాయి. తన దగ్గర అణు ఇంధనం, పాతబడిన అణురియాక్టర్‌ పరిజ్ఞానం అమ్ముకోవడం అమెరికాకు అవసరం. అందుకే అది అణ్వస్త్ర నిరోధక ఒప్పందాన్ని బైపాస్‌ చేసి మనతో 123 ఒప్పందం కుదుర్చుకుంది. అనేక షరతులతో కూడిన ఒప్పందాన్ని మనపై రుద్దింది.
   అమెరికా తనకు ఏది ప్రయోజనమైతే అది చేసింది. చేస్తోంది. దానికి అమెరికా-భారత్‌ సత్సంబంధాలు అనే ముద్దుపేరు పెడుతోంది. దురదృష్టమేమంటే మన పాలకులే మనదేశానికీ, ప్రజలకూ ఏది ప్రయోజనమో అది చేయడం లేదు. విదేశీ బహుళజాతి సంస్థలు, వాటి మోచేతి నీళ్లుతాగే స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలను చూస్తోందేగానీ, మన దేశ విశాల ప్రయోజనాలను చూడ్డం లేదు. బహుళా అమెరికా వాణిజ్య ప్రయోజనాలు లేకపోయివుంటే మరికొన్నాళ్లు అణు ఆంక్షలు మనమీదుండేవి. అప్పుడు మన శాస్త్రవేత్తలు స్వంత సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసేవారు. మన్మోహన్‌ ప్రభుత్వ నిర్వాకం వల్ల మనకు నష్టదాయకమైన అణు ఒప్పందం వచ్చింది, ప్రయోజనకరమైన అణు పరిశోధనపై పాలకులు శీతకన్ను వేశారు.

Note : Article from  Prajasakti News paper 
 Wirtten By   ఎస్‌. వెంకట్రావు

Wednesday, July 3, 2013

గోదారిలో 'తేల్‌' పడింది

కొందరు ఏం మాట్లాడినా సంచలనమే, ఏమన్నా జోకే! కార్మిక నాయకుడు, మంచి మనిషి అంజయ్యగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో దినపత్రికల వాళ్లకు రోజుకో ఆహ్లాదకర విషయం అందుబాటులో ఉండేది. ఆయన ఏ మాట మాట్లాడినా అందులో ఓ తమాషాని వెదుక్కునేవారు.
ఒకసారి ఆయన 'గోదారిలో తేల్‌ పడింది' అన్నారు. కొందరికి ఏమీ అర్థం కాలేదు. గోదావరిలో తేలు పడితే ఒక ముఖ్యమంత్రి ప్రకటన చేయాలా? అనుకున్నారు. కొందరు ఆయన పెంచుకున్న తేలు పడిందేమోనని అనుకుని ఉండవచ్చు కూడా. అయినా తాను పెంచుకునే తేలును గోదావరి దాకా ఎందుకు తీసుకుపోయినట్టు?
తీరా చూస్తే గోదావరిలో చమురు పడిందని తెలిసింది. 'తేల్‌' అంటే ఉర్దూలో నూనె కదా అని తరువాత అనుకున్నారు. అంతా నవ్వుకున్నారు హాయిగా. రెండు భాషలు కలిపి మాట్లాడితే ఇదే ప్రమాదం. ఆయన ఏది చేసినా అంతే. ఇంకోసారి అమెరికా పర్యటన అనంతరం హైదరాబాదుకొచ్చి 'అమెరికా ఎంతగానో అభివృద్ధి చెందింది. అక్కడ రైతులు కూడా 'ఇంగ్లీష'్‌ మాట్లాడుతున్నారు' అని ఆయన చెప్పినట్టు రాశారు. ఏమైనా ఆ డైలాగుకు కొద్దిసేపు నవ్వుకోవచ్చు. సెల్లు ఫోనులున్న ఈ రోజుల్లో గనుక ఆయన ఉండి ఉంటే మన ఎస్సెమ్మెస్సు జోకులన్నీ ఆయన మీదే ఉండేవేమో?
తరువాత అన్న రామారావు గారు కొన్ని సంవత్సరాలు అందర్నీ అలరించారు. ఇక వారి గురించి కూడా చెప్పుకుంటూ పోతే కథానాయకి 'తేలు'కు కోపమొచ్చి మనల్ని కుట్టవచ్చు!
అందుకే తేలు విషయానికొద్దాం. తేలంటే అందరికీ భయమే. పట్టణాలు, నగరాల్లో నివసించేవారికి అవి పరిచయం లేదు కాని పల్లెల్లో అవి మామూలే. ఎర్ర తేలనీ, నల్ల తేలనీ అవి కుట్టినప్పుడు వాటి తీవ్రత అక్కడివారే చెప్పాలి. 'అసలు కొంతమంది మాట్లాడుతూ ఉంటే నాకు తేళ్లూ, జెర్రులూ వళ్లంతా పాకినట్లుంది' అనేవారూ ఉన్నారు. ఎండ్రకాయలు, రొయ్యలు ఇలా ఆ తెగకు చెందిన వాటి రూపమే అలా ఉంటుంది. వాటి కాళ్లు, కొండ్లు భయపెడతాయి. వాటి బంధువులే అయినా ఎండ్రకాయలు, రొయ్యలను మాత్రం బాగా తింటారు అది వేరే విషయం.
తేలంటే 'నిస్సిం ఎజికిల్‌' రాసిన 'తేలు కుట్టిన రాత్రి' అన్న ఆంగ్ల పద్యం గుర్తొస్తుంది. అందులో ఓ తల్లికి తేలు కుట్టడం, భూత వైద్యుడొచ్చి ఏవేవో మంత్రాలు చెప్పటం, ఇంకా ఇతర మూఢాచారాలు బాగా కనిపిస్తాయి. ఎవరో పసరు పూస్తారు. అయినా ఉపశమనము ఉండదు. ఇదంతా పూర్వ జన్మలో చేసుకున్న పాప ఫలమని ఒకరు చెబుతారు. రాత్రంతా నిద్రలేని ఆమెకు సూర్యోదయాన నొప్పి కొద్దిగా తగ్గుతుంది. ఇక గండం గడచినట్టే. ఆ తల్లి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. తనకు తగ్గినందుకు కాదు, తన పిల్లల్ని కుట్టకుండా తేలు తనని కుట్టినందుకు! పిల్లలపై తల్లి ప్రేమ అటువంటిది. స్వార్థరహితం.
ఇప్పుడో గోదావరి, కృష్ణా బేసిన్‌లో 'తేలే' కాదు, సహజ వాయువూ పడింది. మనల్ని తల్లిలా కాపాడవలసిన మన ప్రభుత్వాలు వాటిని తీసుకుపోయి బాగా చమురు దాహమున్న వ్యాపార స్తులకిస్తున్నాయి. అది ఎంత తాగినా తీరని దాహం. తాగే కొద్దీ పెరుగుతుంది. ఏమంటే రకరకాల లెక్కలు చూపిస్తున్నారు. ఇదేమని అడిగే దిక్కే లేదు. ఉన్న దిక్కు కొందరు నిలదీసినా లోపల అందరూ మిలాఖతు. కాబట్టి అక్కడ బలం చాలటం లేదు.
పెరట్లో పండిన కూరగాయలు ఉచితంగా దొరుకుతాయి కదా! మన దగ్గర దొరికితే ధర తగ్గుతుందని మనమ నుకుంటే పిచ్చోళ్లమే! అలా తగ్గదు. మీకు బొత్తిగా వ్యాపార సూత్రాలు తెలియవంటారు. జీవితంలో మీరు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా చాలా ఉందంటారు. మీరు ఎప్పుడు బాగుపడతారంటారు. ఇలా ఉంటే 'దేశమేగతి బాగు పడునోరు' అంటారు. 'అలా కావాలంటే ముందు మేము బాగు పడవలెనోరు' అని సూచన కూడా వస్తుంది.
సహజ వాయువును మింగే పెద్ద అనకొండ పడిందక్కడ. అది దాన్నంతా మింగి తిరిగి మనకే అమ్ముతుందట. అదీ సంగతి! ప్రభుత్వమే ఆ పని చేస్తే పోలా? అమ్మో అంత పెట్టుబడి కావద్దూ? ఇక్కడ పెట్టుబడి కంటే పుట్టుబడి ముఖ్యం. అందుకే వాటి జోలికి పోదు ప్రభుత్వం.
ఆ అనకొండను ఒకాయన ఆడిస్తుంటాడు. అది తల ఊపుతూ ఉంటుంది. ఇదంతా చూసే వాళ్లకు కనిపించే దృశ్యం. కానీ జరిగేది ఇంకొకటి. అనకొండ తన తలను ఊపిన విధంగానే ఈ పెద్ద మనిషి స్వరం వాయిస్తున్నట్టు నటిస్తాడు.
గోదావరిలో తేలుకిచ్చిన ఆర్భాటం ఈ అనకొండ విషయంలో కొందరివ్వటం లేదెందుకని మీకు అనుమానం రావచ్చు. తేలు చిన్నది కాబట్టి భయపడి ఉండరు. అనకొండ ఎంతో పెద్దది కదా అందుకే జంకుతున్నారు.
ఈ నవయుగ అనకొండకు నదులే కాదు, సముద్రాలు కావాలి. అప్పుడది అందులో ఉన్న చేపలు, తిమింగలాలు, సొర చేపలు ఇలా వానపాముల వరకూ అన్నింటినీ తినేస్తుంది. తినటమే కాదు దానికి జీర్ణశక్తి అధికం. అలా బలాన్నంతా విషం రూపంలో నింపుకుని ఇతర జీవాల్ని చంపేస్తుందది.
'కష్టాల్ని మనందరం పంచుకుందాం, లాభాల్ని మాత్రం మేం నంజుకుంటాం' ఇది అనకొండ సూత్రం. అది బలిసి బలిసి కాళీయునిలా తయారవుతుంది. దాన్ని మధనం చేయడానికి ఒక్క కృష్ణుడు సరిపోడు. ప్రజలందరూ రావాలి. అది మాత్రం తప్పదు. దాని పడగపై బాది విషాన్నంతా కక్కించే రోజులు ఎంతో దూరంలో లేవు. ఆ విషంలోనే దాన్ని పెంచి పోషించినవారూ కొట్టుకుపోతారు. అప్పుడు వారికి ఏ 'ఆధారమూ' ఉండదు!
అప్పుడు గోదావరిలోని 'తేల్‌' చవగ్గా దొరుకుతుంది.

Article By : జంధ్యాల రఘుబాబు from prajasakti

Thursday, April 18, 2013

శాఖాహార పులి ...


ఒకానొక అడవి. ఆవు, పులి కథలోనిదే.
ఒక పులి, అదీ ఆ కథలో ఉన్న పులి వంటిదే. ఒక ఆవు, అదీ ఆ ... పులి వేటకని బయలుదేరింది. ఒక ఆవు కనిపించింది. ఎగిరి దాన్ని తినబోయింది. ఇంతలో ఆవు తనను తినవద్దని వేడుకుంది. 'ఇంటివద్ద నా చిన్న కొడుకు పాల కోసం చూస్తుంటాడు, వాడికి పాలిచ్చి, ఓ సారి ముద్దాడి బంధువులకు అప్పగించి వస్తాను' అని వేడుకుంది.
పులి మొదట ఒప్పుకోలేదు. 'నీవు తిరిగి వస్తావని నమ్మకమేంటి. నన్ను నేనే నమ్మను, నిన్నెలా నమ్మాలి' అని అడిగింది.
'నేను అసత్యాలు చెప్పను, చెప్పిన మాట తప్పను. నన్ను నమ్ము లేదా ఇప్పుడే తినేసేరు' అంది ఆవు.
అనుమానంతోనే పులి ఒప్పుకుంది. ఆవు వెళ్లిపోయింది. గోవు రాకపోతే అదే అదనుగా తీసుకుని తనకు ఇష్టమైనన్ని ఆవుల్ని తినవచ్చని లోపల అనుకుంది. చెప్పిన మాట ప్రకారం ఆవు తిరిగి వచ్చేసింది.
పులి కళ్లలో గ్లిసరిన్‌ వేసుకున్నట్టు కన్నీళ్లు కారాయి. 'నీవు మాట ప్రకారం వచ్చావు. నా మనసు కరిగించావు. నిన్ను వదిలేస్తున్నాను. వెళ్లు, నీ కొడుకుతో హాయిగా ఉండు' అని వెనక్కు పంపింది.
కథ అక్కడితో ఆగిపోతే ఇప్పటి వరకూ చదివిన దాంట్లో కొత్తేమీ లేదు. ఆపై సాగే కథలోనే కొత్తదనం.
మరుసటి రోజు పులి అడవిలోని జంతువులన్నింటినీ సమావేశపరిచింది. క్రితం రోజు జరిగిన 'ఆవు- పులి' కథ వివరించింది.
'నిన్నటి నుంచీ నా మనసు మారిపోయింది. ఒక ఆవు నన్ను మార్చివేసింది. నాకు వైరాగ్యమొచ్చేసింది. ఇక ఆవులను గానీ, ఇతర జంతువులను గానీ చంపి తినే గుణం నాలో నశించింది. అలాగని తినకుండా బతకలేను. అందుకే నేను చనిపో వాలనుకున్నాను. ఈరోజు రాత్రి కనిపించే ఆ కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసు కుంటాను. ఎవ్వరూ నన్ను ఆపటానికి ప్రయత్నిం చవద్దు'. 'నేను చనిపోయాక నా కథ పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా పెడతారు' అని మరొక్కసారి కళ్లనిండా నీరు తెప్పించింది.
జంతువులన్నీ తమ కళ్లలో కూడా నీరు తుడుచుకున్నాయి, రాకున్నా!
ఇక తమకు ప్రాణ భయం లేదని జింకలు, ఆవులు, మేకలు, ఇతర శాఖాహార జంతువులు ఆనందపడితే, అడవిలోని జంతువులన్నీ తమకేనని నక్క, తోడేలు, హైనా లాంటి జంతువులు మహదానందపడ్డాయి.
ఇంతలో ఓ ముదుసలి భల్లూకం ముందుకొచ్చి 'ఆత్మహత్య మహా పాపం, అందుకే నీవు మాంసాహారం మానేసి దుంపలు, గడ్డి లాంటి శాఖాహారం తిని జీవితం చాలించు' అని సలహా ఇచ్చింది.
ఈ సలహా నచ్చి జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి.
పులికి మహదానందంగా ఉంది. తనకు ఇంతలా ప్రచారం వస్తుందని ఊహించనే లేదు. 'ఇదే అదనుగా రాజుగా ఉన్న సింహాన్ని తొలగించి నేను రాజునై పోవచ్చు. తరువాత మళ్లీ మాంసాహారం మొదలెట్టవచ్చు' అనుకుంది లోలోపల.
తనకు శాఖాహారం సేకరించటం తెలియదు కాబట్టి రోజూ ఏదైనా ఒక జంతువు శాఖాహారాన్ని తీసుకురావలసిందిగా జంతువుల్ని కోరింది. జంతువులు కూడా సరేనన్నాయి.
చెప్పిన మాట ప్రకారమే చేశాయి. ప్రతి దినమూ పులికి శాఖాహారాన్ని తీసుకుపోయి ఇవ్వసాగాయి. కొత్తగా శాఖాహారాన్ని తింటున్న పులి బాగా నున్నగా తయారయింది. జంతువులకు శాఖాహారాన్ని తినమని ఎప్పుడూ చెప్పే సత్యజీవి 'చూశారా మాంసాహారం మానేస్తే ఎన్ని లాభాలో' అని తన ప్రచారం ఎక్కువ చేసింది.
కొన్ని రోజులకు అడవిలోని జంతువులు తగ్గినట్టు కనిపించింది. ఎవరికి వారు తమ జాతిని లెక్కపెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి. తమాషాగా శాఖాహారం తీసుకెళ్లిన జంతువులే మాయమైనట్టు జంతువుల సర్వేలో తేలింది. చూస్తే పులి మాంసాహారిగా ఉన్నప్పుడే తమకు నష్టం తక్కువగా ఉందని తేల్చేశాయి.
తమను ఈ విధంగా మోసం చేసిన పులిని మట్టుబెట్టాలని జంతువుల సమావేశం నిర్ణయించింది. అలాగే చేశాయి కూడా ...
తమ 'ఆవు- పులి' కథను ఈ విధంగా మార్చిన పులికి పట్టిన గతిని చూసి ఆవు నవ్వుకుంది, లోలోపల ...
అధికారం కోసం పులి 'గడ్డి' కరవచ్చేమో కానీ 'ఆహారంగా' మాత్రం తినదు. మాంసమే కావాలి!

** Article by  -- జంధ్యాల రఘుబాబు
From prajasakti news paper

Thursday, March 7, 2013

అగ్నియోధునికి అశ్రుతర్పణ

వెనిజులా వేగుచుక్క, ప్రత్యామ్నాయ శక్తుల చైతన్య పతాక హ్యూగో చావేజ్‌ అస్తమయం మాటలకందని విషాదం. నాలుగోసారి దేశాధ్యక్షుడుగా అప్రతిహత విజయం సాధించిన ఆ అచంచల యోధ రెండేళ్ల కాన్సర్‌ పోరాటంలో కన్నుమూయడం నమ్మక తప్పని నిజం. ఈ విషాద వార్త దేశాల సరిహద్దులకు అతీతంగా ప్రజాస్వామ్య ప్రియులు, స్వాతంత్ర పిపాసులందరిలోనూ శోకాన్ని రగిలించింది. ఎందుకంటే చావేజ్‌ ఒకానొక చారిత్రిక దశలో దిశా నిర్దేశం చేసిన ధీరుడు, ధీశాలి. సోవియట్‌ విచ్ఛిన్నానంతరం ప్రజాచైతన్యం, ప్రతిఘటన అన్నవి మటుమాయమై పోతాయని ఆశపడిన దుష్టశక్తుల దురాశలను దునుమాడుతూ అతి బలమైన అమెరికా సామ్రాజ్యవాదాన్ని అతి దగ్గర నుంచి సవాలు చేసిన సాహస సేనాని. సమర్థ పాలకుడు.

చిల్లర వ్యాపారంలాటి రంగాల్లో ఇండియా విదేశీ పెట్టుబడులను అనుమతించడం లేదని అగ్రరాజ్యాధినేత ఒబామా పెదవి విరవడం ... ప్రధాని అసమర్థ సాధకుడని, విషాద యోగి అని అమెరికా మీడియా తీసిపారేయడం ... ప్రపంచ కార్పొరేటింగ్‌ సంస్థలు ఇండియా స్థానాన్ని దిగువకు నెట్టడం ... అన్యధా శరణం నాస్తి అన్నట్టు అమెరికా ఆదేశాలను అమలు చేసేందుకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆఘమేఘాల మీద పరుగులు పెట్టడం మొన్నటి ముచ్చటే. ఇలాటి ప్రపంచంలో ఒకడు ... మన కన్నా చాలా చిన్నదైన దేశ పాలకుడు ... అమెరికాకు అతి సమీపస్తుడు ... నిన్నమొన్నటి దాకా అంకుల్‌ శ్యాం పెరటిదొడ్డిగా వారి కీలుబొమ్మలైన సైనిక పాలకుల చేతిలో నలిగిన, మెలిగిన చరిత్రకు వారసుడు ... ఐరాస సమావేశంలో ఆ అమెరికా అధినేతనే భూతంగా వర్ణించిన ఏకైక నాయకుడు చావేజ్‌. ప్రపంచ బ్యాంకు ఆదేశాల బాటలో దివాళా ఎత్తుతున్న దేశాలకు ప్రత్యామ్నాయం చూపుతూ మరెక్కడా లేనంత వేగంగా, తీవ్రంగా ప్రజా నుకూల విధానాలు అమలు చేసిన పరిపాలకుడు చావేజ్‌. సైద్ధాంతిక పరిభాషలో కమ్యూనిస్టు కాక పోయినా కామ్రేడ్లకు ప్రపంచమంతటా కొత్త ఊపిరి పోసిన సహ చరుడు చావేజ్‌. ఒకే ఒక్కడు అనిపించుకున్న క్యూబా అధినేత ఫైడల్‌ కాస్ట్రో సరసన మరొకడుగా నిలిచే అర్హత సంపాదించుకున్న ధీమంతుడు చావేజ్‌.
ప్రపంచీకరణ యుగంలో వనరులను ప్రైవేటు పరం చేయడం రివాజుగా మారితే చావేజ్‌ అందుకు పూర్తి భిన్నమైన విధానాలు అమలు చేశాడు. చమురు సంపన్నమైన వెనిజులా బడా సంస్థల కల్పవృక్షంలా ఉండే స్థితిని చావేజ్‌ మార్చేశాడు. ఆ వనరులను పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చి ప్రజలకు అంకితం చేశాడు. విస్తృత స్థాయిలో భూ సంస్కరణలు అమలు చేసి పేదలకు భూమిని పంచాడు. ప్రతిచోటా ఉద్యోగ భద్రత పోతుంటే వెనిజులాలో పని గంటలు వారానికి 44 నుంచి 40కి తగ్గించడమే గాక ఇంకా అనేక సరికొత్త హక్కులు కల్పించాడు. 1999-2010 మధ్య వెనిజులాలో దారిద్య్రం 21 శాతం తగ్గిందని ఐక్యరాజ్యసమితి కమిషన్‌ అభినందనలు పొందాడు. నిరక్షరాస్యత నిర్మూలించి ఉచిత ఆరోగ్య వసతి కూడా కల్పించేందుకు చర్యలు మొదలెట్టాడు. తాను సైనిక నేపథ్యం నుంచి వచ్చినా, అమెరికా వత్తాసుతో నడిచే సైనిక కుట్రలకు తావులేకుండా ప్రజా స్వామ్యాన్ని విస్త రించాడు. అందుకే 1998లో మొదటి సారి ఎన్నికైన చావేజ్‌ను 2002లో కూల దోయడానికి సైన్యం ద్వారా కుట్ర జరిగితే వమ్ము చేసి దమ్ము చూపించాడు. తర్వాత దాదాపు ఏడెనిమిది సార్లు రెఫరెండంలు, రకరకాల ఎన్నికలు, రాజ్యాంగ రూపకల్పన, ఇలా ఏదో ఒక రూపంలో ప్రజల ఆమోదం పొందుతూ జైత్రయాత్ర సాగిస్తున్నాడు.
క్యూబాను దుర్మార్గ దిగ్బంధం చేయజూసే అమెరికా ఆంక్షలను తోసిపుచ్చి అగ్రజుడు కాస్ట్రోను అనుజుడుగా ఆదుకున్నాడు. భారత దేశంతో సహా అన్నిచోట్లా అభ్యుదయ శక్తులకు తోడైనాడు. సద్దాం హుస్సేన్‌ను కలుసుకుని సంఘీభావం చెప్పివచ్చాడు. చైనాతో చెలిమి చేశాడు. తనకు నచ్చని నాజర్‌, కాస్ట్రో, అరాఫత్‌, సద్దాం, వంటివారందరిపైనా దాడిచేసినట్టే చావేజ్‌పైనా అమెరికా మీడియా సహాయంతో విష ప్రచారం సాగించింది. ఈసారి ఆయన ఓడిపోవడం ఖాయమనీ, కొద్ది పాటి తేడాతో నెగ్గినా చేయగలిగింది ఉండదనీ శాసనార్థాలు పెట్టింది. ఒక్కసారిగా అమెరికా పత్రికలు, చానెళ్లు చావేజ్‌పై చేయని దుష్ప్రచారం లేదు. ఆయనను ఓడించేందుకు వెనిజులా పెట్టుబడిదారులు, చమురు మాఫియాలు, అమెరికా హంగుదారులు ప్రతీఘాత ప్రతిపక్షాలు అందరూ కలసి 30 పార్టీల కూటమిగా ఏర్పడి కాప్రిల్‌ అనే మితవాదిని నిలబెట్టి ఓడించాలని విఫలయత్నం చేశాయి. ఇన్నిటినీ తట్టుకుని అశేష జనాదరణతో అఖండ విజయం సాధించిన చావేజ్‌ ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా లేకుండా ప్రాణాంతక కాన్సర్‌తో పెనుగులాడాల్సి వచ్చింది. అందుకోసం క్యూబాలో చికిత్స, కాస్ట్రోతో సాన్నిహిత్యం ఆయనను ఆఖరి వరకూ సజీవ స్ఫూర్తిగా నిలిపాయి. అయినా చివరకు ఆ వ్యాధి ఆయన ప్రాణాలు బలిగొనకుండా వదల్లేదు.
చావేజ్‌ చారిత్రిక పాత్రకు స్పష్టమైన భూమిక ఉంది. సామ్రాజ్యవాద, నయా ఉదారవాద ఎదురు దాడికి వ్యతిరేకంగా పెల్లుబికిన ప్రజావెల్లువ ఫలితంగానే వెనిజులాతో సహా అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో ప్రజా ప్రభుత్వాలు ఆవిర్భవించాయి. దీన్నే 'పింక్‌ వెల్లువ- వామపక్షం వైపు మలుపు' అని పిలుస్తున్నారు. వీటి మనుగడ గొప్ప సానుకూల పరిణామం. ఈ పరిణామ క్రమానికి స్ఫూర్తిగా నిలిచిన హ్యూగో చావేజ్‌ కన్నుమూయడంతో ఈ క్రమాన్ని అడ్డుకోవడానికి సామ్రాజ్యవాద శక్తులు నిస్సందేహంగా కుట్రలు తీవ్రం చేస్తాయి. ఇప్పటికే ఆ కుటిల పన్నాగాలు మొదలైనట్టు కనిపిస్తుంది. ఆయనే చెప్పినట్లు విప్లవం ఏ ఒక్క వ్యక్తిపైనో ఆధారపడి ఉండదు. చావేజ్‌కు అశ్రుతర్పణ చేస్తూనే ఆయన ఆఖరి వరకూ అడ్డుకున్న ఆధిపత్య శక్తుల ఆటకట్టించడం ఇప్పుడు అవశ్య కర్తవ్యం. ఆయనకు అదే అసలైన నివాళి. 

Note : Taken From Prajasakti Editorial
visit : అగ్నియోధునికి అశ్రుతర్పణ prajasakti.com

Wednesday, April 25, 2012

నయా పోకడల మోజులో నవతరం


శాస్త్రీయ దృక్పథానికి భిన్నమైన ఆలోచనా ధోరణే అసలైన ట్రెండుగా చెలామణి అవుతున్న పరిస్థితి నేడు కనిపిస్తోంది. 'మార్కెట్‌ సంస్కృతి' తీసుకొస్తున్న నయా పోకడల మోజుతో, కెరీరిస్టు ధోరణితో యువతలో ప్రశ్నించే తత్వం, ఆత్మస్థయిర్యం, సామాజిక స్పృహ కనుమరుగవుతున్నాయి. చదువులో, మీడియాలో, ఆయా రంగాల్లో ఎక్కువగా ఫోకస్‌ అవుతున్న పెట్టుబడిదారి కట్టు కథనాల ప్రభావానికి టీనేజర్లు ఆకర్షితులవుతున్నారు. అదే అసలైన లైఫ్‌ స్టయిల్‌ అన్న భ్రమలకు లోనవుతున్నారు.
కెరీరిజం భ్రమల్లో, నయా పోకడల ఆకర్షణలో యువతలో అసలైన సామర్థ్యం కనుమరుగవుతోంది. మీడియా కూడా అతికొద్ది మందికి ఉపయోగపడే వాటినే ఎక్కువగా ఫోకస్‌ చేస్తోంది. మెజార్టీ యువతకు ఉపయోగపడే విషయాలను విస్మరిస్తోంది. 'వేణు చదువులో ధిట్ట. ఎప్పుడూ ఫస్టు క్లాసులో పాసయ్యేవాడు. కానీ డిగ్రీ దాకా చదివి ఆపేశాడు. ఫలితంగా టీచర్‌ కావాలన్న కల నెరవేరనే లేదు' ఎందుకని అడిగితే 'బి.ఇ.డి. చేసేందుకు రెండు లక్షలు కట్టలేక' అని బదులిచ్చాడు. రెండు లక్షలు పెద్ద విషయమేం కాదని కొందరు భావించొచ్చు. కానీ రెండువేలు కట్టేందుకు నానా అవస్థలు పడేవారే ఎక్కువ శాతం వున్నారు. అదే ప్రభుత్వ బి.ఇ.డి. కళాశాలల్లో ఫ్రీ అడ్మిషన్‌ వుండి వుంటే... 'వేణు మాత్రమే కాదు. అలాంటి ఇంకెందరికలో సాకారమౌతుంది. కానీ అలా చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవు. కొంతమందికి ఖరీదుతో కూడుకున్న ఉన్నతమైన చదువులు చదివేందుకూ, ఆ తర్వాత విదేశాలకు వెళ్లేందుకు కార్పొరేటు సంస్థల ద్వారానో, బ్యాంకుల ద్వారానో లోన్లో, రాయితీలో కల్పిస్తుంది. ఇక్కడ ఉన్నత వర్గాల కొమ్ము కాస్తుంది.

చదువు 'కొంటూ' ఉన్నత స్థితికి ఎదిగే పరిస్థితి పేద, మధ్య తరగతి యువతలో ఉండట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గనుక పరిశీలిస్తే కనీసం పదోతరగతి వరకు చదివేందుకే అష్టకష్టాలు పడాల్సిన దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారి శాతం ఎక్కువే. వలసెళ్లిన తమ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కాయిన్‌ బాక్సులో వేసేందుకు రెండు ఒక్కరూపాయి బిళ్లలకోసం ఇబ్బందిపడే యువతీ యువకులు ఆంధ్రప్రదేశ్‌లోని ఏ మారుమూల గిరిజన తండాకెళ్లినా, గూడేనికెళ్లినా, గ్రామాల్లోని దళిత వాడల్లోకెళ్లినా కన్పిస్తారు. ఇలాంటి వారి బతుకుల్లో వెలుగు పూలు పూయించే ఆర్థిక విధానాలూ, ప్రభుత్వ పాలసీలూ ఉండవు. ఉన్నా అవి ఏ కొద్దిమందికో మాత్రమే ఉపయోగ పడుతుంటాయి. దీనివెనుకనున్న మూల కారణాలు వెలికి తీసే ప్రయత్నం కూడా చేయని కొన్ని ప్రసార సాధనాలు అతికొద్ది మంది ధనిక వర్గాల జీవన పరిస్థితులను ఆకాశానికెత్తేస్తుంటాయి. అవి వాస్తవాలుగా నమ్మించేందుకు, యువతను భ్రమల్లో ముంచేందుకు ప్రయత్నిస్తుంటాయి.

నూటికి 90 శాతం యువతరం లైఫ్‌ స్టయిల్‌ను ప్రతిబింబించే బతుకు చిత్రం ఎక్కడా కనిపించదుగానీ ఏ కొద్దిమందో అనుభవిస్తున్న భోగ భాగ్యాల గురించి మాత్రం అద్భుతంగా ఫోకస్‌ చేస్తుంటారు. 'పబ్‌ కల్చర్‌ గురించీ, కొత్తకొత్త ఫ్యాషన్‌ల గురించీ 'బైక్‌ రేస్‌' గురించీ, పెద్దపెద్ద బిజినెస్‌ చదువుల గురించీ పత్రికల్లో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో కవరేజీ చూస్తే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని యువతను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వాస్తవానికి ఒక్క గంటకు తక్కువలో తక్కువ ఐదారువేలు ఖర్చుపెట్టి పబ్బుల్లో ఎంజారు చేసే స్థోమత ఎంతమంది యువతకుంటుంది? లక్షల్లో అడ్మిషన్‌ ఫీజలు చెల్లించి చదువు'కొనే' పరిస్థితి ఎందరికుంటుంది? రకరకాల బైకులు కొనే స్థోమత, రేసింగ్‌లో పాల్గొనే ఆసక్తి ఎవరికుంటుంది? వేలల్లో ఖరీదు చేసే ఫేస్‌ క్రీములు ఏ మధ్య తరగతి యువత కొనగలదు? బిల్‌గేట్స్‌లాగో, టాటాబిర్లాలాగో గొప్పవాళ్లు కావాలన్న కలలు కనాలని చెప్పే మాటలు ఎవరికి ఉపయోగపడతాయి? అంటే... సమాజంలోని కొంతమంది ధనికవర్గాలు అనుసరిస్తున్న పోకడలనే ఈతరం యువత మొగ్గుచూపుతున్న ట్రెండుగా ప్రచారం కల్పిస్తోంది పెట్టుబడిదారీ మీడియా. కానీ అత్యధిక శాతం వున్న పేద, మధ్య తరగతి యువత జీవన చిత్రాన్ని ప్రతిబింబించేది, ప్రతిభను వెలికి తీసేది, ఏదీ ప్రచారానికి నోచుకోవట్లేదు. కార్పొరేట్‌ ప్రతిభ ధాటికి సామాన్య యువత ప్రజ్ఞ పనికి రాకుండా పోతోంది. కారణం.... పెట్టుబడుల కట్టుకథల భావనలు యువత మెదళ్లను రకరకాలుగా ప్రభావితం చేస్తున్నాయి. పత్రికల ద్వారా, సినిమాల ద్వారా, ప్రకటనల ద్వారా, ఇంటర్నెట్‌ ద్వారా ఇవి విస్తరిస్తున్నాయి.

నేడు చాలా సంస్థలు, కంపెనీలు తాము మెరిట్‌ ప్రకారమే అవకాశాలు కల్పిస్తామంటున్నాయి. ప్రతిభకు, అర్హతలకు, కమ్యూనికేషన్‌ స్కిల్సుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇంతకీ మెరిట్‌ అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? సాధిస్తే వస్తుందా? అలా అయితే అందరూ ఎందుకు సాధించట్లేదు? ఇక్కడా ఓ కారణం ఉండే ఉంటుందన్న అనుమానం అక్కర్లేదు. కచ్చితంగా వుంటుంది. నేడు మెరిట్‌గా చెలామణి అవుతున్న వారంతా అవి సాధించడానికి కావలసిన ఆర్థిక పరిస్థితులూ, ప్రోత్సాహం, ఇతర కారణాలు అనుకూలించిన వారే ఎక్కువశాతం ఉంటున్నారు. అంటే... అనుకూల వాతావరణం వుంటే మెరిట్‌ ఎవరైనా సాధిస్తారు. కానీ నేడా పరిస్థితి ఉన్నవారు సమాజంలోని నాన్‌మెజార్టీ ధనికవర్గమే కాబట్టి మెరిట్‌ క్రెడిట్‌ అంతా వారికే దక్కుతోంది. అలాంటప్పుడు మెరిట్‌ ప్రకారం కొలువులన్నప్పుడు అవి ఏ వర్గ యువతకు దక్కుతున్నాయో చెప్పనక్కర్లేదు. ఇలాంటి అంతరాలు సమసిపోవాలంటే అందరికీ మెరిట్‌ సాధించే ఆర్థిక స్థోమత చేకూర్చగల ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఇప్పుడున్నవన్నీ అవి కావుకదా! అందుకే మెరిట్‌ వెనుక ఉన్న వాస్తవ ప్రతిభ తొక్కివేయబడుతోంది.

నేడు కెరీర్‌కు అత్యంత ప్రాధాన్యతే కాదు, ప్రచారమూ అలాగే లభిస్తోంది. అది వ్యక్తి ఉన్నతికీ, సమాజానికీ ఉపయోపడేదైనంత వరకు ఇబ్బంది లేదు. కానీ దాని పేరుతో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వ్యాపారమయమౌతున్నాయి. చివరికీ కెరీరిజం మోజులో వాస్తవానికి దూరంగా, సామాజిక స్పృహలేని వారిగా యువతరం తయారవుతోంది. ఉన్నతమైన కెరీర్‌ ప్రారంభించాలనుకుంటే అందుకు సంబంధించిన కోర్సులు చదవాలి. అవి చదవాలంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలించాలి. అనుకూలించినా అవకాశం దక్కాలి. అంటే... లక్షలతో ముడిపడి ఉన్నప్పుడు? కనీసం మూడుపూటలా తిండికిలేని కుటుంబం నుంచి వచ్చిన యువతీ యువకులు తమ కలను ఎలా సాకారం చేసుకోగలరు? ఐఐఎం, ఐటిఐ, ఇంజనీరింగ్‌, యానిమేషన్‌ లాంటి కెరీర్లో ఎలా ప్రవేశించగలరు? ఇవన్నీ కార్పొరేట్‌ సంస్థ చేతుల్లో ఉన్నప్పుడు సామాన్య యువత ఎలా చదువు 'కొనగలదు' అదే ప్రభుత్వాధీనంలో ఉంటేనో, ప్రభుత్వ సహకారం ఉంటేనో, ప్రజలందరి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే విధానాలు అమలైతేనో సామాన్యులు కూడా తమ లక్ష్యం నెరవేర్చుకోగలరు. కానీ ఇక్కడ ఒక పథకం ప్రకారమే కొద్దిమందికి ఉపయోగపడే పాలసీలే మన పాలకులు ప్రవేశపెడుతున్నప్పుడు ఉన్నతమైన కెరీర్‌ అనేది సామాన్య యువత రంగుల కలగానే మిగులుతోంది.

అప్పటి ట్రెండునుబట్టి నడ్చుకోవాలి? లేకపోతే అది నామోషీగా ఫీలయ్యే వారెక్కువ. మరి నేటి ట్రెండ్‌ ఏంటి? వాస్తవంగా ఎక్కువమంది అనుసరించేదో, ఎక్కువమంది జీవన పరిస్థితిని ప్రతిబింబించేదో అసలైన ట్రెండ్‌! కానీ మీడియా ప్రచారం పుణ్యమా అని బయట మాత్రం వేరేలా అర్థం చేసుకుంటున్నారు. పేద, మధ్యతరగతి యువతరం పోకడలను, వారి బతుకు చిత్రాలను పట్టించుకోవట్లేదు. కానీ కొంతమంది ఉన్నత వర్గాలవారు అనుసరించే, అనుకరించే, అనుభవించే జీవన విధానాన్నీ, వినోదాన్నీ అదే సర్వస్వమైనట్లు, అదే అందరికీ శిరోధార్యమైనట్లు, అదే అసలైన ట్రెండ్‌ అయినట్లు ప్రచారం కల్పిస్తోంది. ఫ్యాషన్‌ పోకడలు, పబ్‌కల్చర్‌, వెస్ట్రన్‌ కల్చర్‌, మదర్స్‌డేలు, ఫాదర్స్‌డేలు, బర్త్‌డేలు, ఫ్రెండ్‌షిప్‌డేలు, లవర్స్‌ డేలు, కొద్దిమంది ఉన్నత వర్గాల విలాసవంతమైన జీవన విధానాలు.... ఇవే నేడు ట్రెండుగా చెలామణి అవుతున్నాయి. తాజ్‌, ఒబెరారు రెస్టారెంట్ల యజమానులు కూడా ఒకప్పుడు హోటల్లో పనిచేశారు. ఎంతో కష్టపడి పైకొచ్చారు. (హోటల్లో జీవితాంతం పనిచేసినా' ఒక్క తాజ్‌ హోటల్‌ నిర్మాణానికి కావాల్సిన డబ్బులు కూడబెట్టడం కష్టం) ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తికి సొంత ఇల్లు కూడా లేదు. (చెవిలో పువ్వులు పెట్టడమంటే ఇదే), సోనియాగాంధికీ కారు లేదు. (కొనుక్కునే ఆర్థిక పరిస్థితి లేకనా?) ఇలాంటి విషయాలు కూడా కొన్ని సైకాలజీ గ్రంథాల్లో ప్రస్తావిస్తూ వారి మంచితనాన్ని ఆదర్శంగా తీసుకొమ్మంటారు.

ఒక గొప్ప వ్యాపారవేత్తను ఆదర్శంగా తీసుకొనో, పారిశ్రామికవేత్తను రోల్‌మోడల్‌గా తీసుకొనో, లేకపోతే అమితాబ్‌ బచ్చన్‌ లాంటి వారి విజయాలను వరుసబెట్టి చెబుతూ మీరూ అలా ఎదగండనో చెబుతుంటారు. అలా ఎదిగేందుకు సంకల్పం, కృషి, పట్టుదల, తపన, సాధన, లక్ష్యం ఉండాలని గట్టిగా చెబుతుంటారు. కానీ అలా ఎదగాలంటే అందుకు తగిన పరిస్థితులు ఎందుకు ఉండట్లేదు? ఆర్థిక పరిస్థితులు అందరికీ ఎందుకు అనుకూలించట్లేదు? ఈ వ్యవస్థలో ఉన్న లోపాలేమిటి? అన్న విషయాలు ఎక్కువ శాతం యువత మొగ్గు చూపుతున్న 'కెరీరిస్టు' 'పర్సనల్‌ స్కిల్స్‌, ఇతర సైకాలజీ గ్రంథాల్లో ఉండట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే అవి ఉన్న వ్యవస్థలోనే ఉన్నత స్థితికి ఎదిగేందుకు కావాల్సిన మాటలు చెబుతాయి. (అవి ఆచరణ సాధ్యమో కాదో మాత్రం పట్టించుకోవు) అంతేతప్ప వ్యవస్థలో సమూల మార్పునకు, సమిష్టి తత్వానికి కావలసినదేదీ అందులో ఉండట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి మానసిక దౌర్భల్యుల్ని తయారు చేయడమో, భ్రమలు కలుగ జేయడమో చేస్తున్నాయి. కానీ నయా పోకడల ముసుగులో విస్తరిస్తున్న అంతరాల సమాజాన్నీ, దుర్భర వ్యవస్థనూ మార్చే ఆచరణ సాధ్యమైన చైతన్య స్థాయిని కల్పించట్లేదు. అందరికీ విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలను కల్పించే సరైన మార్గం చూపట్లేదు.

** article from prajasakti  prajasakti.com

Sunday, February 5, 2012

ఇరాన్‌ పై కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

 
ఇరాన్‌ తన రివల్యూషనరీ గార్డ్స్‌ను సన్నద్ధంగా ఉంచింది. వైమానిక దళాన్ని అప్రమత్తం చేసింది. గత డిసెంబర్‌ నుండి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. దాడి చేస్తే గట్టిగా బుధ్ధి చెబుతామని అమెరికా, ఇజ్రాయిల్‌ను హెచ్చరించింది.ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం తగదని చైనా, రష్యా పేర్కొన్నాయి. ఇటువంటి చర్యలు ఇరాన్‌ను తిరిగి చర్చలకు ఒప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఆటంకం కలగజేస్తాయని అవి పేర్కొన్నాయి.
ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరు కుంటున్నాయి. యుద్ధం అనివార్యం అంటూ అమెరికా, దాని ప్రధాన మిత్రపక్షమైన ఇజ్రాయిల్‌ రోజూ ఇరాన్‌ను హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇరాన్‌పై మరింత కిరాతకమైన ఆంక్షలను విధించాలని అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు ఏకపక్షంగా నిర్ణ యించాయి. ఇరాన్‌ చమురు, గ్యాస్‌ ఎగుమతులను భారీగా దెబ్బతీసే విధంగా పాశ్చాత్య దేశాల కూటమి ఆంక్షలు విధించింది. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ చమురు, గ్యాస్‌ ఎగుమతుల పైనే ప్రధానంగా ఆధారపడి ఉంది. ఐఎఇఎ తాజా నివేదిక విడుదలైన అనంతరం ఒబామా ప్రభుత్వం ఇరాన్‌పై మరింతగా ఒత్తిడి పెంచసాగింది. ఇరాన్‌ రహస్యంగా యురేనియాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని రహస్యంగా నిర్వహి స్తోందని ఎటువంటి సాక్ష్యాధారాలు సమర్పించ కుండానే ఐఎఇఎ తన నివేదికలో పేర్కొంది.. ఒక సంవత్సర కాలంలో ఇరాన్‌ చేతిలో అణ్వాయుధం ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి లియోన్‌ పనెట్టా డిసెంబర్‌ చివరి వారంలో పేర్కొన్నారు. ఇరాన్‌ ఈ రెడ్‌లైన్‌ను దాటడాన్ని ఎన్నడూ అనుమతించ బోమని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని పరిష్కరిం చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోగలమని పేర్కొన్నారు. తన అణు కార్యక్రమం శాంతియుత సైనికేతర ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించిందని ఇరాన్‌ స్పష్టంగా ప్రకటిస్తూనే ఉంది. అప్రకటిత అణ్వాయుధ దేశమైన ఇజ్రాయిల్‌ దాడి చేస్తామని ఇరాన్‌ను పదేపదే హెచ్చరిస్తోంది. అణ్వాయుధాలు గల అమెరికా నౌకలు, జలాంతర్గాములు పర్షియా గల్ఫ్‌లో సంచరిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలో కదన రంగంలో దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి. పొరుగున ఉన్న బహ్రెయిన్‌, కతార్‌లలో అమెరికా పెద్ద ఎత్తున సైనిక స్థావరాలను నిర్మించుకుంది. ఏ సమయంలోనైనా అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉంది. ఇరాన్‌పై దాడి చేసి పాము తలను తొలగించాలని అయెరికాపై సౌదీ అరేబియా రాజు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వికిలీక్స్‌ వెల్లడించింది.
అసాధారణ స్థాయికి చేరుకున్న హిస్టీరియా
ఐఎఇఎ అందించినట్లుగా చెబుతున్న సాక్ష్యాధారాలను ఇరాన్‌ ఖండిస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీల కుట్రగా అభివర్ణిం చింది. విదేశాంగ విధానంపై పత్రికలో ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇదే సమయమని మాథ్యూ కోన్రింగ్‌ పేర్కొన్నాడు. ఆ వ్యాస రచయిత అమెరికా రక్షణ మంత్రికి ఇటీవలి కాలం వరకు ప్రత్యేక సలహాదారునిగా ఉన్నాడు. అమెరికా పకడ్బందీగా దాడి చేస్తే ఇరాన్‌ అణు స్థావరాలను ధ్వంసం చేయవచ్చునని ఆయన సలహా ఇచ్చాడు. గల్ఫ్‌ ప్రాంతం మొత్తానికి ఇబ్బంది కలిగించకుండా దాడి చేయవచ్చునని సూచించాడు. ఇరాన్‌ వ్యతిరేక హిస్టీరియా ఇటీవలి మాసాల్లో అమెరికాలో అసాధారణ స్థాయికి చేరుకుంది. అమెరికాలో సౌదీ అరేబియా రాయబారిని హత్య చేసేందుకు కాంట్రాక్టును మెక్సికోకు చెందిన ఒక డ్రగ్‌ కార్టెల్‌కు ఇరాన్‌ అధికారులు ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. న్యూయార్క్‌లో జరిగిన 9/11 దాడుల వెనక ఇరాన్‌ ఉందని ఫెడరల్‌ జడ్జ్‌ రూలింగ్‌ ఇచ్చారు. ఇరాన్‌ అల్‌ ఖైదాకు ఈ డాడులను నిర్వహించేందుకు ప్రత్యక్షంగా సహాయ మందించిందని ఆయన పేర్కొన్నారు.
చమురు ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామి దేశాల్లో ఒకటైన ఇరాన్‌ తాజా పరిణామాల నేపథ్యంలో తన ఉనికికి ముప్పు రానున్నదని ఆందోళన చెందడం సహజం. కొత్త ఆంక్షలను అమలు చేస్తే హార్మజ్‌ జలసంధిని మూసివేస్తామని ఇరాన్‌ మిలిటరీ ఉన్నత శ్రేణి నాయకులు హెచ్చరించారు. పర్షియా గల్ఫ్‌ ప్రాంతంలో ఉన్న ఈ జలసంధి ద్వారా చమురు అంతర్జాతీయంగా రవాణా అవుతుంది. హార్మజ్‌ జలసంధి పొడవు 6.4 కిలోమీటర్లు. ఇరాన్‌, ఒమన్‌ మధ్య గల్ఫ్‌ ముఖ ద్వారంగా ఉంది. ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే ముడి చమురులో మూడవ వంతు ఇరుకుగా ఉండే ఈ జలసంధి ద్వారా రవాణా అవుతుంది. కతార్‌ నుండి లిక్విఫైడ్‌ గ్యాస్‌ సరఫరా హార్మజ్‌ జలసంధి ద్వారానే జరుగుతుంది.
పశ్చిమ దేశాలు క్రమంగా విస్తరించుకుంటూపోతున్న ఆంక్షల కారణంగా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే బాగా దెబ్బతింది. డిసెంబర్‌ 31న ఒబామా కొత్తగా ఆంక్షలు విధించారు. ఇరాన్‌ కేంద్ర బ్యాంక్‌తో లావాదేవీలు జరిపే కంపెనీలపై చర్య తీసుకుంటామని ఈ కొత్త శాసనం నిర్దేశించింది. భారత్‌ వంటి దేశాలు ఇరాన్‌ నుండి చమురు దిగుమతి చేసుకోకుండా చూడటం ఈ చట్టం ఉద్దేశంగా ఉంది. ఇరాన్‌ చమురులో ఎక్కువ భాగం చైనా, భారత్‌కు రవాణా అవుతుంది. ఇయు 18 శాతం మాత్రమే దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్‌ చమురు రంగంపై ఆంక్షలు విధిస్తే ఒక్క బొట్టు చమురు కూడా హార్మజ్‌ జలసంధి నుండి రవాణా కాదని ఇరాన్‌ ఉపాధ్యక్షుడు మహ్మద్‌ రేజా రహిమి హెచ్చరించారు. డిసెంబర్‌ నెల చివర్లో ఇరాన్‌ సైన్యం హార్మజ్‌ జలసంధి సమీపంలో పది రోజుల పాటు సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసాల్లో భాగంగా వైమానిక దళం జలాంతర్గాములను సముద్రంలో ముంచేసింది. నౌకలు రాకుండా ఈ జలసంధిని మూసివేయడం చాలా తేలికైన విషయమని ఇరాన్‌ నౌకాదళాల అధిపతి అడ్మిరల్‌ హబీబుల్లా సయ్యారి మీడియాకు చెప్పారు. జలమార్గాలపై ఇరాన్‌కు పూర్తి నియంత్రణ ఉందని పేర్కొన్నారు. పశ్చిమ దేశాలు ఇరాన్‌పై ఆంక్షలు విధించడానికే కృతనిశ్చయంతో ఉన్నాయని స్పష్టమవుతోంది. ఈ విషయంలో అవి వెనకడుగు వేసేందుకు సుముఖత చూపడం లేదన్నారు. తన కీలక ప్రయోజనాలు పరిరక్షించుకునేందుకు రక్షాత్మక వ్యూహాలను అనుసరించ గలదని రివల్యూషనరీ గార్డ్స్‌ డిప్యూటీ కమాండర్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ హుస్సేన్‌ సలామీ చెప్పారు. తమపై దాడి చేస్తే అమెరికాకు చెందిన 32 స్థావరాలను ధ్వంసం చేస్తామని ఇరాన్‌ ఇంతకు ముందు హెచ్చరించింది. ఇరాన్‌తో యుద్ధం వస్తే చమురు ధర ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చ రించారు. తన అణు కార్యక్రమంపై తిరిగి చర్చలు జరిపేందుకు ఇరాన్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు కొత్తగా ఆంక్షలు విధించిన తరువాత ఇరాన్‌ సైన్యం ఉపరితలం నుండి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణిని పరీక్షించింది. రాడార్లకు ఇది చిక్కదు. మొట్టమొదటి అణు ఇంధన రాడ్‌ను తమ శాస్త్రవేత్తలు నిర్మించినట్లు ఇరాన్‌ జనవరి 1న ప్రకటించింది. సహజసిద్ధమైన యురేనియం గల రాడ్స్‌ను ఇరాన్‌ కీలకమైన అణు రియాక్టర్‌లో అమర్చారు.
సైన్యం నుండి ముప్పు
హార్మజ్‌ జలసంధిని మూసివేస్తామని ఇరాన్‌ చేసిన హెచ్చరికపై అమెరికా తీవ్రంగా ప్రతిస్పందించింది. రెండు యుద్ధనౌకలను జలసంధి వైపు పంపించింది. ఈ జలసంధిలో నౌకాయానం జరిపేందుకు గల హక్కును హరించే ఎటువంటి చర్యను క్షమించబోమని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. సైనిక దళాన్ని వినియోగించే ప్రమాదంతోపాటు అమెరికా, ఇజ్రాయిల్‌ గత రెండు సంవత్సరాలుగా ఇరాన్‌ సైంటిఫిక్‌ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులపై దృష్టి సారించాయి. వారిని కిడ్నాప్‌ చేసేదుకు, హతమార్చేందుకు, ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్‌ మిలిటరీ, పౌర స్థావరాలపై ఉగ్రవాద దాడులు జరిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత రెండు సంవత్సరాల్లో ఇద్దరు అణు శాస్త్రవేత్తలను హతమార్చారు. వారు కారులో ప్రయాణిస్తుండగా వారి కారును పేల్చివేశారు. ఇరాన్‌ అణు ఇంధన సంస్థ ఛైర్మన్‌ ఫెరేదౌన్‌ అబ్బాసీ దావానీ కారుపై కూడా ఇదే విధంగా బాంబు దాడి జరిగింది. రివొల్యూషనరీ గార్డ్‌ స్థావరంలో నవంబర్‌ 12న జరిగిన పేలుడులో 17 మంది మృతి చెందారు. అందులో ఇరాన్‌ క్షిపణి కార్యక్రమ రూపకర్త జనరల్‌ హసన్‌ తెహెరాని మొఘద్దమ్‌ కూడా ఉన్నారు. ద్రోణ్‌ నుండి క్షిపణిని ప్రయోగించి ఉండవచ్చునని నిపుణులు పేర్కొన్నట్లుగా న్యూయార్క్‌టైమ్స్‌ వెల్లడించింది. గత నవంబర్‌లో సంభవించిన మరో పేలుడు కారణంగా ఇస్ఫహాన్‌ నగరానికి సమీపంలోని యురేనియం శుద్ధి చేసే కర్మాగారం దెబ్బతిందని పశ్చిమ దేశాల మీడియా వెల్లడించింది. ఇరాన్‌ మీడియాలో మాత్రం ఈ పేలుడు గురించిన సమాచారం లేదు. ఈ విధ్వంస చర్య తమ ఘనతేనని ఇజ్రాయిల్‌, అమెరికా అధికారులు పేర్కొన్నారు.యువ అణు శాస్త్రవేత్త, నటాంజ్‌ యురేనియం కేంద్రంలో ఉప అధిపతి ముస్తాఫా అహ్మది రోషన్‌ హత్య వెనుక సిఐఎ హస్తం ఉందని ఇరాన్‌ అధికారులు ఆరోపించారు. ఆయన కారు తలుపుకు అయస్కాంత బాంబును అమర్చడం ద్వారా పేల్చివేశారని పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద చర్య వెనుక సిఐఎ హస్తం ఉందని నిరూపించేందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఇరాన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ హత్యను ఖండించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి, భద్రతా మండలికి ఇరాన్‌ విజ్ఞప్తి చేసింది. 2010లో ఇరాన్‌ అణు స్థావరాలకు స్టక్‌నెట్‌ కంప్యూటర్‌ వైరస్‌ను అమెరికా, ఇజ్రాయిల్‌ ప్రయోగించాయి. పరిశ్రమల్లో ఉపయోగించే కంప్యూటర్లను కూడా ఈ వైరస్‌ దెబ్బతీసింది. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వైరస్‌ను అవి ప్రయోగించాయి. ఇరాన్‌ గగనతలంలో సాయుధ ద్రోణ్‌ విమానాల విహారానికి ఒబామా ప్రభుత్వం అనుమతించింది. అమెరికాకు చెందిన ఆర్‌కు 170 సెంటినెల్‌ స్టీల్త్‌ ద్రోణ్‌ను గత డిసెంబర్‌లో ఇరాన్‌ దింపేసిన తరువాత అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 50 వేల అడుగుల ఎత్తున ప్రయాణించగల ద్రోణ్‌ అమెరికా విమానాల్లో అత్యంత ఆధునికమైంది. ఈ విమానాన్ని ఇరాన్‌ ప్రదర్శనలో పెట్టింది. దీనిని వెనక్కు పంపాలని అమెరికా చేసిన డిమాండ్‌ను ఇరాన్‌ తోసిపుచ్చింది. ద్రోణ్‌ ఇరాన్‌ గగనతలంలో నిఘా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అవి ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాదులపై ప్రయోగించడానికి ఉద్దేశించినవి కావు. యుద్ధం ముప్పును ఇరాన్‌ కూడా తేలికగా తీసుకోవడం లేదు. తన రివల్యూషనరీ గార్డ్స్‌ను సన్నద్ధంగా ఉంచింది. వైమానిక దళాన్ని అప్రమత్తం చేసింది. గత డిసెంబర్‌ నుండి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. దాడి చేస్తే గట్టిగా బుధ్ధి చెబుతామని అది అమెరికా, ఇజ్రాయిల్‌ను హెచ్చరించింది.ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం తగదని చైనా, రష్యా పేర్కొన్నాయి. ఇటువంటి చర్యలు ఇరాన్‌ను తిరిగి చర్చలకు ఒప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఆటంకం కలగజేస్తాయని అవి పేర్కొన్నాయి.

***** Article From  PRAJASAKTI  NEWS Paper Link www.prajasakti.com written by యొహానన్‌ చామరపల్లి

Sunday, November 6, 2011

మరో గ్లో'బలి'

మొన్న ఇరాక్‌... నిన్న ఆఫ్ఘనిస్తాన్‌... నేడు లిబియా... ప్రపంచ రక్షకుడిగా చెప్పుకుంటున్న అమెరికా తాజాగా లిబియాను భక్షించింది. ప్రపంచ పోలీసు అవతారమెత్తి తనకు ఎదురు తిరిగే దేశం పాలిట విలన్‌గా మారడం అమెరికా ఆనవాయితీ. ఆ ఆనవాయితీని నిజం చేస్తూ 42 ఏళ్లుగా తన కంట్లో నలుసుగా ఉన్న లిబియా అధినేత కల్నల్‌ గడాఫీని పాశవికంగా వెంటాడి, వేటాడి హత్య చేసింది. గ్లోబలీకరణ... ప్రపంచీకరణ పేరుతో మరో గ్లో'బలి'కి పాల్పడింది. లిబియాలో ఉన్న అపార చమురు సంపదపై కన్నేసిన అమెరికా దాని మిత్ర పక్షాలు ఆ దేశాన్ని కబళించాయి. అంతటితో ఊరుకోకుండా ఆ దేశాన్ని ఎప్పటికీ తన చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు అధ్యక్షుడు గడాఫీని బలి తీసుకుంది.
తమ దేశంలోని ఆర్థిక మాంద్యం, నిరుద్యోగాన్ని పరిష్కరించలేని అమెరికా ప్రపంచంలోని ఇతర దేశాల సమస్యలను పరిష్కరిస్తానని బయలుదేరింది. మానవ హక్కులను కాపాడతాననే నెపంతో తనకు కంటగింపుగా ఉన్న దేశాలపైకి బాంబుల వర్షం కురిపిస్తూ లక్షలాది మందిని బలి తీసుకుంటోంది. అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించిన లిబియా అధ్యక్షుడిగా గడాఫీని నాటో దళాల ముసుగులో అదును చూసి చంపేసింది. అంతటితో ఊరుకోకుండా ప్రపంచంలోనే అతి నాణ్యమైన చమురు సంపదను కొల్లగొట్టడానికి రంగం సిద్ధం చేసింది. 42 ఏళ్లుగా చెప్పుకోదగ్గ జీవన ప్రమాణాలతో విలసిల్లుతున్న లిబియన్లను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ప్రణాళిక రచించింది. 27 ఏళ్లకే అధికారం చేపట్టి 42 ఏళ్లు అప్రతిహతంగా పరిపాలించిన గడాఫీ లిబియాను ఆఫ్రికాలోనే అత్యంత ధనిక దేశంగా నిలిపాడు. 1969లో రక్తపాత రహిత తిరుగుబాటుతో ఈ పోలీసు అధికారి లిబియా గద్దెనెక్కాడు. యునెస్కో లెక్కల ప్రకారమే లిబియాలో అక్షరాస్యత శాతం 83. యువకుల్లో 99.9 శాతం మంది అక్షరాస్యులు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యుహెచ్‌ఓ) లెక్కల ప్రకారం వైద్య సేవలందించడంలో ఆఫ్రికాలోనే లిబియా అగ్రస్థానంలో ఉంది.
ఇటలీ వలస రాజ్యంగా...
వేలాది సంవత్సరాల క్రితం లిబియాలోని 90 శాతం భూమి సహారా ఎడారితోనే నిండి ఉంది. భౌగోళిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 8000 బిసి నుండే ఇక్కడ జనజీవనం కొనసాగింది. ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. ఎడారిలో అక్కడక్కడ పారే చిన్న వాగులు, కాలువలను ఆధారం చేసుకొని లిబియన్లు వ్యవసాయం కొనసాగించేవారు. రాళ్లపై పెయింటింగ్‌కు అక్కడి పర్వతాలు చారిత్రక నిదర్శనంగా నిలిచాయి. 1000 బిసిలో ఫెజాన్‌ ప్రజలను గిరిజనులుగా పరిగణించేవారు. 500 బిసి నుండి 500 ఎడి మధ్య కాలంలో స్థానిక పాలనలో ఉంది. తూర్పు ప్రాంత ప్రజలు, సహారా ప్రాంతంలో స్థిరపడిన ప్రజలు రావడంతో లిబియా నాగరికతను సంతరించుకుంది. ఫియోనిసియన్లు లిబియన్లతో తొలుత వ్యాపార లావాదేవీలు నిర్వహించారు.
లిబియా తీర ప్రాంతమైన ఓయె, లిబ్‌దాV్‌ా, సబ్రతా నగరాలు కలిసి ప్రస్తుత ట్రిపోలీ (మూడు నగరాలు)గా రూపాంతరం చెందింది. ఇటలీ ఆక్రమించుకున్న తర్వాత 1912 - 27 మధ్యకాలంలో లిబియాను ఇటాలియన్‌ ఉత్తర ఆఫ్రికాగా పిలిచారు. 1927-34 మధ్యకాలంలో ఇటాలియన్‌ సైరేనైకా, ఇటాలియన్‌ ట్రిపోలిటానియా అనే రెండు ప్రాంతాలుగా విభజించబడింది. ఈ రెండు ప్రాంతాలు ఇటలీ ప్రభుత్వ పాలనలో ఉండేవి. ఆ కాలంలో లక్షా 50 వేల మంది ఇటాలియన్లు (లిబియా జనాభాలో 20 శాతం) ఇక్కడ స్థిరపడ్డారు. సైరేనైకా, ట్రిపోలిటానియా, ఫెజాన్‌ అనే మూడు ప్రాంతాలను కలిపి లిబియాగా 1934లో ఇటలీ స్థిరీకరించింది. లిబియా రెండు ప్రపంచ యుద్ధాల సమయాల్లోనూ ఇటలీ ఆధీనంలోనే ఉంది. 1943-51 మధ్యకాలంలో ట్రిపోలిటానియా, సైరేనైకాలు బ్రిటిష్‌ పాలనలో ఉన్నాయి. ఫెజాన్‌ను ఫ్రాన్స్‌ ఆధీనంలో ఉంచుకున్నది.
951లో స్వాతంత్య్రం
లిబియాకు జనవరి1, 1952లోపు స్వాతంత్య్రం ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి నవంబర్‌ 21, 1949లో తీర్మానం చేసింది. దానికి అనుగుణంగానే డిసెంబర్‌ 24, 1951లో లిబియాకు స్వాతంత్య్రం వచ్చింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ లిబియాకు రాజుగా ఇద్రిస్‌ నియమితులయ్యాడు. లిబియా రాజ్యాంగం ప్రకారం రాజు ఇద్రిస్‌ పాలనలో లిబియా నేషనల్‌ అసెంబ్లీతో పాటు ఒక అధ్యక్షుడు (మహ్మద్‌ అబ్దులాస్‌ ఎల్‌ ఆలెమ్‌), ఇద్దరు ఉపాధ్యక్షులు (ఒమర్‌ ఫేక్‌ షెనిబ్‌, అబూబకర్‌ అహ్మద్‌ అబూబకర్‌) నియమితులయ్యారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి లిబియా ఉత్తర ఆఫ్రికాలో నిరుపేద గిరిజన దేశంగానే ఉండేది. ఇది ఆఫ్రికాలో నాలుగో పెద్ద దేశం, ప్రపంచంలో 17వ పెద్ద దేశం. సాంప్రదాయకంగా లిబియా ట్రిపోలిటానియా, ఫెజాన్‌, సైరేనైకా అనే మూడు ప్రాంతాలు కలిగి ఉంది. 1951లో స్వాతంత్య్రం పొంది యునైటెడ్‌ లిబియన్‌ కింగ్‌డమ్‌గా అవతరించింది. 1959లో చమురు నిక్షేపాలు బయటపడిన తర్వాత లిబియా శుద్ధమైన చమురు నిక్షేపాలు గల పదవ అతిపెద్ద దేశంగా, పెట్రోలియం నిక్షేపాలు గల 17వ అతిపెద్ద దేశంగా ఘనతకెక్కింది. 1963లో దానిపేరును కింగ్‌డమ్‌ ఆఫ్‌ లిబియాగా మార్చారు. 1969లో జరిగిన రక్తపాత రహిత విప్లవంలో కల్నల్‌ గడాఫీ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. తర్వాత దేశం పేరును లిబియన్‌ అరబ్‌ రిపబ్లిక్‌ (అల్‌-జమూరియా అల్‌ అరబియా అల్‌-లిబియా)గా మార్చాడు. గడాఫీ కొన్ని సోషలిస్టు విధానాలను అవలంభించడంతో ఆ దేశాన్ని 1977-86 మధ్య కాలంలో 'సోషలిస్ట్‌ పీపుల్స్‌ లిబియన్‌ అరబ్‌ జమాహిరియా' అని, 1986-2011 మధ్య కాలంలో 'గ్రేట్‌ సోషలిస్ట్‌ పీపుల్స్‌ లిబియన్‌ అరబ్‌ జమాహిరియా' అని పిలిచారు. ఇప్పుడు కొత్తగా అధికారం చేపట్టిన నేషనల్‌ ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌ (ఎన్‌టిపి) 'లిబియన్‌ రిపబ్లిక్‌' అని మార్చారు.
దేశం : లిబియా
రాజధాని : ట్రిపోలి
అధికారిక భాష : అరబిక్‌
స్వాతంత్య్రం పొందింది : ఫిబ్రవరి 10, 1947 (ఇటలీ నుండి ఐక్యరాజ్య సమితి ట్రస్టీషిప్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ @ ఫ్రాన్స్‌ల ఆధీనంలోకి మారింది)
డిసెంబర్‌ 24 1951 (యునైటెడ్‌ కింగ్‌డమ్‌ & ఫ్రాన్స్‌ ఆధీనం నుండి కూడా స్వాతంత్య్రం పొందింది)
జనాభా : 66 లక్షలు
విస్తీర్ణం : 17,59,541 చదరపు కిలోమీటర్లు
ప్రధాన ఆదాయ వనరు : చమురు
కరెన్సీ : దీనార్‌
రాష్ట్రాలు : ట్రిపోలిటానియా, బర్కా, ఫెజాన్‌
ప్రధాన నది : మన్మేడ్‌ నది (సహారా ఎడారిలో)



గడాఫీ పాలన...
1959లో చమురు నిక్షేపాల వెలికితీతతో అతిపేద గిరిజన దేశం అకస్మాత్తుగా ఆఫ్రికాలోనే అత్యంత ధనిక దేశంగా అవతరించింది. చమురు విక్రయంతో ప్రభుత్వ ఆదాయం భారీ స్థాయిలో పెరిగింది. ప్రభుత్వ ఆదాయం పెరగడంతో ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు ఇద్రిస్‌ భోగభాగ్యాల్లో మునిగిపోయాడు. ప్రజా సంపదను సొంతానికి వాడుకుంటూ ప్రజల పేదరికాన్ని పట్టించుకోలేదు. పాలన స్థంభించింది. లిబియాలో ఇంజనీరింగ్‌ ప్రాజెక్టులను, ఆ దేశానికి ఆయుధాలను బ్రిటన్‌ ఎక్కువగా సరఫరా చేసింది. అమెరికా కూడా లిబియాలో అతిపెద్ద ఎయిర్‌బేస్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా, బ్రిటన్‌ దోపిడీలు పెరగడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. సెప్టెంబర్‌ 1, 1969లో 27 ఏళ్ల యువ మౌమ్మర్‌ గడాఫీ నేతృత్వంలో చిన్న మిలిటరీ అధికారుల గ్రూపు తిరుగుబాటు చేసింది. గడాఫీని ''సోదర నాయకుడు, తిరుగుబాటుకు మార్గదర్శకుడు''గా పేర్కొన్నారు. రాజు ఇద్రిస్‌ ప్రతిఘటించకుండానే పాలనాధికారాలను గడాఫీ బృందానికి అప్పగించాడు. గడాఫీ పాలనా పగ్గాలు చేపట్టగానే దేశంలో మార్పులు చేపట్టాడు. రేడియో, టెలివిజన్‌లను ప్రభుత్వ ఆధీనం చేశాడు. ప్రధానంగా కంపెనీలను, విద్యావ్యవస్థలను ప్రభుత్వపరం చేశాడు. చమురును జాతీయం చేశాడు. 1977లో లిబియాను 'సోషలిస్టు పీపుల్స్‌ లిబియన్‌ అరబ్‌ జమాహిరియా'గా ప్రకటించాడు. దేశంలో గల 66 లక్షల మందికి ఉచిత విద్య, వైద్యంతో పాటు నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించాడు. చదువుపై ఆసక్తి ఉండాలే కాని లిబియాలో ప్రోత్సాహానికి కరువులేదు. విదేశాల్లో చదవాలనుకునే వారందరికీ అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. అయితే తాము సంపాదించిన జ్ఞానాన్నంతా మళ్లీ దేశాభివృద్ధికే వెచ్చించాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తారు. లిబియన్లు ఆస్పత్రి మెట్లు ఎక్కిననాటి నుండి ఇంటికి వెళ్లే వరకూ చిల్లి గవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంతటి అనారోగ్యమైనా ప్రభుత్వమే భరిస్తుంది. విదేశాల నుండి మందులు, వైద్యులను తెప్పించి మరీ సేవలు అందిస్తుంది. కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. అవసరార్థం డబ్బులు కావాల్సి వస్తే లిబియా బ్యాంకులు వడ్డీ లేని రుణాలు అందిస్తాయి. యువతీ యువకులు పెళ్లి చేసుకుంటే 50 వేల డాలర్లు బహుమతిగా ఇస్తుంది. ఇల్లు కొనుక్కుని స్థిరపడేందుకు ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. వ్యవసాయం చేయాలనుకునే వారికి భూమి, అవసరమైన పనిముట్లు, విత్తనాలు సమకూర్చి అండగా నిలుస్తుంది. కారు కొనుక్కువాలనుకునే వారికి సగం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. భారత్‌ నుండే కాదు అగ్రరాజ్యాలుగా చెలామణి అవుతున్న అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాల ప్రజలు కూడా ఉద్యోగాల కోసం పొట్ట చేతబట్టుకొని ఇతర దేశాలకు వలస వెళ్తారు. కానీ ఒక్క లిబియా పౌరుడు కూడా ఇతర దేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లిన సందర్భం లేదు. పైపెచ్చు ఇతర దేశస్తులను ఉద్యోగం కోసం ఆ దేశానికే వలస వెళ్తారు. ఇదీ లిబియా ప్రత్యేకత. ఆఫ్రికా దేశాల్లో లిబియా ఒక స్విట్జర్లాండ్‌ వంటిదని ఇటలీ జర్నలిస్టు వైవోన్‌ పేర్కొన్నారు.
లిబియాను 'ధనిక మధ్య తరగతి ఆదాయం' గల దేశంగా ప్రపంచ బ్యాంకు కూడా కొనియాడింది. అప్పులేని దేశం లిబియా. 1980 వచ్చే సరికి ధనిక దేశాల సరసన నిలిచింది. ఇటలీ, సింగపూర్‌, దక్షిణ కొరియా, స్పెయిన్‌, న్యూజిలాండ్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే లిబియాలోనే జిడిపి వృద్ధిరేటు ఎక్కువగా ఉంది. లిబియన్లను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత గడాఫీకే దక్కింది.
మరి వ్యతిరేకత ఎందుకు..?
లిబియాలో తన కీలుబొమ్మ రాజు ఇద్రిస్‌ను తొలగించి గడాఫీ అధికారం చేపట్టగానే అమెరికాకు వ్యతిరేకమైన చర్యలు చేపట్టాడు. అధికార పగ్గాలు చేపట్టగానే అమెరికన్‌, బ్రిటన్‌ సైనిక స్థావరాలను తొలగించాడు. అంతర్జాతీయ వేదికలపై అమెరికా పెత్తనాన్ని సవాలు చేశాడు. చమురు సంపద విలువను తెలియజెప్పి దీన్ని ఇతర దేశాలు కొల్లగొట్టుకోకుండా కాపాడాల్సిన బాధ్యత తమదేనని లిబియన్లలో నింపాడు. అలీనోద్యమంలో ముఖ్య పాత్రధారిగా ఉంటూ ఆఫ్రికా దేశాల ఐక్యత కోసం పరితపించాడు. సోవియట్‌ రష్యా నేతృత్వంలోని సోషలిస్టు కూటమితో సన్నిహితంగా ఉంటూ సామ్రాజ్యవాదాన్ని సవాల్‌ చేశాడు. తమ భూభాగం కోసం పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు అండగా నిలిచాడు. ఇజ్రాయిల్‌ జాత్యాహంకారాన్ని నిర్ద్వందంగా ఖండించాడు. ఇజ్రాయిల్‌ దాడులకు బలవుతున్న లెబనాన్‌కు మద్దతుగా నిలిచాడు. అంతేకాదు ఇజ్రాయిల్‌తో ఈజిప్ట్‌ అధ్యక్షుడు అన్వర్‌ సాదత్‌ శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల ఆగ్రహించి ఆ దేశంపై శతఘ్నులు, ఫిరంగులతో దాడులు చేశాడు.
ఈ చర్యలే అమెరికాకు కంటగింపుగా మారాయి. 80వ దశకంలో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌, ఇంగ్లండ్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌లు తమ అభివృద్ధి నిరోధక ప్రయత్నాలకు అడ్డుగా నిలిచిన లిబియాతో ఘర్షణ వైఖరి అవలంబించాయి. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ అమెరికా చేసిన పనిని లిబియాపైకి నెట్టింది. యూరప్‌లో ఒక హోటల్‌పై దాడి, అమెరికా విమానం కూల్చివేత వంటి ఆరోపణలు గడాఫీపై మోపి అతడిపై క్రిమినల్‌గా ముద్ర వేయడానికి ప్రయత్నించాయి. 1986లోనే లిబియాపై, గడాఫీ నివాసంపై అమెరికా వైమానిక దాడులు చేసి ఆయన పెంపుడు కూతుర్ని చంపేసింది. గడాఫీపై ఎన్నో హత్యాయత్నాలు జరిగాయి. గడాఫీ లిబియాలో ఎన్నికలు జరపలేదని, అక్కడ ప్రజాస్వామ్యం లేదని, మానవ హక్కులు మృగ్యమని అమెరికా ప్రచారం చేసింది. కార్పొరేట్‌ మీడియా దానికి వంతపాడింది.
సోవియట్‌ పతనంతో గడాఫీ వైఖరిలో మార్పు
సోవియట్‌ యూనియన్‌ పతనంతో గడాఫీ వైఖరిలో మార్పు వచ్చింది. విమానం పేల్చివేతకు కారకుడైనట్లు ఆరోపిస్తున్న వ్యక్తిని అమెరికాకు అప్పగించాడు. ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌లను కబ్జా చేసుకున్న తర్వాత ఇరాన్‌, లిబియాలపై అమెరికా దాడిచేస్తుందని ఎప్పుడో స్పష్టమైంది. అయితే గడాఫీ దౌత్య నీతితో ఇంతకాలం నెట్టుకొచ్చాడు. 9/11 నిందితులలో ఒకడైన అబ్దెలఖిమ్‌ బెల్వద్జీని మలేసియాలో 2003లో పట్టుకున్న అమెరికాకు చెందిన సిఐఎ మరుసటి ఏడాది లిబియాకు అప్పగించింది. అతడ్ని కొంతకాలం జైల్లో ఉంచిన గడాఫీ తర్వాత ఉదారవాద దృష్టితో విడుదల చేశాడు. అయితే బెల్వద్జీ అప్పటికే సిఐఎ ఏజెంటుగా మారినట్లుంది. లిబియా ఇస్లామిక్‌ ఫైటింగ్‌ గ్రూప్‌ (ఎల్‌ఐఎఫ్‌జి) పేరుతో ఒక ఛాందస వాద సంస్థను ఏర్పాటు చేశాడు. అల్‌ఖైదా అధినేత బిన్‌లాడెన్‌ను పెంచి పోషించినట్లు బెల్వద్జీని కూడా అమెరికా పెంచి పోషించింది. అతడు గడాఫీపైనే దాడికి దిగాడు. ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై పోరాటమే తన ధ్యేమని చెప్పే అమెరికా తన వత్తాసుతో పలికే నాటోను లిబియాలో దించాడు. నాటో కూటమి బెల్వద్జీ సంస్థకు అండగా నిలిచి లిబియాలో వ్యతిరేకతను ప్రోత్సహించింది. అరబ్‌ దేశాల్లోని సిరియా, ఈజిప్టుల్లో మాదిరిగా లిబియాలో కూడా తిరుగుబాటు దారులు పురోగమించారు. అయితే గడాఫీ ఆయన కుమారుడు వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. తిరుగుబాటు దారులు ఆక్రమించుకున్న రాజధాని ట్రిపోలీని, ఇతర ప్రాంతాలను మళ్లీ తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు గడాఫీ దళం ప్రయత్నించింది. అయితే అమెరికా కనుసన్నల్లో నడిచే ఐక్యరాజ్య సమితి ట్రిపోలీని 'నో ఫ్లై జోన్‌'గా మార్చి 17న ప్రకటించింది. ఆ ప్రాంతాన్ని కాపాడే బాధ్యతను నాటో దళాల ముసుగులో ఫ్రాన్స్‌, అమెరికా, బ్రిటన్‌ కూటమిలోని సైనికులు తమకుతామే స్వీకరించారు. ట్రిపోలీని కాపాడతామని వాగ్దానం చేసిన ఈ నాటో దళాలు లిబియాలో గడాఫీ అనుకూల దళాలను తుదముట్టించే పనిలో పడ్డాయి. ఏప్రిల్‌ 20వ తేదీన గడాఫీ నివాసాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో గడాఫీ తన స్వస్థలం సిర్తేలో తలదాచుకోవాల్సి వచ్చింది. ట్రిపోలీని కాపాడతామని వచ్చిన నాటో దళాలు గడాఫీని వెంటాడి, వేటాడి హత్య చేయడం వారి దుర్మార్గానికి నిదర్శనం. గడాఫీ మరణం తర్వాత లిబియాలో శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయని, మానవహక్కులు వర్థిల్లుతాయని భావించలేం. మాజీ సోషలిస్టు దేశాలతోపాటు ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌లో అమెరికా నమ్మిన బంటైన పాకిస్తాన్‌లో ఎలాంటి పరిస్థితులున్నాయో మనం చూస్తూనే వున్నాం.

నాటో దళాలు
నాటో (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) ఏప్రిల్‌ 4, 1949లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఉంది. ప్రధానంగా అగ్రదేశాల రాజకీయ ప్రయోజనాలను కాపాడే సంస్థ ఇది. అమెరికాకు చెందిన సైనికాధికారులు నేతృత్వంలోకి నాటో వెళ్లాక వివిధ దేశాల్లో నాటో దళాల రాజకీయ జోక్యం మరీ పెరిగింది. నాటోపై ప్రపంచ దేశాలకు నమ్మకం పోయింది. నాటో దళం తొలిసారి యుగోస్లావియాలో జోక్యం చేసుకుంది. 1991-95 మధ్యకాలంలో నాటో బోస్నియాలో సైనిక చర్యను చేపట్టింది. 1999లో యుగోస్లావియాలోనూ జోక్యం చేసుకుంది. 9/11 నాడు తమ దేశంపై జరిగిన దాడులను 19 నాటో సభ్య దేశాలపై జరిగిన దాడిగా గుర్తించాలని అమెరికా తీర్మానం చేయించింది. 9/11ను సాకుగా చేసుకున్న అమెరికా తన శత్రు దేశాలపై దాడులకు నాటోను పావుగా ఉపయోగించుకోనారంభించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకొని తాలిబన్లను మట్టికరిపించి అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవరకూ నాటో దళం ఆ దేశంలో తిష్టవేసింది. ఇరాక్‌లోని చమురు సంపదపై కన్నేసిన అమెరికా సద్దాం హుస్సేన్‌ను క్రూరంగా చంపి ఆ దేశంలోనే తమ నమ్మిన బంటును నియమించుకుంది. ఇప్పుడు లిబియాలోనూ తిరుగుబాటు దళాలకు మద్దతుగా ఆ దేశ రాజధాని ట్రిపోలీని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించి ఆ నగరాన్ని కాపాడేందుకు మాత్రమే అక్కడికి వెళ్తున్నట్లు చెప్పింది. కానీ గడాఫీని హత్యచేసి తిరుగుబాటు దళాలు చంపినట్లు అబద్ధాలు ఆడింది. అమెరికా నేతృత్వంలో ఏ దేశంలోనైనా అక్రమంగా ప్రవేశించి అక్కడి అమాయక ప్రజలను దారుణంగా చంపడమే పనిగా నాటో దళాలు పెట్టుకున్నాయి. ఇది అంతర్జాతీయ ఉగ్రవాది అమెరికాకు నమ్మినబంటుగా వ్యవహరిస్తూ ఇతర దేశాల విశ్వాసాన్ని కోల్పోయాయి. నాటోలో ఏప్రిల్‌ 2009న కొత్తగా అల్బేనియా, క్రొయేషియా చేరాయి. డిసెంబర్‌ 16, 2002లో కుదిరిన బెర్లిన్‌ ప్లస్‌ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఎక్కడైనా సంక్షోభం తలెత్తితే స్వతంత్య్రంగా జోక్యం చేసుకునే హక్కు నాటోకు ఉంది. ఈ ఒప్పందం నాటో, యూరోపియన్‌ దేశాల మధ్య కుదిరింది. నాటో 28 దేశాల కూటమి అయినా అందులో అమెరికా 43 శాతం, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీలు 15 శాతం చొప్పున సైనిక శక్తి కలిగి ఉన్నాయి.

యువతలో అసంతృప్తి
లిబియాను గడాఫీ అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలబెట్టి అందరి మన్ననలు పొందాడు. అయితే ఇటీవల యువతరం ఆయనపై అసంతృప్తిని పెంచుకుంది. లిబియాలో కీలకమైన విభాగాల్లో విదేశీ ఉద్యోగస్తులే ఉన్నారు. ఎంత ఉన్నత విద్యను అభ్యసించినా ఉద్యోగం దొరకడం కష్టమైంది. దీంతో కొత్త తరం ప్రజల్లో నిరుద్యోగిత పెరిగింది. లిబియన్‌ యువకుల్లో చాలా మంది తమ కారును ట్యాక్సీగా మార్చి జీవించాల్సి వచ్చింది. ఉన్నత చదువులు చదివిన తమకు ఉద్యోగాలు లభించడం లేదన్న అసంతృప్తి వాళ్లలో పెరిగింది. యువతలోని ఈ బలహీనతను బెల్వద్జీ నేతృత్వంలోని లిబియా ఇస్లామిక్‌ ఫైటింగ్‌ గ్రూప్‌ (ఎల్‌ఐఎఫ్‌జి) సొమ్ముచేసుకుంది. యువతలో మతోన్మాదాన్ని నింపి గడాఫీకి వ్యతిరేకంగా ఉసిగొల్పింది. వాళ్లకు అమెరికా వెన్నుదన్నుగా నిలిచింది.
ఇక కుక్కలు చింపిన విస్తరే...
అమెరికా విష కౌగిలిలో లిబియా ఇక కుక్కలు చింపిన విస్తరిగా మారనుంది. నేషనల్‌ ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌ (ఎన్‌టిసి) పేరుతో ఆ దేశంలో అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆఫ్రికాలోనే అత్యంత ధనిక దేశంగా ఓ వెలుగు వెలుగుతున్న లిబియా ప్రధాన వనరు చమురు. ఈ చమురును అమెరికా, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌లు ఎగరేసుకుపోవడం మాత్రం ఖాయం. 99.9 శాతం విద్యావంతులు గల ఆ దేశ ప్రజలు తమ దేశంలోనే పరాయివాళ్లుగా బతకాల్సి వస్తుంది. ప్రజలందరికీ అన్నీ ఉచితం పేరిట ఒక విధమైన సోషలిజం పరిఢవిల్లుతున్న లిబియాలో అమెరికా మెల్లగా తన పెట్టుబడిదారీ విధానాన్ని చొప్పించడానికి వెనకాడదు. లిబియాను కూడా తన మార్కెట్‌గా మార్చుకొని అక్కడి సహజవనరులను కొల్లగొట్టుకొని పోయేందుకు రంగం సిద్ధం చేసుకుంది. గడాఫీ బతికుండగానే ఇంగ్లండ్‌ ప్రధాని కామెరూన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు సర్కోజీ లిబియాకు వెళ్లి తమ కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలపై ఒక ఒప్పందానికి వచ్చారు. లిబియాపై వచ్చే ఆదాయం అగ్ర రాజ్యాల మధ్య స్నేహాన్ని పెంచుతుందా లేక వారి మధ్య వైరుధ్యాలను మరింత పెంచుతుందా అనేది చూడాలి.

*Article from prajasakti Daily written by Md.Hassan Sharif. visit www.prajasakti.com


Friday, September 16, 2011

కేజీ గ్యాస్‌ - రిలయన్స్‌ లూటీ

రిలయన్స్‌ తన చిత్తం వచ్చినట్టు కేజీ బేసిన్‌లో వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ఏ ప్రాంతమయితే ఆ గ్యాసుతో పారిశ్రామికవంతం అవుతుందో ఆ కోస్తా ప్రాంతంలో సిపిఎం ప్రచారోద్యమాన్ని నిర్వహించింది. వాస్తవం ఇది కాగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ పట్టువదలని విక్రమార్కునిలా కెజి గ్యాస్‌ కోసం కృషి చేశారని కొందరు చేస్తున్న ప్రచారం అర్ధం లేనిది. ఆయన రాష్ట్రానికి కోరిన గ్యాస్‌ వాటా 10 శాతం మాత్రమే. దాన్నీ ఆయన సాధించలేకపోయారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళతానని మాటలతోనే కాలం వెళ్లబుచ్చారు. కేంద్రానికి విజ్ఞప్తులతోనే పరిమితమయ్యారు.
ఇటీవల వెల్లడయిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక మన రాష్ట్రంలోని కృష్ణా గోదావరి (కెజి) బేసిన్‌లో రిలయన్స్‌ గ్యాస్‌ కంట్రాక్టు వ్యవహారంలో చోటుచేసున్న అనేక అవకతవకలను ఎత్తిచూపింది. గత కొన్నేళ్లుగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కేంద్రంలోను, రాష్ట్రంలోను ఈ భారీ లూటీని ఎండగట్టి, చేస్తున్న ఆందోళనల సహేతుకతను ఈ నివేదిక ధ్రువీకరిస్తున్నది. సహజ వనరుల అన్వేషణ వెలికితీతలకు సంబంధించి భారత ప్రభుత్వం, పని అప్పగించబడిన ప్రైవేటు సంస్థల మధ్య ప్రాతిపదిక ఒప్పందం అయిన ఉత్పత్తి పంపిణీ కాంట్రాక్టును (పిఎస్‌సి) రిలయన్స్‌ ఉల్లంఘించిన తీరును కాగ్‌ స్పష్టం చేసింది. పెట్టుబడి వ్యయాన్ని అనుచితంగా పెంచి ఉత్పత్తిలో అత్యధిక వాటాను రిలయన్స్‌ కాజేస్తున్న వైనాన్ని వివరించింది.
భారత దేశంలో కనుగొన్న అతి పెద్ద గ్యాస్‌ నిక్షేపాలు ధీరూబారు-1, ధీరూబారు-3 క్షేత్రాలు. అంతేకాదు, ఇవి దేశంలో అతిపెద్ద చమురు అన్వేషణా క్షేత్రాలు కూడా. ఉత్పత్తి పంపిణీ కాంట్రాక్టు ప్రకారం రిలయన్స్‌ సంస్థ మొదటి దశ అన్వేషణ తర్వాత కాంట్రాక్టు ప్రాంతంలో 25 శాతాన్ని వదిలివేయాలి, రెండవదశ అన్వేషణ తర్వాత మరో 25 శాతం ప్రాంతాన్ని వదిలి వేయాలి. చమురు కనుగొన్న ప్రాంతాన్ని డిస్కవరీ ప్రాంతంగా ప్రకటిస్తారు. అంటే ఆ ప్రాంతంలో ఎంత పరిమాణంలో గ్యాస్‌ లభిస్తుంది అన్నదాన్ని బావులు తవ్వడం ద్వారా కచ్చితంగా నిర్ధారిస్తారు. డిస్కవరీ ప్రాంతంగా ప్రకటించిన దాన్ని కాంట్రాక్టుదారు తన ఆధీనంలో ఉంచుకుంటాడు. మిగతా కాంట్రాక్టు ప్రాంతంలో 25 శాతాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. అలా ప్రభుత్వం తిరిగి తీసుకున్న దానిని ఆసక్తికలిగిన ఇతర పార్టీలకు కాంట్రాక్టుకు ఇస్తుంది. కాని ఇక్కడ రిలయన్స్‌ సంస్థ మొదటి దశ అన్వేషణ ముగిసిన తర్వాత 25 శాతం మిగతా ప్రాంతాన్ని అప్పగించకుండానే రెండవ దశ అన్వేషణకు పూనుకుంది. ఆ తర్వాత 2009లో మొత్తంగా 765 చదరపు కిలోమీటర్ల కాంట్రాక్టు ప్రాంతాన్ని డిస్కవరీ ప్రాంతంగా ప్రకటించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ విధంగా దేశంలోనే అతిపెద్ద గ్యాస్‌, చమురు నిక్షేపాలున్న ప్రాంతాన్ని రిలయన్స్‌ సంస్థ గుత్తాధిపత్యానికి ప్రభుత్వం కట్టబెట్టింది. మొదటి దశలో రిలయన్స్‌ తన కంట్రాక్టు ప్రాంతంలో కేవలం వాయవ్య ప్రాంతంలో మాత్రమే అన్వేషణ జరిపి, రెండవదశకు సాగిపోయింది. బావులు తవ్వి కచ్చితంగా డిస్కవరీని నిర్ధారించడానికి బదులు, భూప్రకంపనల అధ్యయనం ఆధారంగా నిక్షేపాలగురించి రిలయన్స్‌ పేర్కొన్న అంచనాలను ఆమోదించి ప్రభుత్వం మొత్తం కాంట్రాక్టు ఏరియాను డిస్కవరీ ఏరియాగా ప్రకటించింది.
ఈ విధంగా మొత్తం కాంట్రాక్టు ఏరియాను డిస్కవరీ ఏరియాగా ప్రకటించడాన్ని సమీక్షించమని చమురు, సహజవాయువు మంత్రిత్వశాఖను కాగ్‌ ఆదేశించింది. మొదటి దశ రెండవ దశ అన్వేషణ తర్వాత తిరిగి అప్పగించాల్సిన 25 శాతం ప్రాంతాన్ని కూడ నిర్ధారించమని కోరింది. మొదటి దశలో కాని, రెండవ దశలో కాని నిర్దేశిత ప్రాంతంలో, నిర్దేశిత కాలవ్యవధిలో కనుగొన్న నిక్షేపాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, కాలపరిమితి తర్వాత ఆ ప్రాంతంలో తవ్వి కనుగొన్న క్షేత్రాలను కచ్చితంగా మినహాయించాలని కూడ చెప్పింది. ఈ నిబంధనలను కఠినంగా అమలుచేయాలని, ఎట్టిపరిస్థితిలోను మినహాయింపులు ఇవ్వకూడదని, డిస్కవరీ తర్వాత మిగిలిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని మరొకరికి కాంట్రాక్టుకు ఇవ్వడం ద్వారా ఇంధన వనరుల అన్వేషణ సంపూర్ణంగా జరుగుతుందని చెప్పింది.
కాగ్‌ నివేదిక ఎత్తిచూపిన మరొక ప్రధాన అంశం పెట్టుబడి వ్యయం అంచనాలను భారీగా పెంచడం గురించి. మొదటి దశలో కనుగొన్న వనరులను అభివృద్ధి చేయడానికి 240 కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని రిలయన్స్‌ 2004లో చూపించింది. కానీ ఆ తర్వాత 2006లో అనుబంధ అంచనాలో మొదటి దశకు 520 కోట్ల డాలర్లు, రెండవ దశకు 360 కోట్ల డాలర్లు అవుతుందని చూపించింది. అనుబంధ అంచనాను ప్రభుత్వానికి సమర్పించి ఆమోదింపచేసుకోవడానికి ముందే దాని ప్రకారం అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టారు. డి-1, డి-3 క్షేత్రాలను సకాలంలో అభివృద్ధి చేయడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆమోదం లభిస్తుందన్న ఉద్దేశంతో ఇలా చేశామని కాంట్రాక్టరు చెబుతున్నప్పటికీ, ప్రభుత్వ ఆమోదం దానంతటదే వస్తుందన్న ధీమాతో ఇలా చేస్తుంటారని కాగ్‌ పేర్కొంది.
ఇలా పెట్టుబడి వ్యయ అంచనాను పెంచడం వల్ల ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుంది. ఉత్పత్తి పంపిణీ ఒప్పందం ప్రకారం ఒక ఏడాదిలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ, అన్వేషణా వ్యయం, అభివృద్ధికి అయిన వ్యయం కలుపుకొని ఆ ఏడాది ఉత్పత్తి అయిన దానిలో 'కాస్ట్‌ పెట్రోలియం'ను నిర్ణయిస్తారు. దానికోసం ఆ ఏడాది అయిన ఉత్పత్తిలో 90 శాతం వరకు మినహాయిస్తారు. మిగతాదాన్ని 'ప్రాఫిట్‌ పెట్రోలియం'గా గుర్తిస్తారు. ఈ ప్రాఫిట్‌ పెట్రోలియంలో కూడ మొత్తం పెట్టుబడిని బట్టి కాంట్రాక్టరుకు వాటా లభిస్తుంది. మిగిలినదే ప్రభుత్వానికి దక్కేది. వనరుల అభివృద్ధి వ్యయం అంచనా ఇలా పెరగడం వల్ల ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుంది. ఉత్పత్తి అధికంగా జరిగే తొలి దశలో ప్రభుత్వం వాటా నామమాత్రంగా ఉంటుంది. క్రమంగా చివరికి వాటా పెరిగినా ఉత్పత్తి తగ్గిపోతుంటుంది. అధిక వాటా ప్రభుత్వానికి లభించే సమయానికి అసలు ఆ వనరే వట్టిపోయే అవకాశం ఉంటుంది. అందుచేతనే అనేక దేశాలు పెట్టుబడి వ్యయం అంచనాల పెంపుదలపై కచ్చితమైన, నిఘాను, నియంత్రణను అమలుచేస్తున్నాయి. ఉదాహరణకు మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ పెట్టుబడి వ్యయం 5 లక్షల డాలర్లు పెరిగితే దాన్ని ప్రభుత్వ ప్రతినిధులు కూడ సగం మంది ఉండే మేనేజింగ్‌ కమిటీ ఆమోదించి తీరాలని నిబంధన విధించింది. అలాంటి పద్ధతి మనకు లేదు.
మరొక ముఖ్యమైన అంశం గ్యాస్‌ ధర. ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వలోని సాధికార కమిటీ రిలయన్స్‌ గ్యాస్‌కు ఒక ఎంఎంబిటికి 4.2 డాలర్ల ధరను నాలుగేళ్ల క్రితమే ఆమోదించింది. ఇది అంతకుముందు రిలయన్స్‌ సంస్థ ఎన్‌టిపిసికి సరఫరా చేస్తానన్న 2.34 డాలర్ల కన్నా ఎక్కువ. అంబానీ సోదరులు తమ ప్రైవేటు ఒప్పందంలో అంగీకరించుకున్న 2.25 డాలర్ల కన్నా ఎక్కువ. 4.33 డాలర్లను అనుమతించమని రిలయన్స్‌ చేసిన ప్రతిపాదనను 0.1 శాతం తగ్గించి ప్రభుత్వం ఆమోదించింది. దీని మూలంగా ఆ గ్యాస్‌ను వినియోగించే విద్యుత్‌ కేంద్రాలు, ఎరువుల ఫ్యాక్టరీలు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అంతిమంగా భరించేది ప్రజలే. గ్యాస్‌ను వెలికి తీయడానికి ఒక ఎంఎంబిటికి ఒక డాలరుకు మించి ఖర్చు అవుతుందని ప్రపంచంలో ఎక్కడా ఎవరూ చెప్పలేదని నిపుణులు ఎన్ని సార్లు మొత్తుకున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పుడు దీన్ని కాగ్‌ ప్రశ్నించినా ప్రభుత్వం నుండి మౌనమే సమాధానం.
ఆరంభంలోనే చెప్పినట్లు ఈ అన్ని అంశాల గురించి చాల కాలంగా పోరాటం చేస్తున్నది సిపిఎం పార్లమెంటు సభ్యుడు తపన్‌ సేన్‌. 2006 డిసెంబరు 21న మొదలుపెట్టి అనేక లేఖలను పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖకు రాశారు. వాటి కాపీలను ప్రధానమంత్రికి పంపించడంతోపాటు నేరుగా ఆయనకూ లేఖలు రాశారు. రాష్ట్రానికి చెందిన అప్పటి సిపిఎం పార్లమెంటు సభ్యులు పి. మధు, ఎం. బాబూరావు ప్రధానికి లేఖ రాస్తూ కెజి బేసిన్‌లో రిలయన్స్‌ వెలికితీసే గ్యాసుకు నిర్ణయించిన అహేతుకమైన ధర గురించి, అన్యాయమైన ఉత్పత్తి పంపిణీ ఒప్పందం గురించి ప్రశ్నించారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను ముందుగా మన అవసరాలకు వినియోగించాలని, ఆ తర్వాతనే బయటికి తరలించాలని కోరారు. సహజవనరులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి ఉత్పత్తిలో 50 శాతం కేటాయించాలని 12వ ఆర్థిక సంఘం చెప్పినదాన్ని అమలుచేయాలని, లేదంటే ప్రభుత్వానికి లభించే గ్యాస్‌లో అయినా 50 శాతం ఈ రాష్ట్రానికి వినియోగించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ కమిటీ 2007లోనే ఈ అంశంపై సిపిఎం ఎంపీల లేఖలు, పొలిట్‌బ్యూరో ప్రకటనలతో పాటు, పలువురు రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలతో ఒక బుక్‌లెట్‌ను ప్రచురించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ఈ బుక్‌లెట్‌ ముందుమాటలో ''సహజవాయు నిక్షేపాలు రాష్ట్రంలో లభిస్తున్నప్పటికీ వాటి అభివృద్ధి మీద, వినియోగం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు. పెత్తనమంతా కేంద్రానిదే. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత విధానాలలో భాగంగా ఇప్పుడంతా ప్రైవేటు సంస్థలదే రాజ్యంగా మారిపోయింది. ముఖ్యంగా రిలయన్స్‌ సంస్థ గుత్తాధిపత్యాన్ని సంపాదించి తన చిత్తం వచ్చినట్లు వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వమేమో నామమాత్రంగా లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నది.'' అని ఘాటుగా విమర్శించారు. అంతేకాదు, కెజి బేసిన్‌ గ్యాస్‌పై రాష్ట్రానికే హక్కు అని నినదిస్తూ ఏ ప్రాంతమయితే ఆ గ్యాసుతో పారిశ్రామికవంతం అవుతుందో ఆ కోస్తా ప్రాంతంలో సిపిఎం ప్రచారోద్యమాన్ని నిర్వహించింది. వాస్తవం ఇది కాగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పట్టువదలని విక్రమార్కునిలా కెజి బేసిన్‌ గ్యాస్‌ కోసం కృషి చేశారని కొందరు చేస్తున్న ప్రచారం అర్ధం లేనిది. ఆయన రాష్ట్రానికి కోరిన గ్యాస్‌ వాటా 10 శాతం మాత్రమే. దాన్నీ ఆయన సాధించలేకపోయారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళతానని మాటలతోనే సరిపుచ్చారు. కేంద్రానికి విజ్ఞప్తులతోనే పరిమితమయ్యారు. పైగా ఆంధ్రప్రదేశ్‌ను పెట్రోలియం, కెమికల్స్‌,పెట్రోకెమికల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ జోన్‌గా తయారుచేస్తానని ఒక వైపున గొప్పలు చెప్పుకొంటూ, తన ప్రభుత్వమే ఒప్పందం కుదుర్చుకున్న కాకినాడ ఓఎన్‌జిసి రిఫైనరీ బయటికి తరలిపోతున్నా అడ్డుకోలేకపోయారు.

**** from Prajasakti desk

Tuesday, August 23, 2011

హజారే ఉద్యమంలో కొన్ని కోణాలు

అన్నా ఉద్యమాన్ని 22 మంది సభ్యుల కోర్‌కమిటీ నడిపిస్తోంది. ఇందులో కనీసం సగం మంది సభ్యులతో అన్నాకు ముఖ పరిచయం కూడా లేదన్నది వాస్తవం. ఈ కమిటీ కింద మరో 13 ఉప కమిటీలు వివిధ అంశాలపై కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. మీడియా, సమాచార విభాగం దేశవ్యాప్తంగా రోజుకు పది లక్షల మొబైల్‌ ఫోన్లకు, 20 లక్షల ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తోంది. ఇటువంటి వాటిలో ఆరెస్సెస్‌ చొరబడుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం దేశంలో రెండో స్వాతంత్య్రోద్యమం నడుస్తోందా ? అవినీతికి వ్యతిరేకంగా ప్రజా విప్లవం పెల్లుబికిందా ?? సంఫ్‌ు పరివార్‌ దీనిని సొమ్ము చేసుకోవాలని చూస్తోందా ??? ఈ ప్రశ్నలకు ఒక్కొక్కరి వద్దా ఒక్కో సమాధానముంది. ఏ సమాధానం సరైనదన్న విషయాన్ని కాలమే త్వరలో నిర్ణయించనుంది. అవునన్నా, కాదన్నా...ఇప్పుడు దేశంలో అవినీతి అతిపెద్ద చర్చనీయాంశం అయ్యింది. పెట్రోల్‌ ధరలు తగ్గించాలని దేశ ప్రజలందరూ నినదించవచ్చు..ప్రభుత్వం ఒక్కరోజులో తగ్గించనూ వచ్చు. వేతనాలు పెంచాలని, లాకౌట్లు ఎత్తివేయాలని కార్మికులు సమ్మె చేయవచ్చు...ప్రభుత్వాలు, యాజమన్యాలు తలొగ్గవచ్చు. ఇలా అత్యధిక శాతం ప్రజలు కొన్ని 'నిర్దిష్టమైన' డిమాండ్ల ఆధారంగా (నిత్య జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలపై) ఏకమవ్వడం..ఆందోళనల్లోకి రావడం సర్వ సాధారణం. అవినీతిని అంతమొందించాలని ' దేశ ప్రజలందరూ ' వీధుల్లోకి రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించేదే ! వ్యవస్థీకృతమైన అవినీతిని అరికట్టడం, ఒకటి రెండు చట్టాలతోనే సాధ్యమౌతుందని భావించడమూ అటువంటిదే. అన్నా హజారే దీక్ష రూపంలో ప్రస్తుతం దేశవ్యాపితంగా సాగుతోన్న ఆందోళనలోనూ పైకి కనిపించని వాస్తవాలు కూడా కొన్ని ఉన్నాయి. సయోధ్యకు ఇరుపక్షాలూ సిద్ధంగానే ఉన్న నేపథ్యంలో..అన్నా బృందం, కేంద్ర ప్రభుత్వం మధ్య నేడో, రేపో ఒక ఒప్పందం కుదరవచ్చు. ఈ సయోధ్యమాటున అవినీతి వ్యతిరేక ఉద్యమంలో దాగున్న కీలకాంశాలను మరుగున పడేయడం మాత్రం సాధ్యం కాదు.
కల్లోల కాంగ్రెస్‌
ప్రస్తుతం యుపిఎ 2 ప్రభుత్వం రెండు సంవత్సరాల వయసులోనే అపారమైన అవినీతి (అప్రతిష్ట) మూటగట్టుకుందనడంలో వివాదం లేదు. హాజారే, రామ్‌దేవ్‌బాబా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక 'ఉద్యమాన్ని' ఎదుర్కోవడంలోనూ తలపండిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ పసితనాన్ని ప్రదర్శించింది. హజారేబృందాన్ని లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా తయారీ కమిటీలోకి సభ్యులుగా తీసుకోవడం - ఆపాదమస్తకమూ హజారే అవినీతిపరుడేనని విమర్శించడం....రామ్‌దేవ్‌బాబాతో విమానాశ్రయానికి వెళ్లి చర్చలు జరపడం - దీక్షలో కూర్చున్న వ్యక్తిని అర్ధరాత్రి బలవంతంగా అరెస్టు చేయడం...ఇలా గత ఏప్రిల్‌ నుండీ కాంగ్రెస్‌ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఆగస్టు 16న హజారేను ఇంటి నుండి నేరుగా తీహార్‌ జైలుకు తరలించడం వీటికి పరాకాష్ట. ఇది ప్రజాస్వామ్య హక్కులపై అధికార పార్టీ నగంగా చేసిన దాడి. లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా కమిటీలోకి కొందరు వ్యక్తులను సభ్యులుగా తీసుకోవడం కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం..నాడు కాంగ్రెస్‌కు అప్రజాస్వామికంగానూ, పార్లమెంటును అగౌరవపర్చే చర్యగానూ అనిపించకపోవడం విడ్డూరం. అప్రజాస్వామిక డిమాండ్లతో అన్నా ఆందోళన చేస్తున్నారని విమర్శించే హక్కు ఇప్పుడు కాంగ్రెస్‌కు ఉందా అన్నదే ప్రశ్న. అవినీతి వ్యతిరేక ఉద్యమాలపై, వాటికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తులపై గత ఏప్రిల్‌ నుండీ కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ సూత్రబద్ధమైన, నిలకడైన వైఖరిని ప్రదర్శించలేదు. 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీ, ఇలా ఏపూటకాపూట బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నది. ఇంత జరుగుతున్నా అవినీతి అంశంపై కనీసం ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు. 'ఆర్థిక సంస్కరణల అమలు వల్లే దేశంలో అవినీతి పెరిగిందని కొందరు అంటున్నారు. ఇది అవాస్తవం. సంస్కరణలకూ, అవినీతికీ సంబంధం లేదు. ఇంకా కొన్ని రంగాల్లో సంస్కరణల కారణంగానే, అవినీతి తగ్గింది' అంటూ ప్రధాని మన్మోహన్‌ రెండ్రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్‌ జెండాను, ఎజెండానూ చెప్పకనే చెబుతున్నాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమం నేపథ్యలో సంస్కరణలకు ఎక్కడ అగౌరవం కలుగుతుందోనన్న ఆందోళన తప్ప...ప్రధాని ప్రకటనలో మరేమీ కనబడకపోవడం యాదృచ్ఛికం కాదు.
ఆరెస్సెస్‌ చొరబాటు యత్నాలు
గత ఏప్రిల్‌లో మొదటి సారి జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన ఆందోళనకన్నా ప్రస్తుత ఆందోళన విస్తృతి పెరిగింది. హజారే దీక్షలో చొరబడి దీనిని సొమ్ము చేసుకోవాలని ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తోంది. ఈ ఉద్యమంలో తమ శ్రేణులు పూర్తి స్థాయిలో, ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేత సునీల్‌ జోషి కొద్ది రోజుల క్రితం స్వయంగా చెప్పడం, ఎబివిపి ఆధ్వర్యంలో నడిచే 'ఇండియా అగైనెస్ట్‌ కరప్షన్‌' ఈ ఉద్యమంలో చొరబడడం దీనినే సూచిస్తున్నాయి. అన్నా ఉద్యమాన్ని 22 మంది సభ్యుల కోర్‌కమిటీ నడిపిస్తోంది. ఇందులో కనీసం సగం మంది సభ్యులతో అన్నాకు ముఖ పరిచయం కూడా లేదన్నది వాస్తవం. ఈ కమిటీ కింద మరో 13 ఉప కమిటీలు వివిధ అంశాలపై కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. మీడియా, సమాచార విభాగం దేశవ్యాప్తంగా రోజుకు పది లక్షల మొబైల్‌ ఫోన్లకు, 20 లక్షల ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తోంది. ఇటువంటి వాటిలో ఆరెస్సెస్‌ చొరబడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అలా అని అన్నా ఆందోళనలో ప్రజలెవరూ స్వచ్ఛదంగా పాల్గొనడం లేదన్నది దీనర్ధం కాదు. హజారే ఉద్యమంతో ఊపందుకున్న అవినీతి వ్యతిరేక వాతావరణం నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని బిజెపి ఇంకొకవైపు నుంచి ప్రయత్నిస్తున్నది. అదలా ఉంచితే అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు, కార్పొరేట్‌ ఉద్యోగులు, యువత, మధ్యతరగతి జీవులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడం ఆహ్వనించదగ్గ పరిణామమే.
పార్లమెంటు...ప్రజాస్వామ్యం
ఈ ఉద్యమం సందర్భంగా అన్నా బృందం లేవనెత్తిన డిమాండ్లకు సంబంధించిన కొన్ని అంశాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఫలానా గడువులోగా ఫలానా చట్టాన్ని రూపొందించాలని శాసించజూడడం అన్నా బృందం పట్టుబట్టడం విమర్శలకు ఆస్కారమిచ్చింది. అదే సమయంలో ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ...పార్లమెంటు అధికారమే అత్యున్నతమైనదని భీష్మించుక్కూర్చొన్న యుపిఏ ప్రభుత్వ ధోరణి ప్రజల ఆగ్రహం పెరగడానికి కారణమవుతున్నది. 'అవినీతి' అంశానికి నిర్దిష్టత్వం లేదు కాబట్టి దేశ కార్పొరేట్‌ రంగం కూడా అన్నా ఆందోళనకు మద్దతునిస్తున్నది. అన్నా బృందం ప్రస్తావిస్తున్న జన లోక్‌పాల్‌లో ప్రభుత్వ అవినీతి గురించి తప్ప కార్పొరేట్‌ అవినీతి గురించిన ఊసే లేకపోవడం గమనార్హం. ఇప్పుడు వెల్లువెత్తిన అవినీతి కుంభకోణాలన్నీ దాదాపు ఈ కార్పొరేట్‌ రంగం ప్రమేయంతో జరిగినవేనన్న విషయం మరువరాదు. రెండో దశ సంస్కరణలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ విఫలమయ్యిందన్న అసంతృప్తితో ఉన్న కార్పొరేట్‌ గణం... కూడా హజారే ఉద్యమానికి మద్దతు నిస్తున్నదనే వార్తలను కొట్టిపారేయలేం. మధ్యతరగతి స్పందిస్తుందన్న కారణం చెప్పి, అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కార్పొరేట్‌ మీడియా కల్పిస్తోన్న ప్రాధాన్యతా శ్రుతి మించుతోందనే చెప్పాలి. ఏడాది క్రితం ఇదే రామ్‌లీలా మైదానం నుండి ఇదే జంతర్‌మంతర్‌ వరకూ లక్షలాది అంగన్‌వాడీలు ప్రదర్శనగా వస్తే...' ట్రేడ్‌యూనియన్‌ ఆందోళనలతో ఢిల్లీ వాసులుకు ట్రాఫిక్‌ ఇక్కట్లు ' అంటూ లోపలి పేజీల్లో ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక వార్తను ఇచ్చింది. అదే పత్రిక ప్రస్తుతం అన్నా ఉద్యమంపై నిత్యం 8 పేజీలకు తగ్గకుండా వార్తలిస్తోంది. 'సంస్కరణలను కొనసాగించడంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం విఫలమౌతోంది. ఈ కారణంగా దేశంలో మధ్య తరగతి ఆకాంక్షలు, అభిలాషలు తీరడం లేదు. అందువల్లే దేశ మధ్యతరగతి అన్నా ఉద్యమానికి బాసటగా నిలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించకపోతే, కాంగ్రెస్‌ పుట్టి మునిగినట్లే' అని మరో ప్రముఖ ఆంగ్ల పత్రిక సంపాదకుడు రెండ్రోజుల క్రితం వ్యాసమే రాశారు !

**Article By D.JayaPrakash From prajasakti.com 

Tuesday, August 16, 2011

అమెరికా బాటలో ఫ్రాన్స్‌

అసలే ఐరోపాలో వేసవి, దానికి తోడు రుణ సంక్షోభ వేడిగాలులు పాలకపార్టీలకు మరింతగా చెమటలు పట్టిస్తున్నాయి. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా పరపతి పోయింది. తరువాత వంతు ఏ దేశానిది అవుతుందన్నది మదుపర్లలో ప్రశ్నార్థకంగా మారిన సమయంలో న్యూయార్క్‌, వాషింగ్టన్‌, నుంచి రుణ సంక్షోభం పారిస్‌ నగరానికి పాకింది. ఏ క్షణంలో అయినా దాని పరపతీ పతనం కానున్నదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సంక్షోభంలో ఉన్న ఐరోపాను ఆదుకొనేందుకు తాత్కాలిక సర్దుబాటు నిధి సమకూర్చే దేశాలలో జర్మనీ తరువాత స్థానంలో ఉంది ఫ్రాన్స్‌. అలాంటి దేశంలో పడిపోతున్న స్టాక్‌మార్కెట్‌ను నిలబెట్టేందుకు అధ్యక్షుడు సర్కోజీ పక్షం రోజుల ముందుగానే వేసవి విడిది నుంచి ఆగమేఘాల మీద పారిస్‌ చేరుకున్నాడు. లండన్‌ తగలడిపోవటం కూడా నిస్సందేహంగా సర్కోజీని కలవర పరిచి ఉంటుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తన తాజా నివేదికలో ఫ్రెంచి ఆర్థిక వ్యవస్థ పురోగమనం గురించి భరోసా ఇచ్చింది. రానున్న రెండు సంవత్సరాలలో తన ఆర్థిక వనరులను అది మరింతగా స్థిరపరుచుకుంటుందని చెప్పింది. ఇదొక ఎత్తయితే అమెరికా పరపతిని తగ్గించిన స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ సంస్థతో పాటు మరో రెండు ప్రముఖ సంస్థలు ఫ్రెంచి సర్కార్‌ బాండ్లు కొనటం సురక్షితమని చేసిన ప్రకటనల నేపథ్యంలో ఫ్రెంచి బాండ్ల ధరలు పెరిగాయి. అయితే ఉరుములేని పిడుగులా శుక్రవారం నాడు ఫ్రెంచి ప్రభుత్వ పది సంవత్సరాల బాండ్లపై రాబడి మూడు శాతం పడిపోయింది. ఈ పరిణామం జరిగిన కొద్ది సేపటికే ఏప్రిల్‌-జూన్‌ మధ్య ఫ్రెంచి ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పురోగతి లేక స్తంభించి పోయిందని, సర్కోజీ సర్కార్‌ చెబుతున్నట్లు ఏడాది కాలంలో రెండు శాతం కాదు 0.3శాతం మాత్రమే పెరుగుదల రేటు ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనాలను ప్రకటించారు. పులి మీద పుట్రలా తొలి మూడు మాసాలతో పోల్చితే వినియోగం రెండవ త్రైమాసికంలో 0.7శాతం పడిపోయిందని గణాంకాలు వెల్లడించాయి. అటు సూర్యుడు ఇటు పొడిచినా ఈ ఏటి లోటు బడ్జెట్‌ను 7.1 నుంచి 5.7శాతానికి, వచ్చే ఏడు 4.6శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యంలో ఎలాంటి మార్పులు లేవని అందుకు గాను బడ్జెట్‌ కోతలను విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెల్లవారే సరికి పరిష్కరించటానికి మంత్ర దండం లేదని కొన్ని పత్రికలు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. ఇదే జరిగితే అభివృద్ధి రేటు మరింత పతనం అవకతప్పదు. ఇతర ఐరోపా ధనిక దేశాలతో పోల్చితే ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద దేశీయ డిమాండ్‌ మీదే ప్రధానంగా ఆధారపడి ఉంది. కొత్త కార్ల కొనుగోలుకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను ఉపసంహరించగానే జనం కొనుగోళ్లను కూడా నిలిపివేశారు. ఈ పరిణామం సర్కోజీ సర్కార్‌ను కుదిపేస్తోంది. రుణభారాన్ని తగ్గించేందుకు, బడ్జెట్‌లోటును కుదించేందుకు చర్యలు తీసుకుంటామని ట్రిపుల్‌ ఏలతో ఉన్న తమ పరపతికి ఎలాంటి ఢోకా లేదని ప్రపంచాన్ని నమ్మించేందుకు అధ్యక్షుడు సర్కోజీ సర్కస్‌ ఫీట్లు చేస్తున్నాడు. దానిలో భాగంగానే ప్రభుత్వ బాండ్లను తక్కువ రేట్లకు విక్రయించటాన్ని పదిహేను రోజుల పాటు నిషేధించాడు. ఇటలీ, స్పెయిన్‌, బెల్జియం కూడా ఇవే చర్యలను తీసుకున్నాయి. ఇలాంటి పరిస్థితి మార్కెట్‌లో తలెత్తటం అంటే ప్రభుత్వ సమర్థతపై విశ్వాసం కోల్పోవటానికి సూచిక.

ఐరోపా యూనియన్‌లో జర్మనీ తరువాత ఫ్రాన్స్‌ పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు భావిస్తారు. అక్కడ నిరుద్యోగం 9.2శాతం కాగా, యువతలో అది 22.8శాతం కావటం గమనార్హం. ఫ్రాన్స్‌లో పెద్ద బ్యాంకుల్లో మూడవదైన సొసైటీ జనరల్‌ షేర్ల ధరలు జూలై రెండవ వారం నుంచి ఇప్పటివరకు 40శాతం పడిపోవటం ప్రమాద సూచిక. ఒక నిర్దిష్ట తేదీని నిర్ణయించి కంపెనీల వాటాలు, వస్తువుల ధరలపై లావాదేవీలు జరపటాన్ని ఆర్థిక పరిభాషలో డెరివేటివ్స్‌ అంటారు. ఇది పెద్ద జూదం. దీనిలో సొసైటీ జనరల్‌ది పెద్ద చేయి. అమెరికా సెక్యూరిటీల డెరివేటివ్స్‌ తనఖా లావాదేవీల్లో 67 వేల కోట్ల డాలర్లు పోగొట్టుకొని చేతులు కాల్చుకుంది. అయితే అమెరికా సర్కార్‌ ఆదుకోవటంతో అది నష్టాల నుంచి బయట పడింది. ఇప్పుడు ఫ్రెంచి సర్కార్‌ ఈ బ్యాంకును కాపాడేందుకు రంగంలోకి దిగింది. ఈ బ్యాంకే పోర్చుగల్‌, ఐర్లండ్‌, గ్రీస్‌, స్పెయిన్‌ సర్కార్లను ఆదుకొనేందుకు 1820 కోట్ల యూరోలు, ఫ్రెంచి సర్కారుకు 1920 కోట్ల యూరోల రుణం ఇచ్చింది. ఫ్రాన్స్‌లో రుణ సంక్షోభ ఛాయలు కనిపించటంతో వంద రూపాయల ఆదాయమైతే ఇప్పటికే 120 రూపాయల అప్పుల పాలైన ఇటలీ కూడా ఉలిక్కి పడుతోంది. రానున్న రెండు సంవత్సరాలలో 6,500 కోట్ల డాలర్ల మేరకు అదనంగా పొదుపు చర్యలు చేపట్టాలని శుక్రవారం నాడు బెర్లుస్కోనీ సర్కార్‌ నిర్ణయించింది. మతేతరమైన అనేక సెలవురోజుల రద్దు, స్థానిక సంస్థలకు ఎన్నికయ్యేవారి సంఖ్య పరిమితం చేయటం, పన్నులు పెంచటం వంటి చర్యలను ప్రకటించింది. సంక్షోభంలో ఉన్న గ్రీస్‌ను ఆదుకోవటం, మిగతా దేశాల పతనాన్ని ఎలా నిలబెట్టాలా అని మదన పడుతున్న ఐరోపా యూనియన్‌కు ఫ్రెంచి పరిణామం ఊహించని దెబ్బ. ఒక దగ్గర పడిన చిల్లుకు మాసిక వేసిన మరుక్షణమే మరోచోట పడిపోతోంది. దివాళాకోరు పెట్టుబడిదారీ విధానాలను, ప్రపంచాధిపత్యం కోసం యుద్ధాలను రుద్దుతున్న ధనిక దేశాలే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లుగా అమెరికా, ఐరోపా యూనియన్‌ సంక్షోభానికి ప్రపంచం కూడా మూల్యం చెల్లించాల్సి రావటమే ఆందోళన కలిగించే అంశం.

***Article From prajasakti Editorial  www.prajasakti.com

Sunday, August 14, 2011

చరిత్ర బురుజుపై స్వతంత్ర పతాక

ఎర్రకోటను మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ పాతఢిల్లీలో యమునానది ఒడ్డున 17వ శతాబ్దంలో నిర్మించాడు. లాల్‌ ఖిల్లా అప్పట్లో చక్రవర్తి కుటుంబ నివాసంగా వుండేది. చివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ను బ్రిటిష్‌వారు దేశ బహిష్కరణ చేసేవరకు అంటే 1857 వరకు మొఘలుల రాజధాని నగరం కూడా అదే. షాజహాన్‌ 1638లో ప్రారంభించిన ఈ కోట నిర్మాణం తొమ్మిదేళ్లపాటు సాగింది. ఔరంగజేబు, ఆ తర్వాత మొఘల్‌ పాలకులు కోటకు అనేక కొత్త అందాలు అద్దారు

 ఎర్రకోట పర్షియన్‌, యూరోపియన్‌, ఇండియన్‌ కళల కలబోతగా వుంటుంది. ఖిల్లా ప్రతి అంగుళంలోనూ కళాకారుల పనితనం కనిపిస్తుంది. భారతదేశంలోని అత్యంత ప్రధానమైన నిర్మాణాల్లో ఎర్రకోట ఒకటి. భవన నిర్మాణ కౌశలానికి, శక్తికి ఈ కోట నిదర్శనం. నిర్మాణంలోని ప్రతి అంశం ఎంతో కళాత్మకంగా వుంటుంది. ఈ కోట లోపలి స్థలము 6 లక్షల చదరపు గజాలుంటుంది. గోడల యెత్తు 35 గజాలు. కోట చుట్టూ 24 గజాల వెడల్పు, 20 గజాల లోతుగల కందకం తవ్వబడింది. ఈ కోట నిర్మాణానికి అప్పుడే 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. లోపలి భవనాల నిర్మాణానికి మరో 50 లక్షల రూపాయలైంది. కట్టడాల నిర్మాణం ఎంతో అందంగా, ఉన్నతంగా వుంటుంది. విశాలమైన భవనాలు, వాటి చుట్టూ అందమైన తోటలు, స్నానాల గదులు...రాచరికానికి నిలువెత్తు నిదర్శనంగా గోచరిస్తాయి. ఇంతటి అపురూపమైన కోట కాలక్రమంలో ఎన్నో దాడులకు గురై తన సౌందర్యాన్ని చాలా వరకు కోల్పోయిందనే చెప్పాలి. మహారాజసం వుట్టిపడే ఈ కోట ఒకప్పుడు మహాకవులు, కళాకోవిదులతో కళకళలాడిపోయేది. కవితా కళాకుసుమాలు వికసించేవి. ముస్లింల ఈద్‌ సందర్భంగా, హిందువుల దీపావళి వంటి పండుగల సందర్భంగా పాదుషాలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రజల ఆనందంలో పాలుపంచుకొనేవారు

మొఘల్‌ వంశపు చివరి రాజైన బహదూర్‌ షా 1837 సెప్టెంబర్‌ 27వ తేదీన ఢిల్లీ సింహాసనం అధిష్టించాడు. అయితే అప్పటినుంచే బ్రిటిషు ప్రభుత్వం అతని పతనానికి కుట్రలు పన్నసాగింది. ఎన్నో రాజకీయ, ప్రతికూల క్లిష్ట పరిస్థితుల్లో బహదూర్‌ పట్టాభిషేకం జరిగిందనుకోవాలి. 1857లో మొదటిసారిగా మీరట్‌లో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరవేయబడింది. సైన్యంలో బెంగాల్‌ ఆర్మీ రెజిమెంట్‌కు చెందిన సైన్యాధికారి మంగల్‌పాండే ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించి గొప్ప సంక్షోభాన్ని సృష్టించాడు. బ్రిటిషు సైన్యం ఆ అధికారిని హతమార్చి తిరుగుబాటును అణచివేయాలని చూసింది. కానీ అతను చనిపోయినా అతను రగిల్చిన తిరుగుబాటు జ్వాలలు చల్లారలేదు. మరింతగా భగ్గుమన్నాయి. తిరుగుబాటు సైన్యం ఎర్రకోటలోకి ప్రవేశించి బహదూర్‌షా ఆదేశాలను పాటించడానికి సిద్ధంగా వున్నామంది. లాల్‌ ఖిల్లాలో ప్రతి కీలక ప్రాంతంలోను ఆయుధధారులైన సైనిక కేంద్రాలను సన్నద్ధం చేశారు. పోరాటం కూడా ఉధృతం చేయబడింది. బ్రిటిష్‌ సైన్యం మరింత అప్రమత్తమై అణచివేతను కఠినంగా అమలు జరిపింది. ఆ పోరాటంలో మూడు వేల మందికి పైగా దేశభక్తులను ఉరితీశారు. వేలాదిమందిని కాల్చిచంపారు. లక్షలాదిమంది సైనికుల ప్రాణాలు ఫిరంగుల ధాటికి గాలిలో కలిసిపోయాయి. ఇటువంటి అనేక పోరాటాల చరిత్ర కలిగిన ఎర్రకోటను చూడగానే దేశభక్తులైన ప్రతి భారతీయుడి హృదయం అలనాటి చారిత్రక స్మృతులతో బరువెక్కిపోతుంది. ఉద్వేగభరితమౌతుంది.

వివిధ చారిత్రిక దశల్లో స్వతంత్రంకోసం పోరాడిన ఎందరో వీరులను, ఈ కోటలోనే బంధించి ఉరితీశారు. అజాద్‌ హింద్‌ ఫౌజ్‌పైన విచారణ జరిపిందీ ఇక్కడే. ఈ ఎర్రకోటపైనే బ్రిటిష్‌ పాలకుల పతాకం అనేక సంవత్సరాలు రెపరెపలాడి, భారత ప్రజల బానిస బతుకుల్ని అవహేళన చేసింది. ఎందరో దేశ భక్తులైన ధీరహృదయులు, కవులు, కళాకారులు, ప్రభువులు, బ్రిటిషు ప్రభుత్వ దారుణ శిక్షలకు గురై అమరవీరులయ్యారు. అయితే ఎర్రకోట మహోన్నత వైభవం మహోజ్వలంగా ప్రకాశించి దశదిశలను కాంతివంతం చేసిన రోజుల గురించి కూడా మనం చరిత్రలో చూస్తాం. సుదీర్ఘ కాలం పాటు ఈ కోట నుంచి వెలువడిన ఆజ్ఞలు యావత్‌ భారత దేశాన్ని శాసించాయి. దీని వైభవ ప్రాభవాలకు తల వంచని శక్తి ఏదీ ఆనాడు దేశంలో వుండేది కాదు. అలాంటి చోటనే 27 జనవరి 1858వ సంవత్సరంలో కడపటి భారత చక్రవర్తి, సుప్రసిద్ధ దేశభక్తుడు అయిన బహదూర్‌ షా జఫర్‌ ఒక సాధారణ నేరస్థుడిగా నిర్బంధితుడై బ్రిటిషు పరిపాలకుల ఎదుట విచారణకు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ కేసు విచారణ కోట భవనాల సముదాయంలోని ఒకప్పటి ఆయన న్యాయ దర్బారు 'దర్బారె ఖాస్‌'లో జరిగింది. ఇదే ప్రదేశంలో ఒకానొక రోజుల్లో జఫర్‌ ఆజ్ఞలు నిర్విఘ్నంగా అమలయ్యేవి. అలాంటి చోటనే జఫర్‌ నేరస్థుడుగా నిరూపించబడటం చరిత్ర గతికి ఒక తార్కాణం. బ్రిటిష్‌ పాలకులు ఆయనకు దేశ బహిష్కరణ శిక్ష విధించి రంగూన్‌ పంపారు. ఆ విధంగా 1862వ సంవత్సరంతో అక్కడే ఢిల్లీ సార్వభౌమత్వపు ఆఖరి వెలుగు కొడిగట్టిపోయింది.
బ్రిటిష్‌వారి కాలంలో కోటను ప్రధానంగా సైనిక శిబిరంగానే ఉపయోగించారు. స్వాతంత్య్రానంతరం కూడా 2003 వరకు కోటలో ప్రధాన భాగం భారత సైన్యం అధీనంలోనే వుంది. ఐరాస సాంస్కృతిక విభాగమైన యునెస్కో 2007లో ఎర్రకోటను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.


మువ్వన్నెల రెపరెపలు
 
మనదేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు చిహ్నమైన మువ్వన్నెల జండా గురించి చెప్పుకోవాలంటే... త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య. మన తెలుగువాడే. ఆయన సృజించిన జాతీయ పతాకంలో మూడు రంగులుంటాయి. కాషాయం, ఆకుపచ్చ, తెలుపు. ఈ మువ్వన్నెలు కేవలం మూడు రంగుల కలయికే కాదు. ఇది మన సంస్కృతి, ఐక్యత, సంప్రదాయాల కలయిక. జాతీయ జండా సైజు 3:2 వుండాలి. పై భాగంలో కాషాయం, కింది భాగంలో హరిత వర్ణం, మధ్యలో శ్వేత వర్ణం వుండాలి. మధ్య భాగంలో నీలి రంగులో అశోక చక్రం వుంటుంది. ఇందులో 24 గీతలుంటాయి. ప్రారంభంలో జాతీయ పతాకాన్ని గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం వంటి ప్రత్యేకమైన దినాల్లో మాత్రమే ఆవిష్కరించేవారు. తర్వాత అన్ని రోజుల్లోను మువ్వన్నెల పతాకాన్ని ఎగరేయవచ్చని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం, సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. గణతంత్ర దిన్సోతవం నాడు దేశ రాష్ట్రపతి సైనిక దళాల వందనం స్వీకరిస్తారు.
1948 ఆగస్టు 15వ తేదీన మొదటిసారిగా నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దేశ రాజధాని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచే స్వాతంత్య్రదినోత్సవం నాడు ఎర్రకోటపై జాతీయజండాను ఆవిష్కరించే సంప్రదాయం ప్రారంభమైంది. అలాగే దేశాధ్యక్షుని ముందర మన దేశ సైనిక ప్రతిభాపాటవాల ప్రదర్శన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఏటా ఒక దేశాధినేత ముఖ్య అతిథిగా పాల్గొంటారు.


పతాక నియమాలివే!

అయితే మువ్వన్నెల పతాకాన్ని అగౌరవపరచకుండా కొన్ని నియమనిబంధనలు పెట్టింది మన ప్రభుత్వం. వాటి ప్రకారం చిరిగిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకూడదు. జండాను తిరగవేసి ఎగరేయకూడదు. కార్లమీద పరవకూడదు. వ్యక్తిగత వస్త్రాలపై త్రివర్ణ పతాకాన్ని ముద్రించకూడదు. దిళ్లు, చేతి రుమాళ్లు, నేప్కిన్ల మీద మువ్వన్నెల జండాను కుట్టకూడదు. జండాపై ఎటువంటి అక్షరాలను రాయకూడదు. కేంద్రం అనుమతి లేకుండా వాహనాలపై ఎగరేయకూడదు. రైళ్లు, వాహనాల ముందు, వెనక తగిలించకూడదు. మూడు రంగుల బట్ట ముక్కలను కలిపి ఒక పతాకంలాగా చేయకూడదు. పతాకాన్ని నేల మీదగానీ, నీటిలోగానీ పడనివ్వకూడదు. ప్రభుత్వ, సైనిక అంత్యక్రియల సందర్భంలో మినహా మరెక్కడా ఉపయోగించకూడదు. కాళ్లతో తొక్కడం, తగలబెట్టడం కూడా చేయకూడదు. ఒకవేళ పతాకం పాడైపోతే దాన్ని సగౌరవంగా గంగాజలంలో వదిలేయడంగానీ, మట్టిలో పూడ్చిపెట్టడంకానీ చేయాలి.
పతాకావిష్కరణ ఎలా? ఎక్కడీ
మువ్వన్నెల జెండా ఎగరేసిన చోట దానికి ప్రత్యేక గౌరవ స్థానం కల్పించాలి. ప్రభుత్వ భవనాలపై ఎగరేసినప్పుడు సెలవు దినాలతో సంబంధం లేకుండా అన్ని రోజుల్లోను పతాకం రెపరెపలాడుతూనే వుండాలి. ఇందుకు సూర్యోదయ - సూర్యాస్తమయాలు, వాతావరణాలతో కూడా సంబంధం వుండదు. దేశాధినేతలు కాలం చేసినప్పుడు వారి గౌరవార్ధం జాతీయ పతాకాన్ని కొంతసేపు కిందికి దించుతారు. పతాకాన్ని ఎగరవేసేప్పుడుగానీ, దించేప్పుడుగానీ ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి. అలాగే పెరేడ్‌లో జాతీయ పతాకం వున్న వాహనం వస్తున్నప్పుడు కూడా గౌరవార్థం లేచి నిలబడాలి. హైకోర్టులు, సెక్రటేరియట్‌ కమిషనర్‌ కార్యాలయం, కలెక్టరేట్లు, జైళ్లు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు. అదేవిధంగా అంతర్జాతీయ సరిహద్దులు, కస్టమ్‌ పోస్టులు, చెక్‌ పోస్టులు, ఔట్‌ పోస్టులు, ఇతర ప్రత్యేక స్థలాల్లో కూడా జాతీయ పతాకాన్ని ఎగరేయవచ్చు. ఇవికాక విమానాశ్రయాలు, సరిహద్దు పహారా, అంతర్జాతీయ జలాల సమీపంలో వున్న లైట్‌ హౌస్‌లు దగ్గర కూడా ఎగరేయవచ్చు. దేశాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గవర్నర్లు, లెఫ్టెనెంట్‌ గవర్నర్ల అధికార నివాసాల్లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించవచ్చు. అదేవిధంగా దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఏదైనా సంస్థను సందర్శించినప్పుడు వారి గౌరవార్థం పతాకావిష్కరణ చేయవచ్చు. విదేశీ దేశాధినేతలు, యువరాజులు, రాజులు, ప్రధానమంత్రులు భారత దేశాన్ని సందర్శించినప్పుడు మన జాతీయ పతాకంతోపాటుగా సదరు ప్రముఖుల జాతీయ పతాకాన్ని కూడా ఆవిష్కరించవచ్చు. భారత దేశాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గవర్నర్లు, లెఫ్టనెంట్‌ గవర్నర్లు, ప్రధానమంత్రులు, క్యాబినెట్‌ మంత్రులు, స్పీకర్‌, భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మరికొందరు ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహనాలపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకునే అవకాశం వుంది. మన దేశ ప్రధాని, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఏదైనా ప్రత్యేక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్‌ బోగీలో జాతీయ పతాకాన్ని వుంచవచ్చు. ఈ పతాకం రైల్వే ప్లాట్‌ఫారమ్‌కు అభిముఖంగా వుండాలి.
ఒకరోజు దేశభక్తులు!
స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న కాలంలో జాతీయ జెండా ఎగరేయడం పెద్ద ధిక్కార చర్య. పోలీసుల కళ్లు గప్పి దేశ భక్తులు ఎలాగో పైకి ఎక్కేసి తూటాలు ఒళ్లు చీరేస్తున్నా జండా ఎగరేస్తుండేవారు. ప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ గర్వాల్‌లో ఆ విధంగా జెండా ఎగరేసిన ఘటన చాలా ఉత్తేజకరమైంది. ప్రీతిలతా వడేదార్‌ కూడా అలా ఎగరేస్తూనే పోలీసుల కాల్పులకు గురైంది. ఝండా వూంఛే రహా హమారా అన్నది ఒక పెద్ద నినాదం.
దేశ స్వాతంత్య్రం తర్వాత మాత్రం క్రమేణా జెండా పండుగ తీరు తెన్నులు మారిపోయాయి. ప్రజల దైనందిన జీవిత సమస్యలు పెరుగుతున్న కొద్ది ప్రభుత్వాలు అసంతృప్తి మూటగట్టుకున్న కొద్ది స్వాతంత్య్ర దినోత్సవం మొక్కుబడిగా మారిపోతున్నది. ఆ పోరాట కాలం నాటి త్యాగాలు ఆశయాలకు తిలోదకాలిచ్చిన పాలక వర్గ నేతలు ప్రజలలో నిరుత్సాహం నింపడంతో దేశ భక్తి సంప్రదాయాలకు కూడా ముప్పు ఏర్పడింది. ఇప్పుడు ఆగష్టు 15 అనేది అధికార లాంఛనాలకు రాజకీయ పటాటోపానికి ఆలవాలమై సజీవ చైతన్యం సన్నగిల్లింది.

ఆగష్టు 15 సందడి ప్రధానంగా పిల్లలదే. ఆ రోజు స్కూళ్లలో జెండా ఎగరేయడం, ఉపన్యాసాలు అలా వుంచితే ఆటలు పాటల పోటీలు వంటివి జరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యం మిఠాయిలు కనీసం చాక్లెట్లు పంచి పెడతారు.అసంఖ్యాకమైన పేద, మధ్య తరగతి పిల్లలకు ఇది కూడా అపురూపమే గనక 'జెండా పండుగ' అని మురిసిపోతుంటారు. చిన్న చిన్న జెండాలు కూడా చేతపట్టుకుని లేదా బాడ్జీలు పెట్టుకుని గొప్పగా భావించుకుంటారు.
ఇక నాయక గణాల విషయానికొస్తే జెండా ఎగరేయడం వారికి హోదాకు సంబంధించిన విషయం. కలెక్టర్లు పోలీసుల అధికారులతో పాటు మంత్రులు తము చూస్తున్న జిల్లాల్లో జెండా ఎగరేస్తారు. ప్రజా ప్రతినిధులు కూడా వారి ఉత్సాహాన్ని బట్టి జెండా వందనం ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ అధికార తతంగాలను పక్కనబెడితే ఆర్భాటాలకు హంగు దర్పాలకు ఆ సందర్బాన్ని వాడుకోవడం కద్దు. కారులు బారులు తీరించి వీలైనన్ని చోట్ల జండాలు ఎగరేస్తే తమ పట్టు చాటుకోవచ్చన్న ధోరణి చాలా పట్టణాలలో ఛోటా మోటా నాయకులకు పెరిగింది. పార్టీల వారిగా కూడా తాత్కాలిక దిమ్మలు ఏర్పాటు చేసి- అంటే డ్రమ్ములో ఇసుక పోసి మధ్యలో జెండా పాతి సాయంత్రం వరకూ సంరంభం చేస్తారు.ఈ ఒకరోజు దేశభక్తి ముగిశాక మరురోజు షరా మామూలే!
పాడవోయి భారతీయుడా!
పదిమందికి సంబంధించిన ఏ ఉత్సవమైనా పాటలు లేకపోతే అసంపూర్ణమే. స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా అనేక దేశభక్తి గీతాలు మార్మోగుతాయి. అన్నిట్లోకి ఎక్కువగా వినిపించేది పాడవోయి భారతీయుడా! అన్న శ్రీశ్రీ పాట. 'వెలుగు నీడలు' చిత్రంలోని ఈ పాట అర్థవంతంగానూ సమస్యల ప్రస్తావనతోనూ ఇప్పటికి నిత్యనూతనంగా విరాజిల్లుతున్నది. ఏ వీధిలో చూసినా ఆ పాటతోనే మొదలవుతుంది. మన సినిమాల్లో దేశభక్తి గీతాలు ఒకప్పుడు ఎక్కువగా వుండేవి. ఏదో ఒక వీలు చూసుకుని అలాంటి పాట జొప్పించేసేవారు. అంతర్నాటకాల రూపంలోనూ దేశభక్తి ప్రబోధం, గాంధీ నెహ్రూలను చూపించడం జరగుతుండేది. భారత మాతకు జేజేలు, మన జన్మభూమి బంగారు భూమి లాంటి పాటలు కూడా వినిపిస్తాయి. సినిమా పాటలను అటుంచితే దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన 'జయజయజయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి' అన్న పాట కూడా జాతీయ గీతంలాగే ప్రసిద్ధమైంది. నాడు తిలక్‌ మహాశయుని నోట మార్మోగిన నినాదంతో 'స్వాతంత్రమే నా జన్మహక్కని చాటండి' వంటి పాటలు కూడా ఆ రోజున వినిపిస్తాయి. ఘంటసాల గానం చేసిన పద్యాలు 'అమ్మా సరోజినీ దేవి' వంటివి కూడా వేస్తుంటారు. ఇటీవలి కాలంలోనైతే వందేమాతరం గీతం రహ్మాన్‌ కట్టిన రాగంలో మార్మోగుతుంటుంది. 'పుణ్యభూమి నా దేశం నమోనమామి' మరీ తప్పనిసరి. భారతీయుడు చిత్రంలోనూ జండా ఎగరేసే సన్నివేశంతో పాటు స్వాతంత్ర దిన సంబరాలను చిత్రించే పాట కూడా వీటిలో ఒకటిగా వినిపిస్తుంది. ఎన్‌డిఎ హయాంలో కార్గిల్‌ తరహా దేశభక్తి దశలోనూ 'ఖడ్గం, జై' వంటి చిత్రాల్లో మరో తరహా దేశభక్తిని గుప్పించే పాటలుంటాయి. అన్నిటినీ మించి 'అల్లూరి సీతారామరాజు' పాటలు, 'భలేతాత మన బాపూజీ' వంటి పాటలు కూడా ఆ రోజున వింటాము. రేడియోలోనూ టీవీల్లోనూ తెల్లవారక ముందునుంచి చెవుల తుప్పు వదిలిపోయేలా ఇలాంటి పాటలే దంచి కొట్టడం అనివార్యం. చంద్రునికో నూలుపోగులా దేశానికి ఆగష్టు 15న అందించే నివాళి ఇది.


*********Article From Prajasakti Written By K.Sahil  www.prajasakti.com





Thursday, August 11, 2011

మండుతున్న బ్రిటన్‌

ఇటీవల లండన్‌లో పోలీసులు మార్క్‌ డగ్గన్‌ అనే 29 సంవత్సరాల ఆఫ్రో కరీబియన్‌ యువకుడ్ని కాల్చి చంపటంతో ప్రారంభమైన అల్లర్లు మూడు రోజుల్లో బ్రిటన్‌ అంతటికీ విస్తరించాయి. లండన్‌లో ప్రారంభమైన నిరసన దావానలంలా ఆ దేశంలోని ఇతర నగరాలకు పాకింది. మంగళవారంనాడు బర్మింగ్‌హాం, లివర్‌పూల్‌, బ్రిస్టల్‌, నాటింగ్‌హామ్‌, మాంచెస్టర్‌ తదితర నగరాల్లో నిరసనలు దొమ్మీలు, లూటీల రూపం తీసుకున్నాయి. ఒక్క లండన్‌ నగరంలోనే మంగళవారం నాడు 16 వేల మంది పోలీసులను దించారు. సోమవారం విధుల్లో ఉన్న వారి సంఖ్యకు ఇది దాదాపు మూడు రెట్లు. దేశవ్యాప్తంగా పన్నెండు వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు.వందలాది కేసులు నమోదు చేస్తున్నారు. మార్క్‌ డగ్గన్‌ను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన పోలీసులు అతడే తమపై కాల్పులు జరిపాడని బుకాయించడంతో దక్షిణ లండన్‌లో కొద్దిమంది యువతీ యువకులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసన ప్రారంభించారు. ఆ చిన్న నిరసనను సైతం పోలీసులు సహించకుండా తీవ్ర నిర్బంధం ప్రయోగించారు. ఇది ప్రజాగ్రహానికి కారణమై నిరసనలు పెల్లుబికాయి. క్రమంగా అల్లర్లు, ఘర్షణలు స్థాయికి చేరాయి. కొన్నిచోట్ల లూటీలు సైతం సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో, నిరసనల్లో యువతే అధికంగా ఉన్నారు. వారిలో శ్వేతజాతీయులు గణనీయంగా ఉన్నారని పోలీసులు సైతం చెబుతున్నారు. అంటే వీటిని జాత్యహంకారానికి సంబంధించిన అల్లర్లుగా చెప్పడం ముమ్మాటికీ తప్పు. కానీ కార్పొరేట్‌ మీడియా రోజురోజుకూ ఆ నిరసనోద్యమాన్ని జాత్యహంకార అల్లర్లు, లూటీలుగా ప్రచారం చేస్తోంది. మంగళవారం నాడు బర్మింగ్‌హాంలో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. షహజాద్‌, హారీహుస్సేన్‌ సోదరులు తన మిత్రుడైన ముసావెర్‌ ఆలీతో కలిసి తమ నివాస ప్రాంతంలో ఉండగా ఒక శ్వేతజాతీయుడు కారును వేగంగా నడుపుతూ వారిని ఢకొీట్టడంతో ముగ్గురూ మరణించారు. వారు రోడ్డుకు అడ్డంగా గానీ, మార్గ నిరోధకంగా గానీ లేనే లేరని పోలీసు అధికారులు కూడా నిర్ధారించారు. ఆ శ్వేతజాతీయుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు కానీ అరెస్టు చేయలేదు. మీడియా చేసిన దుష్ప్రచారంతో కూడా కొంతమంది ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతుండవచ్చు.

           ప్రతిష్టాత్మకమైన లండన్‌ ఒలింపిక్స్‌ 2012 ద్వితీయార్థంలో జరగనున్నాయి. ఒక్క ఏడాది ముందు ఇంత విస్తృత స్థాయిలో ఘర్షణలు సాగడం తీవ్రమైన విషయం. బ్రిటన్‌ ప్రతిష్టకు ఇది దెబ్బే! ప్రస్తుతం బర్మింగ్‌హాంలో భారత్‌, ఇంగ్లండ్‌ టీమ్‌ల మధ్య క్రికెట్‌ టెస్ట్‌ జరుగుతోంది. ఘర్షణలతో ఆట ఆగలేదు. అయితే ఇలాంటి అల్లర్లే భారత్‌లో జరిగి ఉంటే ఇంగ్లండ్‌ టీమ్‌ మూటాముల్లె సర్దుకొని పోయేవారన్న భారతీయ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ మాట అక్షర సత్యం. 2008లో ముంబయి దాడులు జరిగిన సందర్భంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌ చర్యనుబట్టే గవాస్కర్‌ అలా వ్యాఖ్యానించి ఉండవచ్చు. ఇప్పుడు బ్రిటన్‌లో మన క్రీడాకారులు నిబ్బరంగా ఉండడం మంచి విషయం. ఈ నిరసనల సెగకు ఇటలీలో సెలవులు 'అనుభవిస్తున్న' బ్రిటన్‌ దేశాధ్యక్షుడు డేవిడ్‌ కామెరాన్‌ పర్యటనను కుదించుకొని వెనక్కి వెళ్లారు. ప్రస్తుతం వేసవి సెలవులయినప్పటికీ పరిస్థితిని చర్చించడానికి అత్యవసరంగా పార్లమెంట్‌ సమావేశాన్ని గురువారం జరపనున్నారు. పెట్టుబడిదారీ దేశాలన్నింటా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల కారణంగా ప్రజా సంక్షేమం నానాటికీ అడుగంటుతోంది. అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ఆదర్శ ప్రాయమైనదిగా చెప్పబడే బ్రిటన్‌ వైద్య రంగంలో సైతం సంక్షేమానికి కోతపెట్టడానికి టోరీ ప్రభుత్వం సిద్ధపడింది. ఇతర రంగాల్లోనూ సంక్షేమ వ్యయాన్ని కత్తిరిస్తున్నారు. 2015 నాటికి ప్రభుత్వ వ్యయంలో 8 వేల కోట్ల పౌండ్లు (ఆరు లక్షల కోట్ల రూపాయలు) కోత విధించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే కత్తిరింపులు మొదలయ్యాయి. మార్క్‌ డగ్గన్‌ను కాల్చి చంపిన దక్షిణ లండన్‌లోని టోటెన్‌హాం ప్రాంతంలో యువజన సర్వీసులకిచ్చే బడ్జెట్‌లో 75 శాతం కోతపెట్టారు. ఆ ప్రాంతంలో నిరుద్యోగిత 20 శాతం నమోదయ్యింది. సంక్షేమ బడ్జెట్‌ కోత పడడంతో యువతీ యువకుల్లో అసంతృప్తి విపరీతంగా పెరిగింది. బ్రిటన్‌ ప్రజల్లో ముఖ్యంగా యువతలో అసంతృప్తి జ్వాలలు రగలడానికి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అసంతృప్తులను, అసమ్మతులను అణిచివేసేందుకు ఉపయోగించే పోలీసుల్లోనూ అసంతృప్తి చోటు చేసుకుంటోంది. పొదుపు చర్యల్లో భాగంగా టోరీ ప్రభుత్వం రానున్న నాలుగు సంవత్సరాల్లో 34 వేల పోలీసు ఉద్యోగుల పోస్టులను రద్దుచేయ నిర్ణయించింది. పోలీసు బడ్జెట్‌లో 20 శాతం కోత విధించింది. మీడియాను సైతం టోరీ పాలన వదిలిపెట్టలేదు. ఆ దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థ అయిన బిబిసికి ప్రభుత్వం నుంచి ఇచ్చే కేటాయింపులకు కోతపెట్టింది. అందుకు నిరసనగా గడిచిన రెండు నెలల్లోనే బిబిసి పాత్రికేయులు రెండుసార్లు సమ్మె చేశారు. ఇలా బ్రిటన్‌లోని వివిధ వర్గాలు, తరగతులకు చెందిన ప్రజానీకం ప్రభుత్వ చర్యలతో అసంతృప్తి చెందాయి. అదే చినుచినుకు చేరి మహా ప్రవాహంలా మారిన రీతిన ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో అల్లర్లు, ఘర్షణల రూపంలో నిరసనోద్యమాలు సాగుతున్నాయి. పోలీసు బలంతోనూ, అధికార మదంతోనూ నిరసనలను టోరీ ప్రభుత్వం అణిచివేయవచ్చు. కానీ ప్రజల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా మిగిలిపోతుంది. నిరసనలకు మూల కారణమైన ఉదారవాద ఆర్థిక విధానాలను అక్కడి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. లేదా కనీసం ఆ వేగాన్ని తగ్గించాలి. అప్పుడే బ్రిటన్‌లో మంటలు చల్లారుతాయి. కాకపోతే చింకి గుడ్డకు మాసికలు వేస్తే దానిపక్కనే మరో చిరుగు పడుతుందన్న తీరున ఆ సమాజం అతలాకుతలం అవుతుందని బ్రిటన్‌ పాలకులు అలాంటి విధానాలను తలకెత్తుకొన్న దేశాల ఏలికలు గుర్తెరగాలి.

*****Article From Prajasakti Paper www.prajasakti.com

Tuesday, August 9, 2011

స్కాములోరి సామ్రాజ్యాలు




స్వాములమని ఇంకా మాట్లాడితే సాక్షాత్‌ భగవత్‌ స్వరూపులమని తమకు తామే ముద్ర వేసుకుని పూజా పీఠాలధిష్టిస్తున్నారు. సొంత సామ్రాజ్యాలు సృష్టించుకుంటున్నారు. అమాయకుల నమ్మకాలతో ఆటలాడుకుంటున్న ఇలాంటి ఆషాడభూతుల అసలుసిసలు అవతారాలు ఒక్కొక్కటే బట్టబయలవుతున్నాయి. నిత్యానందుని అత్యానంద రహస్యాలు ఆమూలాగ్రం వెల్లడై అతగాడు అత్తగారింటిని సందర్శించవలసిన గతి పట్టింది. వచ్చాక మళ్లీ భక్తాభినేత్రి రంజితతో కలసి రసవత్తర గురు పూర్ణిమ దృశ్యంలో దర్శనమివ్వడం వేరే సంగతి. అంతకు ముందే కల్కి భగవానుని కళంకిత గాధలు వెలుగు చూశాయి. అంతు తెలియని మానసిక స్థితిలో అపసవ్య అవస్థలో అమాయకులెందరో ఆ సాలెగూడులో చిక్కిన ఉదంతాలు టీవీలలో ప్రసారమయ్యాయి. వీటన్నిటినీ మించి బాబాలకు బాబాగా దేవేంద్ర వైభవంలో మునిగితేలిన పుట్టపర్తి సాయిబాబా జబ్బుపట్టి ఆస్పత్రి పాలవడం, ఆశ్రమంలోని అపార సంపదలు తరలిపోవడంపైన భక్త జనాలే గగ్గోలు పెట్టారు గాని ఏలిన వారు వేలు కదల్చలేదు. బాబా అవసానదశ నుంచి అంత్యక్రియల వరకూ కూడా ఆ విచారం కన్నా వివాదమే ప్రధానమైపోయింది. బయటివారి సంగతి అటుంచి బాబా బంధువర్గాలు కూడా గగ్గోలు పెడుతుంటే సర్కారు వారు మాత్రం ఆఖరు వరకూ మీన మేషాలు లెక్కించి అంతా అయిపోయాక రంగంలోకి దిగామనిపించారు. అక్కడ గూడుపుఠానీ జరుగుతుందని భక్తులు కూడా వాపోక తప్పలేదు. భక్తి కొద్దీ వారు ఇదంతా బాబాకు సంబంధం లేదని అనుకోవచ్చు. అంతటి వ్యక్తి ఆంతరంగికులను అమాయకంగా ఎంచుకుంటాడా అని ఆలోచించలేకపోవచ్చు. కాని అదే అసలైన ప్రశ్న. ఏతావాతా తేలేదొక్కటే! స్వీయ సామ్రాజ్యాలను తలపించే స్వామీజీల ఆశ్రమాలు అనేక రకాల అవాంఛనీయ శక్తులకు, అవినీతిపరులకు ఆశ్రయాలుగా మారుతున్నాయి. చెదురుమదురుగా గాక అన్ని చోట్లా అందరి విషయంలో ఇదే తంతు. స్వాములకూ స్కాములకూ అవినాభావ సంబంధం ఎవరూ కాదనలేని సత్యం. ఒకప్పుడు హేతువాదులు లేదా నాస్తికులు, కాదంటే కమ్యూనిస్టులు మాత్రమే చెప్పే విషయాలు ఇప్పుడు మీడియాలో రోజూ పుంఖానుపుంఖాలుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు స్వాముల స్కాముల లీలా విలాసాలు మచ్చుకు కొన్ని...
70, 80 ఏళ్ల కిందటి వరకూ ఆది శంకరాచార్యులు స్థాపించిన పీఠాల అధిపతులూ, రామకృష్ణమఠాలు నిర్వహించే స్వాములు లాంటి కొద్దిమంది ధర్మ ప్రచారకులుండేవారు. వారు కూడా దైవభక్తినీ, ధర్మాచరణను మాత్రమే బోధించేవారు. కానీ ఈనాడు అనేక పీఠాలూ మఠాలే కాదు, అనేకమంది కలియుగ దేవుళ్లు అవతారమెత్తి ధార్మిక జీవనాన్ని శాసిస్తుండడం చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. విచిత్రమేంటంటే 12,96,000 సంవత్సరాల కాలపరిమితి గల త్రేతాయుగంలో రామావతారమొక్కటే ధరించినట్లుగా పేర్కొనబడింది. పరశురాముడు కూడా శ్రీరాముడు జన్మించిన తర్వాత తన అవతార అవసరం తీరిందంటాడని రామాయణంలో చెప్పబడింది. 8,64,000 సంవత్సరాల కాల పరిమితిగల ద్వాపరయుగంలో కృష్ణావతారమొక్కటే చెప్పబడింది. కలియుగంలో కూడా ఐదు వేల సంవత్సరాలలో ఒక్క దేవుడూ అవతరించలేదు కానీ గత 150 ఏళ్లలో అనేక దేవుళ్లు జన్మించారనీ, వాళ్లు భక్తులకు మోక్షసామ్రాజ్యాన్ని కాక, భక్తుల క్షణిక బాధలూ, తాత్కాలిక సమస్యలూ తీర్చారనీ ప్రచారం జరుగుతుండడం ఈ శతాబ్ది ప్రత్యేకతగా గుర్తింపు పొందుతోంది.
కోవూరు నుంచి జెవివి వరకూ

70 లలో అబ్రహాం టి.కోవూరు అనే శ్రీలంక హేతువాద డాక్టరు సత్యసాయిబాబాను తన ముందు మహిమలు నిరూపించవలసిందిగా సవాలు చేశాడు. కాని బాబా స్పందించలేదు. ప్రభుత్వాలూ ప్రశ్నించలేదు. క్రమేణా టీవీ మీడియా వచ్చిన తర్వాత బాబా మహిమలు మానేసి దాన ధర్మాలు మొదలెట్టారు. అది కూడా ప్రజా ధనమే మరి. ఇటీవల చాలా కాలంగా జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు మహిమల బండారం బయటపెడుతున్నారు. బాబాలు, స్వాములు చేసేవన్నీ మరింత బాగా చేసి చూపిస్తూ ఇదంతా హస్త లాఘవమేనని నిరూపిస్తున్నారు. దురదృష్టం ఏమంటే వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు.
పరంపర.. తామర తంపర
వీరిలో షిర్దీసాయిబాబా వారసులుగా చెప్పుకుంటున్న పుట్టపర్తి సత్య సాయిబాబా, పెనుగొండ కాళేశ్వర్‌, కర్నూలు బాలసాయి బాబా మరియు దత్తాత్రేయుని అపరావతారంగా చెప్పబడుతున్న గణపతి సచ్చిదానంద స్వామి, విష్ణుమూర్తి పదవ అవతారంగా తనను తాను ప్రకటించుకున్న కల్కి భగవాన్‌ ఉరఫ్‌ విజయకుమార్‌, కృష్ణుని అవతారంగా చెప్పుకుంటున్న స్వామి సుందర చైతన్య, ప్రకాశం జిల్లా రామదూత స్వామి... ఇలా అనేకమంది ''భగవత్‌ అవతారమూర్తులు'' మన రాష్ట్రంలోనే అవతరించడం తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. వీరందరూ అతి సామాన్య, పేద కుటుంబాల్లో జన్మించారు. కానీ ప్రస్తుతం వేల కోట్ల రూపాయల ఆస్తులతో సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. హత్యలు, మానభంగాలు, కబ్జాలు ఇలా అనేక నేరారోపణలు వీరిమీదున్నాయి. చాలావరకు నిరూపితమయ్యాయి కూడా. కొన్ని నేరాలను తమ పరపతితో విచారణ స్థాయిలోనే తొక్కేయగలిగారు. వీరు భగవంతుని అవతారమూర్తులని పిలుద్దామా? అంటే కొన్ని దశాబ్దాల కాలంలోనే ఈ విశాల భూగ్రహంపై ఇంతమంది అవసరం ఏం వచ్చిందన్న ప్రశ్న ఉదయిస్తుంది. అదీగాక వీరందరూ జీవించి ఉన్న సమయంలోనే ధర్మ సంస్థాపన జరగకపోగా నేరాల తీవ్రత, నేరస్థుల చిట్టా రోజురోజుకీ పెరుగుతోంది. మరి వీరి అవతార ప్రయోజనమేంటి? పోనీ స్వాములు, యోగులు, సన్యాసులు అనుకుందామా అంటే డబ్బు, బంగారం, ఆస్తులున్న సన్యాసులను చూస్తేనే మహా పాపమనీ, ఆ పాపం పోగొట్టుకోడానికి కట్టుకున్న బట్టలతోనే స్నానం చేయాలనీ ''యాజ్ఞవల్క్య స్మృతి'' వంటి స్మృతులు ఘోషిస్తున్నాయి. కాబట్టి వీరు సన్యాసులూ కారు. వీరి ''లీల''లను కొన్నింటిని పరిశీలిద్దాం.


కర్నూలు బాలసాయిబాబా ఈయన మొదట్లో రికార్డింగ్‌ డ్యాన్సర్‌. బాలసాయిగా అవతారమెత్తాక ఈయన ఆస్తి వందల కోట్లలోకి చేరింది. ఈయన నడిపే స్కూళ్లలో ఉచితంగా చదువు చెప్తారని ప్రచారం. కానీ పిల్లల నుండి 40 వేల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తారు. హైదరాబాద్‌లోని భూ ఆక్రమణ కోర్టు ఇతన్ని భూ కబ్జాదారునిగా నిర్థారించింది. చెక్‌ పవర్‌ తన దగ్గరే అట్టిపెట్టుకున్న ''భగవాన్‌'' ఈయన.

 కాళేశ్వర్400 గదులతో కూడిన అన్ని వసతులూ ఉన్న బ్రహ్మాండమైన ఆశ్రమం ఈయనది. ఈ ఆశ్రమంలోని సిబ్బంది జీతాల ఖర్చే నెలకు పది లక్షల రూపాయలుంది. ఒక భక్తురాలి పట్ల అమర్యాదగా ప్రవర్తించి చెప్పుదెబ్బలు తిన్నాడు. 2005లో పెళ్లి చేసుకున్నాడు. ఆస్తుల విలువ కొన్ని కోట్ల రూపాయలు

 సుందర చైతన్యానంద స్వామి స్వగ్రామం నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం. చిన్నతనంలో కనీసం సైకిల్‌ కూడా లేని పరిస్థితి నుండి ఈనాడు అనేక ఎ.సి కార్లున్న పరిస్థితికి ఎదిగిపోయాడు. కబ్జాల్లో చెయ్యి తిరిగినవాడు. దళితుల గుడిసెలను కూడా వదిలిపెట్టని కబ్జావీరుడు. ధవళేశ్వరంలో ఆ కబ్జాను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన అఖిల పక్ష కమిటీ కార్యకర్తలను గూండాలతో కొట్టించే ప్రయత్నం చేశాడు. ఉపన్యాసాలు చేసేటప్పుడు నెమలి పింఛం పెట్టుకుని భక్తులు తనని శ్రీకృష్ణావతారుడుగా భావించాలంటాడు. భక్తులతో ఒకసారి బంగారు కిరీటం పెట్టించుకుని, బంగారు మురళిని బహుమతిగా అందుకున్నాడు. అయితే ద్వాపరయుగ కృష్ణుడికీ, సుందర చైతన్యానందుడికీ గల ప్రధానమైన తేడా ఏమిటంటే శ్రీకృష్ణుడ్ని ఎంత బంగారంతోనైనా సత్యభామ తూచలేకపోయింది. ఒకే ఒక్క తులసిదళంతో అది సాధ్యమైంది. కానీ మన అపర శ్రీకృష్ణుడు భక్తులకు ఒక్కో తులసిదళం ఇచ్చి వెయ్యి రూపాయలు వసూలు చేశాడు. ఇలా కొన్ని వేల తులసిదళాలు భక్తులకిచ్చి కొన్ని లక్షల రూపాయలు ఆర్జించాడు

 గణపతి సచ్చిదానంద ఈయన పాద దర్శనానికి వెయ్యి రూపాయలు, పాద పూజకు కనీసం 20 వేలు, గృహ ప్రవేశానికి వస్తే మినిమమ్‌ 50 వేలు, అమెరికాలోనైతే పాద పూజకు వేల డాలర్లు వసూలు చేశాడు. ఒక దశలో తన పాదుకలను పంపి ఫీజు వసూలు చేశాడు. ఈయన ప్రస్తుత ఆస్తి వెయ్యికోట్లు.



కల్కి భగవాన్‌ ఉరఫ్‌ విజయకుమార్‌ ఈయన తనను తాను విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కిగా ప్రకటించుకున్నాడు. ఈయన దర్శనానికి ఐదు వందల రూపాయలు, దీక్షకు 50 వేలు, పాదం చూస్తే వెయ్యి రూపాయలు, పాద పూజకు ఐదు వేలు, మాట్లాడేందుకు వేలకు వేలు వసూలు చేశాడు. మూలమంత్రం అంటూ ఒక మంత్రాన్ని సృష్టించి దాన్ని లాకెట్‌లో పొదిగి, ఆ లాకెట్‌ని భారతీయులకు 50 వేలు, విదేశీయులకు లక్ష రూపాయలకు అమ్మాడు. చిత్తూరు జిల్లా, వరదయ్యపాలెం మండలం, బత్తలవల్లం గ్రామంలో మూడు వందల కోట్ల రూపాయలతో గోల్డెన్‌ టెంపుల్‌ నిర్మించాడు. ప్రస్తుత ఆస్తి విలువ వేల కోట్లలో ఉంది. ఈ ఆశ్రమంలో స్వామీజీ ఇచ్చే ద్రవం తాగిన ఆశ్రమవాసులు అచేతనావస్తలో అయోమయంగా మాట్లాడుతున్న దృశ్యాలు టీవీలలో ప్రసారమై ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈయన భూములు విపరీతంగా ఆక్రమించుకోవడంతో భూ పోరాటాలు కూడా జరిగాయి.అయితే ఇప్పటికీ దీనిపై ప్రభుత్వ చర్య శూన్యం.

రామదూత స్వామి ఈయన ఆశ్రమం నెల్లూరు ప్రకాశం మధ్య ఉంది. ఈయన భూకబ్జాదారుడని స్థానిక తహసీల్దారు కలెక్టరుకు నివేదిక పంపించాడు కూడా. అయినా నాటి కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప, నాటి డిజిపి అరవిందరావు ఈయనను దర్శించి పాదాభివందనాలు, సాష్టాంగ నమస్కారాలు చేయడం ఎవరికీ అంతుచిక్కని విషయం.
సర్కార్ల సహకారం!
అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నా ఆశ్రమాల అధిపతులు శిష్య పరివారంతో సహా వైభోగంలో తులతూగడానికి ప్రభుత్వాధినేతలు పాలక వర్గ ప్రముఖుల కుమ్మక్కు ప్రధాన కారణం. చిన్నాచితకా నేరాలకే అమితమైన ప్రచారం ఇచ్చే ప్రభుత్వం, పోలీసులు ఈ బాబాలు, స్వాముల సామ్రాజ్యాల జోలికి పోరు. సాయిబాబా ఆశ్రమంలో అయిదు హత్యలు జరిగినా దానిపై అధికారిక దర్యాప్తు గాని విచారణ గాని లేకపోగా రాజ్యాధినేతగా వున్న శంకర్‌ దయాళ్‌ శర్మ అది చిన్న విషయమని తేల్చేశారు! బాబా ఆరోగ్యపరిస్థితిపై అనేక ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి తటపటాయించింది. వెళ్లిన మంత్రులు ట్రస్టు నిర్వాహకులకే వంత పాడారు తప్ప తమ వంతు బాధ్యత నిర్వహించలేదు. ఇప్పుడు అనివార్యంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నా జరగాల్సిన నష్టం జరిగే పోయింది. లోగడ నగ సన్యాసిని మంగమ్మవ్వ ఓ హత్య కేసులో జైలు పాలైంది. తమిళనాడులో ప్రేమానంద అనే స్వామి కూడా అంతే. అమెరికా వెళ్లిన స్వామి రజనీష్‌ (ఓషో) అక్కడి పోలీసుల దాడి తట్టుకోలేక ఇక్కడకు పరుగెత్తుకొచ్చాడు. నీళ్ల స్వాములు, నిమ్మకాయల స్వాములు, వుమ్మేసే స్వాములు... ఎందరెందరో జన విజ్ఞాన వేదిక ధాటికి చిత్తయిపోయారు. ఈ బడా స్వాములు అలా చిక్కకుండా తప్పించుకోవడానికి కారణం ప్రభుత్వ అండదండలే. పాలక వర్గ ప్రముఖులు పనులు జరిపించుకోవడానికి ఈ ఆశ్రమాలను ఉపయోగించుకుంటారు. అక్కడ చట్టాలు పని చేయకుండా అడ్డుకుంటారు. ఇప్పుడు దేశంలో నల్లడబ్బు గురించి ఇంత చర్చ జరుగుతున్నది గాని బాబా ఆశ్రమంలో గుట్టలు పడిన సంపద ఎవరిదనే దానిపై మాత్రం సమాచారం లేదు. దేశ విదేశీయులు ఇష్టానుసారం సంచరించే అలాంటి చోట సంఘ వ్యతిరేక శక్తులు తలదాచుకునే అవకాశాలను ఎవరూ తోసి పుచ్చలేరు. ఆధ్యాత్మికంగా ప్రతిష్టాత్మకమైన కంచి ఆశ్రమ స్వామి జయేంద్ర సరస్వతి అరెస్టు సందర్భంలో వినవచ్చిన కథనాలు కంపరం పుట్టించాయి. ఏదో కారణంతో జయలలిత ప్రభుత్వం నాడు అంత కఠినంగా వ్యవహరించింది గాని అది అరుదైన ఘటన. ఆమెకు స్వయంగా చాలా మూఢత్వం వుంది. అవినీతి వ్యవహారాలతో నిన్న గద్దె దిగిన యెడ్యూరప్ప ముందు స్వామీజీనే సందర్శించారు. నెల్లూరు జిల్లాలోని రామదూత ఆశ్రమానికి కూడా ఆయన తరచూ వస్తుంటారు. తులాభార చక్రవర్తిగా పేరొందిన మన మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కూడా బాబాలు స్వాముల చుట్టూ తిరుగుతుండే వారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, పోలీసులు, శాస్త్రజ్ఞులు ఆఖరుకు అత్యున్నత నేతలుగా వుండాల్సిన ప్రధాన మంత్రులు రాష్ట్రపతులు కూడా రాజ్యాంగ విలువలను కాలదన్ని బాబాల ముందు మోకరిల్లుతుంటే సామాన్య ప్రజలు వారి చుట్టూ చేరడంలో ఆశ్చర్యం ఏముంటుంది? ప్రజల చైతన్యాన్ని మొద్దుబార్చి పోరాటాల్లోకి రాకుండా చేసేందుకు కర్మ సిద్ధాంతం లాగే బాబాలు కూడా బాగా ఉపయోగపడతారు గనకే పాలకులు వారిని నెత్తిన పెట్టుకుంటారు. ఆపైన తమ అక్రమాలకూ ఉపయోగించుకుంటారు. ప్రశ్నించేవారిని ప్రోత్సహించకపోగా అణగదొక్కుతారు. అంతర్జాతీయ శక్తులు కూడా ఆ విషయంలో వెనకబడవు. వెరసి ఇదొక విష వలయం అంటే తప్పు కాదు.
పుట్టపర్తి సాయిబాబా తనకు తాను భగవంతునిగా ప్రకటించుకున్న ఈ బాబా చనిపోయిన తర్వాత, ఈయన నెలకొల్పిన ట్రస్టు సభ్యులు, బాబా డబ్బునుగానీ, బంగారాన్ని గానీ ముట్టుకునేవారు కాదనీ, విరాళాలన్నీ చెక్కుల రూపంలో ఉంటాయనీ, డబ్బు స్వీకరిస్తే రసీదు ఇచ్చేవారనీ ప్రకటించారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన బెడ్‌రూంలో దాదాపు క్వింటాల్‌ (వంద కేజీలు) బంగారం, కోట్ల రూపాయల నగదు కనిపించింది. ట్రస్ట్‌ సభ్యులు రసీదులు లేని, కోట్లాది రూపాయల బంగారం, నగదు అక్కడ ఎందుకు ఉందనే ప్రశ్నకు జవాబు చెప్ప లేదు. మీడియా కూడా సత్యసాయి నివాస గృహం నుండి అక్రమంగా తరలిపోతున్న ధనాన్ని ఎవరు బయటికి పంపారనే విషయం పైనే కేంద్రీకరించింది కానీ, అసలు సాయి నివాసంలో ఎందుకుందనే విషయంపై దృష్టి సారించలేదు.
అంతేకాదు, రిజర్వ్‌ బ్యాంకు సూత్రాల ప్రకారం ప్రైవేటు వ్యక్తుల వద్ద బంగారం ఎక్కడ్నుండి వచ్చిందనే వివరాలు, రసీదులు లేకుండా కిలోలు, క్వింటాళ్ల లెక్కన బంగారం ఉండకూడదు. కానీ వంద కేజీల బరువున్న సుందర చైతన్యానంద బంగారంతో తులాభారం తూగినా, పుట్టపర్తి సత్యసాయిబాబా వద్ద దాదాపు క్వింటాల్‌ బంగారం లెక్కల్లో లేనిది ఉన్నా రిజర్వ్‌ బ్యాంకు కానీ, ప్రభుత్వం కానీ ఎంక్వయిరీ చేయించిన దాఖలాలు లేవు. అంటే ఈ స్వాములూ, బాబాల ఆశ్రమాలు వారి స్వంత సామ్రాజ్యాలా? వారి నెవరూ సోదా చేయకూడదా?
ఈ భగవాన్‌లు, స్వాములలో కొందరు తమ భారీ నిల్వ ధనంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నారు. కాబట్టి వారిని గౌరవించాలనీ, కీర్తించాలనీ కొందరు అంటుంటారు. ఇదే పరిస్థితి బాబాలు మన అమాయక భక్తుల విషయంలోనూ జరుగుతోంది. కబ్జాదారులు, మోసగాళ్లు.... బాబాలు, స్వాముల అవతారాలు ఎందుకు ఎత్తుతున్నారు? అన్న ప్రశ్నకు ఒక టీవీ చానల్‌ ప్రసారంలో ఒకరు ఇచ్చిన సమాధానం మీ ముందుంచుతాను.
''ఒక కొలనులో కొన్ని చేపలుండేవి. వాటిని తినడానికి ఓ కొంగ వచ్చింది. రోజల్లా ఆ నీళ్లల్లో ప్రయత్నించినా ఒక్క చేపా దానికి దొరకలేదు. అప్పుడది సమీపంలో వున్న తన గురువుగారి దగ్గరకు వెళ్లి తనకు చేపలు దొరికే మార్గం చెప్పమని అడిగింది. ఆ గురువుగారు నీవు రేపు కాషాయ వస్త్రాలు ధరించి వెళ్లు. నీ దగ్గరకే చేపలు వస్తాయి'' అని చెప్పారు. గురువు గారు చెప్పినట్టే చేసి కొంగ కడుపు నిండా చేపలను ఆరగించిందట. ఇదీ కాషాయ వస్త్రాల రహస్యం. అందుకే నిపుణులైన మోసగాళ్లు కాషాయ వస్త్రాలు ధరించి ప్రజల ముందుకు వస్తున్నారు. అమాయకులైన ప్రజలు వారి వలలో పడి తమ సర్వస్వం సమర్పించుకుంటున్నారు.
ఈ సందర్భంలో ఒక విషయం స్పష్టం చేయాలి. కాషాయం ధరించిన వాళ్లంతా మోసకారులు కాదు. ఎవరైతే సామాన్యమైన మెజీషియన్లు చేసే మేజిక్కులను తాము కూడా చేసి అవి తమ మహిమలని ప్రకటించుకుంటారో, ఎవరైతే దర్శనానికి కూడా రేట్లు నిర్ణయిస్తారో, ఎవరైతే వందల..వేల కోట్లలో ఆస్తులు సంపాదించి సన్యాస ధర్మాన్ని అతిక్రమిస్తారో, ఎవరైతే తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తాము చనిపోయే వరకు చెక్‌ పవర్‌ కూడా వదులుకోరో వారిని మోసగాళ్లగా ప్రజలు గుర్తించాలి.
మూఢత్వమే మార్కెట్‌!
ఆధునిక యుగంలో కూడా ఎందుకీ మూఢత్వం? చదువుకున్న వారు కూడా మోసకారి స్వాముల వెంట ఎందుకు పడుతున్నారు? వంటి ప్రశ్నలు తరచూ ఎదురవుతుంటాయి. విద్యలో విజ్ఞానాన్ని రంగరించే బదులు దేనికదిగా చెబుతూ మూఢత్వాన్ని ప్రోత్సహించే విధానాలు ఇందుకు ముఖ్య కారణం. అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్‌ ప్రయోగించే ఉపగ్రహ నమూనాను దైవ దర్శనానికి తీసుకువెళ్లడం నిజానికి సైన్సుకే గాక రాజ్యాంగ లౌకిక స్వభావానికి కూడా విరుద్ధం. అయినా అవన్నీ షరా మామూలుగా జరిగిపోతున్నాయి. పాలకులకు ప్రజల మూఢత్వం కావాలి తప్ప చైతన్యం కాదు.దాన్ని పెంచేందుకే సహకరిస్తారు తప్ప తగ్గించేందుకు సిద్ధపడరు. ఇప్పుడు నడుస్తున్న ప్రపంచీకరణ వాస్తవంలో మార్కెట్‌తత్వంతో పాటు మత ఛాందసాన్ని కూడా ఎగదోస్తుంది. అంతర్జాతీయ సామ్రాజ్యవాదాన్ని గురించి తెలుసుకోకుండా స్థానికత పేరిట అంధ విశ్వాసాలలో జనం కూరుకుపోవడం వారికి చాలా అవసరం. అలాగే వారి మార్కెట్‌ సూత్రాలకు ఏదీ అతీతం కాదు గనక మూఢత్వాన్ని భక్తి విశ్వాసాలను కూడా మార్కెట్‌ సరుకుగా మార్చుకుని సొమ్ము చేసుకుంటారు. బాబాలు తమ ప్రచారం తామే చేసుకునే రోజుల నుంచి ఇప్పుడు మెగా ఈవెంట్స్‌గా జరిపే స్థితికి వచ్చారంటే అదే కారణం. ఒకప్పుడు హరేరామ హరే కృష్ణ ఉద్యమం మన దేశంలో గాక పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయిన సంగతి మర్చిపోరాదు. వినోదం పొందడానికి విలాసంగా గడపడానికి కూడా వారికి ఈ ఆశ్రమాలు ఉపయోగపడతాయి. విదేశీయులు వస్తే అది అదనపు ఆకర్షణగా భావించి మన దేశంలోని అమాయక ప్రజలు కూడా ఎగబడతారు.
చిన్న చిన్న స్వాముల నుంచి వేలకోట్ల రూపాయలార్జించిన బడాస్వాముల వరకూ, వీరికి భక్తులెందుకు ఏర్పడుతున్నారు? కొంత మందికి మానవాతీత శక్తులుంటాయనే కథలను పసితనం నుంచి అమ్మలు, బామ్మలు, పాఠ్యపుస్తకాలు నూరిపోయడమే స్వాములను మానవాతీత వ్యక్తులుగా నమ్మడానికి ప్రధాన కారణం. పాఠ్యపుస్తకాలలో శాస్త్రీయ అవగాహనను పెంచే అంశాలే వుండడం లేదు. పైగా ఉన్నత విద్యావ్యవస్థలో జ్యోతిషం, వాస్తు వంటి అశాస్త్రీయ అంశాలు కోర్సులుగా ప్రవేశ పెట్టబడ్డాయి. దానితో ప్రజలలో అశాస్త్రీయ ఆలోచనా విధానం బాగా ముదిరిపోయింది. ''ఈశాన్య మూలన బరువు వుంటే ధన నాశం'' అని ఒక వాస్తువాది అంటే నమ్మడమే గానీ ఈశాన్య మూలన వుండే కర్రకు, మన ఇంట్లో ధనాన్ని నాశనం చేసే శక్తి ఎలా వస్తుంది? అని హేతుబద్ధంగా ఆలోచించే శక్తి నశించింది. అందుకే నిన్నటి దాకా బిందెల చిల్లులకు మాట్లు వేసుకుని బతికిన వ్యక్తి నేడు నీళ్ల స్వామి అవతారమెత్తి, ప్రజల రోగాలు పోగొట్టే శక్తిగలవాడంటే నమ్మి విద్యాధికులతో సహా నీళ్ల చెంబులతో అతని ముందు క్యూ కట్టారు. నిన్న సినిమా హాళ్ల ముందు బ్లాకులో టికెట్లు అమ్మిన వ్యక్తి నేడు బాబా అవతారమెత్తి ఆశీర్వదిస్తున్నాడంటే శిరస్సు వంచారు. కాబట్టి ఈనాడు నలుగురైదుగురు బాబాలు, స్వాముల బండారం బయటపెడితే, వారి సొంత సామ్రాజ్యాల పెరుగుదల ఆగిపోతుంది. అంతే. రేపు మరో నలుగురైదుగురు స్వాములు 'అవతరిస్తారు'. ప్రజలు వారిని అనుసరిస్తారు. వీరి 'ప్రమాదం' నుంచి ప్రజలు బయటపడాలంటే విద్యార్థి దశ నుంచే పిల్లల మనస్సులలో శాస్త్రీయ అవగాహనా బీజాలు నాటాలి. ప్రకృతి సూత్రాలకతీతంగా ఎవ్వరూ ఏ పనీ చేయలేరని వివరించాలి. అశాస్త్రీయ అంశాల బోధనను నిలిపివేయాలి.
ఒక మోసకారి బాబాదో, కబ్జాస్వామిదో బండారాన్ని సైన్సు ఉద్యమకారులు బయటపెట్టినప్పుడు, ఆ ప్రయత్నం హిందూ మతం మీద దాడిగా భావించుకొని కొందరు ఆవేశపూరితులౌతున్నారు. సైన్సుఉద్యమకారులు హిందూ మతం మీదే దాడిచేస్తారనీ, ఇతర మతాలకు చెందిన మోసగాళ్ల జోలికి పోరనీ ఆరోపిస్తున్నారు. హైదరాబాదులో ఎంతోమంది ముస్లిం మతానికి చెందిన నకిలీ బాబాలు దొరికిపోయారు. సైన్సుఉద్యమకారులు బలంగా వున్న చోట ముస్లిం, క్రిస్టియన్‌ మతాలలోని మోసగాళ్ల బండారాలను కూడా బయటపెడుతున్నారు. కింది ఉదాహరణను పరిశీలించండి.
''అమెరికాలో దైవదూతగా ప్రచారం పొందిన మావియన్‌ సెలోలార్‌ బొంబాయి, మద్రాసులలో విజయవంతంగా పర్యటనలను ముగించుకొని కలకత్తాలో అడుగుపెట్టారు. ఆయన రాకకు పత్రికలలో కనీవినీ ఎరుగని ప్రచారం లభించింది. చెవుడు, మూగతనంతో బాధపడుతున్నవారిని తక్షణం నయం చేస్తాననే వాగ్దానంతో నగరంలోని పార్క్‌ సర్కస్‌ మైదానంలో ఆయన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆయన తన అసమాన వాక్చాతుర్యంతో వేలాదిమందిని ఆకట్టుకున్నారు. అయితే సైన్సుఉద్యమకారులు రంగప్రవేశం చేసి ఆయన బూటకాన్ని బట్టబయలుచేసే వరకే అదంతా సాగింది. సైన్సుఉద్యమకారులు అకస్మాత్తుగా వేదికపైకి ఎక్కి సెలోలార్‌ అప్పుడే నయం చేశానని చెబుతున్న ఒక వ్యక్తిని చుట్టుముట్టారు. తరచి తరచి ప్రశ్నించిన మీదట అతను అసలు చెవుడు లేదా మూగ కాదని తేలింది. దాంతో ఆగ్రహావేశులైన ప్రజలు సెలోలార్‌పై రాళ్లు రువ్వడంతో ఆయన వాటి నుంచి ఎలాగో తప్పించుకున్నారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించి అక్కడి నుంచి పంపివేసింది.''

(లేఖా రతనాని, కవితా షెట్టి, టి.ఎన్‌.గోప కుమార్‌, సరితా రారులు ఇండియా టుడే లో వ్రాసిన వ్యాసం నుంచి)
ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, శివసేనలు బలంగా వున్న బొంబాయిలో సెలోలార్‌ బండారం బయటపడలేదు. అసలు అక్కడ ఆ ప్రయత్నమే జరగలేదు. సైన్సుఉద్యమకారులు బలంగా వున్న కలకత్తాలో అతని బండారం బయటపెట్టబడింది. మార్క్సిస్టు ప్రభుత్వం ఆ మోసగాడిని రాష్ట్రం నుంచి బయటకు పంపేసింది. ఇదీ అసలు విషయం.
భగవత్‌ స్వరూపులను విమర్శిస్తే వారి భక్తుల మనోభావాలు గాయపడతాయని ఇటీవల కొందరు అంటున్నారు. పురాణాల ప్రకారం చూసినా భగవంతుడికేే భక్తులుంటారు. భగవత్‌ స్వరూపులను అనుసరించేవారిలో చాలా మంది అమాయకంగా మోసగాళ్లను నమ్ముతున్నారు. కాబట్టి ఆ అమాయకులను ఆత్మహత్యా సదృశ్యమైన మార్గం నుంచి తప్పించి, మోసగాళ్ల బారి నుంచి బయట పడవేయడం ప్రతి ఒక్క పౌరుని కర్తవ్యం. కాబట్టి భగవత్‌ స్వరూపుల మోసాలను, కబ్జాలను బయట పెట్టడాన్ని, వారి భక్తుల మనోభావాలను గాయపరచడం కానే కాదు. రాజ్యాంగంలో 51ఎ (హెచ్‌) అధికరణం కూడా ఆ కర్తవ్యాన్ని నిర్దేశిస్తోంది. ఇన్ని భాగోతాలు బయటపడిన తర్వాతనైనా ఈ స్వాములు, బాబాలు, భగవత్‌ స్వరూపుల మాయా సామ్రాజ్యాలను విచ్ఛిన్నం చేయడం ప్రతి ఒక్క దేశ భక్తుడి బాధ్యత. అంతకు మించి ప్రభుత్వాల బాధ్యత.


***Article From Prajasakti Daily
Written By K.L.KanthaRao  http://www.prajasakti.com/