Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"
Showing posts with label article 2011. Show all posts
Showing posts with label article 2011. Show all posts

Sunday, August 14, 2011

చరిత్ర బురుజుపై స్వతంత్ర పతాక

ఎర్రకోటను మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ పాతఢిల్లీలో యమునానది ఒడ్డున 17వ శతాబ్దంలో నిర్మించాడు. లాల్‌ ఖిల్లా అప్పట్లో చక్రవర్తి కుటుంబ నివాసంగా వుండేది. చివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ను బ్రిటిష్‌వారు దేశ బహిష్కరణ చేసేవరకు అంటే 1857 వరకు మొఘలుల రాజధాని నగరం కూడా అదే. షాజహాన్‌ 1638లో ప్రారంభించిన ఈ కోట నిర్మాణం తొమ్మిదేళ్లపాటు సాగింది. ఔరంగజేబు, ఆ తర్వాత మొఘల్‌ పాలకులు కోటకు అనేక కొత్త అందాలు అద్దారు

 ఎర్రకోట పర్షియన్‌, యూరోపియన్‌, ఇండియన్‌ కళల కలబోతగా వుంటుంది. ఖిల్లా ప్రతి అంగుళంలోనూ కళాకారుల పనితనం కనిపిస్తుంది. భారతదేశంలోని అత్యంత ప్రధానమైన నిర్మాణాల్లో ఎర్రకోట ఒకటి. భవన నిర్మాణ కౌశలానికి, శక్తికి ఈ కోట నిదర్శనం. నిర్మాణంలోని ప్రతి అంశం ఎంతో కళాత్మకంగా వుంటుంది. ఈ కోట లోపలి స్థలము 6 లక్షల చదరపు గజాలుంటుంది. గోడల యెత్తు 35 గజాలు. కోట చుట్టూ 24 గజాల వెడల్పు, 20 గజాల లోతుగల కందకం తవ్వబడింది. ఈ కోట నిర్మాణానికి అప్పుడే 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. లోపలి భవనాల నిర్మాణానికి మరో 50 లక్షల రూపాయలైంది. కట్టడాల నిర్మాణం ఎంతో అందంగా, ఉన్నతంగా వుంటుంది. విశాలమైన భవనాలు, వాటి చుట్టూ అందమైన తోటలు, స్నానాల గదులు...రాచరికానికి నిలువెత్తు నిదర్శనంగా గోచరిస్తాయి. ఇంతటి అపురూపమైన కోట కాలక్రమంలో ఎన్నో దాడులకు గురై తన సౌందర్యాన్ని చాలా వరకు కోల్పోయిందనే చెప్పాలి. మహారాజసం వుట్టిపడే ఈ కోట ఒకప్పుడు మహాకవులు, కళాకోవిదులతో కళకళలాడిపోయేది. కవితా కళాకుసుమాలు వికసించేవి. ముస్లింల ఈద్‌ సందర్భంగా, హిందువుల దీపావళి వంటి పండుగల సందర్భంగా పాదుషాలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రజల ఆనందంలో పాలుపంచుకొనేవారు

మొఘల్‌ వంశపు చివరి రాజైన బహదూర్‌ షా 1837 సెప్టెంబర్‌ 27వ తేదీన ఢిల్లీ సింహాసనం అధిష్టించాడు. అయితే అప్పటినుంచే బ్రిటిషు ప్రభుత్వం అతని పతనానికి కుట్రలు పన్నసాగింది. ఎన్నో రాజకీయ, ప్రతికూల క్లిష్ట పరిస్థితుల్లో బహదూర్‌ పట్టాభిషేకం జరిగిందనుకోవాలి. 1857లో మొదటిసారిగా మీరట్‌లో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరవేయబడింది. సైన్యంలో బెంగాల్‌ ఆర్మీ రెజిమెంట్‌కు చెందిన సైన్యాధికారి మంగల్‌పాండే ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించి గొప్ప సంక్షోభాన్ని సృష్టించాడు. బ్రిటిషు సైన్యం ఆ అధికారిని హతమార్చి తిరుగుబాటును అణచివేయాలని చూసింది. కానీ అతను చనిపోయినా అతను రగిల్చిన తిరుగుబాటు జ్వాలలు చల్లారలేదు. మరింతగా భగ్గుమన్నాయి. తిరుగుబాటు సైన్యం ఎర్రకోటలోకి ప్రవేశించి బహదూర్‌షా ఆదేశాలను పాటించడానికి సిద్ధంగా వున్నామంది. లాల్‌ ఖిల్లాలో ప్రతి కీలక ప్రాంతంలోను ఆయుధధారులైన సైనిక కేంద్రాలను సన్నద్ధం చేశారు. పోరాటం కూడా ఉధృతం చేయబడింది. బ్రిటిష్‌ సైన్యం మరింత అప్రమత్తమై అణచివేతను కఠినంగా అమలు జరిపింది. ఆ పోరాటంలో మూడు వేల మందికి పైగా దేశభక్తులను ఉరితీశారు. వేలాదిమందిని కాల్చిచంపారు. లక్షలాదిమంది సైనికుల ప్రాణాలు ఫిరంగుల ధాటికి గాలిలో కలిసిపోయాయి. ఇటువంటి అనేక పోరాటాల చరిత్ర కలిగిన ఎర్రకోటను చూడగానే దేశభక్తులైన ప్రతి భారతీయుడి హృదయం అలనాటి చారిత్రక స్మృతులతో బరువెక్కిపోతుంది. ఉద్వేగభరితమౌతుంది.

వివిధ చారిత్రిక దశల్లో స్వతంత్రంకోసం పోరాడిన ఎందరో వీరులను, ఈ కోటలోనే బంధించి ఉరితీశారు. అజాద్‌ హింద్‌ ఫౌజ్‌పైన విచారణ జరిపిందీ ఇక్కడే. ఈ ఎర్రకోటపైనే బ్రిటిష్‌ పాలకుల పతాకం అనేక సంవత్సరాలు రెపరెపలాడి, భారత ప్రజల బానిస బతుకుల్ని అవహేళన చేసింది. ఎందరో దేశ భక్తులైన ధీరహృదయులు, కవులు, కళాకారులు, ప్రభువులు, బ్రిటిషు ప్రభుత్వ దారుణ శిక్షలకు గురై అమరవీరులయ్యారు. అయితే ఎర్రకోట మహోన్నత వైభవం మహోజ్వలంగా ప్రకాశించి దశదిశలను కాంతివంతం చేసిన రోజుల గురించి కూడా మనం చరిత్రలో చూస్తాం. సుదీర్ఘ కాలం పాటు ఈ కోట నుంచి వెలువడిన ఆజ్ఞలు యావత్‌ భారత దేశాన్ని శాసించాయి. దీని వైభవ ప్రాభవాలకు తల వంచని శక్తి ఏదీ ఆనాడు దేశంలో వుండేది కాదు. అలాంటి చోటనే 27 జనవరి 1858వ సంవత్సరంలో కడపటి భారత చక్రవర్తి, సుప్రసిద్ధ దేశభక్తుడు అయిన బహదూర్‌ షా జఫర్‌ ఒక సాధారణ నేరస్థుడిగా నిర్బంధితుడై బ్రిటిషు పరిపాలకుల ఎదుట విచారణకు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ కేసు విచారణ కోట భవనాల సముదాయంలోని ఒకప్పటి ఆయన న్యాయ దర్బారు 'దర్బారె ఖాస్‌'లో జరిగింది. ఇదే ప్రదేశంలో ఒకానొక రోజుల్లో జఫర్‌ ఆజ్ఞలు నిర్విఘ్నంగా అమలయ్యేవి. అలాంటి చోటనే జఫర్‌ నేరస్థుడుగా నిరూపించబడటం చరిత్ర గతికి ఒక తార్కాణం. బ్రిటిష్‌ పాలకులు ఆయనకు దేశ బహిష్కరణ శిక్ష విధించి రంగూన్‌ పంపారు. ఆ విధంగా 1862వ సంవత్సరంతో అక్కడే ఢిల్లీ సార్వభౌమత్వపు ఆఖరి వెలుగు కొడిగట్టిపోయింది.
బ్రిటిష్‌వారి కాలంలో కోటను ప్రధానంగా సైనిక శిబిరంగానే ఉపయోగించారు. స్వాతంత్య్రానంతరం కూడా 2003 వరకు కోటలో ప్రధాన భాగం భారత సైన్యం అధీనంలోనే వుంది. ఐరాస సాంస్కృతిక విభాగమైన యునెస్కో 2007లో ఎర్రకోటను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.


మువ్వన్నెల రెపరెపలు
 
మనదేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు చిహ్నమైన మువ్వన్నెల జండా గురించి చెప్పుకోవాలంటే... త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య. మన తెలుగువాడే. ఆయన సృజించిన జాతీయ పతాకంలో మూడు రంగులుంటాయి. కాషాయం, ఆకుపచ్చ, తెలుపు. ఈ మువ్వన్నెలు కేవలం మూడు రంగుల కలయికే కాదు. ఇది మన సంస్కృతి, ఐక్యత, సంప్రదాయాల కలయిక. జాతీయ జండా సైజు 3:2 వుండాలి. పై భాగంలో కాషాయం, కింది భాగంలో హరిత వర్ణం, మధ్యలో శ్వేత వర్ణం వుండాలి. మధ్య భాగంలో నీలి రంగులో అశోక చక్రం వుంటుంది. ఇందులో 24 గీతలుంటాయి. ప్రారంభంలో జాతీయ పతాకాన్ని గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం వంటి ప్రత్యేకమైన దినాల్లో మాత్రమే ఆవిష్కరించేవారు. తర్వాత అన్ని రోజుల్లోను మువ్వన్నెల పతాకాన్ని ఎగరేయవచ్చని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం, సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. గణతంత్ర దిన్సోతవం నాడు దేశ రాష్ట్రపతి సైనిక దళాల వందనం స్వీకరిస్తారు.
1948 ఆగస్టు 15వ తేదీన మొదటిసారిగా నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దేశ రాజధాని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచే స్వాతంత్య్రదినోత్సవం నాడు ఎర్రకోటపై జాతీయజండాను ఆవిష్కరించే సంప్రదాయం ప్రారంభమైంది. అలాగే దేశాధ్యక్షుని ముందర మన దేశ సైనిక ప్రతిభాపాటవాల ప్రదర్శన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఏటా ఒక దేశాధినేత ముఖ్య అతిథిగా పాల్గొంటారు.


పతాక నియమాలివే!

అయితే మువ్వన్నెల పతాకాన్ని అగౌరవపరచకుండా కొన్ని నియమనిబంధనలు పెట్టింది మన ప్రభుత్వం. వాటి ప్రకారం చిరిగిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకూడదు. జండాను తిరగవేసి ఎగరేయకూడదు. కార్లమీద పరవకూడదు. వ్యక్తిగత వస్త్రాలపై త్రివర్ణ పతాకాన్ని ముద్రించకూడదు. దిళ్లు, చేతి రుమాళ్లు, నేప్కిన్ల మీద మువ్వన్నెల జండాను కుట్టకూడదు. జండాపై ఎటువంటి అక్షరాలను రాయకూడదు. కేంద్రం అనుమతి లేకుండా వాహనాలపై ఎగరేయకూడదు. రైళ్లు, వాహనాల ముందు, వెనక తగిలించకూడదు. మూడు రంగుల బట్ట ముక్కలను కలిపి ఒక పతాకంలాగా చేయకూడదు. పతాకాన్ని నేల మీదగానీ, నీటిలోగానీ పడనివ్వకూడదు. ప్రభుత్వ, సైనిక అంత్యక్రియల సందర్భంలో మినహా మరెక్కడా ఉపయోగించకూడదు. కాళ్లతో తొక్కడం, తగలబెట్టడం కూడా చేయకూడదు. ఒకవేళ పతాకం పాడైపోతే దాన్ని సగౌరవంగా గంగాజలంలో వదిలేయడంగానీ, మట్టిలో పూడ్చిపెట్టడంకానీ చేయాలి.
పతాకావిష్కరణ ఎలా? ఎక్కడీ
మువ్వన్నెల జెండా ఎగరేసిన చోట దానికి ప్రత్యేక గౌరవ స్థానం కల్పించాలి. ప్రభుత్వ భవనాలపై ఎగరేసినప్పుడు సెలవు దినాలతో సంబంధం లేకుండా అన్ని రోజుల్లోను పతాకం రెపరెపలాడుతూనే వుండాలి. ఇందుకు సూర్యోదయ - సూర్యాస్తమయాలు, వాతావరణాలతో కూడా సంబంధం వుండదు. దేశాధినేతలు కాలం చేసినప్పుడు వారి గౌరవార్ధం జాతీయ పతాకాన్ని కొంతసేపు కిందికి దించుతారు. పతాకాన్ని ఎగరవేసేప్పుడుగానీ, దించేప్పుడుగానీ ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి. అలాగే పెరేడ్‌లో జాతీయ పతాకం వున్న వాహనం వస్తున్నప్పుడు కూడా గౌరవార్థం లేచి నిలబడాలి. హైకోర్టులు, సెక్రటేరియట్‌ కమిషనర్‌ కార్యాలయం, కలెక్టరేట్లు, జైళ్లు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు. అదేవిధంగా అంతర్జాతీయ సరిహద్దులు, కస్టమ్‌ పోస్టులు, చెక్‌ పోస్టులు, ఔట్‌ పోస్టులు, ఇతర ప్రత్యేక స్థలాల్లో కూడా జాతీయ పతాకాన్ని ఎగరేయవచ్చు. ఇవికాక విమానాశ్రయాలు, సరిహద్దు పహారా, అంతర్జాతీయ జలాల సమీపంలో వున్న లైట్‌ హౌస్‌లు దగ్గర కూడా ఎగరేయవచ్చు. దేశాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గవర్నర్లు, లెఫ్టెనెంట్‌ గవర్నర్ల అధికార నివాసాల్లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించవచ్చు. అదేవిధంగా దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఏదైనా సంస్థను సందర్శించినప్పుడు వారి గౌరవార్థం పతాకావిష్కరణ చేయవచ్చు. విదేశీ దేశాధినేతలు, యువరాజులు, రాజులు, ప్రధానమంత్రులు భారత దేశాన్ని సందర్శించినప్పుడు మన జాతీయ పతాకంతోపాటుగా సదరు ప్రముఖుల జాతీయ పతాకాన్ని కూడా ఆవిష్కరించవచ్చు. భారత దేశాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గవర్నర్లు, లెఫ్టనెంట్‌ గవర్నర్లు, ప్రధానమంత్రులు, క్యాబినెట్‌ మంత్రులు, స్పీకర్‌, భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మరికొందరు ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహనాలపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకునే అవకాశం వుంది. మన దేశ ప్రధాని, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఏదైనా ప్రత్యేక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్‌ బోగీలో జాతీయ పతాకాన్ని వుంచవచ్చు. ఈ పతాకం రైల్వే ప్లాట్‌ఫారమ్‌కు అభిముఖంగా వుండాలి.
ఒకరోజు దేశభక్తులు!
స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న కాలంలో జాతీయ జెండా ఎగరేయడం పెద్ద ధిక్కార చర్య. పోలీసుల కళ్లు గప్పి దేశ భక్తులు ఎలాగో పైకి ఎక్కేసి తూటాలు ఒళ్లు చీరేస్తున్నా జండా ఎగరేస్తుండేవారు. ప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ గర్వాల్‌లో ఆ విధంగా జెండా ఎగరేసిన ఘటన చాలా ఉత్తేజకరమైంది. ప్రీతిలతా వడేదార్‌ కూడా అలా ఎగరేస్తూనే పోలీసుల కాల్పులకు గురైంది. ఝండా వూంఛే రహా హమారా అన్నది ఒక పెద్ద నినాదం.
దేశ స్వాతంత్య్రం తర్వాత మాత్రం క్రమేణా జెండా పండుగ తీరు తెన్నులు మారిపోయాయి. ప్రజల దైనందిన జీవిత సమస్యలు పెరుగుతున్న కొద్ది ప్రభుత్వాలు అసంతృప్తి మూటగట్టుకున్న కొద్ది స్వాతంత్య్ర దినోత్సవం మొక్కుబడిగా మారిపోతున్నది. ఆ పోరాట కాలం నాటి త్యాగాలు ఆశయాలకు తిలోదకాలిచ్చిన పాలక వర్గ నేతలు ప్రజలలో నిరుత్సాహం నింపడంతో దేశ భక్తి సంప్రదాయాలకు కూడా ముప్పు ఏర్పడింది. ఇప్పుడు ఆగష్టు 15 అనేది అధికార లాంఛనాలకు రాజకీయ పటాటోపానికి ఆలవాలమై సజీవ చైతన్యం సన్నగిల్లింది.

ఆగష్టు 15 సందడి ప్రధానంగా పిల్లలదే. ఆ రోజు స్కూళ్లలో జెండా ఎగరేయడం, ఉపన్యాసాలు అలా వుంచితే ఆటలు పాటల పోటీలు వంటివి జరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యం మిఠాయిలు కనీసం చాక్లెట్లు పంచి పెడతారు.అసంఖ్యాకమైన పేద, మధ్య తరగతి పిల్లలకు ఇది కూడా అపురూపమే గనక 'జెండా పండుగ' అని మురిసిపోతుంటారు. చిన్న చిన్న జెండాలు కూడా చేతపట్టుకుని లేదా బాడ్జీలు పెట్టుకుని గొప్పగా భావించుకుంటారు.
ఇక నాయక గణాల విషయానికొస్తే జెండా ఎగరేయడం వారికి హోదాకు సంబంధించిన విషయం. కలెక్టర్లు పోలీసుల అధికారులతో పాటు మంత్రులు తము చూస్తున్న జిల్లాల్లో జెండా ఎగరేస్తారు. ప్రజా ప్రతినిధులు కూడా వారి ఉత్సాహాన్ని బట్టి జెండా వందనం ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ అధికార తతంగాలను పక్కనబెడితే ఆర్భాటాలకు హంగు దర్పాలకు ఆ సందర్బాన్ని వాడుకోవడం కద్దు. కారులు బారులు తీరించి వీలైనన్ని చోట్ల జండాలు ఎగరేస్తే తమ పట్టు చాటుకోవచ్చన్న ధోరణి చాలా పట్టణాలలో ఛోటా మోటా నాయకులకు పెరిగింది. పార్టీల వారిగా కూడా తాత్కాలిక దిమ్మలు ఏర్పాటు చేసి- అంటే డ్రమ్ములో ఇసుక పోసి మధ్యలో జెండా పాతి సాయంత్రం వరకూ సంరంభం చేస్తారు.ఈ ఒకరోజు దేశభక్తి ముగిశాక మరురోజు షరా మామూలే!
పాడవోయి భారతీయుడా!
పదిమందికి సంబంధించిన ఏ ఉత్సవమైనా పాటలు లేకపోతే అసంపూర్ణమే. స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా అనేక దేశభక్తి గీతాలు మార్మోగుతాయి. అన్నిట్లోకి ఎక్కువగా వినిపించేది పాడవోయి భారతీయుడా! అన్న శ్రీశ్రీ పాట. 'వెలుగు నీడలు' చిత్రంలోని ఈ పాట అర్థవంతంగానూ సమస్యల ప్రస్తావనతోనూ ఇప్పటికి నిత్యనూతనంగా విరాజిల్లుతున్నది. ఏ వీధిలో చూసినా ఆ పాటతోనే మొదలవుతుంది. మన సినిమాల్లో దేశభక్తి గీతాలు ఒకప్పుడు ఎక్కువగా వుండేవి. ఏదో ఒక వీలు చూసుకుని అలాంటి పాట జొప్పించేసేవారు. అంతర్నాటకాల రూపంలోనూ దేశభక్తి ప్రబోధం, గాంధీ నెహ్రూలను చూపించడం జరగుతుండేది. భారత మాతకు జేజేలు, మన జన్మభూమి బంగారు భూమి లాంటి పాటలు కూడా వినిపిస్తాయి. సినిమా పాటలను అటుంచితే దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన 'జయజయజయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి' అన్న పాట కూడా జాతీయ గీతంలాగే ప్రసిద్ధమైంది. నాడు తిలక్‌ మహాశయుని నోట మార్మోగిన నినాదంతో 'స్వాతంత్రమే నా జన్మహక్కని చాటండి' వంటి పాటలు కూడా ఆ రోజున వినిపిస్తాయి. ఘంటసాల గానం చేసిన పద్యాలు 'అమ్మా సరోజినీ దేవి' వంటివి కూడా వేస్తుంటారు. ఇటీవలి కాలంలోనైతే వందేమాతరం గీతం రహ్మాన్‌ కట్టిన రాగంలో మార్మోగుతుంటుంది. 'పుణ్యభూమి నా దేశం నమోనమామి' మరీ తప్పనిసరి. భారతీయుడు చిత్రంలోనూ జండా ఎగరేసే సన్నివేశంతో పాటు స్వాతంత్ర దిన సంబరాలను చిత్రించే పాట కూడా వీటిలో ఒకటిగా వినిపిస్తుంది. ఎన్‌డిఎ హయాంలో కార్గిల్‌ తరహా దేశభక్తి దశలోనూ 'ఖడ్గం, జై' వంటి చిత్రాల్లో మరో తరహా దేశభక్తిని గుప్పించే పాటలుంటాయి. అన్నిటినీ మించి 'అల్లూరి సీతారామరాజు' పాటలు, 'భలేతాత మన బాపూజీ' వంటి పాటలు కూడా ఆ రోజున వింటాము. రేడియోలోనూ టీవీల్లోనూ తెల్లవారక ముందునుంచి చెవుల తుప్పు వదిలిపోయేలా ఇలాంటి పాటలే దంచి కొట్టడం అనివార్యం. చంద్రునికో నూలుపోగులా దేశానికి ఆగష్టు 15న అందించే నివాళి ఇది.


*********Article From Prajasakti Written By K.Sahil  www.prajasakti.com