Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"
Showing posts with label america iran war. Show all posts
Showing posts with label america iran war. Show all posts

Sunday, February 5, 2012

ఇరాన్‌ పై కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

 
ఇరాన్‌ తన రివల్యూషనరీ గార్డ్స్‌ను సన్నద్ధంగా ఉంచింది. వైమానిక దళాన్ని అప్రమత్తం చేసింది. గత డిసెంబర్‌ నుండి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. దాడి చేస్తే గట్టిగా బుధ్ధి చెబుతామని అమెరికా, ఇజ్రాయిల్‌ను హెచ్చరించింది.ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం తగదని చైనా, రష్యా పేర్కొన్నాయి. ఇటువంటి చర్యలు ఇరాన్‌ను తిరిగి చర్చలకు ఒప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఆటంకం కలగజేస్తాయని అవి పేర్కొన్నాయి.
ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరు కుంటున్నాయి. యుద్ధం అనివార్యం అంటూ అమెరికా, దాని ప్రధాన మిత్రపక్షమైన ఇజ్రాయిల్‌ రోజూ ఇరాన్‌ను హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇరాన్‌పై మరింత కిరాతకమైన ఆంక్షలను విధించాలని అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు ఏకపక్షంగా నిర్ణ యించాయి. ఇరాన్‌ చమురు, గ్యాస్‌ ఎగుమతులను భారీగా దెబ్బతీసే విధంగా పాశ్చాత్య దేశాల కూటమి ఆంక్షలు విధించింది. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ చమురు, గ్యాస్‌ ఎగుమతుల పైనే ప్రధానంగా ఆధారపడి ఉంది. ఐఎఇఎ తాజా నివేదిక విడుదలైన అనంతరం ఒబామా ప్రభుత్వం ఇరాన్‌పై మరింతగా ఒత్తిడి పెంచసాగింది. ఇరాన్‌ రహస్యంగా యురేనియాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని రహస్యంగా నిర్వహి స్తోందని ఎటువంటి సాక్ష్యాధారాలు సమర్పించ కుండానే ఐఎఇఎ తన నివేదికలో పేర్కొంది.. ఒక సంవత్సర కాలంలో ఇరాన్‌ చేతిలో అణ్వాయుధం ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి లియోన్‌ పనెట్టా డిసెంబర్‌ చివరి వారంలో పేర్కొన్నారు. ఇరాన్‌ ఈ రెడ్‌లైన్‌ను దాటడాన్ని ఎన్నడూ అనుమతించ బోమని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని పరిష్కరిం చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోగలమని పేర్కొన్నారు. తన అణు కార్యక్రమం శాంతియుత సైనికేతర ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించిందని ఇరాన్‌ స్పష్టంగా ప్రకటిస్తూనే ఉంది. అప్రకటిత అణ్వాయుధ దేశమైన ఇజ్రాయిల్‌ దాడి చేస్తామని ఇరాన్‌ను పదేపదే హెచ్చరిస్తోంది. అణ్వాయుధాలు గల అమెరికా నౌకలు, జలాంతర్గాములు పర్షియా గల్ఫ్‌లో సంచరిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలో కదన రంగంలో దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి. పొరుగున ఉన్న బహ్రెయిన్‌, కతార్‌లలో అమెరికా పెద్ద ఎత్తున సైనిక స్థావరాలను నిర్మించుకుంది. ఏ సమయంలోనైనా అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉంది. ఇరాన్‌పై దాడి చేసి పాము తలను తొలగించాలని అయెరికాపై సౌదీ అరేబియా రాజు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వికిలీక్స్‌ వెల్లడించింది.
అసాధారణ స్థాయికి చేరుకున్న హిస్టీరియా
ఐఎఇఎ అందించినట్లుగా చెబుతున్న సాక్ష్యాధారాలను ఇరాన్‌ ఖండిస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీల కుట్రగా అభివర్ణిం చింది. విదేశాంగ విధానంపై పత్రికలో ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇదే సమయమని మాథ్యూ కోన్రింగ్‌ పేర్కొన్నాడు. ఆ వ్యాస రచయిత అమెరికా రక్షణ మంత్రికి ఇటీవలి కాలం వరకు ప్రత్యేక సలహాదారునిగా ఉన్నాడు. అమెరికా పకడ్బందీగా దాడి చేస్తే ఇరాన్‌ అణు స్థావరాలను ధ్వంసం చేయవచ్చునని ఆయన సలహా ఇచ్చాడు. గల్ఫ్‌ ప్రాంతం మొత్తానికి ఇబ్బంది కలిగించకుండా దాడి చేయవచ్చునని సూచించాడు. ఇరాన్‌ వ్యతిరేక హిస్టీరియా ఇటీవలి మాసాల్లో అమెరికాలో అసాధారణ స్థాయికి చేరుకుంది. అమెరికాలో సౌదీ అరేబియా రాయబారిని హత్య చేసేందుకు కాంట్రాక్టును మెక్సికోకు చెందిన ఒక డ్రగ్‌ కార్టెల్‌కు ఇరాన్‌ అధికారులు ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. న్యూయార్క్‌లో జరిగిన 9/11 దాడుల వెనక ఇరాన్‌ ఉందని ఫెడరల్‌ జడ్జ్‌ రూలింగ్‌ ఇచ్చారు. ఇరాన్‌ అల్‌ ఖైదాకు ఈ డాడులను నిర్వహించేందుకు ప్రత్యక్షంగా సహాయ మందించిందని ఆయన పేర్కొన్నారు.
చమురు ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామి దేశాల్లో ఒకటైన ఇరాన్‌ తాజా పరిణామాల నేపథ్యంలో తన ఉనికికి ముప్పు రానున్నదని ఆందోళన చెందడం సహజం. కొత్త ఆంక్షలను అమలు చేస్తే హార్మజ్‌ జలసంధిని మూసివేస్తామని ఇరాన్‌ మిలిటరీ ఉన్నత శ్రేణి నాయకులు హెచ్చరించారు. పర్షియా గల్ఫ్‌ ప్రాంతంలో ఉన్న ఈ జలసంధి ద్వారా చమురు అంతర్జాతీయంగా రవాణా అవుతుంది. హార్మజ్‌ జలసంధి పొడవు 6.4 కిలోమీటర్లు. ఇరాన్‌, ఒమన్‌ మధ్య గల్ఫ్‌ ముఖ ద్వారంగా ఉంది. ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే ముడి చమురులో మూడవ వంతు ఇరుకుగా ఉండే ఈ జలసంధి ద్వారా రవాణా అవుతుంది. కతార్‌ నుండి లిక్విఫైడ్‌ గ్యాస్‌ సరఫరా హార్మజ్‌ జలసంధి ద్వారానే జరుగుతుంది.
పశ్చిమ దేశాలు క్రమంగా విస్తరించుకుంటూపోతున్న ఆంక్షల కారణంగా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే బాగా దెబ్బతింది. డిసెంబర్‌ 31న ఒబామా కొత్తగా ఆంక్షలు విధించారు. ఇరాన్‌ కేంద్ర బ్యాంక్‌తో లావాదేవీలు జరిపే కంపెనీలపై చర్య తీసుకుంటామని ఈ కొత్త శాసనం నిర్దేశించింది. భారత్‌ వంటి దేశాలు ఇరాన్‌ నుండి చమురు దిగుమతి చేసుకోకుండా చూడటం ఈ చట్టం ఉద్దేశంగా ఉంది. ఇరాన్‌ చమురులో ఎక్కువ భాగం చైనా, భారత్‌కు రవాణా అవుతుంది. ఇయు 18 శాతం మాత్రమే దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్‌ చమురు రంగంపై ఆంక్షలు విధిస్తే ఒక్క బొట్టు చమురు కూడా హార్మజ్‌ జలసంధి నుండి రవాణా కాదని ఇరాన్‌ ఉపాధ్యక్షుడు మహ్మద్‌ రేజా రహిమి హెచ్చరించారు. డిసెంబర్‌ నెల చివర్లో ఇరాన్‌ సైన్యం హార్మజ్‌ జలసంధి సమీపంలో పది రోజుల పాటు సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసాల్లో భాగంగా వైమానిక దళం జలాంతర్గాములను సముద్రంలో ముంచేసింది. నౌకలు రాకుండా ఈ జలసంధిని మూసివేయడం చాలా తేలికైన విషయమని ఇరాన్‌ నౌకాదళాల అధిపతి అడ్మిరల్‌ హబీబుల్లా సయ్యారి మీడియాకు చెప్పారు. జలమార్గాలపై ఇరాన్‌కు పూర్తి నియంత్రణ ఉందని పేర్కొన్నారు. పశ్చిమ దేశాలు ఇరాన్‌పై ఆంక్షలు విధించడానికే కృతనిశ్చయంతో ఉన్నాయని స్పష్టమవుతోంది. ఈ విషయంలో అవి వెనకడుగు వేసేందుకు సుముఖత చూపడం లేదన్నారు. తన కీలక ప్రయోజనాలు పరిరక్షించుకునేందుకు రక్షాత్మక వ్యూహాలను అనుసరించ గలదని రివల్యూషనరీ గార్డ్స్‌ డిప్యూటీ కమాండర్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ హుస్సేన్‌ సలామీ చెప్పారు. తమపై దాడి చేస్తే అమెరికాకు చెందిన 32 స్థావరాలను ధ్వంసం చేస్తామని ఇరాన్‌ ఇంతకు ముందు హెచ్చరించింది. ఇరాన్‌తో యుద్ధం వస్తే చమురు ధర ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చ రించారు. తన అణు కార్యక్రమంపై తిరిగి చర్చలు జరిపేందుకు ఇరాన్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు కొత్తగా ఆంక్షలు విధించిన తరువాత ఇరాన్‌ సైన్యం ఉపరితలం నుండి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణిని పరీక్షించింది. రాడార్లకు ఇది చిక్కదు. మొట్టమొదటి అణు ఇంధన రాడ్‌ను తమ శాస్త్రవేత్తలు నిర్మించినట్లు ఇరాన్‌ జనవరి 1న ప్రకటించింది. సహజసిద్ధమైన యురేనియం గల రాడ్స్‌ను ఇరాన్‌ కీలకమైన అణు రియాక్టర్‌లో అమర్చారు.
సైన్యం నుండి ముప్పు
హార్మజ్‌ జలసంధిని మూసివేస్తామని ఇరాన్‌ చేసిన హెచ్చరికపై అమెరికా తీవ్రంగా ప్రతిస్పందించింది. రెండు యుద్ధనౌకలను జలసంధి వైపు పంపించింది. ఈ జలసంధిలో నౌకాయానం జరిపేందుకు గల హక్కును హరించే ఎటువంటి చర్యను క్షమించబోమని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. సైనిక దళాన్ని వినియోగించే ప్రమాదంతోపాటు అమెరికా, ఇజ్రాయిల్‌ గత రెండు సంవత్సరాలుగా ఇరాన్‌ సైంటిఫిక్‌ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులపై దృష్టి సారించాయి. వారిని కిడ్నాప్‌ చేసేదుకు, హతమార్చేందుకు, ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్‌ మిలిటరీ, పౌర స్థావరాలపై ఉగ్రవాద దాడులు జరిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత రెండు సంవత్సరాల్లో ఇద్దరు అణు శాస్త్రవేత్తలను హతమార్చారు. వారు కారులో ప్రయాణిస్తుండగా వారి కారును పేల్చివేశారు. ఇరాన్‌ అణు ఇంధన సంస్థ ఛైర్మన్‌ ఫెరేదౌన్‌ అబ్బాసీ దావానీ కారుపై కూడా ఇదే విధంగా బాంబు దాడి జరిగింది. రివొల్యూషనరీ గార్డ్‌ స్థావరంలో నవంబర్‌ 12న జరిగిన పేలుడులో 17 మంది మృతి చెందారు. అందులో ఇరాన్‌ క్షిపణి కార్యక్రమ రూపకర్త జనరల్‌ హసన్‌ తెహెరాని మొఘద్దమ్‌ కూడా ఉన్నారు. ద్రోణ్‌ నుండి క్షిపణిని ప్రయోగించి ఉండవచ్చునని నిపుణులు పేర్కొన్నట్లుగా న్యూయార్క్‌టైమ్స్‌ వెల్లడించింది. గత నవంబర్‌లో సంభవించిన మరో పేలుడు కారణంగా ఇస్ఫహాన్‌ నగరానికి సమీపంలోని యురేనియం శుద్ధి చేసే కర్మాగారం దెబ్బతిందని పశ్చిమ దేశాల మీడియా వెల్లడించింది. ఇరాన్‌ మీడియాలో మాత్రం ఈ పేలుడు గురించిన సమాచారం లేదు. ఈ విధ్వంస చర్య తమ ఘనతేనని ఇజ్రాయిల్‌, అమెరికా అధికారులు పేర్కొన్నారు.యువ అణు శాస్త్రవేత్త, నటాంజ్‌ యురేనియం కేంద్రంలో ఉప అధిపతి ముస్తాఫా అహ్మది రోషన్‌ హత్య వెనుక సిఐఎ హస్తం ఉందని ఇరాన్‌ అధికారులు ఆరోపించారు. ఆయన కారు తలుపుకు అయస్కాంత బాంబును అమర్చడం ద్వారా పేల్చివేశారని పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద చర్య వెనుక సిఐఎ హస్తం ఉందని నిరూపించేందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఇరాన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ హత్యను ఖండించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి, భద్రతా మండలికి ఇరాన్‌ విజ్ఞప్తి చేసింది. 2010లో ఇరాన్‌ అణు స్థావరాలకు స్టక్‌నెట్‌ కంప్యూటర్‌ వైరస్‌ను అమెరికా, ఇజ్రాయిల్‌ ప్రయోగించాయి. పరిశ్రమల్లో ఉపయోగించే కంప్యూటర్లను కూడా ఈ వైరస్‌ దెబ్బతీసింది. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వైరస్‌ను అవి ప్రయోగించాయి. ఇరాన్‌ గగనతలంలో సాయుధ ద్రోణ్‌ విమానాల విహారానికి ఒబామా ప్రభుత్వం అనుమతించింది. అమెరికాకు చెందిన ఆర్‌కు 170 సెంటినెల్‌ స్టీల్త్‌ ద్రోణ్‌ను గత డిసెంబర్‌లో ఇరాన్‌ దింపేసిన తరువాత అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 50 వేల అడుగుల ఎత్తున ప్రయాణించగల ద్రోణ్‌ అమెరికా విమానాల్లో అత్యంత ఆధునికమైంది. ఈ విమానాన్ని ఇరాన్‌ ప్రదర్శనలో పెట్టింది. దీనిని వెనక్కు పంపాలని అమెరికా చేసిన డిమాండ్‌ను ఇరాన్‌ తోసిపుచ్చింది. ద్రోణ్‌ ఇరాన్‌ గగనతలంలో నిఘా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అవి ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాదులపై ప్రయోగించడానికి ఉద్దేశించినవి కావు. యుద్ధం ముప్పును ఇరాన్‌ కూడా తేలికగా తీసుకోవడం లేదు. తన రివల్యూషనరీ గార్డ్స్‌ను సన్నద్ధంగా ఉంచింది. వైమానిక దళాన్ని అప్రమత్తం చేసింది. గత డిసెంబర్‌ నుండి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. దాడి చేస్తే గట్టిగా బుధ్ధి చెబుతామని అది అమెరికా, ఇజ్రాయిల్‌ను హెచ్చరించింది.ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం తగదని చైనా, రష్యా పేర్కొన్నాయి. ఇటువంటి చర్యలు ఇరాన్‌ను తిరిగి చర్చలకు ఒప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఆటంకం కలగజేస్తాయని అవి పేర్కొన్నాయి.

***** Article From  PRAJASAKTI  NEWS Paper Link www.prajasakti.com written by యొహానన్‌ చామరపల్లి