Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Tuesday, January 7, 2014

 అమెరికా - అణు ఒప్పందం - క్రయోజనిక్ ఇంజన్

మనకు క్రయోజనిక్‌ పరిజ్ఞానం ఇవ్వకపోవడం వెనుకా, అణు రియాక్టర్లు ఇవ్వడం వెనుకా కూడా అమెరికా ప్రయోజనాలు దాగున్నాయిగానీ, భారత్‌ ప్రయోజనాలు లేవు. ఇద్దరికీ పరస్పర ప్రయోజనాలు అనేవి రెండు దేశాల సంబంధాల్లో లేవు. భారత్‌కు క్రయోజనిక్‌ పరిజ్ఞానం అందిస్తే పదేళ్ల ముందే ఇస్రో ఉపగ్రహ వాణిజ్య రంగంలో అమెరికా కంపెనీలతో పోటీపడేది. అంతరిక్ష పరిశోధనలోనూ, రాకెట్‌ పరిజ్ఞానంలోనూ ఇతర అగ్రరాజ్యాలకు భారత్‌ సవాలుగా మారేది. దాన్ని అడ్డుకోవడానికి అమెరికా శతవిధాలా ప్రయత్నించింది. అమెరికా సృష్టించిన అడ్డంకులను అధిగమించి ముందుకుపోయిన మన శాస్త్రవేత్తల కృషికి నేడు దేశమంతా జేజేలు పలుకుతోంది.




   ఆదివారం సాయంకాలం శ్రీహరికోట నుంచి జిఎస్‌ఎల్‌వి రాకెట్‌ జిశాట్‌ ఉపగ్రహాన్ని మోసుకుంటూ అంతరిక్షంలోకి దూసు కుపోతుంటే చూసి ఆనందిరచని భారతీయుడు ఉండడు. మన శాస్త్రవేత్తలు 20 ఏళ్లు శ్రమించి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్‌ ఇంజన్‌ ఎట్టకేలకు జయప్రదం కావడం మన అంతరిక్ష కార్యక్రమానికి పెద్ద ఊపు తెస్తుంది. దీనివల్ల శాస్త్ర-సాంకేతిక, వాణిజ్య, సైనికపరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మొదటిది, రానున్న కాలంలో మన కమ్యూనికేషన్స్‌ అవసరాలకు కావలసిన ట్రాన్స్‌పాండర్స్‌ కోసం విదేశాల మీద, ముఖ్యంగా ఇప్పటిలా ఐరోపా స్పేస్‌ ఏజెన్సీ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. రెండోది, మన అంతరిక్ష కార్యక్రమం ఇప్పటికన్నా విస్తరించాలంటే, అంటే మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలూ, స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం వంటి కార్యకాలాపాలకు వెళ్లాలంటే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పిఎస్‌ఎల్‌వి రాకెట్‌ శక్తి సరిపోదు. పిఎస్‌ఎల్‌వి ఘన, ద్రవ ఇంధన ఇంజన్లతో కూడిన రాకెట్‌. జిఎస్‌ఎల్‌వికి ఈ ఇంజన్లతోబాటు అదనంగా క్రయోజనిక్‌ ఇంజన్‌ తోడవుతుంది. క్రయెజనిక్‌ ఇంజన్‌ అత్యంత శీతల స్థితిలో ఉన్న ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ వాయువులను తగు మోతాదులో కలపడం ద్వారా అంతరిక్షంలో రాకెట్‌ను వేగంగా ముందుకు తీసుకుపోయే శక్తిని సమకూరుస్తారు. ఇది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ.
   క్రయోజనిక్‌ రాకెట్‌ పరిజ్ఞానం మనకు రాకుండా అడ్డుకున్న అమెరికాకు మన శాస్త్రవేత్తలు చెంపదెబ్బ కొట్టి మరీ ఈ ఘనకార్యం సాధించారని దాదాపు మీడియా అంతా రిపోర్టు చేసింది. నిజమే మనకు అమెరికా లేక ఇతర పశ్చిమ దేశాలు సహకరించి ఉంటే పదిహేనేళ్ల క్రితమే మనం ఈ తరహా రాకెట్లు ఉపయోగించేవాళ్లం. కానీ అమెరికా మనకీ క్రయోజనిక్‌ పరిజ్ఞానం ఇవ్వకపోగా మనకు రాకుండా అడ్డుకోడానికి అన్ని విధాలా ప్రయత్నించింది. ఏ దేశమూ మనకు క్రయోజనిక్‌ పరిజ్ఞానం ఇవ్వకపోతే 1991లో మన అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' రష్యాకు చెందిన గ్లావ్‌కాస్మోస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడు క్రయోజనిక్‌ రాకెట్లను సాంకేతిక పరిజ్ఞానంతో సహా మనకు అందజేయాలన్నది ఈ ఒప్పందం సారం. కానీ 1993 జులైలో రష్యన్‌ కంపెనీ ఒప్పందం నుంచి వైదొలగింది. కారణం అమెరికా విధించిన ఆంక్షలు. మనకు గనుక రష్యా క్రయోజనిక్‌ పరిజ్ఞానాన్ని అందజేస్తే క్షిపణి సాంకేతిక పరిజ్ఞాన నియంత్రణ ఒప్పందం (ఎంటిసిఆర్‌)ను ఉల్లంఘించినట్లవుతుందని అమెరికా గగ్గోలు పెట్టి ఆంక్షలకు దిగింది. దాంతో అప్పటికే బలహీనపడిన రష్యా భారత్‌తో ఒప్పందం నుంచి వెనక్కు తగ్గింది. దాంతో ఇస్రోకి మార్గాంతరం లేక స్వంతంగా ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవలసి వచ్చింది.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఇటీవల మనం అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పం దంతో పోల్చి పరిశీ లించాలి. అంతరిక్ష పరిశోధ నలాగే అణు పరిశోధన విష యంలో కూడా అమెరికా మనపై ఆంక్షలు పెట్టింది. వివక్షతతో కూడిన అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై భారత్‌ సంతకం చేయలేదు కాబట్టి మనకు అణు ఇంధనం, సాంకేతిక పరిజ్ఞానం రాకుండా అడ్డుకుంది. అణు ఇంధన ఎగుమతి దేశాల కూటమి ఏకమై భారత్‌కు ఎటువంటి అణు సాంకేతిక పరిజ్ఞానం రాకుండా చేశాయి. దాంతో క్రయోజనిక్‌ పరిజ్ఞానం విషయంలో మాదిరిగానే అణు సాంకేతిక పరిజ్ఞానంలో కూడా భారత శాస్త్రవేత్తలు స్వయంగా ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో భారజల అణు రియాక్టర్లు రూపొందించారు. ఫాస్ట్‌ బ్రీడర్‌ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ పరిజ్ఞానం ద్వారా అణు వ్యర్ధాలను తిరిగి ఇంధనంగా మార్చే సైకిల్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. కల్పక్కంలోని ఇందిరా గాంధీ అణు పరిశోధనా శాల దీనికి వేదిక.
   భారత దేశంలో యురేనియం నిల్వలు తక్కువ. థోరియం నుంచి అణు ఇంధనం తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకుంటే అణు ఇంధనంలో మనం అగ్రరాజ్యంగా మారతాం. దానిపై మన దేశంలోనూ, చైనాలోనూ విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. అమెరికా ఈ రంగంలో పరిశోధనలో బాగా వెనుకబడి ఉంది. కల్పక్కంలో థోరియంను అణు ఇంధనంగా ఉపయోగించేందుకు ఒక చిన్న ప్రోటోటైపు అణు రియాక్టరును కూడా నిర్మించారు. క్రయోజనిక్‌ ఇంజన్‌ మాదిరిగానే అణు ఇంధనం, అణు పరిజ్ఞానం విషయంలో కూడా భారత్‌ స్వయం సమృద్ధి సాధించగలదన్న నమ్మకం ఏర్పడింది.
   సరిగ్గా ఈ సమయంలో, అమెరికా-భారత్‌ అణు ఒప్పందం కుదిరింది. వామపక్షాలు అణు ఒప్పందానికి వ్యతిరేకంగా యుపిఎ-1 ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాయి. మన్మోహన్‌ సింగ్‌గారు ప్రభుత్వం పడిపోయినా ఫరవాలేదు అణు ఒప్పందం కుదరాల్సిందే అన్నారు. మన యువరాజు రాహుల్‌ గాంధీ పార్లమెంటులో మొట్టమొదటిసారిగా నోరు తెరుస్తూ కళావతి కథ చెప్పారు. అమెరికాతో అణు ఒప్పందం కుదరకపోతే ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న కళావతి ఇంట్లో కాంతులు ఎలా వస్తాయని ప్రశ్నించారు? మన అభివృద్ధికి అమెరికా అణు ఇంధనం, అణు రియాక్టర్లు అత్యవసరమని పాలక పక్షాలూ, కార్పొరేట్‌ మీడియా ఇల్లెక్కి ప్రచారం చేశాయి.
ఇక్కడ ఒక్క ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకోవాలి. ఇరవై ఏళ్లుగా భారత్‌కు క్రయోజనిక్‌ పరిజ్ఞానం ఇవ్వడానికి నిరాకరించిన అమెరికా అణు ఇంధనం, అణు రియాక్టర్లు ఇవ్వడానికి ఎందుకు ముందుకొచ్చింది. తిరగేసి చెప్పుకోవాలంటే అణు ఇంధన పరిజ్ఞానం ఇవ్వడానికి ఇష్టపడ్డ అమెరికా క్రయోజనిక్‌ ఇంజన్‌ను ఎందుకు ఇవ్వలేదు. సరికదా ఇతరులు ఇస్తే కూడా ఎందుకు అడ్డుకున్నది? దీనికి సమాధానం చెప్పలేనంత అమాయకత్వంలో మన పాలకులు ఉన్నారా? గత ఇరవై సంవత్సరాలుగా భారత్‌-అమెరికా సంబంధాలు ఉరకలు పరుగులతో ముందుకు సాగుతుంటే, మనకు అమెరికా నుంచి అణు సరఫరాలు, సైనిక సరఫరాలు, పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా అందుతుంటే ఈ క్రయోజనిక్‌ పరిజ్ఞానం విషయంలో అమెరికా ఎందుకు ముందుకు రాలేకపోయింది?
   మనకు క్రయోజనిక్‌ పరిజ్ఞానం ఇవ్వకపోవడం వెనుకా, అణు రియాక్టర్లు ఇవ్వడం వెనుకా కూడా అమెరికా ప్రయోజనాలు దాగున్నాయిగానీ, భారత్‌ ప్రయోజనాలు లేవు. ఇద్దరికీ పరస్పర ప్రయోజనాలు అనేవి రెండు దేశాల సంబంధాల్లో లేవు. భారత్‌కు క్రయోజనిక్‌ పరిజ్ఞానం అందిస్తే పదేళ్ల ముందే ఇస్రో ఉపగ్రహ వాణిజ్య రంగంలో అమెరికా కంపెనీలతో పోటీపడేది. అంతరిక్ష పరిశోధనలోనూ, రాకెట్‌ పరిజ్ఞానంలోనూ ఇతర అగ్రరాజ్యాలకు భారత్‌ సవాలుగా మారేది. దాన్ని అడ్డుకోవడానికి అమెరికా శతవిధాలా ప్రయత్నించింది. అమెరికా సృష్టించిన అడ్డంకులను అధిగమించి ముందుకుపోయిన మన శాస్త్రవేత్తల కృషికి నేడు దేశమంతా జేజేలు పలుకుతోంది.
కానీ అమెరికాతో అణు ఒప్పందం కుదిరిన తరువాత మన అణు పరిశోధన ఏమైంది? మన ఫాస్ట్‌బ్రీడర్‌ పరిశోధన గురించి గత ఎనిమిదేళ్లలో ఒక్క మాట కూడా పత్రికల్లో రావడం లేదెందుకు? మన పాలకులు దీని గురించి అస్సలు మాట్లాడ్డం లేదెందుకు? భారత్‌కు ఏడు లక్షల కోట్ల రూపాయల విలువైన అణు రియాక్టర్లు, ఇంధనం అమ్ముకుని లాభాలు దండుకుపోవడానికి పశ్చిమ దేశాలు ఒక దానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఒకవేళ అవి సరఫరా చేసే రియాక్టర్లలో ప్రమాదం జరిగితే దానికి తమది బాధ్యత కాదనీ, కష్టం నష్టం భారత దేశమే భరించాలనీ అవి మన చేతనే చట్టాలు చేయిస్తున్నాయి. వీటన్నిటి వెనుక అమెరికా ప్రయోజనాలున్నాయి. తన దగ్గర అణు ఇంధనం, పాతబడిన అణురియాక్టర్‌ పరిజ్ఞానం అమ్ముకోవడం అమెరికాకు అవసరం. అందుకే అది అణ్వస్త్ర నిరోధక ఒప్పందాన్ని బైపాస్‌ చేసి మనతో 123 ఒప్పందం కుదుర్చుకుంది. అనేక షరతులతో కూడిన ఒప్పందాన్ని మనపై రుద్దింది.
   అమెరికా తనకు ఏది ప్రయోజనమైతే అది చేసింది. చేస్తోంది. దానికి అమెరికా-భారత్‌ సత్సంబంధాలు అనే ముద్దుపేరు పెడుతోంది. దురదృష్టమేమంటే మన పాలకులే మనదేశానికీ, ప్రజలకూ ఏది ప్రయోజనమో అది చేయడం లేదు. విదేశీ బహుళజాతి సంస్థలు, వాటి మోచేతి నీళ్లుతాగే స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలను చూస్తోందేగానీ, మన దేశ విశాల ప్రయోజనాలను చూడ్డం లేదు. బహుళా అమెరికా వాణిజ్య ప్రయోజనాలు లేకపోయివుంటే మరికొన్నాళ్లు అణు ఆంక్షలు మనమీదుండేవి. అప్పుడు మన శాస్త్రవేత్తలు స్వంత సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసేవారు. మన్మోహన్‌ ప్రభుత్వ నిర్వాకం వల్ల మనకు నష్టదాయకమైన అణు ఒప్పందం వచ్చింది, ప్రయోజనకరమైన అణు పరిశోధనపై పాలకులు శీతకన్ను వేశారు.

Note : Article from  Prajasakti News paper 
 Wirtten By   ఎస్‌. వెంకట్రావు

Wednesday, July 3, 2013

గోదారిలో 'తేల్‌' పడింది

కొందరు ఏం మాట్లాడినా సంచలనమే, ఏమన్నా జోకే! కార్మిక నాయకుడు, మంచి మనిషి అంజయ్యగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో దినపత్రికల వాళ్లకు రోజుకో ఆహ్లాదకర విషయం అందుబాటులో ఉండేది. ఆయన ఏ మాట మాట్లాడినా అందులో ఓ తమాషాని వెదుక్కునేవారు.
ఒకసారి ఆయన 'గోదారిలో తేల్‌ పడింది' అన్నారు. కొందరికి ఏమీ అర్థం కాలేదు. గోదావరిలో తేలు పడితే ఒక ముఖ్యమంత్రి ప్రకటన చేయాలా? అనుకున్నారు. కొందరు ఆయన పెంచుకున్న తేలు పడిందేమోనని అనుకుని ఉండవచ్చు కూడా. అయినా తాను పెంచుకునే తేలును గోదావరి దాకా ఎందుకు తీసుకుపోయినట్టు?
తీరా చూస్తే గోదావరిలో చమురు పడిందని తెలిసింది. 'తేల్‌' అంటే ఉర్దూలో నూనె కదా అని తరువాత అనుకున్నారు. అంతా నవ్వుకున్నారు హాయిగా. రెండు భాషలు కలిపి మాట్లాడితే ఇదే ప్రమాదం. ఆయన ఏది చేసినా అంతే. ఇంకోసారి అమెరికా పర్యటన అనంతరం హైదరాబాదుకొచ్చి 'అమెరికా ఎంతగానో అభివృద్ధి చెందింది. అక్కడ రైతులు కూడా 'ఇంగ్లీష'్‌ మాట్లాడుతున్నారు' అని ఆయన చెప్పినట్టు రాశారు. ఏమైనా ఆ డైలాగుకు కొద్దిసేపు నవ్వుకోవచ్చు. సెల్లు ఫోనులున్న ఈ రోజుల్లో గనుక ఆయన ఉండి ఉంటే మన ఎస్సెమ్మెస్సు జోకులన్నీ ఆయన మీదే ఉండేవేమో?
తరువాత అన్న రామారావు గారు కొన్ని సంవత్సరాలు అందర్నీ అలరించారు. ఇక వారి గురించి కూడా చెప్పుకుంటూ పోతే కథానాయకి 'తేలు'కు కోపమొచ్చి మనల్ని కుట్టవచ్చు!
అందుకే తేలు విషయానికొద్దాం. తేలంటే అందరికీ భయమే. పట్టణాలు, నగరాల్లో నివసించేవారికి అవి పరిచయం లేదు కాని పల్లెల్లో అవి మామూలే. ఎర్ర తేలనీ, నల్ల తేలనీ అవి కుట్టినప్పుడు వాటి తీవ్రత అక్కడివారే చెప్పాలి. 'అసలు కొంతమంది మాట్లాడుతూ ఉంటే నాకు తేళ్లూ, జెర్రులూ వళ్లంతా పాకినట్లుంది' అనేవారూ ఉన్నారు. ఎండ్రకాయలు, రొయ్యలు ఇలా ఆ తెగకు చెందిన వాటి రూపమే అలా ఉంటుంది. వాటి కాళ్లు, కొండ్లు భయపెడతాయి. వాటి బంధువులే అయినా ఎండ్రకాయలు, రొయ్యలను మాత్రం బాగా తింటారు అది వేరే విషయం.
తేలంటే 'నిస్సిం ఎజికిల్‌' రాసిన 'తేలు కుట్టిన రాత్రి' అన్న ఆంగ్ల పద్యం గుర్తొస్తుంది. అందులో ఓ తల్లికి తేలు కుట్టడం, భూత వైద్యుడొచ్చి ఏవేవో మంత్రాలు చెప్పటం, ఇంకా ఇతర మూఢాచారాలు బాగా కనిపిస్తాయి. ఎవరో పసరు పూస్తారు. అయినా ఉపశమనము ఉండదు. ఇదంతా పూర్వ జన్మలో చేసుకున్న పాప ఫలమని ఒకరు చెబుతారు. రాత్రంతా నిద్రలేని ఆమెకు సూర్యోదయాన నొప్పి కొద్దిగా తగ్గుతుంది. ఇక గండం గడచినట్టే. ఆ తల్లి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. తనకు తగ్గినందుకు కాదు, తన పిల్లల్ని కుట్టకుండా తేలు తనని కుట్టినందుకు! పిల్లలపై తల్లి ప్రేమ అటువంటిది. స్వార్థరహితం.
ఇప్పుడో గోదావరి, కృష్ణా బేసిన్‌లో 'తేలే' కాదు, సహజ వాయువూ పడింది. మనల్ని తల్లిలా కాపాడవలసిన మన ప్రభుత్వాలు వాటిని తీసుకుపోయి బాగా చమురు దాహమున్న వ్యాపార స్తులకిస్తున్నాయి. అది ఎంత తాగినా తీరని దాహం. తాగే కొద్దీ పెరుగుతుంది. ఏమంటే రకరకాల లెక్కలు చూపిస్తున్నారు. ఇదేమని అడిగే దిక్కే లేదు. ఉన్న దిక్కు కొందరు నిలదీసినా లోపల అందరూ మిలాఖతు. కాబట్టి అక్కడ బలం చాలటం లేదు.
పెరట్లో పండిన కూరగాయలు ఉచితంగా దొరుకుతాయి కదా! మన దగ్గర దొరికితే ధర తగ్గుతుందని మనమ నుకుంటే పిచ్చోళ్లమే! అలా తగ్గదు. మీకు బొత్తిగా వ్యాపార సూత్రాలు తెలియవంటారు. జీవితంలో మీరు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా చాలా ఉందంటారు. మీరు ఎప్పుడు బాగుపడతారంటారు. ఇలా ఉంటే 'దేశమేగతి బాగు పడునోరు' అంటారు. 'అలా కావాలంటే ముందు మేము బాగు పడవలెనోరు' అని సూచన కూడా వస్తుంది.
సహజ వాయువును మింగే పెద్ద అనకొండ పడిందక్కడ. అది దాన్నంతా మింగి తిరిగి మనకే అమ్ముతుందట. అదీ సంగతి! ప్రభుత్వమే ఆ పని చేస్తే పోలా? అమ్మో అంత పెట్టుబడి కావద్దూ? ఇక్కడ పెట్టుబడి కంటే పుట్టుబడి ముఖ్యం. అందుకే వాటి జోలికి పోదు ప్రభుత్వం.
ఆ అనకొండను ఒకాయన ఆడిస్తుంటాడు. అది తల ఊపుతూ ఉంటుంది. ఇదంతా చూసే వాళ్లకు కనిపించే దృశ్యం. కానీ జరిగేది ఇంకొకటి. అనకొండ తన తలను ఊపిన విధంగానే ఈ పెద్ద మనిషి స్వరం వాయిస్తున్నట్టు నటిస్తాడు.
గోదావరిలో తేలుకిచ్చిన ఆర్భాటం ఈ అనకొండ విషయంలో కొందరివ్వటం లేదెందుకని మీకు అనుమానం రావచ్చు. తేలు చిన్నది కాబట్టి భయపడి ఉండరు. అనకొండ ఎంతో పెద్దది కదా అందుకే జంకుతున్నారు.
ఈ నవయుగ అనకొండకు నదులే కాదు, సముద్రాలు కావాలి. అప్పుడది అందులో ఉన్న చేపలు, తిమింగలాలు, సొర చేపలు ఇలా వానపాముల వరకూ అన్నింటినీ తినేస్తుంది. తినటమే కాదు దానికి జీర్ణశక్తి అధికం. అలా బలాన్నంతా విషం రూపంలో నింపుకుని ఇతర జీవాల్ని చంపేస్తుందది.
'కష్టాల్ని మనందరం పంచుకుందాం, లాభాల్ని మాత్రం మేం నంజుకుంటాం' ఇది అనకొండ సూత్రం. అది బలిసి బలిసి కాళీయునిలా తయారవుతుంది. దాన్ని మధనం చేయడానికి ఒక్క కృష్ణుడు సరిపోడు. ప్రజలందరూ రావాలి. అది మాత్రం తప్పదు. దాని పడగపై బాది విషాన్నంతా కక్కించే రోజులు ఎంతో దూరంలో లేవు. ఆ విషంలోనే దాన్ని పెంచి పోషించినవారూ కొట్టుకుపోతారు. అప్పుడు వారికి ఏ 'ఆధారమూ' ఉండదు!
అప్పుడు గోదావరిలోని 'తేల్‌' చవగ్గా దొరుకుతుంది.

Article By : జంధ్యాల రఘుబాబు from prajasakti

Thursday, April 18, 2013

శాఖాహార పులి ...


ఒకానొక అడవి. ఆవు, పులి కథలోనిదే.
ఒక పులి, అదీ ఆ కథలో ఉన్న పులి వంటిదే. ఒక ఆవు, అదీ ఆ ... పులి వేటకని బయలుదేరింది. ఒక ఆవు కనిపించింది. ఎగిరి దాన్ని తినబోయింది. ఇంతలో ఆవు తనను తినవద్దని వేడుకుంది. 'ఇంటివద్ద నా చిన్న కొడుకు పాల కోసం చూస్తుంటాడు, వాడికి పాలిచ్చి, ఓ సారి ముద్దాడి బంధువులకు అప్పగించి వస్తాను' అని వేడుకుంది.
పులి మొదట ఒప్పుకోలేదు. 'నీవు తిరిగి వస్తావని నమ్మకమేంటి. నన్ను నేనే నమ్మను, నిన్నెలా నమ్మాలి' అని అడిగింది.
'నేను అసత్యాలు చెప్పను, చెప్పిన మాట తప్పను. నన్ను నమ్ము లేదా ఇప్పుడే తినేసేరు' అంది ఆవు.
అనుమానంతోనే పులి ఒప్పుకుంది. ఆవు వెళ్లిపోయింది. గోవు రాకపోతే అదే అదనుగా తీసుకుని తనకు ఇష్టమైనన్ని ఆవుల్ని తినవచ్చని లోపల అనుకుంది. చెప్పిన మాట ప్రకారం ఆవు తిరిగి వచ్చేసింది.
పులి కళ్లలో గ్లిసరిన్‌ వేసుకున్నట్టు కన్నీళ్లు కారాయి. 'నీవు మాట ప్రకారం వచ్చావు. నా మనసు కరిగించావు. నిన్ను వదిలేస్తున్నాను. వెళ్లు, నీ కొడుకుతో హాయిగా ఉండు' అని వెనక్కు పంపింది.
కథ అక్కడితో ఆగిపోతే ఇప్పటి వరకూ చదివిన దాంట్లో కొత్తేమీ లేదు. ఆపై సాగే కథలోనే కొత్తదనం.
మరుసటి రోజు పులి అడవిలోని జంతువులన్నింటినీ సమావేశపరిచింది. క్రితం రోజు జరిగిన 'ఆవు- పులి' కథ వివరించింది.
'నిన్నటి నుంచీ నా మనసు మారిపోయింది. ఒక ఆవు నన్ను మార్చివేసింది. నాకు వైరాగ్యమొచ్చేసింది. ఇక ఆవులను గానీ, ఇతర జంతువులను గానీ చంపి తినే గుణం నాలో నశించింది. అలాగని తినకుండా బతకలేను. అందుకే నేను చనిపో వాలనుకున్నాను. ఈరోజు రాత్రి కనిపించే ఆ కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసు కుంటాను. ఎవ్వరూ నన్ను ఆపటానికి ప్రయత్నిం చవద్దు'. 'నేను చనిపోయాక నా కథ పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా పెడతారు' అని మరొక్కసారి కళ్లనిండా నీరు తెప్పించింది.
జంతువులన్నీ తమ కళ్లలో కూడా నీరు తుడుచుకున్నాయి, రాకున్నా!
ఇక తమకు ప్రాణ భయం లేదని జింకలు, ఆవులు, మేకలు, ఇతర శాఖాహార జంతువులు ఆనందపడితే, అడవిలోని జంతువులన్నీ తమకేనని నక్క, తోడేలు, హైనా లాంటి జంతువులు మహదానందపడ్డాయి.
ఇంతలో ఓ ముదుసలి భల్లూకం ముందుకొచ్చి 'ఆత్మహత్య మహా పాపం, అందుకే నీవు మాంసాహారం మానేసి దుంపలు, గడ్డి లాంటి శాఖాహారం తిని జీవితం చాలించు' అని సలహా ఇచ్చింది.
ఈ సలహా నచ్చి జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి.
పులికి మహదానందంగా ఉంది. తనకు ఇంతలా ప్రచారం వస్తుందని ఊహించనే లేదు. 'ఇదే అదనుగా రాజుగా ఉన్న సింహాన్ని తొలగించి నేను రాజునై పోవచ్చు. తరువాత మళ్లీ మాంసాహారం మొదలెట్టవచ్చు' అనుకుంది లోలోపల.
తనకు శాఖాహారం సేకరించటం తెలియదు కాబట్టి రోజూ ఏదైనా ఒక జంతువు శాఖాహారాన్ని తీసుకురావలసిందిగా జంతువుల్ని కోరింది. జంతువులు కూడా సరేనన్నాయి.
చెప్పిన మాట ప్రకారమే చేశాయి. ప్రతి దినమూ పులికి శాఖాహారాన్ని తీసుకుపోయి ఇవ్వసాగాయి. కొత్తగా శాఖాహారాన్ని తింటున్న పులి బాగా నున్నగా తయారయింది. జంతువులకు శాఖాహారాన్ని తినమని ఎప్పుడూ చెప్పే సత్యజీవి 'చూశారా మాంసాహారం మానేస్తే ఎన్ని లాభాలో' అని తన ప్రచారం ఎక్కువ చేసింది.
కొన్ని రోజులకు అడవిలోని జంతువులు తగ్గినట్టు కనిపించింది. ఎవరికి వారు తమ జాతిని లెక్కపెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి. తమాషాగా శాఖాహారం తీసుకెళ్లిన జంతువులే మాయమైనట్టు జంతువుల సర్వేలో తేలింది. చూస్తే పులి మాంసాహారిగా ఉన్నప్పుడే తమకు నష్టం తక్కువగా ఉందని తేల్చేశాయి.
తమను ఈ విధంగా మోసం చేసిన పులిని మట్టుబెట్టాలని జంతువుల సమావేశం నిర్ణయించింది. అలాగే చేశాయి కూడా ...
తమ 'ఆవు- పులి' కథను ఈ విధంగా మార్చిన పులికి పట్టిన గతిని చూసి ఆవు నవ్వుకుంది, లోలోపల ...
అధికారం కోసం పులి 'గడ్డి' కరవచ్చేమో కానీ 'ఆహారంగా' మాత్రం తినదు. మాంసమే కావాలి!

** Article by  -- జంధ్యాల రఘుబాబు
From prajasakti news paper

Thursday, March 7, 2013

అగ్నియోధునికి అశ్రుతర్పణ

వెనిజులా వేగుచుక్క, ప్రత్యామ్నాయ శక్తుల చైతన్య పతాక హ్యూగో చావేజ్‌ అస్తమయం మాటలకందని విషాదం. నాలుగోసారి దేశాధ్యక్షుడుగా అప్రతిహత విజయం సాధించిన ఆ అచంచల యోధ రెండేళ్ల కాన్సర్‌ పోరాటంలో కన్నుమూయడం నమ్మక తప్పని నిజం. ఈ విషాద వార్త దేశాల సరిహద్దులకు అతీతంగా ప్రజాస్వామ్య ప్రియులు, స్వాతంత్ర పిపాసులందరిలోనూ శోకాన్ని రగిలించింది. ఎందుకంటే చావేజ్‌ ఒకానొక చారిత్రిక దశలో దిశా నిర్దేశం చేసిన ధీరుడు, ధీశాలి. సోవియట్‌ విచ్ఛిన్నానంతరం ప్రజాచైతన్యం, ప్రతిఘటన అన్నవి మటుమాయమై పోతాయని ఆశపడిన దుష్టశక్తుల దురాశలను దునుమాడుతూ అతి బలమైన అమెరికా సామ్రాజ్యవాదాన్ని అతి దగ్గర నుంచి సవాలు చేసిన సాహస సేనాని. సమర్థ పాలకుడు.

చిల్లర వ్యాపారంలాటి రంగాల్లో ఇండియా విదేశీ పెట్టుబడులను అనుమతించడం లేదని అగ్రరాజ్యాధినేత ఒబామా పెదవి విరవడం ... ప్రధాని అసమర్థ సాధకుడని, విషాద యోగి అని అమెరికా మీడియా తీసిపారేయడం ... ప్రపంచ కార్పొరేటింగ్‌ సంస్థలు ఇండియా స్థానాన్ని దిగువకు నెట్టడం ... అన్యధా శరణం నాస్తి అన్నట్టు అమెరికా ఆదేశాలను అమలు చేసేందుకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆఘమేఘాల మీద పరుగులు పెట్టడం మొన్నటి ముచ్చటే. ఇలాటి ప్రపంచంలో ఒకడు ... మన కన్నా చాలా చిన్నదైన దేశ పాలకుడు ... అమెరికాకు అతి సమీపస్తుడు ... నిన్నమొన్నటి దాకా అంకుల్‌ శ్యాం పెరటిదొడ్డిగా వారి కీలుబొమ్మలైన సైనిక పాలకుల చేతిలో నలిగిన, మెలిగిన చరిత్రకు వారసుడు ... ఐరాస సమావేశంలో ఆ అమెరికా అధినేతనే భూతంగా వర్ణించిన ఏకైక నాయకుడు చావేజ్‌. ప్రపంచ బ్యాంకు ఆదేశాల బాటలో దివాళా ఎత్తుతున్న దేశాలకు ప్రత్యామ్నాయం చూపుతూ మరెక్కడా లేనంత వేగంగా, తీవ్రంగా ప్రజా నుకూల విధానాలు అమలు చేసిన పరిపాలకుడు చావేజ్‌. సైద్ధాంతిక పరిభాషలో కమ్యూనిస్టు కాక పోయినా కామ్రేడ్లకు ప్రపంచమంతటా కొత్త ఊపిరి పోసిన సహ చరుడు చావేజ్‌. ఒకే ఒక్కడు అనిపించుకున్న క్యూబా అధినేత ఫైడల్‌ కాస్ట్రో సరసన మరొకడుగా నిలిచే అర్హత సంపాదించుకున్న ధీమంతుడు చావేజ్‌.
ప్రపంచీకరణ యుగంలో వనరులను ప్రైవేటు పరం చేయడం రివాజుగా మారితే చావేజ్‌ అందుకు పూర్తి భిన్నమైన విధానాలు అమలు చేశాడు. చమురు సంపన్నమైన వెనిజులా బడా సంస్థల కల్పవృక్షంలా ఉండే స్థితిని చావేజ్‌ మార్చేశాడు. ఆ వనరులను పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చి ప్రజలకు అంకితం చేశాడు. విస్తృత స్థాయిలో భూ సంస్కరణలు అమలు చేసి పేదలకు భూమిని పంచాడు. ప్రతిచోటా ఉద్యోగ భద్రత పోతుంటే వెనిజులాలో పని గంటలు వారానికి 44 నుంచి 40కి తగ్గించడమే గాక ఇంకా అనేక సరికొత్త హక్కులు కల్పించాడు. 1999-2010 మధ్య వెనిజులాలో దారిద్య్రం 21 శాతం తగ్గిందని ఐక్యరాజ్యసమితి కమిషన్‌ అభినందనలు పొందాడు. నిరక్షరాస్యత నిర్మూలించి ఉచిత ఆరోగ్య వసతి కూడా కల్పించేందుకు చర్యలు మొదలెట్టాడు. తాను సైనిక నేపథ్యం నుంచి వచ్చినా, అమెరికా వత్తాసుతో నడిచే సైనిక కుట్రలకు తావులేకుండా ప్రజా స్వామ్యాన్ని విస్త రించాడు. అందుకే 1998లో మొదటి సారి ఎన్నికైన చావేజ్‌ను 2002లో కూల దోయడానికి సైన్యం ద్వారా కుట్ర జరిగితే వమ్ము చేసి దమ్ము చూపించాడు. తర్వాత దాదాపు ఏడెనిమిది సార్లు రెఫరెండంలు, రకరకాల ఎన్నికలు, రాజ్యాంగ రూపకల్పన, ఇలా ఏదో ఒక రూపంలో ప్రజల ఆమోదం పొందుతూ జైత్రయాత్ర సాగిస్తున్నాడు.
క్యూబాను దుర్మార్గ దిగ్బంధం చేయజూసే అమెరికా ఆంక్షలను తోసిపుచ్చి అగ్రజుడు కాస్ట్రోను అనుజుడుగా ఆదుకున్నాడు. భారత దేశంతో సహా అన్నిచోట్లా అభ్యుదయ శక్తులకు తోడైనాడు. సద్దాం హుస్సేన్‌ను కలుసుకుని సంఘీభావం చెప్పివచ్చాడు. చైనాతో చెలిమి చేశాడు. తనకు నచ్చని నాజర్‌, కాస్ట్రో, అరాఫత్‌, సద్దాం, వంటివారందరిపైనా దాడిచేసినట్టే చావేజ్‌పైనా అమెరికా మీడియా సహాయంతో విష ప్రచారం సాగించింది. ఈసారి ఆయన ఓడిపోవడం ఖాయమనీ, కొద్ది పాటి తేడాతో నెగ్గినా చేయగలిగింది ఉండదనీ శాసనార్థాలు పెట్టింది. ఒక్కసారిగా అమెరికా పత్రికలు, చానెళ్లు చావేజ్‌పై చేయని దుష్ప్రచారం లేదు. ఆయనను ఓడించేందుకు వెనిజులా పెట్టుబడిదారులు, చమురు మాఫియాలు, అమెరికా హంగుదారులు ప్రతీఘాత ప్రతిపక్షాలు అందరూ కలసి 30 పార్టీల కూటమిగా ఏర్పడి కాప్రిల్‌ అనే మితవాదిని నిలబెట్టి ఓడించాలని విఫలయత్నం చేశాయి. ఇన్నిటినీ తట్టుకుని అశేష జనాదరణతో అఖండ విజయం సాధించిన చావేజ్‌ ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా లేకుండా ప్రాణాంతక కాన్సర్‌తో పెనుగులాడాల్సి వచ్చింది. అందుకోసం క్యూబాలో చికిత్స, కాస్ట్రోతో సాన్నిహిత్యం ఆయనను ఆఖరి వరకూ సజీవ స్ఫూర్తిగా నిలిపాయి. అయినా చివరకు ఆ వ్యాధి ఆయన ప్రాణాలు బలిగొనకుండా వదల్లేదు.
చావేజ్‌ చారిత్రిక పాత్రకు స్పష్టమైన భూమిక ఉంది. సామ్రాజ్యవాద, నయా ఉదారవాద ఎదురు దాడికి వ్యతిరేకంగా పెల్లుబికిన ప్రజావెల్లువ ఫలితంగానే వెనిజులాతో సహా అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో ప్రజా ప్రభుత్వాలు ఆవిర్భవించాయి. దీన్నే 'పింక్‌ వెల్లువ- వామపక్షం వైపు మలుపు' అని పిలుస్తున్నారు. వీటి మనుగడ గొప్ప సానుకూల పరిణామం. ఈ పరిణామ క్రమానికి స్ఫూర్తిగా నిలిచిన హ్యూగో చావేజ్‌ కన్నుమూయడంతో ఈ క్రమాన్ని అడ్డుకోవడానికి సామ్రాజ్యవాద శక్తులు నిస్సందేహంగా కుట్రలు తీవ్రం చేస్తాయి. ఇప్పటికే ఆ కుటిల పన్నాగాలు మొదలైనట్టు కనిపిస్తుంది. ఆయనే చెప్పినట్లు విప్లవం ఏ ఒక్క వ్యక్తిపైనో ఆధారపడి ఉండదు. చావేజ్‌కు అశ్రుతర్పణ చేస్తూనే ఆయన ఆఖరి వరకూ అడ్డుకున్న ఆధిపత్య శక్తుల ఆటకట్టించడం ఇప్పుడు అవశ్య కర్తవ్యం. ఆయనకు అదే అసలైన నివాళి. 

Note : Taken From Prajasakti Editorial
visit : అగ్నియోధునికి అశ్రుతర్పణ prajasakti.com

Wednesday, April 25, 2012

నయా పోకడల మోజులో నవతరం


శాస్త్రీయ దృక్పథానికి భిన్నమైన ఆలోచనా ధోరణే అసలైన ట్రెండుగా చెలామణి అవుతున్న పరిస్థితి నేడు కనిపిస్తోంది. 'మార్కెట్‌ సంస్కృతి' తీసుకొస్తున్న నయా పోకడల మోజుతో, కెరీరిస్టు ధోరణితో యువతలో ప్రశ్నించే తత్వం, ఆత్మస్థయిర్యం, సామాజిక స్పృహ కనుమరుగవుతున్నాయి. చదువులో, మీడియాలో, ఆయా రంగాల్లో ఎక్కువగా ఫోకస్‌ అవుతున్న పెట్టుబడిదారి కట్టు కథనాల ప్రభావానికి టీనేజర్లు ఆకర్షితులవుతున్నారు. అదే అసలైన లైఫ్‌ స్టయిల్‌ అన్న భ్రమలకు లోనవుతున్నారు.
కెరీరిజం భ్రమల్లో, నయా పోకడల ఆకర్షణలో యువతలో అసలైన సామర్థ్యం కనుమరుగవుతోంది. మీడియా కూడా అతికొద్ది మందికి ఉపయోగపడే వాటినే ఎక్కువగా ఫోకస్‌ చేస్తోంది. మెజార్టీ యువతకు ఉపయోగపడే విషయాలను విస్మరిస్తోంది. 'వేణు చదువులో ధిట్ట. ఎప్పుడూ ఫస్టు క్లాసులో పాసయ్యేవాడు. కానీ డిగ్రీ దాకా చదివి ఆపేశాడు. ఫలితంగా టీచర్‌ కావాలన్న కల నెరవేరనే లేదు' ఎందుకని అడిగితే 'బి.ఇ.డి. చేసేందుకు రెండు లక్షలు కట్టలేక' అని బదులిచ్చాడు. రెండు లక్షలు పెద్ద విషయమేం కాదని కొందరు భావించొచ్చు. కానీ రెండువేలు కట్టేందుకు నానా అవస్థలు పడేవారే ఎక్కువ శాతం వున్నారు. అదే ప్రభుత్వ బి.ఇ.డి. కళాశాలల్లో ఫ్రీ అడ్మిషన్‌ వుండి వుంటే... 'వేణు మాత్రమే కాదు. అలాంటి ఇంకెందరికలో సాకారమౌతుంది. కానీ అలా చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవు. కొంతమందికి ఖరీదుతో కూడుకున్న ఉన్నతమైన చదువులు చదివేందుకూ, ఆ తర్వాత విదేశాలకు వెళ్లేందుకు కార్పొరేటు సంస్థల ద్వారానో, బ్యాంకుల ద్వారానో లోన్లో, రాయితీలో కల్పిస్తుంది. ఇక్కడ ఉన్నత వర్గాల కొమ్ము కాస్తుంది.

చదువు 'కొంటూ' ఉన్నత స్థితికి ఎదిగే పరిస్థితి పేద, మధ్య తరగతి యువతలో ఉండట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గనుక పరిశీలిస్తే కనీసం పదోతరగతి వరకు చదివేందుకే అష్టకష్టాలు పడాల్సిన దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారి శాతం ఎక్కువే. వలసెళ్లిన తమ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కాయిన్‌ బాక్సులో వేసేందుకు రెండు ఒక్కరూపాయి బిళ్లలకోసం ఇబ్బందిపడే యువతీ యువకులు ఆంధ్రప్రదేశ్‌లోని ఏ మారుమూల గిరిజన తండాకెళ్లినా, గూడేనికెళ్లినా, గ్రామాల్లోని దళిత వాడల్లోకెళ్లినా కన్పిస్తారు. ఇలాంటి వారి బతుకుల్లో వెలుగు పూలు పూయించే ఆర్థిక విధానాలూ, ప్రభుత్వ పాలసీలూ ఉండవు. ఉన్నా అవి ఏ కొద్దిమందికో మాత్రమే ఉపయోగ పడుతుంటాయి. దీనివెనుకనున్న మూల కారణాలు వెలికి తీసే ప్రయత్నం కూడా చేయని కొన్ని ప్రసార సాధనాలు అతికొద్ది మంది ధనిక వర్గాల జీవన పరిస్థితులను ఆకాశానికెత్తేస్తుంటాయి. అవి వాస్తవాలుగా నమ్మించేందుకు, యువతను భ్రమల్లో ముంచేందుకు ప్రయత్నిస్తుంటాయి.

నూటికి 90 శాతం యువతరం లైఫ్‌ స్టయిల్‌ను ప్రతిబింబించే బతుకు చిత్రం ఎక్కడా కనిపించదుగానీ ఏ కొద్దిమందో అనుభవిస్తున్న భోగ భాగ్యాల గురించి మాత్రం అద్భుతంగా ఫోకస్‌ చేస్తుంటారు. 'పబ్‌ కల్చర్‌ గురించీ, కొత్తకొత్త ఫ్యాషన్‌ల గురించీ 'బైక్‌ రేస్‌' గురించీ, పెద్దపెద్ద బిజినెస్‌ చదువుల గురించీ పత్రికల్లో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో కవరేజీ చూస్తే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని యువతను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వాస్తవానికి ఒక్క గంటకు తక్కువలో తక్కువ ఐదారువేలు ఖర్చుపెట్టి పబ్బుల్లో ఎంజారు చేసే స్థోమత ఎంతమంది యువతకుంటుంది? లక్షల్లో అడ్మిషన్‌ ఫీజలు చెల్లించి చదువు'కొనే' పరిస్థితి ఎందరికుంటుంది? రకరకాల బైకులు కొనే స్థోమత, రేసింగ్‌లో పాల్గొనే ఆసక్తి ఎవరికుంటుంది? వేలల్లో ఖరీదు చేసే ఫేస్‌ క్రీములు ఏ మధ్య తరగతి యువత కొనగలదు? బిల్‌గేట్స్‌లాగో, టాటాబిర్లాలాగో గొప్పవాళ్లు కావాలన్న కలలు కనాలని చెప్పే మాటలు ఎవరికి ఉపయోగపడతాయి? అంటే... సమాజంలోని కొంతమంది ధనికవర్గాలు అనుసరిస్తున్న పోకడలనే ఈతరం యువత మొగ్గుచూపుతున్న ట్రెండుగా ప్రచారం కల్పిస్తోంది పెట్టుబడిదారీ మీడియా. కానీ అత్యధిక శాతం వున్న పేద, మధ్య తరగతి యువత జీవన చిత్రాన్ని ప్రతిబింబించేది, ప్రతిభను వెలికి తీసేది, ఏదీ ప్రచారానికి నోచుకోవట్లేదు. కార్పొరేట్‌ ప్రతిభ ధాటికి సామాన్య యువత ప్రజ్ఞ పనికి రాకుండా పోతోంది. కారణం.... పెట్టుబడుల కట్టుకథల భావనలు యువత మెదళ్లను రకరకాలుగా ప్రభావితం చేస్తున్నాయి. పత్రికల ద్వారా, సినిమాల ద్వారా, ప్రకటనల ద్వారా, ఇంటర్నెట్‌ ద్వారా ఇవి విస్తరిస్తున్నాయి.

నేడు చాలా సంస్థలు, కంపెనీలు తాము మెరిట్‌ ప్రకారమే అవకాశాలు కల్పిస్తామంటున్నాయి. ప్రతిభకు, అర్హతలకు, కమ్యూనికేషన్‌ స్కిల్సుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇంతకీ మెరిట్‌ అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? సాధిస్తే వస్తుందా? అలా అయితే అందరూ ఎందుకు సాధించట్లేదు? ఇక్కడా ఓ కారణం ఉండే ఉంటుందన్న అనుమానం అక్కర్లేదు. కచ్చితంగా వుంటుంది. నేడు మెరిట్‌గా చెలామణి అవుతున్న వారంతా అవి సాధించడానికి కావలసిన ఆర్థిక పరిస్థితులూ, ప్రోత్సాహం, ఇతర కారణాలు అనుకూలించిన వారే ఎక్కువశాతం ఉంటున్నారు. అంటే... అనుకూల వాతావరణం వుంటే మెరిట్‌ ఎవరైనా సాధిస్తారు. కానీ నేడా పరిస్థితి ఉన్నవారు సమాజంలోని నాన్‌మెజార్టీ ధనికవర్గమే కాబట్టి మెరిట్‌ క్రెడిట్‌ అంతా వారికే దక్కుతోంది. అలాంటప్పుడు మెరిట్‌ ప్రకారం కొలువులన్నప్పుడు అవి ఏ వర్గ యువతకు దక్కుతున్నాయో చెప్పనక్కర్లేదు. ఇలాంటి అంతరాలు సమసిపోవాలంటే అందరికీ మెరిట్‌ సాధించే ఆర్థిక స్థోమత చేకూర్చగల ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఇప్పుడున్నవన్నీ అవి కావుకదా! అందుకే మెరిట్‌ వెనుక ఉన్న వాస్తవ ప్రతిభ తొక్కివేయబడుతోంది.

నేడు కెరీర్‌కు అత్యంత ప్రాధాన్యతే కాదు, ప్రచారమూ అలాగే లభిస్తోంది. అది వ్యక్తి ఉన్నతికీ, సమాజానికీ ఉపయోపడేదైనంత వరకు ఇబ్బంది లేదు. కానీ దాని పేరుతో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వ్యాపారమయమౌతున్నాయి. చివరికీ కెరీరిజం మోజులో వాస్తవానికి దూరంగా, సామాజిక స్పృహలేని వారిగా యువతరం తయారవుతోంది. ఉన్నతమైన కెరీర్‌ ప్రారంభించాలనుకుంటే అందుకు సంబంధించిన కోర్సులు చదవాలి. అవి చదవాలంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలించాలి. అనుకూలించినా అవకాశం దక్కాలి. అంటే... లక్షలతో ముడిపడి ఉన్నప్పుడు? కనీసం మూడుపూటలా తిండికిలేని కుటుంబం నుంచి వచ్చిన యువతీ యువకులు తమ కలను ఎలా సాకారం చేసుకోగలరు? ఐఐఎం, ఐటిఐ, ఇంజనీరింగ్‌, యానిమేషన్‌ లాంటి కెరీర్లో ఎలా ప్రవేశించగలరు? ఇవన్నీ కార్పొరేట్‌ సంస్థ చేతుల్లో ఉన్నప్పుడు సామాన్య యువత ఎలా చదువు 'కొనగలదు' అదే ప్రభుత్వాధీనంలో ఉంటేనో, ప్రభుత్వ సహకారం ఉంటేనో, ప్రజలందరి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే విధానాలు అమలైతేనో సామాన్యులు కూడా తమ లక్ష్యం నెరవేర్చుకోగలరు. కానీ ఇక్కడ ఒక పథకం ప్రకారమే కొద్దిమందికి ఉపయోగపడే పాలసీలే మన పాలకులు ప్రవేశపెడుతున్నప్పుడు ఉన్నతమైన కెరీర్‌ అనేది సామాన్య యువత రంగుల కలగానే మిగులుతోంది.

అప్పటి ట్రెండునుబట్టి నడ్చుకోవాలి? లేకపోతే అది నామోషీగా ఫీలయ్యే వారెక్కువ. మరి నేటి ట్రెండ్‌ ఏంటి? వాస్తవంగా ఎక్కువమంది అనుసరించేదో, ఎక్కువమంది జీవన పరిస్థితిని ప్రతిబింబించేదో అసలైన ట్రెండ్‌! కానీ మీడియా ప్రచారం పుణ్యమా అని బయట మాత్రం వేరేలా అర్థం చేసుకుంటున్నారు. పేద, మధ్యతరగతి యువతరం పోకడలను, వారి బతుకు చిత్రాలను పట్టించుకోవట్లేదు. కానీ కొంతమంది ఉన్నత వర్గాలవారు అనుసరించే, అనుకరించే, అనుభవించే జీవన విధానాన్నీ, వినోదాన్నీ అదే సర్వస్వమైనట్లు, అదే అందరికీ శిరోధార్యమైనట్లు, అదే అసలైన ట్రెండ్‌ అయినట్లు ప్రచారం కల్పిస్తోంది. ఫ్యాషన్‌ పోకడలు, పబ్‌కల్చర్‌, వెస్ట్రన్‌ కల్చర్‌, మదర్స్‌డేలు, ఫాదర్స్‌డేలు, బర్త్‌డేలు, ఫ్రెండ్‌షిప్‌డేలు, లవర్స్‌ డేలు, కొద్దిమంది ఉన్నత వర్గాల విలాసవంతమైన జీవన విధానాలు.... ఇవే నేడు ట్రెండుగా చెలామణి అవుతున్నాయి. తాజ్‌, ఒబెరారు రెస్టారెంట్ల యజమానులు కూడా ఒకప్పుడు హోటల్లో పనిచేశారు. ఎంతో కష్టపడి పైకొచ్చారు. (హోటల్లో జీవితాంతం పనిచేసినా' ఒక్క తాజ్‌ హోటల్‌ నిర్మాణానికి కావాల్సిన డబ్బులు కూడబెట్టడం కష్టం) ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తికి సొంత ఇల్లు కూడా లేదు. (చెవిలో పువ్వులు పెట్టడమంటే ఇదే), సోనియాగాంధికీ కారు లేదు. (కొనుక్కునే ఆర్థిక పరిస్థితి లేకనా?) ఇలాంటి విషయాలు కూడా కొన్ని సైకాలజీ గ్రంథాల్లో ప్రస్తావిస్తూ వారి మంచితనాన్ని ఆదర్శంగా తీసుకొమ్మంటారు.

ఒక గొప్ప వ్యాపారవేత్తను ఆదర్శంగా తీసుకొనో, పారిశ్రామికవేత్తను రోల్‌మోడల్‌గా తీసుకొనో, లేకపోతే అమితాబ్‌ బచ్చన్‌ లాంటి వారి విజయాలను వరుసబెట్టి చెబుతూ మీరూ అలా ఎదగండనో చెబుతుంటారు. అలా ఎదిగేందుకు సంకల్పం, కృషి, పట్టుదల, తపన, సాధన, లక్ష్యం ఉండాలని గట్టిగా చెబుతుంటారు. కానీ అలా ఎదగాలంటే అందుకు తగిన పరిస్థితులు ఎందుకు ఉండట్లేదు? ఆర్థిక పరిస్థితులు అందరికీ ఎందుకు అనుకూలించట్లేదు? ఈ వ్యవస్థలో ఉన్న లోపాలేమిటి? అన్న విషయాలు ఎక్కువ శాతం యువత మొగ్గు చూపుతున్న 'కెరీరిస్టు' 'పర్సనల్‌ స్కిల్స్‌, ఇతర సైకాలజీ గ్రంథాల్లో ఉండట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే అవి ఉన్న వ్యవస్థలోనే ఉన్నత స్థితికి ఎదిగేందుకు కావాల్సిన మాటలు చెబుతాయి. (అవి ఆచరణ సాధ్యమో కాదో మాత్రం పట్టించుకోవు) అంతేతప్ప వ్యవస్థలో సమూల మార్పునకు, సమిష్టి తత్వానికి కావలసినదేదీ అందులో ఉండట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి మానసిక దౌర్భల్యుల్ని తయారు చేయడమో, భ్రమలు కలుగ జేయడమో చేస్తున్నాయి. కానీ నయా పోకడల ముసుగులో విస్తరిస్తున్న అంతరాల సమాజాన్నీ, దుర్భర వ్యవస్థనూ మార్చే ఆచరణ సాధ్యమైన చైతన్య స్థాయిని కల్పించట్లేదు. అందరికీ విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలను కల్పించే సరైన మార్గం చూపట్లేదు.

** article from prajasakti  prajasakti.com

Sunday, February 5, 2012

ఇరాన్‌ పై కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

 
ఇరాన్‌ తన రివల్యూషనరీ గార్డ్స్‌ను సన్నద్ధంగా ఉంచింది. వైమానిక దళాన్ని అప్రమత్తం చేసింది. గత డిసెంబర్‌ నుండి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. దాడి చేస్తే గట్టిగా బుధ్ధి చెబుతామని అమెరికా, ఇజ్రాయిల్‌ను హెచ్చరించింది.ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం తగదని చైనా, రష్యా పేర్కొన్నాయి. ఇటువంటి చర్యలు ఇరాన్‌ను తిరిగి చర్చలకు ఒప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఆటంకం కలగజేస్తాయని అవి పేర్కొన్నాయి.
ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరు కుంటున్నాయి. యుద్ధం అనివార్యం అంటూ అమెరికా, దాని ప్రధాన మిత్రపక్షమైన ఇజ్రాయిల్‌ రోజూ ఇరాన్‌ను హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇరాన్‌పై మరింత కిరాతకమైన ఆంక్షలను విధించాలని అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు ఏకపక్షంగా నిర్ణ యించాయి. ఇరాన్‌ చమురు, గ్యాస్‌ ఎగుమతులను భారీగా దెబ్బతీసే విధంగా పాశ్చాత్య దేశాల కూటమి ఆంక్షలు విధించింది. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ చమురు, గ్యాస్‌ ఎగుమతుల పైనే ప్రధానంగా ఆధారపడి ఉంది. ఐఎఇఎ తాజా నివేదిక విడుదలైన అనంతరం ఒబామా ప్రభుత్వం ఇరాన్‌పై మరింతగా ఒత్తిడి పెంచసాగింది. ఇరాన్‌ రహస్యంగా యురేనియాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని రహస్యంగా నిర్వహి స్తోందని ఎటువంటి సాక్ష్యాధారాలు సమర్పించ కుండానే ఐఎఇఎ తన నివేదికలో పేర్కొంది.. ఒక సంవత్సర కాలంలో ఇరాన్‌ చేతిలో అణ్వాయుధం ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి లియోన్‌ పనెట్టా డిసెంబర్‌ చివరి వారంలో పేర్కొన్నారు. ఇరాన్‌ ఈ రెడ్‌లైన్‌ను దాటడాన్ని ఎన్నడూ అనుమతించ బోమని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని పరిష్కరిం చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోగలమని పేర్కొన్నారు. తన అణు కార్యక్రమం శాంతియుత సైనికేతర ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించిందని ఇరాన్‌ స్పష్టంగా ప్రకటిస్తూనే ఉంది. అప్రకటిత అణ్వాయుధ దేశమైన ఇజ్రాయిల్‌ దాడి చేస్తామని ఇరాన్‌ను పదేపదే హెచ్చరిస్తోంది. అణ్వాయుధాలు గల అమెరికా నౌకలు, జలాంతర్గాములు పర్షియా గల్ఫ్‌లో సంచరిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలో కదన రంగంలో దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి. పొరుగున ఉన్న బహ్రెయిన్‌, కతార్‌లలో అమెరికా పెద్ద ఎత్తున సైనిక స్థావరాలను నిర్మించుకుంది. ఏ సమయంలోనైనా అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉంది. ఇరాన్‌పై దాడి చేసి పాము తలను తొలగించాలని అయెరికాపై సౌదీ అరేబియా రాజు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వికిలీక్స్‌ వెల్లడించింది.
అసాధారణ స్థాయికి చేరుకున్న హిస్టీరియా
ఐఎఇఎ అందించినట్లుగా చెబుతున్న సాక్ష్యాధారాలను ఇరాన్‌ ఖండిస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీల కుట్రగా అభివర్ణిం చింది. విదేశాంగ విధానంపై పత్రికలో ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇదే సమయమని మాథ్యూ కోన్రింగ్‌ పేర్కొన్నాడు. ఆ వ్యాస రచయిత అమెరికా రక్షణ మంత్రికి ఇటీవలి కాలం వరకు ప్రత్యేక సలహాదారునిగా ఉన్నాడు. అమెరికా పకడ్బందీగా దాడి చేస్తే ఇరాన్‌ అణు స్థావరాలను ధ్వంసం చేయవచ్చునని ఆయన సలహా ఇచ్చాడు. గల్ఫ్‌ ప్రాంతం మొత్తానికి ఇబ్బంది కలిగించకుండా దాడి చేయవచ్చునని సూచించాడు. ఇరాన్‌ వ్యతిరేక హిస్టీరియా ఇటీవలి మాసాల్లో అమెరికాలో అసాధారణ స్థాయికి చేరుకుంది. అమెరికాలో సౌదీ అరేబియా రాయబారిని హత్య చేసేందుకు కాంట్రాక్టును మెక్సికోకు చెందిన ఒక డ్రగ్‌ కార్టెల్‌కు ఇరాన్‌ అధికారులు ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. న్యూయార్క్‌లో జరిగిన 9/11 దాడుల వెనక ఇరాన్‌ ఉందని ఫెడరల్‌ జడ్జ్‌ రూలింగ్‌ ఇచ్చారు. ఇరాన్‌ అల్‌ ఖైదాకు ఈ డాడులను నిర్వహించేందుకు ప్రత్యక్షంగా సహాయ మందించిందని ఆయన పేర్కొన్నారు.
చమురు ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామి దేశాల్లో ఒకటైన ఇరాన్‌ తాజా పరిణామాల నేపథ్యంలో తన ఉనికికి ముప్పు రానున్నదని ఆందోళన చెందడం సహజం. కొత్త ఆంక్షలను అమలు చేస్తే హార్మజ్‌ జలసంధిని మూసివేస్తామని ఇరాన్‌ మిలిటరీ ఉన్నత శ్రేణి నాయకులు హెచ్చరించారు. పర్షియా గల్ఫ్‌ ప్రాంతంలో ఉన్న ఈ జలసంధి ద్వారా చమురు అంతర్జాతీయంగా రవాణా అవుతుంది. హార్మజ్‌ జలసంధి పొడవు 6.4 కిలోమీటర్లు. ఇరాన్‌, ఒమన్‌ మధ్య గల్ఫ్‌ ముఖ ద్వారంగా ఉంది. ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే ముడి చమురులో మూడవ వంతు ఇరుకుగా ఉండే ఈ జలసంధి ద్వారా రవాణా అవుతుంది. కతార్‌ నుండి లిక్విఫైడ్‌ గ్యాస్‌ సరఫరా హార్మజ్‌ జలసంధి ద్వారానే జరుగుతుంది.
పశ్చిమ దేశాలు క్రమంగా విస్తరించుకుంటూపోతున్న ఆంక్షల కారణంగా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే బాగా దెబ్బతింది. డిసెంబర్‌ 31న ఒబామా కొత్తగా ఆంక్షలు విధించారు. ఇరాన్‌ కేంద్ర బ్యాంక్‌తో లావాదేవీలు జరిపే కంపెనీలపై చర్య తీసుకుంటామని ఈ కొత్త శాసనం నిర్దేశించింది. భారత్‌ వంటి దేశాలు ఇరాన్‌ నుండి చమురు దిగుమతి చేసుకోకుండా చూడటం ఈ చట్టం ఉద్దేశంగా ఉంది. ఇరాన్‌ చమురులో ఎక్కువ భాగం చైనా, భారత్‌కు రవాణా అవుతుంది. ఇయు 18 శాతం మాత్రమే దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్‌ చమురు రంగంపై ఆంక్షలు విధిస్తే ఒక్క బొట్టు చమురు కూడా హార్మజ్‌ జలసంధి నుండి రవాణా కాదని ఇరాన్‌ ఉపాధ్యక్షుడు మహ్మద్‌ రేజా రహిమి హెచ్చరించారు. డిసెంబర్‌ నెల చివర్లో ఇరాన్‌ సైన్యం హార్మజ్‌ జలసంధి సమీపంలో పది రోజుల పాటు సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసాల్లో భాగంగా వైమానిక దళం జలాంతర్గాములను సముద్రంలో ముంచేసింది. నౌకలు రాకుండా ఈ జలసంధిని మూసివేయడం చాలా తేలికైన విషయమని ఇరాన్‌ నౌకాదళాల అధిపతి అడ్మిరల్‌ హబీబుల్లా సయ్యారి మీడియాకు చెప్పారు. జలమార్గాలపై ఇరాన్‌కు పూర్తి నియంత్రణ ఉందని పేర్కొన్నారు. పశ్చిమ దేశాలు ఇరాన్‌పై ఆంక్షలు విధించడానికే కృతనిశ్చయంతో ఉన్నాయని స్పష్టమవుతోంది. ఈ విషయంలో అవి వెనకడుగు వేసేందుకు సుముఖత చూపడం లేదన్నారు. తన కీలక ప్రయోజనాలు పరిరక్షించుకునేందుకు రక్షాత్మక వ్యూహాలను అనుసరించ గలదని రివల్యూషనరీ గార్డ్స్‌ డిప్యూటీ కమాండర్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ హుస్సేన్‌ సలామీ చెప్పారు. తమపై దాడి చేస్తే అమెరికాకు చెందిన 32 స్థావరాలను ధ్వంసం చేస్తామని ఇరాన్‌ ఇంతకు ముందు హెచ్చరించింది. ఇరాన్‌తో యుద్ధం వస్తే చమురు ధర ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చ రించారు. తన అణు కార్యక్రమంపై తిరిగి చర్చలు జరిపేందుకు ఇరాన్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు కొత్తగా ఆంక్షలు విధించిన తరువాత ఇరాన్‌ సైన్యం ఉపరితలం నుండి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణిని పరీక్షించింది. రాడార్లకు ఇది చిక్కదు. మొట్టమొదటి అణు ఇంధన రాడ్‌ను తమ శాస్త్రవేత్తలు నిర్మించినట్లు ఇరాన్‌ జనవరి 1న ప్రకటించింది. సహజసిద్ధమైన యురేనియం గల రాడ్స్‌ను ఇరాన్‌ కీలకమైన అణు రియాక్టర్‌లో అమర్చారు.
సైన్యం నుండి ముప్పు
హార్మజ్‌ జలసంధిని మూసివేస్తామని ఇరాన్‌ చేసిన హెచ్చరికపై అమెరికా తీవ్రంగా ప్రతిస్పందించింది. రెండు యుద్ధనౌకలను జలసంధి వైపు పంపించింది. ఈ జలసంధిలో నౌకాయానం జరిపేందుకు గల హక్కును హరించే ఎటువంటి చర్యను క్షమించబోమని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. సైనిక దళాన్ని వినియోగించే ప్రమాదంతోపాటు అమెరికా, ఇజ్రాయిల్‌ గత రెండు సంవత్సరాలుగా ఇరాన్‌ సైంటిఫిక్‌ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులపై దృష్టి సారించాయి. వారిని కిడ్నాప్‌ చేసేదుకు, హతమార్చేందుకు, ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్‌ మిలిటరీ, పౌర స్థావరాలపై ఉగ్రవాద దాడులు జరిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత రెండు సంవత్సరాల్లో ఇద్దరు అణు శాస్త్రవేత్తలను హతమార్చారు. వారు కారులో ప్రయాణిస్తుండగా వారి కారును పేల్చివేశారు. ఇరాన్‌ అణు ఇంధన సంస్థ ఛైర్మన్‌ ఫెరేదౌన్‌ అబ్బాసీ దావానీ కారుపై కూడా ఇదే విధంగా బాంబు దాడి జరిగింది. రివొల్యూషనరీ గార్డ్‌ స్థావరంలో నవంబర్‌ 12న జరిగిన పేలుడులో 17 మంది మృతి చెందారు. అందులో ఇరాన్‌ క్షిపణి కార్యక్రమ రూపకర్త జనరల్‌ హసన్‌ తెహెరాని మొఘద్దమ్‌ కూడా ఉన్నారు. ద్రోణ్‌ నుండి క్షిపణిని ప్రయోగించి ఉండవచ్చునని నిపుణులు పేర్కొన్నట్లుగా న్యూయార్క్‌టైమ్స్‌ వెల్లడించింది. గత నవంబర్‌లో సంభవించిన మరో పేలుడు కారణంగా ఇస్ఫహాన్‌ నగరానికి సమీపంలోని యురేనియం శుద్ధి చేసే కర్మాగారం దెబ్బతిందని పశ్చిమ దేశాల మీడియా వెల్లడించింది. ఇరాన్‌ మీడియాలో మాత్రం ఈ పేలుడు గురించిన సమాచారం లేదు. ఈ విధ్వంస చర్య తమ ఘనతేనని ఇజ్రాయిల్‌, అమెరికా అధికారులు పేర్కొన్నారు.యువ అణు శాస్త్రవేత్త, నటాంజ్‌ యురేనియం కేంద్రంలో ఉప అధిపతి ముస్తాఫా అహ్మది రోషన్‌ హత్య వెనుక సిఐఎ హస్తం ఉందని ఇరాన్‌ అధికారులు ఆరోపించారు. ఆయన కారు తలుపుకు అయస్కాంత బాంబును అమర్చడం ద్వారా పేల్చివేశారని పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద చర్య వెనుక సిఐఎ హస్తం ఉందని నిరూపించేందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఇరాన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ హత్యను ఖండించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి, భద్రతా మండలికి ఇరాన్‌ విజ్ఞప్తి చేసింది. 2010లో ఇరాన్‌ అణు స్థావరాలకు స్టక్‌నెట్‌ కంప్యూటర్‌ వైరస్‌ను అమెరికా, ఇజ్రాయిల్‌ ప్రయోగించాయి. పరిశ్రమల్లో ఉపయోగించే కంప్యూటర్లను కూడా ఈ వైరస్‌ దెబ్బతీసింది. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వైరస్‌ను అవి ప్రయోగించాయి. ఇరాన్‌ గగనతలంలో సాయుధ ద్రోణ్‌ విమానాల విహారానికి ఒబామా ప్రభుత్వం అనుమతించింది. అమెరికాకు చెందిన ఆర్‌కు 170 సెంటినెల్‌ స్టీల్త్‌ ద్రోణ్‌ను గత డిసెంబర్‌లో ఇరాన్‌ దింపేసిన తరువాత అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 50 వేల అడుగుల ఎత్తున ప్రయాణించగల ద్రోణ్‌ అమెరికా విమానాల్లో అత్యంత ఆధునికమైంది. ఈ విమానాన్ని ఇరాన్‌ ప్రదర్శనలో పెట్టింది. దీనిని వెనక్కు పంపాలని అమెరికా చేసిన డిమాండ్‌ను ఇరాన్‌ తోసిపుచ్చింది. ద్రోణ్‌ ఇరాన్‌ గగనతలంలో నిఘా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అవి ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాదులపై ప్రయోగించడానికి ఉద్దేశించినవి కావు. యుద్ధం ముప్పును ఇరాన్‌ కూడా తేలికగా తీసుకోవడం లేదు. తన రివల్యూషనరీ గార్డ్స్‌ను సన్నద్ధంగా ఉంచింది. వైమానిక దళాన్ని అప్రమత్తం చేసింది. గత డిసెంబర్‌ నుండి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. దాడి చేస్తే గట్టిగా బుధ్ధి చెబుతామని అది అమెరికా, ఇజ్రాయిల్‌ను హెచ్చరించింది.ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం తగదని చైనా, రష్యా పేర్కొన్నాయి. ఇటువంటి చర్యలు ఇరాన్‌ను తిరిగి చర్చలకు ఒప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఆటంకం కలగజేస్తాయని అవి పేర్కొన్నాయి.

***** Article From  PRAJASAKTI  NEWS Paper Link www.prajasakti.com written by యొహానన్‌ చామరపల్లి

Sunday, November 6, 2011

మరో గ్లో'బలి'

మొన్న ఇరాక్‌... నిన్న ఆఫ్ఘనిస్తాన్‌... నేడు లిబియా... ప్రపంచ రక్షకుడిగా చెప్పుకుంటున్న అమెరికా తాజాగా లిబియాను భక్షించింది. ప్రపంచ పోలీసు అవతారమెత్తి తనకు ఎదురు తిరిగే దేశం పాలిట విలన్‌గా మారడం అమెరికా ఆనవాయితీ. ఆ ఆనవాయితీని నిజం చేస్తూ 42 ఏళ్లుగా తన కంట్లో నలుసుగా ఉన్న లిబియా అధినేత కల్నల్‌ గడాఫీని పాశవికంగా వెంటాడి, వేటాడి హత్య చేసింది. గ్లోబలీకరణ... ప్రపంచీకరణ పేరుతో మరో గ్లో'బలి'కి పాల్పడింది. లిబియాలో ఉన్న అపార చమురు సంపదపై కన్నేసిన అమెరికా దాని మిత్ర పక్షాలు ఆ దేశాన్ని కబళించాయి. అంతటితో ఊరుకోకుండా ఆ దేశాన్ని ఎప్పటికీ తన చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు అధ్యక్షుడు గడాఫీని బలి తీసుకుంది.
తమ దేశంలోని ఆర్థిక మాంద్యం, నిరుద్యోగాన్ని పరిష్కరించలేని అమెరికా ప్రపంచంలోని ఇతర దేశాల సమస్యలను పరిష్కరిస్తానని బయలుదేరింది. మానవ హక్కులను కాపాడతాననే నెపంతో తనకు కంటగింపుగా ఉన్న దేశాలపైకి బాంబుల వర్షం కురిపిస్తూ లక్షలాది మందిని బలి తీసుకుంటోంది. అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించిన లిబియా అధ్యక్షుడిగా గడాఫీని నాటో దళాల ముసుగులో అదును చూసి చంపేసింది. అంతటితో ఊరుకోకుండా ప్రపంచంలోనే అతి నాణ్యమైన చమురు సంపదను కొల్లగొట్టడానికి రంగం సిద్ధం చేసింది. 42 ఏళ్లుగా చెప్పుకోదగ్గ జీవన ప్రమాణాలతో విలసిల్లుతున్న లిబియన్లను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ప్రణాళిక రచించింది. 27 ఏళ్లకే అధికారం చేపట్టి 42 ఏళ్లు అప్రతిహతంగా పరిపాలించిన గడాఫీ లిబియాను ఆఫ్రికాలోనే అత్యంత ధనిక దేశంగా నిలిపాడు. 1969లో రక్తపాత రహిత తిరుగుబాటుతో ఈ పోలీసు అధికారి లిబియా గద్దెనెక్కాడు. యునెస్కో లెక్కల ప్రకారమే లిబియాలో అక్షరాస్యత శాతం 83. యువకుల్లో 99.9 శాతం మంది అక్షరాస్యులు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యుహెచ్‌ఓ) లెక్కల ప్రకారం వైద్య సేవలందించడంలో ఆఫ్రికాలోనే లిబియా అగ్రస్థానంలో ఉంది.
ఇటలీ వలస రాజ్యంగా...
వేలాది సంవత్సరాల క్రితం లిబియాలోని 90 శాతం భూమి సహారా ఎడారితోనే నిండి ఉంది. భౌగోళిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 8000 బిసి నుండే ఇక్కడ జనజీవనం కొనసాగింది. ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. ఎడారిలో అక్కడక్కడ పారే చిన్న వాగులు, కాలువలను ఆధారం చేసుకొని లిబియన్లు వ్యవసాయం కొనసాగించేవారు. రాళ్లపై పెయింటింగ్‌కు అక్కడి పర్వతాలు చారిత్రక నిదర్శనంగా నిలిచాయి. 1000 బిసిలో ఫెజాన్‌ ప్రజలను గిరిజనులుగా పరిగణించేవారు. 500 బిసి నుండి 500 ఎడి మధ్య కాలంలో స్థానిక పాలనలో ఉంది. తూర్పు ప్రాంత ప్రజలు, సహారా ప్రాంతంలో స్థిరపడిన ప్రజలు రావడంతో లిబియా నాగరికతను సంతరించుకుంది. ఫియోనిసియన్లు లిబియన్లతో తొలుత వ్యాపార లావాదేవీలు నిర్వహించారు.
లిబియా తీర ప్రాంతమైన ఓయె, లిబ్‌దాV్‌ా, సబ్రతా నగరాలు కలిసి ప్రస్తుత ట్రిపోలీ (మూడు నగరాలు)గా రూపాంతరం చెందింది. ఇటలీ ఆక్రమించుకున్న తర్వాత 1912 - 27 మధ్యకాలంలో లిబియాను ఇటాలియన్‌ ఉత్తర ఆఫ్రికాగా పిలిచారు. 1927-34 మధ్యకాలంలో ఇటాలియన్‌ సైరేనైకా, ఇటాలియన్‌ ట్రిపోలిటానియా అనే రెండు ప్రాంతాలుగా విభజించబడింది. ఈ రెండు ప్రాంతాలు ఇటలీ ప్రభుత్వ పాలనలో ఉండేవి. ఆ కాలంలో లక్షా 50 వేల మంది ఇటాలియన్లు (లిబియా జనాభాలో 20 శాతం) ఇక్కడ స్థిరపడ్డారు. సైరేనైకా, ట్రిపోలిటానియా, ఫెజాన్‌ అనే మూడు ప్రాంతాలను కలిపి లిబియాగా 1934లో ఇటలీ స్థిరీకరించింది. లిబియా రెండు ప్రపంచ యుద్ధాల సమయాల్లోనూ ఇటలీ ఆధీనంలోనే ఉంది. 1943-51 మధ్యకాలంలో ట్రిపోలిటానియా, సైరేనైకాలు బ్రిటిష్‌ పాలనలో ఉన్నాయి. ఫెజాన్‌ను ఫ్రాన్స్‌ ఆధీనంలో ఉంచుకున్నది.
951లో స్వాతంత్య్రం
లిబియాకు జనవరి1, 1952లోపు స్వాతంత్య్రం ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి నవంబర్‌ 21, 1949లో తీర్మానం చేసింది. దానికి అనుగుణంగానే డిసెంబర్‌ 24, 1951లో లిబియాకు స్వాతంత్య్రం వచ్చింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ లిబియాకు రాజుగా ఇద్రిస్‌ నియమితులయ్యాడు. లిబియా రాజ్యాంగం ప్రకారం రాజు ఇద్రిస్‌ పాలనలో లిబియా నేషనల్‌ అసెంబ్లీతో పాటు ఒక అధ్యక్షుడు (మహ్మద్‌ అబ్దులాస్‌ ఎల్‌ ఆలెమ్‌), ఇద్దరు ఉపాధ్యక్షులు (ఒమర్‌ ఫేక్‌ షెనిబ్‌, అబూబకర్‌ అహ్మద్‌ అబూబకర్‌) నియమితులయ్యారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి లిబియా ఉత్తర ఆఫ్రికాలో నిరుపేద గిరిజన దేశంగానే ఉండేది. ఇది ఆఫ్రికాలో నాలుగో పెద్ద దేశం, ప్రపంచంలో 17వ పెద్ద దేశం. సాంప్రదాయకంగా లిబియా ట్రిపోలిటానియా, ఫెజాన్‌, సైరేనైకా అనే మూడు ప్రాంతాలు కలిగి ఉంది. 1951లో స్వాతంత్య్రం పొంది యునైటెడ్‌ లిబియన్‌ కింగ్‌డమ్‌గా అవతరించింది. 1959లో చమురు నిక్షేపాలు బయటపడిన తర్వాత లిబియా శుద్ధమైన చమురు నిక్షేపాలు గల పదవ అతిపెద్ద దేశంగా, పెట్రోలియం నిక్షేపాలు గల 17వ అతిపెద్ద దేశంగా ఘనతకెక్కింది. 1963లో దానిపేరును కింగ్‌డమ్‌ ఆఫ్‌ లిబియాగా మార్చారు. 1969లో జరిగిన రక్తపాత రహిత విప్లవంలో కల్నల్‌ గడాఫీ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. తర్వాత దేశం పేరును లిబియన్‌ అరబ్‌ రిపబ్లిక్‌ (అల్‌-జమూరియా అల్‌ అరబియా అల్‌-లిబియా)గా మార్చాడు. గడాఫీ కొన్ని సోషలిస్టు విధానాలను అవలంభించడంతో ఆ దేశాన్ని 1977-86 మధ్య కాలంలో 'సోషలిస్ట్‌ పీపుల్స్‌ లిబియన్‌ అరబ్‌ జమాహిరియా' అని, 1986-2011 మధ్య కాలంలో 'గ్రేట్‌ సోషలిస్ట్‌ పీపుల్స్‌ లిబియన్‌ అరబ్‌ జమాహిరియా' అని పిలిచారు. ఇప్పుడు కొత్తగా అధికారం చేపట్టిన నేషనల్‌ ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌ (ఎన్‌టిపి) 'లిబియన్‌ రిపబ్లిక్‌' అని మార్చారు.
దేశం : లిబియా
రాజధాని : ట్రిపోలి
అధికారిక భాష : అరబిక్‌
స్వాతంత్య్రం పొందింది : ఫిబ్రవరి 10, 1947 (ఇటలీ నుండి ఐక్యరాజ్య సమితి ట్రస్టీషిప్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ @ ఫ్రాన్స్‌ల ఆధీనంలోకి మారింది)
డిసెంబర్‌ 24 1951 (యునైటెడ్‌ కింగ్‌డమ్‌ & ఫ్రాన్స్‌ ఆధీనం నుండి కూడా స్వాతంత్య్రం పొందింది)
జనాభా : 66 లక్షలు
విస్తీర్ణం : 17,59,541 చదరపు కిలోమీటర్లు
ప్రధాన ఆదాయ వనరు : చమురు
కరెన్సీ : దీనార్‌
రాష్ట్రాలు : ట్రిపోలిటానియా, బర్కా, ఫెజాన్‌
ప్రధాన నది : మన్మేడ్‌ నది (సహారా ఎడారిలో)



గడాఫీ పాలన...
1959లో చమురు నిక్షేపాల వెలికితీతతో అతిపేద గిరిజన దేశం అకస్మాత్తుగా ఆఫ్రికాలోనే అత్యంత ధనిక దేశంగా అవతరించింది. చమురు విక్రయంతో ప్రభుత్వ ఆదాయం భారీ స్థాయిలో పెరిగింది. ప్రభుత్వ ఆదాయం పెరగడంతో ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు ఇద్రిస్‌ భోగభాగ్యాల్లో మునిగిపోయాడు. ప్రజా సంపదను సొంతానికి వాడుకుంటూ ప్రజల పేదరికాన్ని పట్టించుకోలేదు. పాలన స్థంభించింది. లిబియాలో ఇంజనీరింగ్‌ ప్రాజెక్టులను, ఆ దేశానికి ఆయుధాలను బ్రిటన్‌ ఎక్కువగా సరఫరా చేసింది. అమెరికా కూడా లిబియాలో అతిపెద్ద ఎయిర్‌బేస్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా, బ్రిటన్‌ దోపిడీలు పెరగడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. సెప్టెంబర్‌ 1, 1969లో 27 ఏళ్ల యువ మౌమ్మర్‌ గడాఫీ నేతృత్వంలో చిన్న మిలిటరీ అధికారుల గ్రూపు తిరుగుబాటు చేసింది. గడాఫీని ''సోదర నాయకుడు, తిరుగుబాటుకు మార్గదర్శకుడు''గా పేర్కొన్నారు. రాజు ఇద్రిస్‌ ప్రతిఘటించకుండానే పాలనాధికారాలను గడాఫీ బృందానికి అప్పగించాడు. గడాఫీ పాలనా పగ్గాలు చేపట్టగానే దేశంలో మార్పులు చేపట్టాడు. రేడియో, టెలివిజన్‌లను ప్రభుత్వ ఆధీనం చేశాడు. ప్రధానంగా కంపెనీలను, విద్యావ్యవస్థలను ప్రభుత్వపరం చేశాడు. చమురును జాతీయం చేశాడు. 1977లో లిబియాను 'సోషలిస్టు పీపుల్స్‌ లిబియన్‌ అరబ్‌ జమాహిరియా'గా ప్రకటించాడు. దేశంలో గల 66 లక్షల మందికి ఉచిత విద్య, వైద్యంతో పాటు నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించాడు. చదువుపై ఆసక్తి ఉండాలే కాని లిబియాలో ప్రోత్సాహానికి కరువులేదు. విదేశాల్లో చదవాలనుకునే వారందరికీ అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. అయితే తాము సంపాదించిన జ్ఞానాన్నంతా మళ్లీ దేశాభివృద్ధికే వెచ్చించాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తారు. లిబియన్లు ఆస్పత్రి మెట్లు ఎక్కిననాటి నుండి ఇంటికి వెళ్లే వరకూ చిల్లి గవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంతటి అనారోగ్యమైనా ప్రభుత్వమే భరిస్తుంది. విదేశాల నుండి మందులు, వైద్యులను తెప్పించి మరీ సేవలు అందిస్తుంది. కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. అవసరార్థం డబ్బులు కావాల్సి వస్తే లిబియా బ్యాంకులు వడ్డీ లేని రుణాలు అందిస్తాయి. యువతీ యువకులు పెళ్లి చేసుకుంటే 50 వేల డాలర్లు బహుమతిగా ఇస్తుంది. ఇల్లు కొనుక్కుని స్థిరపడేందుకు ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. వ్యవసాయం చేయాలనుకునే వారికి భూమి, అవసరమైన పనిముట్లు, విత్తనాలు సమకూర్చి అండగా నిలుస్తుంది. కారు కొనుక్కువాలనుకునే వారికి సగం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. భారత్‌ నుండే కాదు అగ్రరాజ్యాలుగా చెలామణి అవుతున్న అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాల ప్రజలు కూడా ఉద్యోగాల కోసం పొట్ట చేతబట్టుకొని ఇతర దేశాలకు వలస వెళ్తారు. కానీ ఒక్క లిబియా పౌరుడు కూడా ఇతర దేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లిన సందర్భం లేదు. పైపెచ్చు ఇతర దేశస్తులను ఉద్యోగం కోసం ఆ దేశానికే వలస వెళ్తారు. ఇదీ లిబియా ప్రత్యేకత. ఆఫ్రికా దేశాల్లో లిబియా ఒక స్విట్జర్లాండ్‌ వంటిదని ఇటలీ జర్నలిస్టు వైవోన్‌ పేర్కొన్నారు.
లిబియాను 'ధనిక మధ్య తరగతి ఆదాయం' గల దేశంగా ప్రపంచ బ్యాంకు కూడా కొనియాడింది. అప్పులేని దేశం లిబియా. 1980 వచ్చే సరికి ధనిక దేశాల సరసన నిలిచింది. ఇటలీ, సింగపూర్‌, దక్షిణ కొరియా, స్పెయిన్‌, న్యూజిలాండ్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే లిబియాలోనే జిడిపి వృద్ధిరేటు ఎక్కువగా ఉంది. లిబియన్లను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత గడాఫీకే దక్కింది.
మరి వ్యతిరేకత ఎందుకు..?
లిబియాలో తన కీలుబొమ్మ రాజు ఇద్రిస్‌ను తొలగించి గడాఫీ అధికారం చేపట్టగానే అమెరికాకు వ్యతిరేకమైన చర్యలు చేపట్టాడు. అధికార పగ్గాలు చేపట్టగానే అమెరికన్‌, బ్రిటన్‌ సైనిక స్థావరాలను తొలగించాడు. అంతర్జాతీయ వేదికలపై అమెరికా పెత్తనాన్ని సవాలు చేశాడు. చమురు సంపద విలువను తెలియజెప్పి దీన్ని ఇతర దేశాలు కొల్లగొట్టుకోకుండా కాపాడాల్సిన బాధ్యత తమదేనని లిబియన్లలో నింపాడు. అలీనోద్యమంలో ముఖ్య పాత్రధారిగా ఉంటూ ఆఫ్రికా దేశాల ఐక్యత కోసం పరితపించాడు. సోవియట్‌ రష్యా నేతృత్వంలోని సోషలిస్టు కూటమితో సన్నిహితంగా ఉంటూ సామ్రాజ్యవాదాన్ని సవాల్‌ చేశాడు. తమ భూభాగం కోసం పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు అండగా నిలిచాడు. ఇజ్రాయిల్‌ జాత్యాహంకారాన్ని నిర్ద్వందంగా ఖండించాడు. ఇజ్రాయిల్‌ దాడులకు బలవుతున్న లెబనాన్‌కు మద్దతుగా నిలిచాడు. అంతేకాదు ఇజ్రాయిల్‌తో ఈజిప్ట్‌ అధ్యక్షుడు అన్వర్‌ సాదత్‌ శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల ఆగ్రహించి ఆ దేశంపై శతఘ్నులు, ఫిరంగులతో దాడులు చేశాడు.
ఈ చర్యలే అమెరికాకు కంటగింపుగా మారాయి. 80వ దశకంలో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌, ఇంగ్లండ్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌లు తమ అభివృద్ధి నిరోధక ప్రయత్నాలకు అడ్డుగా నిలిచిన లిబియాతో ఘర్షణ వైఖరి అవలంబించాయి. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ అమెరికా చేసిన పనిని లిబియాపైకి నెట్టింది. యూరప్‌లో ఒక హోటల్‌పై దాడి, అమెరికా విమానం కూల్చివేత వంటి ఆరోపణలు గడాఫీపై మోపి అతడిపై క్రిమినల్‌గా ముద్ర వేయడానికి ప్రయత్నించాయి. 1986లోనే లిబియాపై, గడాఫీ నివాసంపై అమెరికా వైమానిక దాడులు చేసి ఆయన పెంపుడు కూతుర్ని చంపేసింది. గడాఫీపై ఎన్నో హత్యాయత్నాలు జరిగాయి. గడాఫీ లిబియాలో ఎన్నికలు జరపలేదని, అక్కడ ప్రజాస్వామ్యం లేదని, మానవ హక్కులు మృగ్యమని అమెరికా ప్రచారం చేసింది. కార్పొరేట్‌ మీడియా దానికి వంతపాడింది.
సోవియట్‌ పతనంతో గడాఫీ వైఖరిలో మార్పు
సోవియట్‌ యూనియన్‌ పతనంతో గడాఫీ వైఖరిలో మార్పు వచ్చింది. విమానం పేల్చివేతకు కారకుడైనట్లు ఆరోపిస్తున్న వ్యక్తిని అమెరికాకు అప్పగించాడు. ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌లను కబ్జా చేసుకున్న తర్వాత ఇరాన్‌, లిబియాలపై అమెరికా దాడిచేస్తుందని ఎప్పుడో స్పష్టమైంది. అయితే గడాఫీ దౌత్య నీతితో ఇంతకాలం నెట్టుకొచ్చాడు. 9/11 నిందితులలో ఒకడైన అబ్దెలఖిమ్‌ బెల్వద్జీని మలేసియాలో 2003లో పట్టుకున్న అమెరికాకు చెందిన సిఐఎ మరుసటి ఏడాది లిబియాకు అప్పగించింది. అతడ్ని కొంతకాలం జైల్లో ఉంచిన గడాఫీ తర్వాత ఉదారవాద దృష్టితో విడుదల చేశాడు. అయితే బెల్వద్జీ అప్పటికే సిఐఎ ఏజెంటుగా మారినట్లుంది. లిబియా ఇస్లామిక్‌ ఫైటింగ్‌ గ్రూప్‌ (ఎల్‌ఐఎఫ్‌జి) పేరుతో ఒక ఛాందస వాద సంస్థను ఏర్పాటు చేశాడు. అల్‌ఖైదా అధినేత బిన్‌లాడెన్‌ను పెంచి పోషించినట్లు బెల్వద్జీని కూడా అమెరికా పెంచి పోషించింది. అతడు గడాఫీపైనే దాడికి దిగాడు. ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై పోరాటమే తన ధ్యేమని చెప్పే అమెరికా తన వత్తాసుతో పలికే నాటోను లిబియాలో దించాడు. నాటో కూటమి బెల్వద్జీ సంస్థకు అండగా నిలిచి లిబియాలో వ్యతిరేకతను ప్రోత్సహించింది. అరబ్‌ దేశాల్లోని సిరియా, ఈజిప్టుల్లో మాదిరిగా లిబియాలో కూడా తిరుగుబాటు దారులు పురోగమించారు. అయితే గడాఫీ ఆయన కుమారుడు వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. తిరుగుబాటు దారులు ఆక్రమించుకున్న రాజధాని ట్రిపోలీని, ఇతర ప్రాంతాలను మళ్లీ తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు గడాఫీ దళం ప్రయత్నించింది. అయితే అమెరికా కనుసన్నల్లో నడిచే ఐక్యరాజ్య సమితి ట్రిపోలీని 'నో ఫ్లై జోన్‌'గా మార్చి 17న ప్రకటించింది. ఆ ప్రాంతాన్ని కాపాడే బాధ్యతను నాటో దళాల ముసుగులో ఫ్రాన్స్‌, అమెరికా, బ్రిటన్‌ కూటమిలోని సైనికులు తమకుతామే స్వీకరించారు. ట్రిపోలీని కాపాడతామని వాగ్దానం చేసిన ఈ నాటో దళాలు లిబియాలో గడాఫీ అనుకూల దళాలను తుదముట్టించే పనిలో పడ్డాయి. ఏప్రిల్‌ 20వ తేదీన గడాఫీ నివాసాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో గడాఫీ తన స్వస్థలం సిర్తేలో తలదాచుకోవాల్సి వచ్చింది. ట్రిపోలీని కాపాడతామని వచ్చిన నాటో దళాలు గడాఫీని వెంటాడి, వేటాడి హత్య చేయడం వారి దుర్మార్గానికి నిదర్శనం. గడాఫీ మరణం తర్వాత లిబియాలో శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయని, మానవహక్కులు వర్థిల్లుతాయని భావించలేం. మాజీ సోషలిస్టు దేశాలతోపాటు ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌లో అమెరికా నమ్మిన బంటైన పాకిస్తాన్‌లో ఎలాంటి పరిస్థితులున్నాయో మనం చూస్తూనే వున్నాం.

నాటో దళాలు
నాటో (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) ఏప్రిల్‌ 4, 1949లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఉంది. ప్రధానంగా అగ్రదేశాల రాజకీయ ప్రయోజనాలను కాపాడే సంస్థ ఇది. అమెరికాకు చెందిన సైనికాధికారులు నేతృత్వంలోకి నాటో వెళ్లాక వివిధ దేశాల్లో నాటో దళాల రాజకీయ జోక్యం మరీ పెరిగింది. నాటోపై ప్రపంచ దేశాలకు నమ్మకం పోయింది. నాటో దళం తొలిసారి యుగోస్లావియాలో జోక్యం చేసుకుంది. 1991-95 మధ్యకాలంలో నాటో బోస్నియాలో సైనిక చర్యను చేపట్టింది. 1999లో యుగోస్లావియాలోనూ జోక్యం చేసుకుంది. 9/11 నాడు తమ దేశంపై జరిగిన దాడులను 19 నాటో సభ్య దేశాలపై జరిగిన దాడిగా గుర్తించాలని అమెరికా తీర్మానం చేయించింది. 9/11ను సాకుగా చేసుకున్న అమెరికా తన శత్రు దేశాలపై దాడులకు నాటోను పావుగా ఉపయోగించుకోనారంభించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకొని తాలిబన్లను మట్టికరిపించి అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవరకూ నాటో దళం ఆ దేశంలో తిష్టవేసింది. ఇరాక్‌లోని చమురు సంపదపై కన్నేసిన అమెరికా సద్దాం హుస్సేన్‌ను క్రూరంగా చంపి ఆ దేశంలోనే తమ నమ్మిన బంటును నియమించుకుంది. ఇప్పుడు లిబియాలోనూ తిరుగుబాటు దళాలకు మద్దతుగా ఆ దేశ రాజధాని ట్రిపోలీని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించి ఆ నగరాన్ని కాపాడేందుకు మాత్రమే అక్కడికి వెళ్తున్నట్లు చెప్పింది. కానీ గడాఫీని హత్యచేసి తిరుగుబాటు దళాలు చంపినట్లు అబద్ధాలు ఆడింది. అమెరికా నేతృత్వంలో ఏ దేశంలోనైనా అక్రమంగా ప్రవేశించి అక్కడి అమాయక ప్రజలను దారుణంగా చంపడమే పనిగా నాటో దళాలు పెట్టుకున్నాయి. ఇది అంతర్జాతీయ ఉగ్రవాది అమెరికాకు నమ్మినబంటుగా వ్యవహరిస్తూ ఇతర దేశాల విశ్వాసాన్ని కోల్పోయాయి. నాటోలో ఏప్రిల్‌ 2009న కొత్తగా అల్బేనియా, క్రొయేషియా చేరాయి. డిసెంబర్‌ 16, 2002లో కుదిరిన బెర్లిన్‌ ప్లస్‌ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఎక్కడైనా సంక్షోభం తలెత్తితే స్వతంత్య్రంగా జోక్యం చేసుకునే హక్కు నాటోకు ఉంది. ఈ ఒప్పందం నాటో, యూరోపియన్‌ దేశాల మధ్య కుదిరింది. నాటో 28 దేశాల కూటమి అయినా అందులో అమెరికా 43 శాతం, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీలు 15 శాతం చొప్పున సైనిక శక్తి కలిగి ఉన్నాయి.

యువతలో అసంతృప్తి
లిబియాను గడాఫీ అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలబెట్టి అందరి మన్ననలు పొందాడు. అయితే ఇటీవల యువతరం ఆయనపై అసంతృప్తిని పెంచుకుంది. లిబియాలో కీలకమైన విభాగాల్లో విదేశీ ఉద్యోగస్తులే ఉన్నారు. ఎంత ఉన్నత విద్యను అభ్యసించినా ఉద్యోగం దొరకడం కష్టమైంది. దీంతో కొత్త తరం ప్రజల్లో నిరుద్యోగిత పెరిగింది. లిబియన్‌ యువకుల్లో చాలా మంది తమ కారును ట్యాక్సీగా మార్చి జీవించాల్సి వచ్చింది. ఉన్నత చదువులు చదివిన తమకు ఉద్యోగాలు లభించడం లేదన్న అసంతృప్తి వాళ్లలో పెరిగింది. యువతలోని ఈ బలహీనతను బెల్వద్జీ నేతృత్వంలోని లిబియా ఇస్లామిక్‌ ఫైటింగ్‌ గ్రూప్‌ (ఎల్‌ఐఎఫ్‌జి) సొమ్ముచేసుకుంది. యువతలో మతోన్మాదాన్ని నింపి గడాఫీకి వ్యతిరేకంగా ఉసిగొల్పింది. వాళ్లకు అమెరికా వెన్నుదన్నుగా నిలిచింది.
ఇక కుక్కలు చింపిన విస్తరే...
అమెరికా విష కౌగిలిలో లిబియా ఇక కుక్కలు చింపిన విస్తరిగా మారనుంది. నేషనల్‌ ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌ (ఎన్‌టిసి) పేరుతో ఆ దేశంలో అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆఫ్రికాలోనే అత్యంత ధనిక దేశంగా ఓ వెలుగు వెలుగుతున్న లిబియా ప్రధాన వనరు చమురు. ఈ చమురును అమెరికా, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌లు ఎగరేసుకుపోవడం మాత్రం ఖాయం. 99.9 శాతం విద్యావంతులు గల ఆ దేశ ప్రజలు తమ దేశంలోనే పరాయివాళ్లుగా బతకాల్సి వస్తుంది. ప్రజలందరికీ అన్నీ ఉచితం పేరిట ఒక విధమైన సోషలిజం పరిఢవిల్లుతున్న లిబియాలో అమెరికా మెల్లగా తన పెట్టుబడిదారీ విధానాన్ని చొప్పించడానికి వెనకాడదు. లిబియాను కూడా తన మార్కెట్‌గా మార్చుకొని అక్కడి సహజవనరులను కొల్లగొట్టుకొని పోయేందుకు రంగం సిద్ధం చేసుకుంది. గడాఫీ బతికుండగానే ఇంగ్లండ్‌ ప్రధాని కామెరూన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు సర్కోజీ లిబియాకు వెళ్లి తమ కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలపై ఒక ఒప్పందానికి వచ్చారు. లిబియాపై వచ్చే ఆదాయం అగ్ర రాజ్యాల మధ్య స్నేహాన్ని పెంచుతుందా లేక వారి మధ్య వైరుధ్యాలను మరింత పెంచుతుందా అనేది చూడాలి.

*Article from prajasakti Daily written by Md.Hassan Sharif. visit www.prajasakti.com