Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Sunday, November 6, 2011

మరో గ్లో'బలి'

మొన్న ఇరాక్‌... నిన్న ఆఫ్ఘనిస్తాన్‌... నేడు లిబియా... ప్రపంచ రక్షకుడిగా చెప్పుకుంటున్న అమెరికా తాజాగా లిబియాను భక్షించింది. ప్రపంచ పోలీసు అవతారమెత్తి తనకు ఎదురు తిరిగే దేశం పాలిట విలన్‌గా మారడం అమెరికా ఆనవాయితీ. ఆ ఆనవాయితీని నిజం చేస్తూ 42 ఏళ్లుగా తన కంట్లో నలుసుగా ఉన్న లిబియా అధినేత కల్నల్‌ గడాఫీని పాశవికంగా వెంటాడి, వేటాడి హత్య చేసింది. గ్లోబలీకరణ... ప్రపంచీకరణ పేరుతో మరో గ్లో'బలి'కి పాల్పడింది. లిబియాలో ఉన్న అపార చమురు సంపదపై కన్నేసిన అమెరికా దాని మిత్ర పక్షాలు ఆ దేశాన్ని కబళించాయి. అంతటితో ఊరుకోకుండా ఆ దేశాన్ని ఎప్పటికీ తన చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు అధ్యక్షుడు గడాఫీని బలి తీసుకుంది.
తమ దేశంలోని ఆర్థిక మాంద్యం, నిరుద్యోగాన్ని పరిష్కరించలేని అమెరికా ప్రపంచంలోని ఇతర దేశాల సమస్యలను పరిష్కరిస్తానని బయలుదేరింది. మానవ హక్కులను కాపాడతాననే నెపంతో తనకు కంటగింపుగా ఉన్న దేశాలపైకి బాంబుల వర్షం కురిపిస్తూ లక్షలాది మందిని బలి తీసుకుంటోంది. అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించిన లిబియా అధ్యక్షుడిగా గడాఫీని నాటో దళాల ముసుగులో అదును చూసి చంపేసింది. అంతటితో ఊరుకోకుండా ప్రపంచంలోనే అతి నాణ్యమైన చమురు సంపదను కొల్లగొట్టడానికి రంగం సిద్ధం చేసింది. 42 ఏళ్లుగా చెప్పుకోదగ్గ జీవన ప్రమాణాలతో విలసిల్లుతున్న లిబియన్లను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ప్రణాళిక రచించింది. 27 ఏళ్లకే అధికారం చేపట్టి 42 ఏళ్లు అప్రతిహతంగా పరిపాలించిన గడాఫీ లిబియాను ఆఫ్రికాలోనే అత్యంత ధనిక దేశంగా నిలిపాడు. 1969లో రక్తపాత రహిత తిరుగుబాటుతో ఈ పోలీసు అధికారి లిబియా గద్దెనెక్కాడు. యునెస్కో లెక్కల ప్రకారమే లిబియాలో అక్షరాస్యత శాతం 83. యువకుల్లో 99.9 శాతం మంది అక్షరాస్యులు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యుహెచ్‌ఓ) లెక్కల ప్రకారం వైద్య సేవలందించడంలో ఆఫ్రికాలోనే లిబియా అగ్రస్థానంలో ఉంది.
ఇటలీ వలస రాజ్యంగా...
వేలాది సంవత్సరాల క్రితం లిబియాలోని 90 శాతం భూమి సహారా ఎడారితోనే నిండి ఉంది. భౌగోళిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 8000 బిసి నుండే ఇక్కడ జనజీవనం కొనసాగింది. ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. ఎడారిలో అక్కడక్కడ పారే చిన్న వాగులు, కాలువలను ఆధారం చేసుకొని లిబియన్లు వ్యవసాయం కొనసాగించేవారు. రాళ్లపై పెయింటింగ్‌కు అక్కడి పర్వతాలు చారిత్రక నిదర్శనంగా నిలిచాయి. 1000 బిసిలో ఫెజాన్‌ ప్రజలను గిరిజనులుగా పరిగణించేవారు. 500 బిసి నుండి 500 ఎడి మధ్య కాలంలో స్థానిక పాలనలో ఉంది. తూర్పు ప్రాంత ప్రజలు, సహారా ప్రాంతంలో స్థిరపడిన ప్రజలు రావడంతో లిబియా నాగరికతను సంతరించుకుంది. ఫియోనిసియన్లు లిబియన్లతో తొలుత వ్యాపార లావాదేవీలు నిర్వహించారు.
లిబియా తీర ప్రాంతమైన ఓయె, లిబ్‌దాV్‌ా, సబ్రతా నగరాలు కలిసి ప్రస్తుత ట్రిపోలీ (మూడు నగరాలు)గా రూపాంతరం చెందింది. ఇటలీ ఆక్రమించుకున్న తర్వాత 1912 - 27 మధ్యకాలంలో లిబియాను ఇటాలియన్‌ ఉత్తర ఆఫ్రికాగా పిలిచారు. 1927-34 మధ్యకాలంలో ఇటాలియన్‌ సైరేనైకా, ఇటాలియన్‌ ట్రిపోలిటానియా అనే రెండు ప్రాంతాలుగా విభజించబడింది. ఈ రెండు ప్రాంతాలు ఇటలీ ప్రభుత్వ పాలనలో ఉండేవి. ఆ కాలంలో లక్షా 50 వేల మంది ఇటాలియన్లు (లిబియా జనాభాలో 20 శాతం) ఇక్కడ స్థిరపడ్డారు. సైరేనైకా, ట్రిపోలిటానియా, ఫెజాన్‌ అనే మూడు ప్రాంతాలను కలిపి లిబియాగా 1934లో ఇటలీ స్థిరీకరించింది. లిబియా రెండు ప్రపంచ యుద్ధాల సమయాల్లోనూ ఇటలీ ఆధీనంలోనే ఉంది. 1943-51 మధ్యకాలంలో ట్రిపోలిటానియా, సైరేనైకాలు బ్రిటిష్‌ పాలనలో ఉన్నాయి. ఫెజాన్‌ను ఫ్రాన్స్‌ ఆధీనంలో ఉంచుకున్నది.
951లో స్వాతంత్య్రం
లిబియాకు జనవరి1, 1952లోపు స్వాతంత్య్రం ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి నవంబర్‌ 21, 1949లో తీర్మానం చేసింది. దానికి అనుగుణంగానే డిసెంబర్‌ 24, 1951లో లిబియాకు స్వాతంత్య్రం వచ్చింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ లిబియాకు రాజుగా ఇద్రిస్‌ నియమితులయ్యాడు. లిబియా రాజ్యాంగం ప్రకారం రాజు ఇద్రిస్‌ పాలనలో లిబియా నేషనల్‌ అసెంబ్లీతో పాటు ఒక అధ్యక్షుడు (మహ్మద్‌ అబ్దులాస్‌ ఎల్‌ ఆలెమ్‌), ఇద్దరు ఉపాధ్యక్షులు (ఒమర్‌ ఫేక్‌ షెనిబ్‌, అబూబకర్‌ అహ్మద్‌ అబూబకర్‌) నియమితులయ్యారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి లిబియా ఉత్తర ఆఫ్రికాలో నిరుపేద గిరిజన దేశంగానే ఉండేది. ఇది ఆఫ్రికాలో నాలుగో పెద్ద దేశం, ప్రపంచంలో 17వ పెద్ద దేశం. సాంప్రదాయకంగా లిబియా ట్రిపోలిటానియా, ఫెజాన్‌, సైరేనైకా అనే మూడు ప్రాంతాలు కలిగి ఉంది. 1951లో స్వాతంత్య్రం పొంది యునైటెడ్‌ లిబియన్‌ కింగ్‌డమ్‌గా అవతరించింది. 1959లో చమురు నిక్షేపాలు బయటపడిన తర్వాత లిబియా శుద్ధమైన చమురు నిక్షేపాలు గల పదవ అతిపెద్ద దేశంగా, పెట్రోలియం నిక్షేపాలు గల 17వ అతిపెద్ద దేశంగా ఘనతకెక్కింది. 1963లో దానిపేరును కింగ్‌డమ్‌ ఆఫ్‌ లిబియాగా మార్చారు. 1969లో జరిగిన రక్తపాత రహిత విప్లవంలో కల్నల్‌ గడాఫీ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. తర్వాత దేశం పేరును లిబియన్‌ అరబ్‌ రిపబ్లిక్‌ (అల్‌-జమూరియా అల్‌ అరబియా అల్‌-లిబియా)గా మార్చాడు. గడాఫీ కొన్ని సోషలిస్టు విధానాలను అవలంభించడంతో ఆ దేశాన్ని 1977-86 మధ్య కాలంలో 'సోషలిస్ట్‌ పీపుల్స్‌ లిబియన్‌ అరబ్‌ జమాహిరియా' అని, 1986-2011 మధ్య కాలంలో 'గ్రేట్‌ సోషలిస్ట్‌ పీపుల్స్‌ లిబియన్‌ అరబ్‌ జమాహిరియా' అని పిలిచారు. ఇప్పుడు కొత్తగా అధికారం చేపట్టిన నేషనల్‌ ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌ (ఎన్‌టిపి) 'లిబియన్‌ రిపబ్లిక్‌' అని మార్చారు.
దేశం : లిబియా
రాజధాని : ట్రిపోలి
అధికారిక భాష : అరబిక్‌
స్వాతంత్య్రం పొందింది : ఫిబ్రవరి 10, 1947 (ఇటలీ నుండి ఐక్యరాజ్య సమితి ట్రస్టీషిప్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ @ ఫ్రాన్స్‌ల ఆధీనంలోకి మారింది)
డిసెంబర్‌ 24 1951 (యునైటెడ్‌ కింగ్‌డమ్‌ & ఫ్రాన్స్‌ ఆధీనం నుండి కూడా స్వాతంత్య్రం పొందింది)
జనాభా : 66 లక్షలు
విస్తీర్ణం : 17,59,541 చదరపు కిలోమీటర్లు
ప్రధాన ఆదాయ వనరు : చమురు
కరెన్సీ : దీనార్‌
రాష్ట్రాలు : ట్రిపోలిటానియా, బర్కా, ఫెజాన్‌
ప్రధాన నది : మన్మేడ్‌ నది (సహారా ఎడారిలో)



గడాఫీ పాలన...
1959లో చమురు నిక్షేపాల వెలికితీతతో అతిపేద గిరిజన దేశం అకస్మాత్తుగా ఆఫ్రికాలోనే అత్యంత ధనిక దేశంగా అవతరించింది. చమురు విక్రయంతో ప్రభుత్వ ఆదాయం భారీ స్థాయిలో పెరిగింది. ప్రభుత్వ ఆదాయం పెరగడంతో ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు ఇద్రిస్‌ భోగభాగ్యాల్లో మునిగిపోయాడు. ప్రజా సంపదను సొంతానికి వాడుకుంటూ ప్రజల పేదరికాన్ని పట్టించుకోలేదు. పాలన స్థంభించింది. లిబియాలో ఇంజనీరింగ్‌ ప్రాజెక్టులను, ఆ దేశానికి ఆయుధాలను బ్రిటన్‌ ఎక్కువగా సరఫరా చేసింది. అమెరికా కూడా లిబియాలో అతిపెద్ద ఎయిర్‌బేస్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా, బ్రిటన్‌ దోపిడీలు పెరగడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. సెప్టెంబర్‌ 1, 1969లో 27 ఏళ్ల యువ మౌమ్మర్‌ గడాఫీ నేతృత్వంలో చిన్న మిలిటరీ అధికారుల గ్రూపు తిరుగుబాటు చేసింది. గడాఫీని ''సోదర నాయకుడు, తిరుగుబాటుకు మార్గదర్శకుడు''గా పేర్కొన్నారు. రాజు ఇద్రిస్‌ ప్రతిఘటించకుండానే పాలనాధికారాలను గడాఫీ బృందానికి అప్పగించాడు. గడాఫీ పాలనా పగ్గాలు చేపట్టగానే దేశంలో మార్పులు చేపట్టాడు. రేడియో, టెలివిజన్‌లను ప్రభుత్వ ఆధీనం చేశాడు. ప్రధానంగా కంపెనీలను, విద్యావ్యవస్థలను ప్రభుత్వపరం చేశాడు. చమురును జాతీయం చేశాడు. 1977లో లిబియాను 'సోషలిస్టు పీపుల్స్‌ లిబియన్‌ అరబ్‌ జమాహిరియా'గా ప్రకటించాడు. దేశంలో గల 66 లక్షల మందికి ఉచిత విద్య, వైద్యంతో పాటు నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించాడు. చదువుపై ఆసక్తి ఉండాలే కాని లిబియాలో ప్రోత్సాహానికి కరువులేదు. విదేశాల్లో చదవాలనుకునే వారందరికీ అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. అయితే తాము సంపాదించిన జ్ఞానాన్నంతా మళ్లీ దేశాభివృద్ధికే వెచ్చించాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తారు. లిబియన్లు ఆస్పత్రి మెట్లు ఎక్కిననాటి నుండి ఇంటికి వెళ్లే వరకూ చిల్లి గవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంతటి అనారోగ్యమైనా ప్రభుత్వమే భరిస్తుంది. విదేశాల నుండి మందులు, వైద్యులను తెప్పించి మరీ సేవలు అందిస్తుంది. కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. అవసరార్థం డబ్బులు కావాల్సి వస్తే లిబియా బ్యాంకులు వడ్డీ లేని రుణాలు అందిస్తాయి. యువతీ యువకులు పెళ్లి చేసుకుంటే 50 వేల డాలర్లు బహుమతిగా ఇస్తుంది. ఇల్లు కొనుక్కుని స్థిరపడేందుకు ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. వ్యవసాయం చేయాలనుకునే వారికి భూమి, అవసరమైన పనిముట్లు, విత్తనాలు సమకూర్చి అండగా నిలుస్తుంది. కారు కొనుక్కువాలనుకునే వారికి సగం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. భారత్‌ నుండే కాదు అగ్రరాజ్యాలుగా చెలామణి అవుతున్న అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాల ప్రజలు కూడా ఉద్యోగాల కోసం పొట్ట చేతబట్టుకొని ఇతర దేశాలకు వలస వెళ్తారు. కానీ ఒక్క లిబియా పౌరుడు కూడా ఇతర దేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లిన సందర్భం లేదు. పైపెచ్చు ఇతర దేశస్తులను ఉద్యోగం కోసం ఆ దేశానికే వలస వెళ్తారు. ఇదీ లిబియా ప్రత్యేకత. ఆఫ్రికా దేశాల్లో లిబియా ఒక స్విట్జర్లాండ్‌ వంటిదని ఇటలీ జర్నలిస్టు వైవోన్‌ పేర్కొన్నారు.
లిబియాను 'ధనిక మధ్య తరగతి ఆదాయం' గల దేశంగా ప్రపంచ బ్యాంకు కూడా కొనియాడింది. అప్పులేని దేశం లిబియా. 1980 వచ్చే సరికి ధనిక దేశాల సరసన నిలిచింది. ఇటలీ, సింగపూర్‌, దక్షిణ కొరియా, స్పెయిన్‌, న్యూజిలాండ్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే లిబియాలోనే జిడిపి వృద్ధిరేటు ఎక్కువగా ఉంది. లిబియన్లను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత గడాఫీకే దక్కింది.
మరి వ్యతిరేకత ఎందుకు..?
లిబియాలో తన కీలుబొమ్మ రాజు ఇద్రిస్‌ను తొలగించి గడాఫీ అధికారం చేపట్టగానే అమెరికాకు వ్యతిరేకమైన చర్యలు చేపట్టాడు. అధికార పగ్గాలు చేపట్టగానే అమెరికన్‌, బ్రిటన్‌ సైనిక స్థావరాలను తొలగించాడు. అంతర్జాతీయ వేదికలపై అమెరికా పెత్తనాన్ని సవాలు చేశాడు. చమురు సంపద విలువను తెలియజెప్పి దీన్ని ఇతర దేశాలు కొల్లగొట్టుకోకుండా కాపాడాల్సిన బాధ్యత తమదేనని లిబియన్లలో నింపాడు. అలీనోద్యమంలో ముఖ్య పాత్రధారిగా ఉంటూ ఆఫ్రికా దేశాల ఐక్యత కోసం పరితపించాడు. సోవియట్‌ రష్యా నేతృత్వంలోని సోషలిస్టు కూటమితో సన్నిహితంగా ఉంటూ సామ్రాజ్యవాదాన్ని సవాల్‌ చేశాడు. తమ భూభాగం కోసం పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు అండగా నిలిచాడు. ఇజ్రాయిల్‌ జాత్యాహంకారాన్ని నిర్ద్వందంగా ఖండించాడు. ఇజ్రాయిల్‌ దాడులకు బలవుతున్న లెబనాన్‌కు మద్దతుగా నిలిచాడు. అంతేకాదు ఇజ్రాయిల్‌తో ఈజిప్ట్‌ అధ్యక్షుడు అన్వర్‌ సాదత్‌ శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల ఆగ్రహించి ఆ దేశంపై శతఘ్నులు, ఫిరంగులతో దాడులు చేశాడు.
ఈ చర్యలే అమెరికాకు కంటగింపుగా మారాయి. 80వ దశకంలో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌, ఇంగ్లండ్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌లు తమ అభివృద్ధి నిరోధక ప్రయత్నాలకు అడ్డుగా నిలిచిన లిబియాతో ఘర్షణ వైఖరి అవలంబించాయి. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ అమెరికా చేసిన పనిని లిబియాపైకి నెట్టింది. యూరప్‌లో ఒక హోటల్‌పై దాడి, అమెరికా విమానం కూల్చివేత వంటి ఆరోపణలు గడాఫీపై మోపి అతడిపై క్రిమినల్‌గా ముద్ర వేయడానికి ప్రయత్నించాయి. 1986లోనే లిబియాపై, గడాఫీ నివాసంపై అమెరికా వైమానిక దాడులు చేసి ఆయన పెంపుడు కూతుర్ని చంపేసింది. గడాఫీపై ఎన్నో హత్యాయత్నాలు జరిగాయి. గడాఫీ లిబియాలో ఎన్నికలు జరపలేదని, అక్కడ ప్రజాస్వామ్యం లేదని, మానవ హక్కులు మృగ్యమని అమెరికా ప్రచారం చేసింది. కార్పొరేట్‌ మీడియా దానికి వంతపాడింది.
సోవియట్‌ పతనంతో గడాఫీ వైఖరిలో మార్పు
సోవియట్‌ యూనియన్‌ పతనంతో గడాఫీ వైఖరిలో మార్పు వచ్చింది. విమానం పేల్చివేతకు కారకుడైనట్లు ఆరోపిస్తున్న వ్యక్తిని అమెరికాకు అప్పగించాడు. ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌లను కబ్జా చేసుకున్న తర్వాత ఇరాన్‌, లిబియాలపై అమెరికా దాడిచేస్తుందని ఎప్పుడో స్పష్టమైంది. అయితే గడాఫీ దౌత్య నీతితో ఇంతకాలం నెట్టుకొచ్చాడు. 9/11 నిందితులలో ఒకడైన అబ్దెలఖిమ్‌ బెల్వద్జీని మలేసియాలో 2003లో పట్టుకున్న అమెరికాకు చెందిన సిఐఎ మరుసటి ఏడాది లిబియాకు అప్పగించింది. అతడ్ని కొంతకాలం జైల్లో ఉంచిన గడాఫీ తర్వాత ఉదారవాద దృష్టితో విడుదల చేశాడు. అయితే బెల్వద్జీ అప్పటికే సిఐఎ ఏజెంటుగా మారినట్లుంది. లిబియా ఇస్లామిక్‌ ఫైటింగ్‌ గ్రూప్‌ (ఎల్‌ఐఎఫ్‌జి) పేరుతో ఒక ఛాందస వాద సంస్థను ఏర్పాటు చేశాడు. అల్‌ఖైదా అధినేత బిన్‌లాడెన్‌ను పెంచి పోషించినట్లు బెల్వద్జీని కూడా అమెరికా పెంచి పోషించింది. అతడు గడాఫీపైనే దాడికి దిగాడు. ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై పోరాటమే తన ధ్యేమని చెప్పే అమెరికా తన వత్తాసుతో పలికే నాటోను లిబియాలో దించాడు. నాటో కూటమి బెల్వద్జీ సంస్థకు అండగా నిలిచి లిబియాలో వ్యతిరేకతను ప్రోత్సహించింది. అరబ్‌ దేశాల్లోని సిరియా, ఈజిప్టుల్లో మాదిరిగా లిబియాలో కూడా తిరుగుబాటు దారులు పురోగమించారు. అయితే గడాఫీ ఆయన కుమారుడు వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. తిరుగుబాటు దారులు ఆక్రమించుకున్న రాజధాని ట్రిపోలీని, ఇతర ప్రాంతాలను మళ్లీ తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు గడాఫీ దళం ప్రయత్నించింది. అయితే అమెరికా కనుసన్నల్లో నడిచే ఐక్యరాజ్య సమితి ట్రిపోలీని 'నో ఫ్లై జోన్‌'గా మార్చి 17న ప్రకటించింది. ఆ ప్రాంతాన్ని కాపాడే బాధ్యతను నాటో దళాల ముసుగులో ఫ్రాన్స్‌, అమెరికా, బ్రిటన్‌ కూటమిలోని సైనికులు తమకుతామే స్వీకరించారు. ట్రిపోలీని కాపాడతామని వాగ్దానం చేసిన ఈ నాటో దళాలు లిబియాలో గడాఫీ అనుకూల దళాలను తుదముట్టించే పనిలో పడ్డాయి. ఏప్రిల్‌ 20వ తేదీన గడాఫీ నివాసాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో గడాఫీ తన స్వస్థలం సిర్తేలో తలదాచుకోవాల్సి వచ్చింది. ట్రిపోలీని కాపాడతామని వచ్చిన నాటో దళాలు గడాఫీని వెంటాడి, వేటాడి హత్య చేయడం వారి దుర్మార్గానికి నిదర్శనం. గడాఫీ మరణం తర్వాత లిబియాలో శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయని, మానవహక్కులు వర్థిల్లుతాయని భావించలేం. మాజీ సోషలిస్టు దేశాలతోపాటు ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌లో అమెరికా నమ్మిన బంటైన పాకిస్తాన్‌లో ఎలాంటి పరిస్థితులున్నాయో మనం చూస్తూనే వున్నాం.

నాటో దళాలు
నాటో (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) ఏప్రిల్‌ 4, 1949లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఉంది. ప్రధానంగా అగ్రదేశాల రాజకీయ ప్రయోజనాలను కాపాడే సంస్థ ఇది. అమెరికాకు చెందిన సైనికాధికారులు నేతృత్వంలోకి నాటో వెళ్లాక వివిధ దేశాల్లో నాటో దళాల రాజకీయ జోక్యం మరీ పెరిగింది. నాటోపై ప్రపంచ దేశాలకు నమ్మకం పోయింది. నాటో దళం తొలిసారి యుగోస్లావియాలో జోక్యం చేసుకుంది. 1991-95 మధ్యకాలంలో నాటో బోస్నియాలో సైనిక చర్యను చేపట్టింది. 1999లో యుగోస్లావియాలోనూ జోక్యం చేసుకుంది. 9/11 నాడు తమ దేశంపై జరిగిన దాడులను 19 నాటో సభ్య దేశాలపై జరిగిన దాడిగా గుర్తించాలని అమెరికా తీర్మానం చేయించింది. 9/11ను సాకుగా చేసుకున్న అమెరికా తన శత్రు దేశాలపై దాడులకు నాటోను పావుగా ఉపయోగించుకోనారంభించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకొని తాలిబన్లను మట్టికరిపించి అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవరకూ నాటో దళం ఆ దేశంలో తిష్టవేసింది. ఇరాక్‌లోని చమురు సంపదపై కన్నేసిన అమెరికా సద్దాం హుస్సేన్‌ను క్రూరంగా చంపి ఆ దేశంలోనే తమ నమ్మిన బంటును నియమించుకుంది. ఇప్పుడు లిబియాలోనూ తిరుగుబాటు దళాలకు మద్దతుగా ఆ దేశ రాజధాని ట్రిపోలీని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించి ఆ నగరాన్ని కాపాడేందుకు మాత్రమే అక్కడికి వెళ్తున్నట్లు చెప్పింది. కానీ గడాఫీని హత్యచేసి తిరుగుబాటు దళాలు చంపినట్లు అబద్ధాలు ఆడింది. అమెరికా నేతృత్వంలో ఏ దేశంలోనైనా అక్రమంగా ప్రవేశించి అక్కడి అమాయక ప్రజలను దారుణంగా చంపడమే పనిగా నాటో దళాలు పెట్టుకున్నాయి. ఇది అంతర్జాతీయ ఉగ్రవాది అమెరికాకు నమ్మినబంటుగా వ్యవహరిస్తూ ఇతర దేశాల విశ్వాసాన్ని కోల్పోయాయి. నాటోలో ఏప్రిల్‌ 2009న కొత్తగా అల్బేనియా, క్రొయేషియా చేరాయి. డిసెంబర్‌ 16, 2002లో కుదిరిన బెర్లిన్‌ ప్లస్‌ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఎక్కడైనా సంక్షోభం తలెత్తితే స్వతంత్య్రంగా జోక్యం చేసుకునే హక్కు నాటోకు ఉంది. ఈ ఒప్పందం నాటో, యూరోపియన్‌ దేశాల మధ్య కుదిరింది. నాటో 28 దేశాల కూటమి అయినా అందులో అమెరికా 43 శాతం, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీలు 15 శాతం చొప్పున సైనిక శక్తి కలిగి ఉన్నాయి.

యువతలో అసంతృప్తి
లిబియాను గడాఫీ అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలబెట్టి అందరి మన్ననలు పొందాడు. అయితే ఇటీవల యువతరం ఆయనపై అసంతృప్తిని పెంచుకుంది. లిబియాలో కీలకమైన విభాగాల్లో విదేశీ ఉద్యోగస్తులే ఉన్నారు. ఎంత ఉన్నత విద్యను అభ్యసించినా ఉద్యోగం దొరకడం కష్టమైంది. దీంతో కొత్త తరం ప్రజల్లో నిరుద్యోగిత పెరిగింది. లిబియన్‌ యువకుల్లో చాలా మంది తమ కారును ట్యాక్సీగా మార్చి జీవించాల్సి వచ్చింది. ఉన్నత చదువులు చదివిన తమకు ఉద్యోగాలు లభించడం లేదన్న అసంతృప్తి వాళ్లలో పెరిగింది. యువతలోని ఈ బలహీనతను బెల్వద్జీ నేతృత్వంలోని లిబియా ఇస్లామిక్‌ ఫైటింగ్‌ గ్రూప్‌ (ఎల్‌ఐఎఫ్‌జి) సొమ్ముచేసుకుంది. యువతలో మతోన్మాదాన్ని నింపి గడాఫీకి వ్యతిరేకంగా ఉసిగొల్పింది. వాళ్లకు అమెరికా వెన్నుదన్నుగా నిలిచింది.
ఇక కుక్కలు చింపిన విస్తరే...
అమెరికా విష కౌగిలిలో లిబియా ఇక కుక్కలు చింపిన విస్తరిగా మారనుంది. నేషనల్‌ ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌ (ఎన్‌టిసి) పేరుతో ఆ దేశంలో అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆఫ్రికాలోనే అత్యంత ధనిక దేశంగా ఓ వెలుగు వెలుగుతున్న లిబియా ప్రధాన వనరు చమురు. ఈ చమురును అమెరికా, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌లు ఎగరేసుకుపోవడం మాత్రం ఖాయం. 99.9 శాతం విద్యావంతులు గల ఆ దేశ ప్రజలు తమ దేశంలోనే పరాయివాళ్లుగా బతకాల్సి వస్తుంది. ప్రజలందరికీ అన్నీ ఉచితం పేరిట ఒక విధమైన సోషలిజం పరిఢవిల్లుతున్న లిబియాలో అమెరికా మెల్లగా తన పెట్టుబడిదారీ విధానాన్ని చొప్పించడానికి వెనకాడదు. లిబియాను కూడా తన మార్కెట్‌గా మార్చుకొని అక్కడి సహజవనరులను కొల్లగొట్టుకొని పోయేందుకు రంగం సిద్ధం చేసుకుంది. గడాఫీ బతికుండగానే ఇంగ్లండ్‌ ప్రధాని కామెరూన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు సర్కోజీ లిబియాకు వెళ్లి తమ కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలపై ఒక ఒప్పందానికి వచ్చారు. లిబియాపై వచ్చే ఆదాయం అగ్ర రాజ్యాల మధ్య స్నేహాన్ని పెంచుతుందా లేక వారి మధ్య వైరుధ్యాలను మరింత పెంచుతుందా అనేది చూడాలి.

*Article from prajasakti Daily written by Md.Hassan Sharif. visit www.prajasakti.com


Friday, September 16, 2011

కేజీ గ్యాస్‌ - రిలయన్స్‌ లూటీ

రిలయన్స్‌ తన చిత్తం వచ్చినట్టు కేజీ బేసిన్‌లో వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ఏ ప్రాంతమయితే ఆ గ్యాసుతో పారిశ్రామికవంతం అవుతుందో ఆ కోస్తా ప్రాంతంలో సిపిఎం ప్రచారోద్యమాన్ని నిర్వహించింది. వాస్తవం ఇది కాగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ పట్టువదలని విక్రమార్కునిలా కెజి గ్యాస్‌ కోసం కృషి చేశారని కొందరు చేస్తున్న ప్రచారం అర్ధం లేనిది. ఆయన రాష్ట్రానికి కోరిన గ్యాస్‌ వాటా 10 శాతం మాత్రమే. దాన్నీ ఆయన సాధించలేకపోయారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళతానని మాటలతోనే కాలం వెళ్లబుచ్చారు. కేంద్రానికి విజ్ఞప్తులతోనే పరిమితమయ్యారు.
ఇటీవల వెల్లడయిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక మన రాష్ట్రంలోని కృష్ణా గోదావరి (కెజి) బేసిన్‌లో రిలయన్స్‌ గ్యాస్‌ కంట్రాక్టు వ్యవహారంలో చోటుచేసున్న అనేక అవకతవకలను ఎత్తిచూపింది. గత కొన్నేళ్లుగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కేంద్రంలోను, రాష్ట్రంలోను ఈ భారీ లూటీని ఎండగట్టి, చేస్తున్న ఆందోళనల సహేతుకతను ఈ నివేదిక ధ్రువీకరిస్తున్నది. సహజ వనరుల అన్వేషణ వెలికితీతలకు సంబంధించి భారత ప్రభుత్వం, పని అప్పగించబడిన ప్రైవేటు సంస్థల మధ్య ప్రాతిపదిక ఒప్పందం అయిన ఉత్పత్తి పంపిణీ కాంట్రాక్టును (పిఎస్‌సి) రిలయన్స్‌ ఉల్లంఘించిన తీరును కాగ్‌ స్పష్టం చేసింది. పెట్టుబడి వ్యయాన్ని అనుచితంగా పెంచి ఉత్పత్తిలో అత్యధిక వాటాను రిలయన్స్‌ కాజేస్తున్న వైనాన్ని వివరించింది.
భారత దేశంలో కనుగొన్న అతి పెద్ద గ్యాస్‌ నిక్షేపాలు ధీరూబారు-1, ధీరూబారు-3 క్షేత్రాలు. అంతేకాదు, ఇవి దేశంలో అతిపెద్ద చమురు అన్వేషణా క్షేత్రాలు కూడా. ఉత్పత్తి పంపిణీ కాంట్రాక్టు ప్రకారం రిలయన్స్‌ సంస్థ మొదటి దశ అన్వేషణ తర్వాత కాంట్రాక్టు ప్రాంతంలో 25 శాతాన్ని వదిలివేయాలి, రెండవదశ అన్వేషణ తర్వాత మరో 25 శాతం ప్రాంతాన్ని వదిలి వేయాలి. చమురు కనుగొన్న ప్రాంతాన్ని డిస్కవరీ ప్రాంతంగా ప్రకటిస్తారు. అంటే ఆ ప్రాంతంలో ఎంత పరిమాణంలో గ్యాస్‌ లభిస్తుంది అన్నదాన్ని బావులు తవ్వడం ద్వారా కచ్చితంగా నిర్ధారిస్తారు. డిస్కవరీ ప్రాంతంగా ప్రకటించిన దాన్ని కాంట్రాక్టుదారు తన ఆధీనంలో ఉంచుకుంటాడు. మిగతా కాంట్రాక్టు ప్రాంతంలో 25 శాతాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. అలా ప్రభుత్వం తిరిగి తీసుకున్న దానిని ఆసక్తికలిగిన ఇతర పార్టీలకు కాంట్రాక్టుకు ఇస్తుంది. కాని ఇక్కడ రిలయన్స్‌ సంస్థ మొదటి దశ అన్వేషణ ముగిసిన తర్వాత 25 శాతం మిగతా ప్రాంతాన్ని అప్పగించకుండానే రెండవ దశ అన్వేషణకు పూనుకుంది. ఆ తర్వాత 2009లో మొత్తంగా 765 చదరపు కిలోమీటర్ల కాంట్రాక్టు ప్రాంతాన్ని డిస్కవరీ ప్రాంతంగా ప్రకటించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ విధంగా దేశంలోనే అతిపెద్ద గ్యాస్‌, చమురు నిక్షేపాలున్న ప్రాంతాన్ని రిలయన్స్‌ సంస్థ గుత్తాధిపత్యానికి ప్రభుత్వం కట్టబెట్టింది. మొదటి దశలో రిలయన్స్‌ తన కంట్రాక్టు ప్రాంతంలో కేవలం వాయవ్య ప్రాంతంలో మాత్రమే అన్వేషణ జరిపి, రెండవదశకు సాగిపోయింది. బావులు తవ్వి కచ్చితంగా డిస్కవరీని నిర్ధారించడానికి బదులు, భూప్రకంపనల అధ్యయనం ఆధారంగా నిక్షేపాలగురించి రిలయన్స్‌ పేర్కొన్న అంచనాలను ఆమోదించి ప్రభుత్వం మొత్తం కాంట్రాక్టు ఏరియాను డిస్కవరీ ఏరియాగా ప్రకటించింది.
ఈ విధంగా మొత్తం కాంట్రాక్టు ఏరియాను డిస్కవరీ ఏరియాగా ప్రకటించడాన్ని సమీక్షించమని చమురు, సహజవాయువు మంత్రిత్వశాఖను కాగ్‌ ఆదేశించింది. మొదటి దశ రెండవ దశ అన్వేషణ తర్వాత తిరిగి అప్పగించాల్సిన 25 శాతం ప్రాంతాన్ని కూడ నిర్ధారించమని కోరింది. మొదటి దశలో కాని, రెండవ దశలో కాని నిర్దేశిత ప్రాంతంలో, నిర్దేశిత కాలవ్యవధిలో కనుగొన్న నిక్షేపాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, కాలపరిమితి తర్వాత ఆ ప్రాంతంలో తవ్వి కనుగొన్న క్షేత్రాలను కచ్చితంగా మినహాయించాలని కూడ చెప్పింది. ఈ నిబంధనలను కఠినంగా అమలుచేయాలని, ఎట్టిపరిస్థితిలోను మినహాయింపులు ఇవ్వకూడదని, డిస్కవరీ తర్వాత మిగిలిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని మరొకరికి కాంట్రాక్టుకు ఇవ్వడం ద్వారా ఇంధన వనరుల అన్వేషణ సంపూర్ణంగా జరుగుతుందని చెప్పింది.
కాగ్‌ నివేదిక ఎత్తిచూపిన మరొక ప్రధాన అంశం పెట్టుబడి వ్యయం అంచనాలను భారీగా పెంచడం గురించి. మొదటి దశలో కనుగొన్న వనరులను అభివృద్ధి చేయడానికి 240 కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని రిలయన్స్‌ 2004లో చూపించింది. కానీ ఆ తర్వాత 2006లో అనుబంధ అంచనాలో మొదటి దశకు 520 కోట్ల డాలర్లు, రెండవ దశకు 360 కోట్ల డాలర్లు అవుతుందని చూపించింది. అనుబంధ అంచనాను ప్రభుత్వానికి సమర్పించి ఆమోదింపచేసుకోవడానికి ముందే దాని ప్రకారం అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టారు. డి-1, డి-3 క్షేత్రాలను సకాలంలో అభివృద్ధి చేయడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆమోదం లభిస్తుందన్న ఉద్దేశంతో ఇలా చేశామని కాంట్రాక్టరు చెబుతున్నప్పటికీ, ప్రభుత్వ ఆమోదం దానంతటదే వస్తుందన్న ధీమాతో ఇలా చేస్తుంటారని కాగ్‌ పేర్కొంది.
ఇలా పెట్టుబడి వ్యయ అంచనాను పెంచడం వల్ల ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుంది. ఉత్పత్తి పంపిణీ ఒప్పందం ప్రకారం ఒక ఏడాదిలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ, అన్వేషణా వ్యయం, అభివృద్ధికి అయిన వ్యయం కలుపుకొని ఆ ఏడాది ఉత్పత్తి అయిన దానిలో 'కాస్ట్‌ పెట్రోలియం'ను నిర్ణయిస్తారు. దానికోసం ఆ ఏడాది అయిన ఉత్పత్తిలో 90 శాతం వరకు మినహాయిస్తారు. మిగతాదాన్ని 'ప్రాఫిట్‌ పెట్రోలియం'గా గుర్తిస్తారు. ఈ ప్రాఫిట్‌ పెట్రోలియంలో కూడ మొత్తం పెట్టుబడిని బట్టి కాంట్రాక్టరుకు వాటా లభిస్తుంది. మిగిలినదే ప్రభుత్వానికి దక్కేది. వనరుల అభివృద్ధి వ్యయం అంచనా ఇలా పెరగడం వల్ల ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుంది. ఉత్పత్తి అధికంగా జరిగే తొలి దశలో ప్రభుత్వం వాటా నామమాత్రంగా ఉంటుంది. క్రమంగా చివరికి వాటా పెరిగినా ఉత్పత్తి తగ్గిపోతుంటుంది. అధిక వాటా ప్రభుత్వానికి లభించే సమయానికి అసలు ఆ వనరే వట్టిపోయే అవకాశం ఉంటుంది. అందుచేతనే అనేక దేశాలు పెట్టుబడి వ్యయం అంచనాల పెంపుదలపై కచ్చితమైన, నిఘాను, నియంత్రణను అమలుచేస్తున్నాయి. ఉదాహరణకు మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ పెట్టుబడి వ్యయం 5 లక్షల డాలర్లు పెరిగితే దాన్ని ప్రభుత్వ ప్రతినిధులు కూడ సగం మంది ఉండే మేనేజింగ్‌ కమిటీ ఆమోదించి తీరాలని నిబంధన విధించింది. అలాంటి పద్ధతి మనకు లేదు.
మరొక ముఖ్యమైన అంశం గ్యాస్‌ ధర. ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వలోని సాధికార కమిటీ రిలయన్స్‌ గ్యాస్‌కు ఒక ఎంఎంబిటికి 4.2 డాలర్ల ధరను నాలుగేళ్ల క్రితమే ఆమోదించింది. ఇది అంతకుముందు రిలయన్స్‌ సంస్థ ఎన్‌టిపిసికి సరఫరా చేస్తానన్న 2.34 డాలర్ల కన్నా ఎక్కువ. అంబానీ సోదరులు తమ ప్రైవేటు ఒప్పందంలో అంగీకరించుకున్న 2.25 డాలర్ల కన్నా ఎక్కువ. 4.33 డాలర్లను అనుమతించమని రిలయన్స్‌ చేసిన ప్రతిపాదనను 0.1 శాతం తగ్గించి ప్రభుత్వం ఆమోదించింది. దీని మూలంగా ఆ గ్యాస్‌ను వినియోగించే విద్యుత్‌ కేంద్రాలు, ఎరువుల ఫ్యాక్టరీలు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అంతిమంగా భరించేది ప్రజలే. గ్యాస్‌ను వెలికి తీయడానికి ఒక ఎంఎంబిటికి ఒక డాలరుకు మించి ఖర్చు అవుతుందని ప్రపంచంలో ఎక్కడా ఎవరూ చెప్పలేదని నిపుణులు ఎన్ని సార్లు మొత్తుకున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పుడు దీన్ని కాగ్‌ ప్రశ్నించినా ప్రభుత్వం నుండి మౌనమే సమాధానం.
ఆరంభంలోనే చెప్పినట్లు ఈ అన్ని అంశాల గురించి చాల కాలంగా పోరాటం చేస్తున్నది సిపిఎం పార్లమెంటు సభ్యుడు తపన్‌ సేన్‌. 2006 డిసెంబరు 21న మొదలుపెట్టి అనేక లేఖలను పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖకు రాశారు. వాటి కాపీలను ప్రధానమంత్రికి పంపించడంతోపాటు నేరుగా ఆయనకూ లేఖలు రాశారు. రాష్ట్రానికి చెందిన అప్పటి సిపిఎం పార్లమెంటు సభ్యులు పి. మధు, ఎం. బాబూరావు ప్రధానికి లేఖ రాస్తూ కెజి బేసిన్‌లో రిలయన్స్‌ వెలికితీసే గ్యాసుకు నిర్ణయించిన అహేతుకమైన ధర గురించి, అన్యాయమైన ఉత్పత్తి పంపిణీ ఒప్పందం గురించి ప్రశ్నించారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను ముందుగా మన అవసరాలకు వినియోగించాలని, ఆ తర్వాతనే బయటికి తరలించాలని కోరారు. సహజవనరులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి ఉత్పత్తిలో 50 శాతం కేటాయించాలని 12వ ఆర్థిక సంఘం చెప్పినదాన్ని అమలుచేయాలని, లేదంటే ప్రభుత్వానికి లభించే గ్యాస్‌లో అయినా 50 శాతం ఈ రాష్ట్రానికి వినియోగించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ కమిటీ 2007లోనే ఈ అంశంపై సిపిఎం ఎంపీల లేఖలు, పొలిట్‌బ్యూరో ప్రకటనలతో పాటు, పలువురు రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలతో ఒక బుక్‌లెట్‌ను ప్రచురించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ఈ బుక్‌లెట్‌ ముందుమాటలో ''సహజవాయు నిక్షేపాలు రాష్ట్రంలో లభిస్తున్నప్పటికీ వాటి అభివృద్ధి మీద, వినియోగం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు. పెత్తనమంతా కేంద్రానిదే. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత విధానాలలో భాగంగా ఇప్పుడంతా ప్రైవేటు సంస్థలదే రాజ్యంగా మారిపోయింది. ముఖ్యంగా రిలయన్స్‌ సంస్థ గుత్తాధిపత్యాన్ని సంపాదించి తన చిత్తం వచ్చినట్లు వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వమేమో నామమాత్రంగా లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నది.'' అని ఘాటుగా విమర్శించారు. అంతేకాదు, కెజి బేసిన్‌ గ్యాస్‌పై రాష్ట్రానికే హక్కు అని నినదిస్తూ ఏ ప్రాంతమయితే ఆ గ్యాసుతో పారిశ్రామికవంతం అవుతుందో ఆ కోస్తా ప్రాంతంలో సిపిఎం ప్రచారోద్యమాన్ని నిర్వహించింది. వాస్తవం ఇది కాగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పట్టువదలని విక్రమార్కునిలా కెజి బేసిన్‌ గ్యాస్‌ కోసం కృషి చేశారని కొందరు చేస్తున్న ప్రచారం అర్ధం లేనిది. ఆయన రాష్ట్రానికి కోరిన గ్యాస్‌ వాటా 10 శాతం మాత్రమే. దాన్నీ ఆయన సాధించలేకపోయారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళతానని మాటలతోనే సరిపుచ్చారు. కేంద్రానికి విజ్ఞప్తులతోనే పరిమితమయ్యారు. పైగా ఆంధ్రప్రదేశ్‌ను పెట్రోలియం, కెమికల్స్‌,పెట్రోకెమికల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ జోన్‌గా తయారుచేస్తానని ఒక వైపున గొప్పలు చెప్పుకొంటూ, తన ప్రభుత్వమే ఒప్పందం కుదుర్చుకున్న కాకినాడ ఓఎన్‌జిసి రిఫైనరీ బయటికి తరలిపోతున్నా అడ్డుకోలేకపోయారు.

**** from Prajasakti desk

Tuesday, August 23, 2011

హజారే ఉద్యమంలో కొన్ని కోణాలు

అన్నా ఉద్యమాన్ని 22 మంది సభ్యుల కోర్‌కమిటీ నడిపిస్తోంది. ఇందులో కనీసం సగం మంది సభ్యులతో అన్నాకు ముఖ పరిచయం కూడా లేదన్నది వాస్తవం. ఈ కమిటీ కింద మరో 13 ఉప కమిటీలు వివిధ అంశాలపై కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. మీడియా, సమాచార విభాగం దేశవ్యాప్తంగా రోజుకు పది లక్షల మొబైల్‌ ఫోన్లకు, 20 లక్షల ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తోంది. ఇటువంటి వాటిలో ఆరెస్సెస్‌ చొరబడుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం దేశంలో రెండో స్వాతంత్య్రోద్యమం నడుస్తోందా ? అవినీతికి వ్యతిరేకంగా ప్రజా విప్లవం పెల్లుబికిందా ?? సంఫ్‌ు పరివార్‌ దీనిని సొమ్ము చేసుకోవాలని చూస్తోందా ??? ఈ ప్రశ్నలకు ఒక్కొక్కరి వద్దా ఒక్కో సమాధానముంది. ఏ సమాధానం సరైనదన్న విషయాన్ని కాలమే త్వరలో నిర్ణయించనుంది. అవునన్నా, కాదన్నా...ఇప్పుడు దేశంలో అవినీతి అతిపెద్ద చర్చనీయాంశం అయ్యింది. పెట్రోల్‌ ధరలు తగ్గించాలని దేశ ప్రజలందరూ నినదించవచ్చు..ప్రభుత్వం ఒక్కరోజులో తగ్గించనూ వచ్చు. వేతనాలు పెంచాలని, లాకౌట్లు ఎత్తివేయాలని కార్మికులు సమ్మె చేయవచ్చు...ప్రభుత్వాలు, యాజమన్యాలు తలొగ్గవచ్చు. ఇలా అత్యధిక శాతం ప్రజలు కొన్ని 'నిర్దిష్టమైన' డిమాండ్ల ఆధారంగా (నిత్య జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలపై) ఏకమవ్వడం..ఆందోళనల్లోకి రావడం సర్వ సాధారణం. అవినీతిని అంతమొందించాలని ' దేశ ప్రజలందరూ ' వీధుల్లోకి రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించేదే ! వ్యవస్థీకృతమైన అవినీతిని అరికట్టడం, ఒకటి రెండు చట్టాలతోనే సాధ్యమౌతుందని భావించడమూ అటువంటిదే. అన్నా హజారే దీక్ష రూపంలో ప్రస్తుతం దేశవ్యాపితంగా సాగుతోన్న ఆందోళనలోనూ పైకి కనిపించని వాస్తవాలు కూడా కొన్ని ఉన్నాయి. సయోధ్యకు ఇరుపక్షాలూ సిద్ధంగానే ఉన్న నేపథ్యంలో..అన్నా బృందం, కేంద్ర ప్రభుత్వం మధ్య నేడో, రేపో ఒక ఒప్పందం కుదరవచ్చు. ఈ సయోధ్యమాటున అవినీతి వ్యతిరేక ఉద్యమంలో దాగున్న కీలకాంశాలను మరుగున పడేయడం మాత్రం సాధ్యం కాదు.
కల్లోల కాంగ్రెస్‌
ప్రస్తుతం యుపిఎ 2 ప్రభుత్వం రెండు సంవత్సరాల వయసులోనే అపారమైన అవినీతి (అప్రతిష్ట) మూటగట్టుకుందనడంలో వివాదం లేదు. హాజారే, రామ్‌దేవ్‌బాబా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక 'ఉద్యమాన్ని' ఎదుర్కోవడంలోనూ తలపండిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ పసితనాన్ని ప్రదర్శించింది. హజారేబృందాన్ని లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా తయారీ కమిటీలోకి సభ్యులుగా తీసుకోవడం - ఆపాదమస్తకమూ హజారే అవినీతిపరుడేనని విమర్శించడం....రామ్‌దేవ్‌బాబాతో విమానాశ్రయానికి వెళ్లి చర్చలు జరపడం - దీక్షలో కూర్చున్న వ్యక్తిని అర్ధరాత్రి బలవంతంగా అరెస్టు చేయడం...ఇలా గత ఏప్రిల్‌ నుండీ కాంగ్రెస్‌ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఆగస్టు 16న హజారేను ఇంటి నుండి నేరుగా తీహార్‌ జైలుకు తరలించడం వీటికి పరాకాష్ట. ఇది ప్రజాస్వామ్య హక్కులపై అధికార పార్టీ నగంగా చేసిన దాడి. లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా కమిటీలోకి కొందరు వ్యక్తులను సభ్యులుగా తీసుకోవడం కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం..నాడు కాంగ్రెస్‌కు అప్రజాస్వామికంగానూ, పార్లమెంటును అగౌరవపర్చే చర్యగానూ అనిపించకపోవడం విడ్డూరం. అప్రజాస్వామిక డిమాండ్లతో అన్నా ఆందోళన చేస్తున్నారని విమర్శించే హక్కు ఇప్పుడు కాంగ్రెస్‌కు ఉందా అన్నదే ప్రశ్న. అవినీతి వ్యతిరేక ఉద్యమాలపై, వాటికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తులపై గత ఏప్రిల్‌ నుండీ కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ సూత్రబద్ధమైన, నిలకడైన వైఖరిని ప్రదర్శించలేదు. 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీ, ఇలా ఏపూటకాపూట బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నది. ఇంత జరుగుతున్నా అవినీతి అంశంపై కనీసం ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు. 'ఆర్థిక సంస్కరణల అమలు వల్లే దేశంలో అవినీతి పెరిగిందని కొందరు అంటున్నారు. ఇది అవాస్తవం. సంస్కరణలకూ, అవినీతికీ సంబంధం లేదు. ఇంకా కొన్ని రంగాల్లో సంస్కరణల కారణంగానే, అవినీతి తగ్గింది' అంటూ ప్రధాని మన్మోహన్‌ రెండ్రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్‌ జెండాను, ఎజెండానూ చెప్పకనే చెబుతున్నాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమం నేపథ్యలో సంస్కరణలకు ఎక్కడ అగౌరవం కలుగుతుందోనన్న ఆందోళన తప్ప...ప్రధాని ప్రకటనలో మరేమీ కనబడకపోవడం యాదృచ్ఛికం కాదు.
ఆరెస్సెస్‌ చొరబాటు యత్నాలు
గత ఏప్రిల్‌లో మొదటి సారి జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన ఆందోళనకన్నా ప్రస్తుత ఆందోళన విస్తృతి పెరిగింది. హజారే దీక్షలో చొరబడి దీనిని సొమ్ము చేసుకోవాలని ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తోంది. ఈ ఉద్యమంలో తమ శ్రేణులు పూర్తి స్థాయిలో, ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేత సునీల్‌ జోషి కొద్ది రోజుల క్రితం స్వయంగా చెప్పడం, ఎబివిపి ఆధ్వర్యంలో నడిచే 'ఇండియా అగైనెస్ట్‌ కరప్షన్‌' ఈ ఉద్యమంలో చొరబడడం దీనినే సూచిస్తున్నాయి. అన్నా ఉద్యమాన్ని 22 మంది సభ్యుల కోర్‌కమిటీ నడిపిస్తోంది. ఇందులో కనీసం సగం మంది సభ్యులతో అన్నాకు ముఖ పరిచయం కూడా లేదన్నది వాస్తవం. ఈ కమిటీ కింద మరో 13 ఉప కమిటీలు వివిధ అంశాలపై కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. మీడియా, సమాచార విభాగం దేశవ్యాప్తంగా రోజుకు పది లక్షల మొబైల్‌ ఫోన్లకు, 20 లక్షల ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తోంది. ఇటువంటి వాటిలో ఆరెస్సెస్‌ చొరబడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అలా అని అన్నా ఆందోళనలో ప్రజలెవరూ స్వచ్ఛదంగా పాల్గొనడం లేదన్నది దీనర్ధం కాదు. హజారే ఉద్యమంతో ఊపందుకున్న అవినీతి వ్యతిరేక వాతావరణం నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని బిజెపి ఇంకొకవైపు నుంచి ప్రయత్నిస్తున్నది. అదలా ఉంచితే అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు, కార్పొరేట్‌ ఉద్యోగులు, యువత, మధ్యతరగతి జీవులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడం ఆహ్వనించదగ్గ పరిణామమే.
పార్లమెంటు...ప్రజాస్వామ్యం
ఈ ఉద్యమం సందర్భంగా అన్నా బృందం లేవనెత్తిన డిమాండ్లకు సంబంధించిన కొన్ని అంశాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఫలానా గడువులోగా ఫలానా చట్టాన్ని రూపొందించాలని శాసించజూడడం అన్నా బృందం పట్టుబట్టడం విమర్శలకు ఆస్కారమిచ్చింది. అదే సమయంలో ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ...పార్లమెంటు అధికారమే అత్యున్నతమైనదని భీష్మించుక్కూర్చొన్న యుపిఏ ప్రభుత్వ ధోరణి ప్రజల ఆగ్రహం పెరగడానికి కారణమవుతున్నది. 'అవినీతి' అంశానికి నిర్దిష్టత్వం లేదు కాబట్టి దేశ కార్పొరేట్‌ రంగం కూడా అన్నా ఆందోళనకు మద్దతునిస్తున్నది. అన్నా బృందం ప్రస్తావిస్తున్న జన లోక్‌పాల్‌లో ప్రభుత్వ అవినీతి గురించి తప్ప కార్పొరేట్‌ అవినీతి గురించిన ఊసే లేకపోవడం గమనార్హం. ఇప్పుడు వెల్లువెత్తిన అవినీతి కుంభకోణాలన్నీ దాదాపు ఈ కార్పొరేట్‌ రంగం ప్రమేయంతో జరిగినవేనన్న విషయం మరువరాదు. రెండో దశ సంస్కరణలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ విఫలమయ్యిందన్న అసంతృప్తితో ఉన్న కార్పొరేట్‌ గణం... కూడా హజారే ఉద్యమానికి మద్దతు నిస్తున్నదనే వార్తలను కొట్టిపారేయలేం. మధ్యతరగతి స్పందిస్తుందన్న కారణం చెప్పి, అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కార్పొరేట్‌ మీడియా కల్పిస్తోన్న ప్రాధాన్యతా శ్రుతి మించుతోందనే చెప్పాలి. ఏడాది క్రితం ఇదే రామ్‌లీలా మైదానం నుండి ఇదే జంతర్‌మంతర్‌ వరకూ లక్షలాది అంగన్‌వాడీలు ప్రదర్శనగా వస్తే...' ట్రేడ్‌యూనియన్‌ ఆందోళనలతో ఢిల్లీ వాసులుకు ట్రాఫిక్‌ ఇక్కట్లు ' అంటూ లోపలి పేజీల్లో ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక వార్తను ఇచ్చింది. అదే పత్రిక ప్రస్తుతం అన్నా ఉద్యమంపై నిత్యం 8 పేజీలకు తగ్గకుండా వార్తలిస్తోంది. 'సంస్కరణలను కొనసాగించడంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం విఫలమౌతోంది. ఈ కారణంగా దేశంలో మధ్య తరగతి ఆకాంక్షలు, అభిలాషలు తీరడం లేదు. అందువల్లే దేశ మధ్యతరగతి అన్నా ఉద్యమానికి బాసటగా నిలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించకపోతే, కాంగ్రెస్‌ పుట్టి మునిగినట్లే' అని మరో ప్రముఖ ఆంగ్ల పత్రిక సంపాదకుడు రెండ్రోజుల క్రితం వ్యాసమే రాశారు !

**Article By D.JayaPrakash From prajasakti.com 

Tuesday, August 16, 2011

అమెరికా బాటలో ఫ్రాన్స్‌

అసలే ఐరోపాలో వేసవి, దానికి తోడు రుణ సంక్షోభ వేడిగాలులు పాలకపార్టీలకు మరింతగా చెమటలు పట్టిస్తున్నాయి. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా పరపతి పోయింది. తరువాత వంతు ఏ దేశానిది అవుతుందన్నది మదుపర్లలో ప్రశ్నార్థకంగా మారిన సమయంలో న్యూయార్క్‌, వాషింగ్టన్‌, నుంచి రుణ సంక్షోభం పారిస్‌ నగరానికి పాకింది. ఏ క్షణంలో అయినా దాని పరపతీ పతనం కానున్నదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సంక్షోభంలో ఉన్న ఐరోపాను ఆదుకొనేందుకు తాత్కాలిక సర్దుబాటు నిధి సమకూర్చే దేశాలలో జర్మనీ తరువాత స్థానంలో ఉంది ఫ్రాన్స్‌. అలాంటి దేశంలో పడిపోతున్న స్టాక్‌మార్కెట్‌ను నిలబెట్టేందుకు అధ్యక్షుడు సర్కోజీ పక్షం రోజుల ముందుగానే వేసవి విడిది నుంచి ఆగమేఘాల మీద పారిస్‌ చేరుకున్నాడు. లండన్‌ తగలడిపోవటం కూడా నిస్సందేహంగా సర్కోజీని కలవర పరిచి ఉంటుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తన తాజా నివేదికలో ఫ్రెంచి ఆర్థిక వ్యవస్థ పురోగమనం గురించి భరోసా ఇచ్చింది. రానున్న రెండు సంవత్సరాలలో తన ఆర్థిక వనరులను అది మరింతగా స్థిరపరుచుకుంటుందని చెప్పింది. ఇదొక ఎత్తయితే అమెరికా పరపతిని తగ్గించిన స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ సంస్థతో పాటు మరో రెండు ప్రముఖ సంస్థలు ఫ్రెంచి సర్కార్‌ బాండ్లు కొనటం సురక్షితమని చేసిన ప్రకటనల నేపథ్యంలో ఫ్రెంచి బాండ్ల ధరలు పెరిగాయి. అయితే ఉరుములేని పిడుగులా శుక్రవారం నాడు ఫ్రెంచి ప్రభుత్వ పది సంవత్సరాల బాండ్లపై రాబడి మూడు శాతం పడిపోయింది. ఈ పరిణామం జరిగిన కొద్ది సేపటికే ఏప్రిల్‌-జూన్‌ మధ్య ఫ్రెంచి ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పురోగతి లేక స్తంభించి పోయిందని, సర్కోజీ సర్కార్‌ చెబుతున్నట్లు ఏడాది కాలంలో రెండు శాతం కాదు 0.3శాతం మాత్రమే పెరుగుదల రేటు ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనాలను ప్రకటించారు. పులి మీద పుట్రలా తొలి మూడు మాసాలతో పోల్చితే వినియోగం రెండవ త్రైమాసికంలో 0.7శాతం పడిపోయిందని గణాంకాలు వెల్లడించాయి. అటు సూర్యుడు ఇటు పొడిచినా ఈ ఏటి లోటు బడ్జెట్‌ను 7.1 నుంచి 5.7శాతానికి, వచ్చే ఏడు 4.6శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యంలో ఎలాంటి మార్పులు లేవని అందుకు గాను బడ్జెట్‌ కోతలను విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెల్లవారే సరికి పరిష్కరించటానికి మంత్ర దండం లేదని కొన్ని పత్రికలు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. ఇదే జరిగితే అభివృద్ధి రేటు మరింత పతనం అవకతప్పదు. ఇతర ఐరోపా ధనిక దేశాలతో పోల్చితే ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద దేశీయ డిమాండ్‌ మీదే ప్రధానంగా ఆధారపడి ఉంది. కొత్త కార్ల కొనుగోలుకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను ఉపసంహరించగానే జనం కొనుగోళ్లను కూడా నిలిపివేశారు. ఈ పరిణామం సర్కోజీ సర్కార్‌ను కుదిపేస్తోంది. రుణభారాన్ని తగ్గించేందుకు, బడ్జెట్‌లోటును కుదించేందుకు చర్యలు తీసుకుంటామని ట్రిపుల్‌ ఏలతో ఉన్న తమ పరపతికి ఎలాంటి ఢోకా లేదని ప్రపంచాన్ని నమ్మించేందుకు అధ్యక్షుడు సర్కోజీ సర్కస్‌ ఫీట్లు చేస్తున్నాడు. దానిలో భాగంగానే ప్రభుత్వ బాండ్లను తక్కువ రేట్లకు విక్రయించటాన్ని పదిహేను రోజుల పాటు నిషేధించాడు. ఇటలీ, స్పెయిన్‌, బెల్జియం కూడా ఇవే చర్యలను తీసుకున్నాయి. ఇలాంటి పరిస్థితి మార్కెట్‌లో తలెత్తటం అంటే ప్రభుత్వ సమర్థతపై విశ్వాసం కోల్పోవటానికి సూచిక.

ఐరోపా యూనియన్‌లో జర్మనీ తరువాత ఫ్రాన్స్‌ పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు భావిస్తారు. అక్కడ నిరుద్యోగం 9.2శాతం కాగా, యువతలో అది 22.8శాతం కావటం గమనార్హం. ఫ్రాన్స్‌లో పెద్ద బ్యాంకుల్లో మూడవదైన సొసైటీ జనరల్‌ షేర్ల ధరలు జూలై రెండవ వారం నుంచి ఇప్పటివరకు 40శాతం పడిపోవటం ప్రమాద సూచిక. ఒక నిర్దిష్ట తేదీని నిర్ణయించి కంపెనీల వాటాలు, వస్తువుల ధరలపై లావాదేవీలు జరపటాన్ని ఆర్థిక పరిభాషలో డెరివేటివ్స్‌ అంటారు. ఇది పెద్ద జూదం. దీనిలో సొసైటీ జనరల్‌ది పెద్ద చేయి. అమెరికా సెక్యూరిటీల డెరివేటివ్స్‌ తనఖా లావాదేవీల్లో 67 వేల కోట్ల డాలర్లు పోగొట్టుకొని చేతులు కాల్చుకుంది. అయితే అమెరికా సర్కార్‌ ఆదుకోవటంతో అది నష్టాల నుంచి బయట పడింది. ఇప్పుడు ఫ్రెంచి సర్కార్‌ ఈ బ్యాంకును కాపాడేందుకు రంగంలోకి దిగింది. ఈ బ్యాంకే పోర్చుగల్‌, ఐర్లండ్‌, గ్రీస్‌, స్పెయిన్‌ సర్కార్లను ఆదుకొనేందుకు 1820 కోట్ల యూరోలు, ఫ్రెంచి సర్కారుకు 1920 కోట్ల యూరోల రుణం ఇచ్చింది. ఫ్రాన్స్‌లో రుణ సంక్షోభ ఛాయలు కనిపించటంతో వంద రూపాయల ఆదాయమైతే ఇప్పటికే 120 రూపాయల అప్పుల పాలైన ఇటలీ కూడా ఉలిక్కి పడుతోంది. రానున్న రెండు సంవత్సరాలలో 6,500 కోట్ల డాలర్ల మేరకు అదనంగా పొదుపు చర్యలు చేపట్టాలని శుక్రవారం నాడు బెర్లుస్కోనీ సర్కార్‌ నిర్ణయించింది. మతేతరమైన అనేక సెలవురోజుల రద్దు, స్థానిక సంస్థలకు ఎన్నికయ్యేవారి సంఖ్య పరిమితం చేయటం, పన్నులు పెంచటం వంటి చర్యలను ప్రకటించింది. సంక్షోభంలో ఉన్న గ్రీస్‌ను ఆదుకోవటం, మిగతా దేశాల పతనాన్ని ఎలా నిలబెట్టాలా అని మదన పడుతున్న ఐరోపా యూనియన్‌కు ఫ్రెంచి పరిణామం ఊహించని దెబ్బ. ఒక దగ్గర పడిన చిల్లుకు మాసిక వేసిన మరుక్షణమే మరోచోట పడిపోతోంది. దివాళాకోరు పెట్టుబడిదారీ విధానాలను, ప్రపంచాధిపత్యం కోసం యుద్ధాలను రుద్దుతున్న ధనిక దేశాలే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లుగా అమెరికా, ఐరోపా యూనియన్‌ సంక్షోభానికి ప్రపంచం కూడా మూల్యం చెల్లించాల్సి రావటమే ఆందోళన కలిగించే అంశం.

***Article From prajasakti Editorial  www.prajasakti.com

Sunday, August 14, 2011

చరిత్ర బురుజుపై స్వతంత్ర పతాక

ఎర్రకోటను మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ పాతఢిల్లీలో యమునానది ఒడ్డున 17వ శతాబ్దంలో నిర్మించాడు. లాల్‌ ఖిల్లా అప్పట్లో చక్రవర్తి కుటుంబ నివాసంగా వుండేది. చివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ను బ్రిటిష్‌వారు దేశ బహిష్కరణ చేసేవరకు అంటే 1857 వరకు మొఘలుల రాజధాని నగరం కూడా అదే. షాజహాన్‌ 1638లో ప్రారంభించిన ఈ కోట నిర్మాణం తొమ్మిదేళ్లపాటు సాగింది. ఔరంగజేబు, ఆ తర్వాత మొఘల్‌ పాలకులు కోటకు అనేక కొత్త అందాలు అద్దారు

 ఎర్రకోట పర్షియన్‌, యూరోపియన్‌, ఇండియన్‌ కళల కలబోతగా వుంటుంది. ఖిల్లా ప్రతి అంగుళంలోనూ కళాకారుల పనితనం కనిపిస్తుంది. భారతదేశంలోని అత్యంత ప్రధానమైన నిర్మాణాల్లో ఎర్రకోట ఒకటి. భవన నిర్మాణ కౌశలానికి, శక్తికి ఈ కోట నిదర్శనం. నిర్మాణంలోని ప్రతి అంశం ఎంతో కళాత్మకంగా వుంటుంది. ఈ కోట లోపలి స్థలము 6 లక్షల చదరపు గజాలుంటుంది. గోడల యెత్తు 35 గజాలు. కోట చుట్టూ 24 గజాల వెడల్పు, 20 గజాల లోతుగల కందకం తవ్వబడింది. ఈ కోట నిర్మాణానికి అప్పుడే 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. లోపలి భవనాల నిర్మాణానికి మరో 50 లక్షల రూపాయలైంది. కట్టడాల నిర్మాణం ఎంతో అందంగా, ఉన్నతంగా వుంటుంది. విశాలమైన భవనాలు, వాటి చుట్టూ అందమైన తోటలు, స్నానాల గదులు...రాచరికానికి నిలువెత్తు నిదర్శనంగా గోచరిస్తాయి. ఇంతటి అపురూపమైన కోట కాలక్రమంలో ఎన్నో దాడులకు గురై తన సౌందర్యాన్ని చాలా వరకు కోల్పోయిందనే చెప్పాలి. మహారాజసం వుట్టిపడే ఈ కోట ఒకప్పుడు మహాకవులు, కళాకోవిదులతో కళకళలాడిపోయేది. కవితా కళాకుసుమాలు వికసించేవి. ముస్లింల ఈద్‌ సందర్భంగా, హిందువుల దీపావళి వంటి పండుగల సందర్భంగా పాదుషాలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రజల ఆనందంలో పాలుపంచుకొనేవారు

మొఘల్‌ వంశపు చివరి రాజైన బహదూర్‌ షా 1837 సెప్టెంబర్‌ 27వ తేదీన ఢిల్లీ సింహాసనం అధిష్టించాడు. అయితే అప్పటినుంచే బ్రిటిషు ప్రభుత్వం అతని పతనానికి కుట్రలు పన్నసాగింది. ఎన్నో రాజకీయ, ప్రతికూల క్లిష్ట పరిస్థితుల్లో బహదూర్‌ పట్టాభిషేకం జరిగిందనుకోవాలి. 1857లో మొదటిసారిగా మీరట్‌లో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరవేయబడింది. సైన్యంలో బెంగాల్‌ ఆర్మీ రెజిమెంట్‌కు చెందిన సైన్యాధికారి మంగల్‌పాండే ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించి గొప్ప సంక్షోభాన్ని సృష్టించాడు. బ్రిటిషు సైన్యం ఆ అధికారిని హతమార్చి తిరుగుబాటును అణచివేయాలని చూసింది. కానీ అతను చనిపోయినా అతను రగిల్చిన తిరుగుబాటు జ్వాలలు చల్లారలేదు. మరింతగా భగ్గుమన్నాయి. తిరుగుబాటు సైన్యం ఎర్రకోటలోకి ప్రవేశించి బహదూర్‌షా ఆదేశాలను పాటించడానికి సిద్ధంగా వున్నామంది. లాల్‌ ఖిల్లాలో ప్రతి కీలక ప్రాంతంలోను ఆయుధధారులైన సైనిక కేంద్రాలను సన్నద్ధం చేశారు. పోరాటం కూడా ఉధృతం చేయబడింది. బ్రిటిష్‌ సైన్యం మరింత అప్రమత్తమై అణచివేతను కఠినంగా అమలు జరిపింది. ఆ పోరాటంలో మూడు వేల మందికి పైగా దేశభక్తులను ఉరితీశారు. వేలాదిమందిని కాల్చిచంపారు. లక్షలాదిమంది సైనికుల ప్రాణాలు ఫిరంగుల ధాటికి గాలిలో కలిసిపోయాయి. ఇటువంటి అనేక పోరాటాల చరిత్ర కలిగిన ఎర్రకోటను చూడగానే దేశభక్తులైన ప్రతి భారతీయుడి హృదయం అలనాటి చారిత్రక స్మృతులతో బరువెక్కిపోతుంది. ఉద్వేగభరితమౌతుంది.

వివిధ చారిత్రిక దశల్లో స్వతంత్రంకోసం పోరాడిన ఎందరో వీరులను, ఈ కోటలోనే బంధించి ఉరితీశారు. అజాద్‌ హింద్‌ ఫౌజ్‌పైన విచారణ జరిపిందీ ఇక్కడే. ఈ ఎర్రకోటపైనే బ్రిటిష్‌ పాలకుల పతాకం అనేక సంవత్సరాలు రెపరెపలాడి, భారత ప్రజల బానిస బతుకుల్ని అవహేళన చేసింది. ఎందరో దేశ భక్తులైన ధీరహృదయులు, కవులు, కళాకారులు, ప్రభువులు, బ్రిటిషు ప్రభుత్వ దారుణ శిక్షలకు గురై అమరవీరులయ్యారు. అయితే ఎర్రకోట మహోన్నత వైభవం మహోజ్వలంగా ప్రకాశించి దశదిశలను కాంతివంతం చేసిన రోజుల గురించి కూడా మనం చరిత్రలో చూస్తాం. సుదీర్ఘ కాలం పాటు ఈ కోట నుంచి వెలువడిన ఆజ్ఞలు యావత్‌ భారత దేశాన్ని శాసించాయి. దీని వైభవ ప్రాభవాలకు తల వంచని శక్తి ఏదీ ఆనాడు దేశంలో వుండేది కాదు. అలాంటి చోటనే 27 జనవరి 1858వ సంవత్సరంలో కడపటి భారత చక్రవర్తి, సుప్రసిద్ధ దేశభక్తుడు అయిన బహదూర్‌ షా జఫర్‌ ఒక సాధారణ నేరస్థుడిగా నిర్బంధితుడై బ్రిటిషు పరిపాలకుల ఎదుట విచారణకు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ కేసు విచారణ కోట భవనాల సముదాయంలోని ఒకప్పటి ఆయన న్యాయ దర్బారు 'దర్బారె ఖాస్‌'లో జరిగింది. ఇదే ప్రదేశంలో ఒకానొక రోజుల్లో జఫర్‌ ఆజ్ఞలు నిర్విఘ్నంగా అమలయ్యేవి. అలాంటి చోటనే జఫర్‌ నేరస్థుడుగా నిరూపించబడటం చరిత్ర గతికి ఒక తార్కాణం. బ్రిటిష్‌ పాలకులు ఆయనకు దేశ బహిష్కరణ శిక్ష విధించి రంగూన్‌ పంపారు. ఆ విధంగా 1862వ సంవత్సరంతో అక్కడే ఢిల్లీ సార్వభౌమత్వపు ఆఖరి వెలుగు కొడిగట్టిపోయింది.
బ్రిటిష్‌వారి కాలంలో కోటను ప్రధానంగా సైనిక శిబిరంగానే ఉపయోగించారు. స్వాతంత్య్రానంతరం కూడా 2003 వరకు కోటలో ప్రధాన భాగం భారత సైన్యం అధీనంలోనే వుంది. ఐరాస సాంస్కృతిక విభాగమైన యునెస్కో 2007లో ఎర్రకోటను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.


మువ్వన్నెల రెపరెపలు
 
మనదేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు చిహ్నమైన మువ్వన్నెల జండా గురించి చెప్పుకోవాలంటే... త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య. మన తెలుగువాడే. ఆయన సృజించిన జాతీయ పతాకంలో మూడు రంగులుంటాయి. కాషాయం, ఆకుపచ్చ, తెలుపు. ఈ మువ్వన్నెలు కేవలం మూడు రంగుల కలయికే కాదు. ఇది మన సంస్కృతి, ఐక్యత, సంప్రదాయాల కలయిక. జాతీయ జండా సైజు 3:2 వుండాలి. పై భాగంలో కాషాయం, కింది భాగంలో హరిత వర్ణం, మధ్యలో శ్వేత వర్ణం వుండాలి. మధ్య భాగంలో నీలి రంగులో అశోక చక్రం వుంటుంది. ఇందులో 24 గీతలుంటాయి. ప్రారంభంలో జాతీయ పతాకాన్ని గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం వంటి ప్రత్యేకమైన దినాల్లో మాత్రమే ఆవిష్కరించేవారు. తర్వాత అన్ని రోజుల్లోను మువ్వన్నెల పతాకాన్ని ఎగరేయవచ్చని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం, సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. గణతంత్ర దిన్సోతవం నాడు దేశ రాష్ట్రపతి సైనిక దళాల వందనం స్వీకరిస్తారు.
1948 ఆగస్టు 15వ తేదీన మొదటిసారిగా నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దేశ రాజధాని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచే స్వాతంత్య్రదినోత్సవం నాడు ఎర్రకోటపై జాతీయజండాను ఆవిష్కరించే సంప్రదాయం ప్రారంభమైంది. అలాగే దేశాధ్యక్షుని ముందర మన దేశ సైనిక ప్రతిభాపాటవాల ప్రదర్శన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఏటా ఒక దేశాధినేత ముఖ్య అతిథిగా పాల్గొంటారు.


పతాక నియమాలివే!

అయితే మువ్వన్నెల పతాకాన్ని అగౌరవపరచకుండా కొన్ని నియమనిబంధనలు పెట్టింది మన ప్రభుత్వం. వాటి ప్రకారం చిరిగిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకూడదు. జండాను తిరగవేసి ఎగరేయకూడదు. కార్లమీద పరవకూడదు. వ్యక్తిగత వస్త్రాలపై త్రివర్ణ పతాకాన్ని ముద్రించకూడదు. దిళ్లు, చేతి రుమాళ్లు, నేప్కిన్ల మీద మువ్వన్నెల జండాను కుట్టకూడదు. జండాపై ఎటువంటి అక్షరాలను రాయకూడదు. కేంద్రం అనుమతి లేకుండా వాహనాలపై ఎగరేయకూడదు. రైళ్లు, వాహనాల ముందు, వెనక తగిలించకూడదు. మూడు రంగుల బట్ట ముక్కలను కలిపి ఒక పతాకంలాగా చేయకూడదు. పతాకాన్ని నేల మీదగానీ, నీటిలోగానీ పడనివ్వకూడదు. ప్రభుత్వ, సైనిక అంత్యక్రియల సందర్భంలో మినహా మరెక్కడా ఉపయోగించకూడదు. కాళ్లతో తొక్కడం, తగలబెట్టడం కూడా చేయకూడదు. ఒకవేళ పతాకం పాడైపోతే దాన్ని సగౌరవంగా గంగాజలంలో వదిలేయడంగానీ, మట్టిలో పూడ్చిపెట్టడంకానీ చేయాలి.
పతాకావిష్కరణ ఎలా? ఎక్కడీ
మువ్వన్నెల జెండా ఎగరేసిన చోట దానికి ప్రత్యేక గౌరవ స్థానం కల్పించాలి. ప్రభుత్వ భవనాలపై ఎగరేసినప్పుడు సెలవు దినాలతో సంబంధం లేకుండా అన్ని రోజుల్లోను పతాకం రెపరెపలాడుతూనే వుండాలి. ఇందుకు సూర్యోదయ - సూర్యాస్తమయాలు, వాతావరణాలతో కూడా సంబంధం వుండదు. దేశాధినేతలు కాలం చేసినప్పుడు వారి గౌరవార్ధం జాతీయ పతాకాన్ని కొంతసేపు కిందికి దించుతారు. పతాకాన్ని ఎగరవేసేప్పుడుగానీ, దించేప్పుడుగానీ ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి. అలాగే పెరేడ్‌లో జాతీయ పతాకం వున్న వాహనం వస్తున్నప్పుడు కూడా గౌరవార్థం లేచి నిలబడాలి. హైకోర్టులు, సెక్రటేరియట్‌ కమిషనర్‌ కార్యాలయం, కలెక్టరేట్లు, జైళ్లు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు. అదేవిధంగా అంతర్జాతీయ సరిహద్దులు, కస్టమ్‌ పోస్టులు, చెక్‌ పోస్టులు, ఔట్‌ పోస్టులు, ఇతర ప్రత్యేక స్థలాల్లో కూడా జాతీయ పతాకాన్ని ఎగరేయవచ్చు. ఇవికాక విమానాశ్రయాలు, సరిహద్దు పహారా, అంతర్జాతీయ జలాల సమీపంలో వున్న లైట్‌ హౌస్‌లు దగ్గర కూడా ఎగరేయవచ్చు. దేశాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గవర్నర్లు, లెఫ్టెనెంట్‌ గవర్నర్ల అధికార నివాసాల్లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించవచ్చు. అదేవిధంగా దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఏదైనా సంస్థను సందర్శించినప్పుడు వారి గౌరవార్థం పతాకావిష్కరణ చేయవచ్చు. విదేశీ దేశాధినేతలు, యువరాజులు, రాజులు, ప్రధానమంత్రులు భారత దేశాన్ని సందర్శించినప్పుడు మన జాతీయ పతాకంతోపాటుగా సదరు ప్రముఖుల జాతీయ పతాకాన్ని కూడా ఆవిష్కరించవచ్చు. భారత దేశాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గవర్నర్లు, లెఫ్టనెంట్‌ గవర్నర్లు, ప్రధానమంత్రులు, క్యాబినెట్‌ మంత్రులు, స్పీకర్‌, భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మరికొందరు ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహనాలపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకునే అవకాశం వుంది. మన దేశ ప్రధాని, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఏదైనా ప్రత్యేక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్‌ బోగీలో జాతీయ పతాకాన్ని వుంచవచ్చు. ఈ పతాకం రైల్వే ప్లాట్‌ఫారమ్‌కు అభిముఖంగా వుండాలి.
ఒకరోజు దేశభక్తులు!
స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న కాలంలో జాతీయ జెండా ఎగరేయడం పెద్ద ధిక్కార చర్య. పోలీసుల కళ్లు గప్పి దేశ భక్తులు ఎలాగో పైకి ఎక్కేసి తూటాలు ఒళ్లు చీరేస్తున్నా జండా ఎగరేస్తుండేవారు. ప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ గర్వాల్‌లో ఆ విధంగా జెండా ఎగరేసిన ఘటన చాలా ఉత్తేజకరమైంది. ప్రీతిలతా వడేదార్‌ కూడా అలా ఎగరేస్తూనే పోలీసుల కాల్పులకు గురైంది. ఝండా వూంఛే రహా హమారా అన్నది ఒక పెద్ద నినాదం.
దేశ స్వాతంత్య్రం తర్వాత మాత్రం క్రమేణా జెండా పండుగ తీరు తెన్నులు మారిపోయాయి. ప్రజల దైనందిన జీవిత సమస్యలు పెరుగుతున్న కొద్ది ప్రభుత్వాలు అసంతృప్తి మూటగట్టుకున్న కొద్ది స్వాతంత్య్ర దినోత్సవం మొక్కుబడిగా మారిపోతున్నది. ఆ పోరాట కాలం నాటి త్యాగాలు ఆశయాలకు తిలోదకాలిచ్చిన పాలక వర్గ నేతలు ప్రజలలో నిరుత్సాహం నింపడంతో దేశ భక్తి సంప్రదాయాలకు కూడా ముప్పు ఏర్పడింది. ఇప్పుడు ఆగష్టు 15 అనేది అధికార లాంఛనాలకు రాజకీయ పటాటోపానికి ఆలవాలమై సజీవ చైతన్యం సన్నగిల్లింది.

ఆగష్టు 15 సందడి ప్రధానంగా పిల్లలదే. ఆ రోజు స్కూళ్లలో జెండా ఎగరేయడం, ఉపన్యాసాలు అలా వుంచితే ఆటలు పాటల పోటీలు వంటివి జరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యం మిఠాయిలు కనీసం చాక్లెట్లు పంచి పెడతారు.అసంఖ్యాకమైన పేద, మధ్య తరగతి పిల్లలకు ఇది కూడా అపురూపమే గనక 'జెండా పండుగ' అని మురిసిపోతుంటారు. చిన్న చిన్న జెండాలు కూడా చేతపట్టుకుని లేదా బాడ్జీలు పెట్టుకుని గొప్పగా భావించుకుంటారు.
ఇక నాయక గణాల విషయానికొస్తే జెండా ఎగరేయడం వారికి హోదాకు సంబంధించిన విషయం. కలెక్టర్లు పోలీసుల అధికారులతో పాటు మంత్రులు తము చూస్తున్న జిల్లాల్లో జెండా ఎగరేస్తారు. ప్రజా ప్రతినిధులు కూడా వారి ఉత్సాహాన్ని బట్టి జెండా వందనం ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ అధికార తతంగాలను పక్కనబెడితే ఆర్భాటాలకు హంగు దర్పాలకు ఆ సందర్బాన్ని వాడుకోవడం కద్దు. కారులు బారులు తీరించి వీలైనన్ని చోట్ల జండాలు ఎగరేస్తే తమ పట్టు చాటుకోవచ్చన్న ధోరణి చాలా పట్టణాలలో ఛోటా మోటా నాయకులకు పెరిగింది. పార్టీల వారిగా కూడా తాత్కాలిక దిమ్మలు ఏర్పాటు చేసి- అంటే డ్రమ్ములో ఇసుక పోసి మధ్యలో జెండా పాతి సాయంత్రం వరకూ సంరంభం చేస్తారు.ఈ ఒకరోజు దేశభక్తి ముగిశాక మరురోజు షరా మామూలే!
పాడవోయి భారతీయుడా!
పదిమందికి సంబంధించిన ఏ ఉత్సవమైనా పాటలు లేకపోతే అసంపూర్ణమే. స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా అనేక దేశభక్తి గీతాలు మార్మోగుతాయి. అన్నిట్లోకి ఎక్కువగా వినిపించేది పాడవోయి భారతీయుడా! అన్న శ్రీశ్రీ పాట. 'వెలుగు నీడలు' చిత్రంలోని ఈ పాట అర్థవంతంగానూ సమస్యల ప్రస్తావనతోనూ ఇప్పటికి నిత్యనూతనంగా విరాజిల్లుతున్నది. ఏ వీధిలో చూసినా ఆ పాటతోనే మొదలవుతుంది. మన సినిమాల్లో దేశభక్తి గీతాలు ఒకప్పుడు ఎక్కువగా వుండేవి. ఏదో ఒక వీలు చూసుకుని అలాంటి పాట జొప్పించేసేవారు. అంతర్నాటకాల రూపంలోనూ దేశభక్తి ప్రబోధం, గాంధీ నెహ్రూలను చూపించడం జరగుతుండేది. భారత మాతకు జేజేలు, మన జన్మభూమి బంగారు భూమి లాంటి పాటలు కూడా వినిపిస్తాయి. సినిమా పాటలను అటుంచితే దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన 'జయజయజయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి' అన్న పాట కూడా జాతీయ గీతంలాగే ప్రసిద్ధమైంది. నాడు తిలక్‌ మహాశయుని నోట మార్మోగిన నినాదంతో 'స్వాతంత్రమే నా జన్మహక్కని చాటండి' వంటి పాటలు కూడా ఆ రోజున వినిపిస్తాయి. ఘంటసాల గానం చేసిన పద్యాలు 'అమ్మా సరోజినీ దేవి' వంటివి కూడా వేస్తుంటారు. ఇటీవలి కాలంలోనైతే వందేమాతరం గీతం రహ్మాన్‌ కట్టిన రాగంలో మార్మోగుతుంటుంది. 'పుణ్యభూమి నా దేశం నమోనమామి' మరీ తప్పనిసరి. భారతీయుడు చిత్రంలోనూ జండా ఎగరేసే సన్నివేశంతో పాటు స్వాతంత్ర దిన సంబరాలను చిత్రించే పాట కూడా వీటిలో ఒకటిగా వినిపిస్తుంది. ఎన్‌డిఎ హయాంలో కార్గిల్‌ తరహా దేశభక్తి దశలోనూ 'ఖడ్గం, జై' వంటి చిత్రాల్లో మరో తరహా దేశభక్తిని గుప్పించే పాటలుంటాయి. అన్నిటినీ మించి 'అల్లూరి సీతారామరాజు' పాటలు, 'భలేతాత మన బాపూజీ' వంటి పాటలు కూడా ఆ రోజున వింటాము. రేడియోలోనూ టీవీల్లోనూ తెల్లవారక ముందునుంచి చెవుల తుప్పు వదిలిపోయేలా ఇలాంటి పాటలే దంచి కొట్టడం అనివార్యం. చంద్రునికో నూలుపోగులా దేశానికి ఆగష్టు 15న అందించే నివాళి ఇది.


*********Article From Prajasakti Written By K.Sahil  www.prajasakti.com





Thursday, August 11, 2011

మండుతున్న బ్రిటన్‌

ఇటీవల లండన్‌లో పోలీసులు మార్క్‌ డగ్గన్‌ అనే 29 సంవత్సరాల ఆఫ్రో కరీబియన్‌ యువకుడ్ని కాల్చి చంపటంతో ప్రారంభమైన అల్లర్లు మూడు రోజుల్లో బ్రిటన్‌ అంతటికీ విస్తరించాయి. లండన్‌లో ప్రారంభమైన నిరసన దావానలంలా ఆ దేశంలోని ఇతర నగరాలకు పాకింది. మంగళవారంనాడు బర్మింగ్‌హాం, లివర్‌పూల్‌, బ్రిస్టల్‌, నాటింగ్‌హామ్‌, మాంచెస్టర్‌ తదితర నగరాల్లో నిరసనలు దొమ్మీలు, లూటీల రూపం తీసుకున్నాయి. ఒక్క లండన్‌ నగరంలోనే మంగళవారం నాడు 16 వేల మంది పోలీసులను దించారు. సోమవారం విధుల్లో ఉన్న వారి సంఖ్యకు ఇది దాదాపు మూడు రెట్లు. దేశవ్యాప్తంగా పన్నెండు వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు.వందలాది కేసులు నమోదు చేస్తున్నారు. మార్క్‌ డగ్గన్‌ను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన పోలీసులు అతడే తమపై కాల్పులు జరిపాడని బుకాయించడంతో దక్షిణ లండన్‌లో కొద్దిమంది యువతీ యువకులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసన ప్రారంభించారు. ఆ చిన్న నిరసనను సైతం పోలీసులు సహించకుండా తీవ్ర నిర్బంధం ప్రయోగించారు. ఇది ప్రజాగ్రహానికి కారణమై నిరసనలు పెల్లుబికాయి. క్రమంగా అల్లర్లు, ఘర్షణలు స్థాయికి చేరాయి. కొన్నిచోట్ల లూటీలు సైతం సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో, నిరసనల్లో యువతే అధికంగా ఉన్నారు. వారిలో శ్వేతజాతీయులు గణనీయంగా ఉన్నారని పోలీసులు సైతం చెబుతున్నారు. అంటే వీటిని జాత్యహంకారానికి సంబంధించిన అల్లర్లుగా చెప్పడం ముమ్మాటికీ తప్పు. కానీ కార్పొరేట్‌ మీడియా రోజురోజుకూ ఆ నిరసనోద్యమాన్ని జాత్యహంకార అల్లర్లు, లూటీలుగా ప్రచారం చేస్తోంది. మంగళవారం నాడు బర్మింగ్‌హాంలో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. షహజాద్‌, హారీహుస్సేన్‌ సోదరులు తన మిత్రుడైన ముసావెర్‌ ఆలీతో కలిసి తమ నివాస ప్రాంతంలో ఉండగా ఒక శ్వేతజాతీయుడు కారును వేగంగా నడుపుతూ వారిని ఢకొీట్టడంతో ముగ్గురూ మరణించారు. వారు రోడ్డుకు అడ్డంగా గానీ, మార్గ నిరోధకంగా గానీ లేనే లేరని పోలీసు అధికారులు కూడా నిర్ధారించారు. ఆ శ్వేతజాతీయుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు కానీ అరెస్టు చేయలేదు. మీడియా చేసిన దుష్ప్రచారంతో కూడా కొంతమంది ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతుండవచ్చు.

           ప్రతిష్టాత్మకమైన లండన్‌ ఒలింపిక్స్‌ 2012 ద్వితీయార్థంలో జరగనున్నాయి. ఒక్క ఏడాది ముందు ఇంత విస్తృత స్థాయిలో ఘర్షణలు సాగడం తీవ్రమైన విషయం. బ్రిటన్‌ ప్రతిష్టకు ఇది దెబ్బే! ప్రస్తుతం బర్మింగ్‌హాంలో భారత్‌, ఇంగ్లండ్‌ టీమ్‌ల మధ్య క్రికెట్‌ టెస్ట్‌ జరుగుతోంది. ఘర్షణలతో ఆట ఆగలేదు. అయితే ఇలాంటి అల్లర్లే భారత్‌లో జరిగి ఉంటే ఇంగ్లండ్‌ టీమ్‌ మూటాముల్లె సర్దుకొని పోయేవారన్న భారతీయ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ మాట అక్షర సత్యం. 2008లో ముంబయి దాడులు జరిగిన సందర్భంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌ చర్యనుబట్టే గవాస్కర్‌ అలా వ్యాఖ్యానించి ఉండవచ్చు. ఇప్పుడు బ్రిటన్‌లో మన క్రీడాకారులు నిబ్బరంగా ఉండడం మంచి విషయం. ఈ నిరసనల సెగకు ఇటలీలో సెలవులు 'అనుభవిస్తున్న' బ్రిటన్‌ దేశాధ్యక్షుడు డేవిడ్‌ కామెరాన్‌ పర్యటనను కుదించుకొని వెనక్కి వెళ్లారు. ప్రస్తుతం వేసవి సెలవులయినప్పటికీ పరిస్థితిని చర్చించడానికి అత్యవసరంగా పార్లమెంట్‌ సమావేశాన్ని గురువారం జరపనున్నారు. పెట్టుబడిదారీ దేశాలన్నింటా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల కారణంగా ప్రజా సంక్షేమం నానాటికీ అడుగంటుతోంది. అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ఆదర్శ ప్రాయమైనదిగా చెప్పబడే బ్రిటన్‌ వైద్య రంగంలో సైతం సంక్షేమానికి కోతపెట్టడానికి టోరీ ప్రభుత్వం సిద్ధపడింది. ఇతర రంగాల్లోనూ సంక్షేమ వ్యయాన్ని కత్తిరిస్తున్నారు. 2015 నాటికి ప్రభుత్వ వ్యయంలో 8 వేల కోట్ల పౌండ్లు (ఆరు లక్షల కోట్ల రూపాయలు) కోత విధించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే కత్తిరింపులు మొదలయ్యాయి. మార్క్‌ డగ్గన్‌ను కాల్చి చంపిన దక్షిణ లండన్‌లోని టోటెన్‌హాం ప్రాంతంలో యువజన సర్వీసులకిచ్చే బడ్జెట్‌లో 75 శాతం కోతపెట్టారు. ఆ ప్రాంతంలో నిరుద్యోగిత 20 శాతం నమోదయ్యింది. సంక్షేమ బడ్జెట్‌ కోత పడడంతో యువతీ యువకుల్లో అసంతృప్తి విపరీతంగా పెరిగింది. బ్రిటన్‌ ప్రజల్లో ముఖ్యంగా యువతలో అసంతృప్తి జ్వాలలు రగలడానికి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అసంతృప్తులను, అసమ్మతులను అణిచివేసేందుకు ఉపయోగించే పోలీసుల్లోనూ అసంతృప్తి చోటు చేసుకుంటోంది. పొదుపు చర్యల్లో భాగంగా టోరీ ప్రభుత్వం రానున్న నాలుగు సంవత్సరాల్లో 34 వేల పోలీసు ఉద్యోగుల పోస్టులను రద్దుచేయ నిర్ణయించింది. పోలీసు బడ్జెట్‌లో 20 శాతం కోత విధించింది. మీడియాను సైతం టోరీ పాలన వదిలిపెట్టలేదు. ఆ దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థ అయిన బిబిసికి ప్రభుత్వం నుంచి ఇచ్చే కేటాయింపులకు కోతపెట్టింది. అందుకు నిరసనగా గడిచిన రెండు నెలల్లోనే బిబిసి పాత్రికేయులు రెండుసార్లు సమ్మె చేశారు. ఇలా బ్రిటన్‌లోని వివిధ వర్గాలు, తరగతులకు చెందిన ప్రజానీకం ప్రభుత్వ చర్యలతో అసంతృప్తి చెందాయి. అదే చినుచినుకు చేరి మహా ప్రవాహంలా మారిన రీతిన ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో అల్లర్లు, ఘర్షణల రూపంలో నిరసనోద్యమాలు సాగుతున్నాయి. పోలీసు బలంతోనూ, అధికార మదంతోనూ నిరసనలను టోరీ ప్రభుత్వం అణిచివేయవచ్చు. కానీ ప్రజల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా మిగిలిపోతుంది. నిరసనలకు మూల కారణమైన ఉదారవాద ఆర్థిక విధానాలను అక్కడి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. లేదా కనీసం ఆ వేగాన్ని తగ్గించాలి. అప్పుడే బ్రిటన్‌లో మంటలు చల్లారుతాయి. కాకపోతే చింకి గుడ్డకు మాసికలు వేస్తే దానిపక్కనే మరో చిరుగు పడుతుందన్న తీరున ఆ సమాజం అతలాకుతలం అవుతుందని బ్రిటన్‌ పాలకులు అలాంటి విధానాలను తలకెత్తుకొన్న దేశాల ఏలికలు గుర్తెరగాలి.

*****Article From Prajasakti Paper www.prajasakti.com

Tuesday, August 9, 2011

స్కాములోరి సామ్రాజ్యాలు




స్వాములమని ఇంకా మాట్లాడితే సాక్షాత్‌ భగవత్‌ స్వరూపులమని తమకు తామే ముద్ర వేసుకుని పూజా పీఠాలధిష్టిస్తున్నారు. సొంత సామ్రాజ్యాలు సృష్టించుకుంటున్నారు. అమాయకుల నమ్మకాలతో ఆటలాడుకుంటున్న ఇలాంటి ఆషాడభూతుల అసలుసిసలు అవతారాలు ఒక్కొక్కటే బట్టబయలవుతున్నాయి. నిత్యానందుని అత్యానంద రహస్యాలు ఆమూలాగ్రం వెల్లడై అతగాడు అత్తగారింటిని సందర్శించవలసిన గతి పట్టింది. వచ్చాక మళ్లీ భక్తాభినేత్రి రంజితతో కలసి రసవత్తర గురు పూర్ణిమ దృశ్యంలో దర్శనమివ్వడం వేరే సంగతి. అంతకు ముందే కల్కి భగవానుని కళంకిత గాధలు వెలుగు చూశాయి. అంతు తెలియని మానసిక స్థితిలో అపసవ్య అవస్థలో అమాయకులెందరో ఆ సాలెగూడులో చిక్కిన ఉదంతాలు టీవీలలో ప్రసారమయ్యాయి. వీటన్నిటినీ మించి బాబాలకు బాబాగా దేవేంద్ర వైభవంలో మునిగితేలిన పుట్టపర్తి సాయిబాబా జబ్బుపట్టి ఆస్పత్రి పాలవడం, ఆశ్రమంలోని అపార సంపదలు తరలిపోవడంపైన భక్త జనాలే గగ్గోలు పెట్టారు గాని ఏలిన వారు వేలు కదల్చలేదు. బాబా అవసానదశ నుంచి అంత్యక్రియల వరకూ కూడా ఆ విచారం కన్నా వివాదమే ప్రధానమైపోయింది. బయటివారి సంగతి అటుంచి బాబా బంధువర్గాలు కూడా గగ్గోలు పెడుతుంటే సర్కారు వారు మాత్రం ఆఖరు వరకూ మీన మేషాలు లెక్కించి అంతా అయిపోయాక రంగంలోకి దిగామనిపించారు. అక్కడ గూడుపుఠానీ జరుగుతుందని భక్తులు కూడా వాపోక తప్పలేదు. భక్తి కొద్దీ వారు ఇదంతా బాబాకు సంబంధం లేదని అనుకోవచ్చు. అంతటి వ్యక్తి ఆంతరంగికులను అమాయకంగా ఎంచుకుంటాడా అని ఆలోచించలేకపోవచ్చు. కాని అదే అసలైన ప్రశ్న. ఏతావాతా తేలేదొక్కటే! స్వీయ సామ్రాజ్యాలను తలపించే స్వామీజీల ఆశ్రమాలు అనేక రకాల అవాంఛనీయ శక్తులకు, అవినీతిపరులకు ఆశ్రయాలుగా మారుతున్నాయి. చెదురుమదురుగా గాక అన్ని చోట్లా అందరి విషయంలో ఇదే తంతు. స్వాములకూ స్కాములకూ అవినాభావ సంబంధం ఎవరూ కాదనలేని సత్యం. ఒకప్పుడు హేతువాదులు లేదా నాస్తికులు, కాదంటే కమ్యూనిస్టులు మాత్రమే చెప్పే విషయాలు ఇప్పుడు మీడియాలో రోజూ పుంఖానుపుంఖాలుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు స్వాముల స్కాముల లీలా విలాసాలు మచ్చుకు కొన్ని...
70, 80 ఏళ్ల కిందటి వరకూ ఆది శంకరాచార్యులు స్థాపించిన పీఠాల అధిపతులూ, రామకృష్ణమఠాలు నిర్వహించే స్వాములు లాంటి కొద్దిమంది ధర్మ ప్రచారకులుండేవారు. వారు కూడా దైవభక్తినీ, ధర్మాచరణను మాత్రమే బోధించేవారు. కానీ ఈనాడు అనేక పీఠాలూ మఠాలే కాదు, అనేకమంది కలియుగ దేవుళ్లు అవతారమెత్తి ధార్మిక జీవనాన్ని శాసిస్తుండడం చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. విచిత్రమేంటంటే 12,96,000 సంవత్సరాల కాలపరిమితి గల త్రేతాయుగంలో రామావతారమొక్కటే ధరించినట్లుగా పేర్కొనబడింది. పరశురాముడు కూడా శ్రీరాముడు జన్మించిన తర్వాత తన అవతార అవసరం తీరిందంటాడని రామాయణంలో చెప్పబడింది. 8,64,000 సంవత్సరాల కాల పరిమితిగల ద్వాపరయుగంలో కృష్ణావతారమొక్కటే చెప్పబడింది. కలియుగంలో కూడా ఐదు వేల సంవత్సరాలలో ఒక్క దేవుడూ అవతరించలేదు కానీ గత 150 ఏళ్లలో అనేక దేవుళ్లు జన్మించారనీ, వాళ్లు భక్తులకు మోక్షసామ్రాజ్యాన్ని కాక, భక్తుల క్షణిక బాధలూ, తాత్కాలిక సమస్యలూ తీర్చారనీ ప్రచారం జరుగుతుండడం ఈ శతాబ్ది ప్రత్యేకతగా గుర్తింపు పొందుతోంది.
కోవూరు నుంచి జెవివి వరకూ

70 లలో అబ్రహాం టి.కోవూరు అనే శ్రీలంక హేతువాద డాక్టరు సత్యసాయిబాబాను తన ముందు మహిమలు నిరూపించవలసిందిగా సవాలు చేశాడు. కాని బాబా స్పందించలేదు. ప్రభుత్వాలూ ప్రశ్నించలేదు. క్రమేణా టీవీ మీడియా వచ్చిన తర్వాత బాబా మహిమలు మానేసి దాన ధర్మాలు మొదలెట్టారు. అది కూడా ప్రజా ధనమే మరి. ఇటీవల చాలా కాలంగా జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు మహిమల బండారం బయటపెడుతున్నారు. బాబాలు, స్వాములు చేసేవన్నీ మరింత బాగా చేసి చూపిస్తూ ఇదంతా హస్త లాఘవమేనని నిరూపిస్తున్నారు. దురదృష్టం ఏమంటే వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు.
పరంపర.. తామర తంపర
వీరిలో షిర్దీసాయిబాబా వారసులుగా చెప్పుకుంటున్న పుట్టపర్తి సత్య సాయిబాబా, పెనుగొండ కాళేశ్వర్‌, కర్నూలు బాలసాయి బాబా మరియు దత్తాత్రేయుని అపరావతారంగా చెప్పబడుతున్న గణపతి సచ్చిదానంద స్వామి, విష్ణుమూర్తి పదవ అవతారంగా తనను తాను ప్రకటించుకున్న కల్కి భగవాన్‌ ఉరఫ్‌ విజయకుమార్‌, కృష్ణుని అవతారంగా చెప్పుకుంటున్న స్వామి సుందర చైతన్య, ప్రకాశం జిల్లా రామదూత స్వామి... ఇలా అనేకమంది ''భగవత్‌ అవతారమూర్తులు'' మన రాష్ట్రంలోనే అవతరించడం తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. వీరందరూ అతి సామాన్య, పేద కుటుంబాల్లో జన్మించారు. కానీ ప్రస్తుతం వేల కోట్ల రూపాయల ఆస్తులతో సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. హత్యలు, మానభంగాలు, కబ్జాలు ఇలా అనేక నేరారోపణలు వీరిమీదున్నాయి. చాలావరకు నిరూపితమయ్యాయి కూడా. కొన్ని నేరాలను తమ పరపతితో విచారణ స్థాయిలోనే తొక్కేయగలిగారు. వీరు భగవంతుని అవతారమూర్తులని పిలుద్దామా? అంటే కొన్ని దశాబ్దాల కాలంలోనే ఈ విశాల భూగ్రహంపై ఇంతమంది అవసరం ఏం వచ్చిందన్న ప్రశ్న ఉదయిస్తుంది. అదీగాక వీరందరూ జీవించి ఉన్న సమయంలోనే ధర్మ సంస్థాపన జరగకపోగా నేరాల తీవ్రత, నేరస్థుల చిట్టా రోజురోజుకీ పెరుగుతోంది. మరి వీరి అవతార ప్రయోజనమేంటి? పోనీ స్వాములు, యోగులు, సన్యాసులు అనుకుందామా అంటే డబ్బు, బంగారం, ఆస్తులున్న సన్యాసులను చూస్తేనే మహా పాపమనీ, ఆ పాపం పోగొట్టుకోడానికి కట్టుకున్న బట్టలతోనే స్నానం చేయాలనీ ''యాజ్ఞవల్క్య స్మృతి'' వంటి స్మృతులు ఘోషిస్తున్నాయి. కాబట్టి వీరు సన్యాసులూ కారు. వీరి ''లీల''లను కొన్నింటిని పరిశీలిద్దాం.


కర్నూలు బాలసాయిబాబా ఈయన మొదట్లో రికార్డింగ్‌ డ్యాన్సర్‌. బాలసాయిగా అవతారమెత్తాక ఈయన ఆస్తి వందల కోట్లలోకి చేరింది. ఈయన నడిపే స్కూళ్లలో ఉచితంగా చదువు చెప్తారని ప్రచారం. కానీ పిల్లల నుండి 40 వేల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తారు. హైదరాబాద్‌లోని భూ ఆక్రమణ కోర్టు ఇతన్ని భూ కబ్జాదారునిగా నిర్థారించింది. చెక్‌ పవర్‌ తన దగ్గరే అట్టిపెట్టుకున్న ''భగవాన్‌'' ఈయన.

 కాళేశ్వర్400 గదులతో కూడిన అన్ని వసతులూ ఉన్న బ్రహ్మాండమైన ఆశ్రమం ఈయనది. ఈ ఆశ్రమంలోని సిబ్బంది జీతాల ఖర్చే నెలకు పది లక్షల రూపాయలుంది. ఒక భక్తురాలి పట్ల అమర్యాదగా ప్రవర్తించి చెప్పుదెబ్బలు తిన్నాడు. 2005లో పెళ్లి చేసుకున్నాడు. ఆస్తుల విలువ కొన్ని కోట్ల రూపాయలు

 సుందర చైతన్యానంద స్వామి స్వగ్రామం నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం. చిన్నతనంలో కనీసం సైకిల్‌ కూడా లేని పరిస్థితి నుండి ఈనాడు అనేక ఎ.సి కార్లున్న పరిస్థితికి ఎదిగిపోయాడు. కబ్జాల్లో చెయ్యి తిరిగినవాడు. దళితుల గుడిసెలను కూడా వదిలిపెట్టని కబ్జావీరుడు. ధవళేశ్వరంలో ఆ కబ్జాను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన అఖిల పక్ష కమిటీ కార్యకర్తలను గూండాలతో కొట్టించే ప్రయత్నం చేశాడు. ఉపన్యాసాలు చేసేటప్పుడు నెమలి పింఛం పెట్టుకుని భక్తులు తనని శ్రీకృష్ణావతారుడుగా భావించాలంటాడు. భక్తులతో ఒకసారి బంగారు కిరీటం పెట్టించుకుని, బంగారు మురళిని బహుమతిగా అందుకున్నాడు. అయితే ద్వాపరయుగ కృష్ణుడికీ, సుందర చైతన్యానందుడికీ గల ప్రధానమైన తేడా ఏమిటంటే శ్రీకృష్ణుడ్ని ఎంత బంగారంతోనైనా సత్యభామ తూచలేకపోయింది. ఒకే ఒక్క తులసిదళంతో అది సాధ్యమైంది. కానీ మన అపర శ్రీకృష్ణుడు భక్తులకు ఒక్కో తులసిదళం ఇచ్చి వెయ్యి రూపాయలు వసూలు చేశాడు. ఇలా కొన్ని వేల తులసిదళాలు భక్తులకిచ్చి కొన్ని లక్షల రూపాయలు ఆర్జించాడు

 గణపతి సచ్చిదానంద ఈయన పాద దర్శనానికి వెయ్యి రూపాయలు, పాద పూజకు కనీసం 20 వేలు, గృహ ప్రవేశానికి వస్తే మినిమమ్‌ 50 వేలు, అమెరికాలోనైతే పాద పూజకు వేల డాలర్లు వసూలు చేశాడు. ఒక దశలో తన పాదుకలను పంపి ఫీజు వసూలు చేశాడు. ఈయన ప్రస్తుత ఆస్తి వెయ్యికోట్లు.



కల్కి భగవాన్‌ ఉరఫ్‌ విజయకుమార్‌ ఈయన తనను తాను విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కిగా ప్రకటించుకున్నాడు. ఈయన దర్శనానికి ఐదు వందల రూపాయలు, దీక్షకు 50 వేలు, పాదం చూస్తే వెయ్యి రూపాయలు, పాద పూజకు ఐదు వేలు, మాట్లాడేందుకు వేలకు వేలు వసూలు చేశాడు. మూలమంత్రం అంటూ ఒక మంత్రాన్ని సృష్టించి దాన్ని లాకెట్‌లో పొదిగి, ఆ లాకెట్‌ని భారతీయులకు 50 వేలు, విదేశీయులకు లక్ష రూపాయలకు అమ్మాడు. చిత్తూరు జిల్లా, వరదయ్యపాలెం మండలం, బత్తలవల్లం గ్రామంలో మూడు వందల కోట్ల రూపాయలతో గోల్డెన్‌ టెంపుల్‌ నిర్మించాడు. ప్రస్తుత ఆస్తి విలువ వేల కోట్లలో ఉంది. ఈ ఆశ్రమంలో స్వామీజీ ఇచ్చే ద్రవం తాగిన ఆశ్రమవాసులు అచేతనావస్తలో అయోమయంగా మాట్లాడుతున్న దృశ్యాలు టీవీలలో ప్రసారమై ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈయన భూములు విపరీతంగా ఆక్రమించుకోవడంతో భూ పోరాటాలు కూడా జరిగాయి.అయితే ఇప్పటికీ దీనిపై ప్రభుత్వ చర్య శూన్యం.

రామదూత స్వామి ఈయన ఆశ్రమం నెల్లూరు ప్రకాశం మధ్య ఉంది. ఈయన భూకబ్జాదారుడని స్థానిక తహసీల్దారు కలెక్టరుకు నివేదిక పంపించాడు కూడా. అయినా నాటి కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప, నాటి డిజిపి అరవిందరావు ఈయనను దర్శించి పాదాభివందనాలు, సాష్టాంగ నమస్కారాలు చేయడం ఎవరికీ అంతుచిక్కని విషయం.
సర్కార్ల సహకారం!
అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నా ఆశ్రమాల అధిపతులు శిష్య పరివారంతో సహా వైభోగంలో తులతూగడానికి ప్రభుత్వాధినేతలు పాలక వర్గ ప్రముఖుల కుమ్మక్కు ప్రధాన కారణం. చిన్నాచితకా నేరాలకే అమితమైన ప్రచారం ఇచ్చే ప్రభుత్వం, పోలీసులు ఈ బాబాలు, స్వాముల సామ్రాజ్యాల జోలికి పోరు. సాయిబాబా ఆశ్రమంలో అయిదు హత్యలు జరిగినా దానిపై అధికారిక దర్యాప్తు గాని విచారణ గాని లేకపోగా రాజ్యాధినేతగా వున్న శంకర్‌ దయాళ్‌ శర్మ అది చిన్న విషయమని తేల్చేశారు! బాబా ఆరోగ్యపరిస్థితిపై అనేక ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి తటపటాయించింది. వెళ్లిన మంత్రులు ట్రస్టు నిర్వాహకులకే వంత పాడారు తప్ప తమ వంతు బాధ్యత నిర్వహించలేదు. ఇప్పుడు అనివార్యంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నా జరగాల్సిన నష్టం జరిగే పోయింది. లోగడ నగ సన్యాసిని మంగమ్మవ్వ ఓ హత్య కేసులో జైలు పాలైంది. తమిళనాడులో ప్రేమానంద అనే స్వామి కూడా అంతే. అమెరికా వెళ్లిన స్వామి రజనీష్‌ (ఓషో) అక్కడి పోలీసుల దాడి తట్టుకోలేక ఇక్కడకు పరుగెత్తుకొచ్చాడు. నీళ్ల స్వాములు, నిమ్మకాయల స్వాములు, వుమ్మేసే స్వాములు... ఎందరెందరో జన విజ్ఞాన వేదిక ధాటికి చిత్తయిపోయారు. ఈ బడా స్వాములు అలా చిక్కకుండా తప్పించుకోవడానికి కారణం ప్రభుత్వ అండదండలే. పాలక వర్గ ప్రముఖులు పనులు జరిపించుకోవడానికి ఈ ఆశ్రమాలను ఉపయోగించుకుంటారు. అక్కడ చట్టాలు పని చేయకుండా అడ్డుకుంటారు. ఇప్పుడు దేశంలో నల్లడబ్బు గురించి ఇంత చర్చ జరుగుతున్నది గాని బాబా ఆశ్రమంలో గుట్టలు పడిన సంపద ఎవరిదనే దానిపై మాత్రం సమాచారం లేదు. దేశ విదేశీయులు ఇష్టానుసారం సంచరించే అలాంటి చోట సంఘ వ్యతిరేక శక్తులు తలదాచుకునే అవకాశాలను ఎవరూ తోసి పుచ్చలేరు. ఆధ్యాత్మికంగా ప్రతిష్టాత్మకమైన కంచి ఆశ్రమ స్వామి జయేంద్ర సరస్వతి అరెస్టు సందర్భంలో వినవచ్చిన కథనాలు కంపరం పుట్టించాయి. ఏదో కారణంతో జయలలిత ప్రభుత్వం నాడు అంత కఠినంగా వ్యవహరించింది గాని అది అరుదైన ఘటన. ఆమెకు స్వయంగా చాలా మూఢత్వం వుంది. అవినీతి వ్యవహారాలతో నిన్న గద్దె దిగిన యెడ్యూరప్ప ముందు స్వామీజీనే సందర్శించారు. నెల్లూరు జిల్లాలోని రామదూత ఆశ్రమానికి కూడా ఆయన తరచూ వస్తుంటారు. తులాభార చక్రవర్తిగా పేరొందిన మన మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కూడా బాబాలు స్వాముల చుట్టూ తిరుగుతుండే వారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, పోలీసులు, శాస్త్రజ్ఞులు ఆఖరుకు అత్యున్నత నేతలుగా వుండాల్సిన ప్రధాన మంత్రులు రాష్ట్రపతులు కూడా రాజ్యాంగ విలువలను కాలదన్ని బాబాల ముందు మోకరిల్లుతుంటే సామాన్య ప్రజలు వారి చుట్టూ చేరడంలో ఆశ్చర్యం ఏముంటుంది? ప్రజల చైతన్యాన్ని మొద్దుబార్చి పోరాటాల్లోకి రాకుండా చేసేందుకు కర్మ సిద్ధాంతం లాగే బాబాలు కూడా బాగా ఉపయోగపడతారు గనకే పాలకులు వారిని నెత్తిన పెట్టుకుంటారు. ఆపైన తమ అక్రమాలకూ ఉపయోగించుకుంటారు. ప్రశ్నించేవారిని ప్రోత్సహించకపోగా అణగదొక్కుతారు. అంతర్జాతీయ శక్తులు కూడా ఆ విషయంలో వెనకబడవు. వెరసి ఇదొక విష వలయం అంటే తప్పు కాదు.
పుట్టపర్తి సాయిబాబా తనకు తాను భగవంతునిగా ప్రకటించుకున్న ఈ బాబా చనిపోయిన తర్వాత, ఈయన నెలకొల్పిన ట్రస్టు సభ్యులు, బాబా డబ్బునుగానీ, బంగారాన్ని గానీ ముట్టుకునేవారు కాదనీ, విరాళాలన్నీ చెక్కుల రూపంలో ఉంటాయనీ, డబ్బు స్వీకరిస్తే రసీదు ఇచ్చేవారనీ ప్రకటించారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన బెడ్‌రూంలో దాదాపు క్వింటాల్‌ (వంద కేజీలు) బంగారం, కోట్ల రూపాయల నగదు కనిపించింది. ట్రస్ట్‌ సభ్యులు రసీదులు లేని, కోట్లాది రూపాయల బంగారం, నగదు అక్కడ ఎందుకు ఉందనే ప్రశ్నకు జవాబు చెప్ప లేదు. మీడియా కూడా సత్యసాయి నివాస గృహం నుండి అక్రమంగా తరలిపోతున్న ధనాన్ని ఎవరు బయటికి పంపారనే విషయం పైనే కేంద్రీకరించింది కానీ, అసలు సాయి నివాసంలో ఎందుకుందనే విషయంపై దృష్టి సారించలేదు.
అంతేకాదు, రిజర్వ్‌ బ్యాంకు సూత్రాల ప్రకారం ప్రైవేటు వ్యక్తుల వద్ద బంగారం ఎక్కడ్నుండి వచ్చిందనే వివరాలు, రసీదులు లేకుండా కిలోలు, క్వింటాళ్ల లెక్కన బంగారం ఉండకూడదు. కానీ వంద కేజీల బరువున్న సుందర చైతన్యానంద బంగారంతో తులాభారం తూగినా, పుట్టపర్తి సత్యసాయిబాబా వద్ద దాదాపు క్వింటాల్‌ బంగారం లెక్కల్లో లేనిది ఉన్నా రిజర్వ్‌ బ్యాంకు కానీ, ప్రభుత్వం కానీ ఎంక్వయిరీ చేయించిన దాఖలాలు లేవు. అంటే ఈ స్వాములూ, బాబాల ఆశ్రమాలు వారి స్వంత సామ్రాజ్యాలా? వారి నెవరూ సోదా చేయకూడదా?
ఈ భగవాన్‌లు, స్వాములలో కొందరు తమ భారీ నిల్వ ధనంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నారు. కాబట్టి వారిని గౌరవించాలనీ, కీర్తించాలనీ కొందరు అంటుంటారు. ఇదే పరిస్థితి బాబాలు మన అమాయక భక్తుల విషయంలోనూ జరుగుతోంది. కబ్జాదారులు, మోసగాళ్లు.... బాబాలు, స్వాముల అవతారాలు ఎందుకు ఎత్తుతున్నారు? అన్న ప్రశ్నకు ఒక టీవీ చానల్‌ ప్రసారంలో ఒకరు ఇచ్చిన సమాధానం మీ ముందుంచుతాను.
''ఒక కొలనులో కొన్ని చేపలుండేవి. వాటిని తినడానికి ఓ కొంగ వచ్చింది. రోజల్లా ఆ నీళ్లల్లో ప్రయత్నించినా ఒక్క చేపా దానికి దొరకలేదు. అప్పుడది సమీపంలో వున్న తన గురువుగారి దగ్గరకు వెళ్లి తనకు చేపలు దొరికే మార్గం చెప్పమని అడిగింది. ఆ గురువుగారు నీవు రేపు కాషాయ వస్త్రాలు ధరించి వెళ్లు. నీ దగ్గరకే చేపలు వస్తాయి'' అని చెప్పారు. గురువు గారు చెప్పినట్టే చేసి కొంగ కడుపు నిండా చేపలను ఆరగించిందట. ఇదీ కాషాయ వస్త్రాల రహస్యం. అందుకే నిపుణులైన మోసగాళ్లు కాషాయ వస్త్రాలు ధరించి ప్రజల ముందుకు వస్తున్నారు. అమాయకులైన ప్రజలు వారి వలలో పడి తమ సర్వస్వం సమర్పించుకుంటున్నారు.
ఈ సందర్భంలో ఒక విషయం స్పష్టం చేయాలి. కాషాయం ధరించిన వాళ్లంతా మోసకారులు కాదు. ఎవరైతే సామాన్యమైన మెజీషియన్లు చేసే మేజిక్కులను తాము కూడా చేసి అవి తమ మహిమలని ప్రకటించుకుంటారో, ఎవరైతే దర్శనానికి కూడా రేట్లు నిర్ణయిస్తారో, ఎవరైతే వందల..వేల కోట్లలో ఆస్తులు సంపాదించి సన్యాస ధర్మాన్ని అతిక్రమిస్తారో, ఎవరైతే తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తాము చనిపోయే వరకు చెక్‌ పవర్‌ కూడా వదులుకోరో వారిని మోసగాళ్లగా ప్రజలు గుర్తించాలి.
మూఢత్వమే మార్కెట్‌!
ఆధునిక యుగంలో కూడా ఎందుకీ మూఢత్వం? చదువుకున్న వారు కూడా మోసకారి స్వాముల వెంట ఎందుకు పడుతున్నారు? వంటి ప్రశ్నలు తరచూ ఎదురవుతుంటాయి. విద్యలో విజ్ఞానాన్ని రంగరించే బదులు దేనికదిగా చెబుతూ మూఢత్వాన్ని ప్రోత్సహించే విధానాలు ఇందుకు ముఖ్య కారణం. అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్‌ ప్రయోగించే ఉపగ్రహ నమూనాను దైవ దర్శనానికి తీసుకువెళ్లడం నిజానికి సైన్సుకే గాక రాజ్యాంగ లౌకిక స్వభావానికి కూడా విరుద్ధం. అయినా అవన్నీ షరా మామూలుగా జరిగిపోతున్నాయి. పాలకులకు ప్రజల మూఢత్వం కావాలి తప్ప చైతన్యం కాదు.దాన్ని పెంచేందుకే సహకరిస్తారు తప్ప తగ్గించేందుకు సిద్ధపడరు. ఇప్పుడు నడుస్తున్న ప్రపంచీకరణ వాస్తవంలో మార్కెట్‌తత్వంతో పాటు మత ఛాందసాన్ని కూడా ఎగదోస్తుంది. అంతర్జాతీయ సామ్రాజ్యవాదాన్ని గురించి తెలుసుకోకుండా స్థానికత పేరిట అంధ విశ్వాసాలలో జనం కూరుకుపోవడం వారికి చాలా అవసరం. అలాగే వారి మార్కెట్‌ సూత్రాలకు ఏదీ అతీతం కాదు గనక మూఢత్వాన్ని భక్తి విశ్వాసాలను కూడా మార్కెట్‌ సరుకుగా మార్చుకుని సొమ్ము చేసుకుంటారు. బాబాలు తమ ప్రచారం తామే చేసుకునే రోజుల నుంచి ఇప్పుడు మెగా ఈవెంట్స్‌గా జరిపే స్థితికి వచ్చారంటే అదే కారణం. ఒకప్పుడు హరేరామ హరే కృష్ణ ఉద్యమం మన దేశంలో గాక పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయిన సంగతి మర్చిపోరాదు. వినోదం పొందడానికి విలాసంగా గడపడానికి కూడా వారికి ఈ ఆశ్రమాలు ఉపయోగపడతాయి. విదేశీయులు వస్తే అది అదనపు ఆకర్షణగా భావించి మన దేశంలోని అమాయక ప్రజలు కూడా ఎగబడతారు.
చిన్న చిన్న స్వాముల నుంచి వేలకోట్ల రూపాయలార్జించిన బడాస్వాముల వరకూ, వీరికి భక్తులెందుకు ఏర్పడుతున్నారు? కొంత మందికి మానవాతీత శక్తులుంటాయనే కథలను పసితనం నుంచి అమ్మలు, బామ్మలు, పాఠ్యపుస్తకాలు నూరిపోయడమే స్వాములను మానవాతీత వ్యక్తులుగా నమ్మడానికి ప్రధాన కారణం. పాఠ్యపుస్తకాలలో శాస్త్రీయ అవగాహనను పెంచే అంశాలే వుండడం లేదు. పైగా ఉన్నత విద్యావ్యవస్థలో జ్యోతిషం, వాస్తు వంటి అశాస్త్రీయ అంశాలు కోర్సులుగా ప్రవేశ పెట్టబడ్డాయి. దానితో ప్రజలలో అశాస్త్రీయ ఆలోచనా విధానం బాగా ముదిరిపోయింది. ''ఈశాన్య మూలన బరువు వుంటే ధన నాశం'' అని ఒక వాస్తువాది అంటే నమ్మడమే గానీ ఈశాన్య మూలన వుండే కర్రకు, మన ఇంట్లో ధనాన్ని నాశనం చేసే శక్తి ఎలా వస్తుంది? అని హేతుబద్ధంగా ఆలోచించే శక్తి నశించింది. అందుకే నిన్నటి దాకా బిందెల చిల్లులకు మాట్లు వేసుకుని బతికిన వ్యక్తి నేడు నీళ్ల స్వామి అవతారమెత్తి, ప్రజల రోగాలు పోగొట్టే శక్తిగలవాడంటే నమ్మి విద్యాధికులతో సహా నీళ్ల చెంబులతో అతని ముందు క్యూ కట్టారు. నిన్న సినిమా హాళ్ల ముందు బ్లాకులో టికెట్లు అమ్మిన వ్యక్తి నేడు బాబా అవతారమెత్తి ఆశీర్వదిస్తున్నాడంటే శిరస్సు వంచారు. కాబట్టి ఈనాడు నలుగురైదుగురు బాబాలు, స్వాముల బండారం బయటపెడితే, వారి సొంత సామ్రాజ్యాల పెరుగుదల ఆగిపోతుంది. అంతే. రేపు మరో నలుగురైదుగురు స్వాములు 'అవతరిస్తారు'. ప్రజలు వారిని అనుసరిస్తారు. వీరి 'ప్రమాదం' నుంచి ప్రజలు బయటపడాలంటే విద్యార్థి దశ నుంచే పిల్లల మనస్సులలో శాస్త్రీయ అవగాహనా బీజాలు నాటాలి. ప్రకృతి సూత్రాలకతీతంగా ఎవ్వరూ ఏ పనీ చేయలేరని వివరించాలి. అశాస్త్రీయ అంశాల బోధనను నిలిపివేయాలి.
ఒక మోసకారి బాబాదో, కబ్జాస్వామిదో బండారాన్ని సైన్సు ఉద్యమకారులు బయటపెట్టినప్పుడు, ఆ ప్రయత్నం హిందూ మతం మీద దాడిగా భావించుకొని కొందరు ఆవేశపూరితులౌతున్నారు. సైన్సుఉద్యమకారులు హిందూ మతం మీదే దాడిచేస్తారనీ, ఇతర మతాలకు చెందిన మోసగాళ్ల జోలికి పోరనీ ఆరోపిస్తున్నారు. హైదరాబాదులో ఎంతోమంది ముస్లిం మతానికి చెందిన నకిలీ బాబాలు దొరికిపోయారు. సైన్సుఉద్యమకారులు బలంగా వున్న చోట ముస్లిం, క్రిస్టియన్‌ మతాలలోని మోసగాళ్ల బండారాలను కూడా బయటపెడుతున్నారు. కింది ఉదాహరణను పరిశీలించండి.
''అమెరికాలో దైవదూతగా ప్రచారం పొందిన మావియన్‌ సెలోలార్‌ బొంబాయి, మద్రాసులలో విజయవంతంగా పర్యటనలను ముగించుకొని కలకత్తాలో అడుగుపెట్టారు. ఆయన రాకకు పత్రికలలో కనీవినీ ఎరుగని ప్రచారం లభించింది. చెవుడు, మూగతనంతో బాధపడుతున్నవారిని తక్షణం నయం చేస్తాననే వాగ్దానంతో నగరంలోని పార్క్‌ సర్కస్‌ మైదానంలో ఆయన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆయన తన అసమాన వాక్చాతుర్యంతో వేలాదిమందిని ఆకట్టుకున్నారు. అయితే సైన్సుఉద్యమకారులు రంగప్రవేశం చేసి ఆయన బూటకాన్ని బట్టబయలుచేసే వరకే అదంతా సాగింది. సైన్సుఉద్యమకారులు అకస్మాత్తుగా వేదికపైకి ఎక్కి సెలోలార్‌ అప్పుడే నయం చేశానని చెబుతున్న ఒక వ్యక్తిని చుట్టుముట్టారు. తరచి తరచి ప్రశ్నించిన మీదట అతను అసలు చెవుడు లేదా మూగ కాదని తేలింది. దాంతో ఆగ్రహావేశులైన ప్రజలు సెలోలార్‌పై రాళ్లు రువ్వడంతో ఆయన వాటి నుంచి ఎలాగో తప్పించుకున్నారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించి అక్కడి నుంచి పంపివేసింది.''

(లేఖా రతనాని, కవితా షెట్టి, టి.ఎన్‌.గోప కుమార్‌, సరితా రారులు ఇండియా టుడే లో వ్రాసిన వ్యాసం నుంచి)
ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, శివసేనలు బలంగా వున్న బొంబాయిలో సెలోలార్‌ బండారం బయటపడలేదు. అసలు అక్కడ ఆ ప్రయత్నమే జరగలేదు. సైన్సుఉద్యమకారులు బలంగా వున్న కలకత్తాలో అతని బండారం బయటపెట్టబడింది. మార్క్సిస్టు ప్రభుత్వం ఆ మోసగాడిని రాష్ట్రం నుంచి బయటకు పంపేసింది. ఇదీ అసలు విషయం.
భగవత్‌ స్వరూపులను విమర్శిస్తే వారి భక్తుల మనోభావాలు గాయపడతాయని ఇటీవల కొందరు అంటున్నారు. పురాణాల ప్రకారం చూసినా భగవంతుడికేే భక్తులుంటారు. భగవత్‌ స్వరూపులను అనుసరించేవారిలో చాలా మంది అమాయకంగా మోసగాళ్లను నమ్ముతున్నారు. కాబట్టి ఆ అమాయకులను ఆత్మహత్యా సదృశ్యమైన మార్గం నుంచి తప్పించి, మోసగాళ్ల బారి నుంచి బయట పడవేయడం ప్రతి ఒక్క పౌరుని కర్తవ్యం. కాబట్టి భగవత్‌ స్వరూపుల మోసాలను, కబ్జాలను బయట పెట్టడాన్ని, వారి భక్తుల మనోభావాలను గాయపరచడం కానే కాదు. రాజ్యాంగంలో 51ఎ (హెచ్‌) అధికరణం కూడా ఆ కర్తవ్యాన్ని నిర్దేశిస్తోంది. ఇన్ని భాగోతాలు బయటపడిన తర్వాతనైనా ఈ స్వాములు, బాబాలు, భగవత్‌ స్వరూపుల మాయా సామ్రాజ్యాలను విచ్ఛిన్నం చేయడం ప్రతి ఒక్క దేశ భక్తుడి బాధ్యత. అంతకు మించి ప్రభుత్వాల బాధ్యత.


***Article From Prajasakti Daily
Written By K.L.KanthaRao  http://www.prajasakti.com/




Tuesday, August 2, 2011

గాడిద-ఏనుగు పోరు

పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటంగా మారినట్లు ప్రపంచ ధనిక దేశాల విన్యాసాలున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలను గమనంలో ఉంచుకొని అమెరికాలోని పాలక ప్రతిపక్షాల బడ్జెట్‌కోత, దేశ రుణపరిమితిపై వేస్తున్న ఎత్తులు జిత్తులు చివరకు ప్రపంచంలో దేనికి దారితీస్తాయో తెలియని అయోమయంలోకి నెడుతున్నాయి. చిత్రమేమంటే అవసరం లేని ఆయుధాలు కొని ఐరోపాలోని పేద దేశమైన గ్రీస్‌ దివాళా తీస్తే ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకున్న అమెరికా కూడా ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లు ప్రపంచ దేశాలన్నింటికీ పొదుపు చర్యలు తీసుకోవాలని బోధించే అమెరికా ఇప్పుడు తమ అప్పు భారాన్ని తగ్గించుకొనేందుకు ఎలాంటి పొదుపు చర్యలు తీసుకోవాలో తేల్చుకోలేక కొట్టుమిట్టాడుతోంది. ఆగస్టు రెండవ తేదీలోగా ఈ సమస్యపై ఏదో ఒక పరిష్కారానికి రాని పక్షంలో ప్రభుత్వ బిల్లు చెల్లింపులు నిలిచిపోతాయి. ఈ స్థితిని చూసి యూరోపియన్లు దివాళాకు సిద్దంగా ఉన్న మా పోర్చుగల్‌కు అమెరికాకు తేడా ఏంటట అని జోకులు వేస్తున్నారు. అనేక ఇతర దేశాలపై ప్రభావం చూపుతుందన్న జ్ఞానం, బాధ్యత లేకుండా అమెరికాలోని గాడిద-ఏనుగు(రిపబ్లికన్‌-డెమోక్రటిక్‌ పార్టీల గుర్తులు) దెబ్బలాడుకుంటున్నాయని చైనా వార్తా సంస్థ సిన్హువా ఘాటుగా స్పందించింది. రుణ ఊబిలో అమెరికా కూరుకుపోతే చైనా, ఇతర దేశాలు ఎందుకు అంతగా ఆందోళనకు గురికావాలని ఎవరైనా అడగవచ్చు. ఒకనాడు ప్రపంచంపై పెత్తనం చలాయించిన బ్రిటీష్‌ పౌండు స్థానాన్ని అమెరికన్‌ డాలర్‌ ఆక్రమించింది. దాంతో డాలర్‌పే పరమాత్మ అన్నట్లు పరిస్థితి తయారైంది. ఇప్పుడా ఆ డాలరే ఆరు దశాబ్దాలలో తొలిసారిగా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నపుడు డాలర్లను కలిగి ఉన్నవారికి,దానిపై ఆధారపడిన వారికి ఆందోళన లేకుండా ఎలా ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే అధికంగా చైనా ఇప్పుడు 1.16లక్షల కోట్ల డాలర్లతో అమెరికన్‌ బాండ్లు కొనుగోలు చేసింది. ఒక వేళ తన కరెన్సీ విలువను అమెరికా తగ్గించినా, బరితెగించి దివాలా ప్రకటించినా మునిగిపోయేది ప్రపంచమే. సంక్షోభ ఊబిలో మునిగి ఉన్న తమను రక్షిస్తుందని భావిస్తున్న అమెరికాయే రుణ ఊబిలో దిగబడితే తమ గతేం కానని ఐరోపా యూనియన్‌ దేశాలు బావురుమంటున్నాయి. ప్రపంచ ద్రవ్య మార్కెట్ల పట్ల తమకూ బాధ్యత ఉందన్న స్పృహతో అమెరికన్‌ రాజకీయ పక్షాలు వ్యవహరించాలని జర్మన్‌ ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు చేజేతులా తాను సృష్టించిన సంక్షోభానికి తాను బలౌతూ ప్రపంచాన్ని కూడా బలితీసుకుంటున్న అమెరికాలో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. సకల రోగాలున్న రోగికి ఒకదానికి మందిస్తే మరొక రుగ్మతకు దారి తీస్తుందన్న మాదిరి పరిస్థితి తయారైంది. ఇప్పుడున్న ఉద్దీపన పథకాలు, సంక్షేమ పథకాలను కొనసాగిస్తే రుణభారం పెరుగుతుంది. దాన్ని అదుపులో ఉంచటానికి ఉద్దీపన, సంక్షేమ పథకాలకు కోతపెడితే ఇప్పుడున్న ఒకశాతం అభివృద్ధి రేటు మైనస్‌లో పడుతుంది. దీనిలో ఏది జరిగినా అధికారంలో ఉన్న బరాక్‌ ఒబామా రెండవసారి ఎన్నికయ్యే అవకాశం ఉండదు. ధనికుల రాయితీలు తగ్గించకుండా సంక్షేమ పథకాలపై కోత పెట్టించటం ద్వారా ఒబామాను ప్రజలనుంచి దూరం చేసి తాము గద్దెనెక్కాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు చూస్తున్నారు. అందుకోసం రెండుపార్టీలు గత నెల రోజులుగా ఆడుతున్న చెలగాటం ప్రపంచానికి ప్రాణసంకటంగా మారుతోంది. ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్న ప్రతిపక్ష రిపబ్లికన్లు ఆమోదించిన ఒక ఫార్ములా తీర్మానాన్ని 24 గంటలలోపే డెమొక్రాట్లు మెజారిటీ ఉన్న సెనేట్‌ తోసి పుచ్చింది. రెండు సభలలోనూ కొందరు రిపబ్లికన్లు అధికార పార్టీతో చేతులు కలిపారు.
నిజంగా అమెరికా అంత ప్రమాదంలో ఉందా? అలాంటపుడు ఇప్పటికీ అది ప్రపంచ అగ్రరాజ్యంగా ఎందుకుంటోందని కొందరికి సందేహం రావచ్చు. సంక్షోభం, సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ఆర్థికంగా, మిలిటరీ, రాజకీయంగా అమెరికా ఇప్పటికీ అగ్రరాజ్యంగానే ఉంది. దాని ఆధిపత్యానికి ముప్పుతెచ్చే సమస్యల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. అందువల్లనే గాడిద-ఏనుగు పార్టీలు రెండూ కూడా ఎంతసేపటికీ సామాన్యుల సంక్షేమ పథకాలకు ఏమేరకు కోతపెట్టాలనే దానిపై కీచులాడుకుంటున్నాయి తప్ప ఆఫ్ఘన్‌, ఇరాక్‌, లిబియాలపై దాడులు, దురాక్రమణలకు, ప్రపంచంలో ఇతర చోట్ల అగ్గి రాజేసేందుకు చేస్తున్న మిలిటరీ ఖర్చు తగ్గించటం గురించి ఏమాత్రం ఆలోచించటం లేదు. రానున్న పది సంవత్సరాలలో సంక్షేమ పథకాలకు కోత పెట్టి పొదుపు చేయాలని చూస్తున్న మొత్తం కంటే యుద్ధ ఖర్చు రెండింతలుంది. పోనీ ఆ యుద్ధం ద్వారా ఏమైనా సాధించిందా అంటే తన కంపెనీల ఆయుధాలు అమ్ముకోవటం, చవకగా ఇరాక్‌ నుంచి చమురును కొట్టేయటం తప్ప సామాన్య అమెరికన్లకు ఒరిగిందేమీ లేదు. ఉగ్రవాదంపై పోరు పేరుతో ఆప్ఘనిస్తాన్‌లో చేస్తున్న దాడులు ఉగ్రవాద ప్రమాదాన్ని మరింత పెంచాయే తప్ప తగ్గించలేకపోయాయని ఒసామా బిన్‌లాడెన్‌ హత్యానంతర పరిణామాలు కూడా స్పష్టం చేశాయి. అన్నమైతే నేమిరా సున్నమైతే నేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లు అమెరికా ఆర్థిక వ్యవస్థలో సంక్షోభాలు తలెత్తిన ప్రతిసారీ నష్టపోయింది సామాన్యులు తప్ప కార్పొరేట్‌ కంపెనీలు కాదు. తాజా సంక్షోభంలో అమెరికాలో దాదాపు 50లక్షల మంది తమ కొంపాగోడు కోల్పోయారు తప్ప వారికి అప్పులిచ్చి తిప్పలకు గురిచేసిన బ్యాంకర్లు లక్షల కోట్ల డాలర్ల ప్రభుత్వ ఉద్దీపన పథకాలతో అపరిమిత లాభాలు ఆర్జించారు. వారికి సంక్షోభం వరంలా పరిణమించింది. ఇప్పుడు కూడా అలాంటి వారే రెండుపార్టీల వెనుక చేరి సామాన్యుల నెత్తిన శఠగోపం పెట్టించేందుకు చక్రం తిప్పుతున్నారు.
సోమవారంలోగా సమస్య పరిష్కారంగాకపోతే అమెరికాలో ఏమౌతుంది? చికాగో నగరంలో వచ్చే గురువారం నాడు అట్టహాసంగా తన 50వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకొనేందుకు అధ్యక్షుడు ఒబామా సిద్ధం అవుతున్నాడు. నిజంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా అలా చేస్తారా? గడువులోగా తాను చెప్పిన విధంగా పార్లమెంట్‌ రాజీకి రాకపోతే రాజ్యాంగంలోని పద్నాల్గవ సవరణ కత్తిని ఉపయోగించేందుకు సిద్ధం అవుతున్నాడు. దాని ప్రకారం ప్రభుత్వ రుణ పరిమితిపై అధ్యక్షుడి నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించే అవకాశం ఉండదు. ఎన్నికలలో రుణాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకొనేందుకు ప్రతిపక్ష రిపబ్లికన్లు ఒబామాను ఆ స్థితికి నెడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షం సహకరించని కారణంగా కత్తి ఝళిపించక తప్పలేదని ఒబామా కూడా ఎన్నికల్లో చెప్పుకుంటాడని వేరే చెప్పనవసరం లేదు. ఏమైనా అమెరికాలోని అధికార,ప్రతిపక్షపార్టీలు రెండూ కలిసి సామాన్య అమెరికన్లు, ప్రపంచ దేశాలను కష్టాల పాల్జేస్తున్నాయి.
article From : prajasakti daily

Friday, July 22, 2011

మర్డోక్‌ మీడియా - నేరస్త జర్నలిజం

మీడియా సామ్రాజ్యానికి రారాజు వంటి వాడు ఆస్ట్రేలియాకు చెందిన రూపర్ట్‌ మర్డోక్‌. న్యూస్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ ద్వారా అన్ని ఖండాలలో పత్రికలు, టీవీ ఛానల్స్‌తో తన ఆర్థిక ప్రాభవాన్ని పెంచుకొనేందుకు ఎంతకైనా తెగించే ఒక దుష్టశక్తిగా పేరు తెచ్చుకున్నాడు. దానిలో భాగంగానే పలు తరగతులవారి ఫోన్లను దొంగచాటుగా విని ఆ సమాచారంతో వార్తలు ప్రచురించటం, ఇతరత్రా వినియోగించుకొని సొమ్ముచేసుకున్న పెద్ద కుంభకోణంలో మర్డోక్‌ కుటుంబం ఇరుక్కుంది. ఇప్పటివరకు సూత్రధారులను వదలి పాత్రధారులుగా ఉన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని నడిపించిన సంపాదకులు రెబెగా బ్రూక్స్‌, లెస్‌ హింటన్‌ తమ మర్డోక్‌ వ్యాపార సామ్రాజ్యంలో తమ బాధ్యతలకు రాజీనామా చేశారు. తొమ్మిది సంవత్సరాల క్రితం అపహరణ, హత్యకు గురైన 13 సంవత్సరాల బాలిక చివరిగా ఇచ్చిన సమాచారం, ఇతర అంశాలను ఆమె ఫోన్‌ బాక్సునుంచి తొలగించిన న్యూస్‌ ఆఫ్‌ దివరల్డ్‌ పత్రిక జర్నలిస్టులు అమె తప్పిపోయింది తప్ప మరణించలేదనే అభిప్రాయం కలిగించారు. వివిధ తరగతులనుంచి వస్తున్న వత్తిళ్లు, తన వ్యాపార సంస్థల వాటాల ధరలు స్టాక్‌మార్కెట్లో పడిపోతుండటంతో మర్డోక్‌ శుక్రవారం నాడు ఆ బాలిక ఇంటికి వెళ్లి తమ సిబ్బంది చేసిన తప్పిదానికి క్షమాపణలు కోరాడు. పత్రికల్లో విచారం వెలిబుచ్చుతూ పేజీలకు పేజీల ప్రకటనలు ఇచ్చాడు. లేబర్‌ పార్టీ మాజీ ప్రధాని గార్డన్‌ బ్రౌన్‌ కూడా మర్డోక్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు బలయ్యాడు. తనను పదవి నుంచి తప్పించటానికి పేరు మోసిన క్రిమినల్స్‌ను వినియోగించి సండే టైమ్స్‌ పత్రిక తన వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించిందని స్వయంగా చెప్పాడు. తమకు అవసరమైన సమాచారం ఇవ్వని వారికి లంచం ఇవ్వటం,లొంగనివారిని బ్లాక్‌ మెయిల్‌, వేధించటం మర్డోక్‌ వ్యవహార శైలి.
బ్రిటన్‌కు చెందిన న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రిక మూసివేత. తన ఆధీనంలోని పత్రికలు అక్రమాలకు పాల్పడితే సహించను అవసరం అయితే శాశ్వతంగా మూసివేస్తా అని గొప్పలు చెప్పుకొనేందుకే. ప్రపంచంలో ఎంతటి పెద్ద పత్రిక,రేడియో స్టేషన్‌, టీవీ ఛానల్‌ అయినా కొనుగోలు చేయగలిగిన మర్డోక్‌ కుటుంబానికి ఒక పత్రికను మూత వేయటం పెద్ద లెక్కలోది కాదు. కానీ దీనివల్ల తప్పు చేయని జర్నలిస్టులు, సిబ్బంది కూడా వీధిలో పడ్డారు.
రాణీగారి ప్రతిపక్షం, అధికార పక్షం అనేది బ్రిటన్‌లో ఒక సామెత. అలాగే అధికార పక్షాన్ని వ్యతిరేకించటమే తన విధానం అని చెప్పుకొనే ఈ పెద్దమనిషి నిజానికి ఎక్కడ అధికారం ఉంటే దానితోనే ఉండి తన పబ్బం గడుపుకుంటాడు. అమెరికాలో టీవీ ఛానల్‌ను నడపాలంటే యజమాని అమెరికా పౌరుడై ఉండాలి. దాంతో అక్కడ పాగా వేసేందుకు 1985లో అక్కడి పౌరసత్వాన్ని తీసుకున్నాడు. అమెరికాలో అతి పెద్ద ధనికుల్లో 38వ స్థానం(2010) ఆక్రమించాడు. మర్డోక్‌ మీడియా కుంభకోణంపై పార్లమెంటరీ కమిటీ విచారణకు హాజరు కావాలని బ్రిటన్‌ కోరింది. ప్రభుత్వం అన్నీ అవాస్తవాలు చెబుతోంది. విచారణకు రావాలో లేదో ఇంకా నిర్ణయించుకోలేదని పొగరుబోతుగా సమాధాన మిచ్చాడు.
నిజానికి ఈ కుంభకోణంలో మర్డోక్‌ను రక్షించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం తన శక్తి కొలదీ ప్రయత్నిస్తోందంటే అతిశయోక్తి కాదు. దానిలో భాగమే పార్లమెంటరీ విచారణ తతంగం. ఆపేరుతో అక్రమాల వివరాలను ధ్వంసం చేసేందుకు వ్యవధి ఇవ్వటమే. బ్రిటన్‌లో మూతవేసిన న్యూస్‌ ఆఫ్‌ది వరల్డ్‌ పత్రిక ఫోన్ల ట్యాపింగ్‌లో పేరు మోసింది. గత తొమ్మిది సంవత్సరాలుగా దాని అనుచిత కార్యకలాపాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులు, పోలీసు అధికారులు, చివరకు ఇతర పత్రికల జర్నలిస్టుల ఫోన్‌ సంభాషణలను కూడా అక్రమంగా వింటూ మర్డోక్‌ సేవలో తరిస్తున్నది. అలాంటి దానిని ఇప్పుడు ఆకస్మికంగా మూసివేయటం వెనుక కూడా పెద్ద కుంభకోణమే ఉంది. రెండు సంవత్సరాల క్రితం ఇద్దరు ప్రముఖుల ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వారికి 16 లక్షల పౌండ్ల నష్టపరిహారం చెల్లించి న్యూస్‌ ఆఫ్‌ది వరల్డ్‌ కేసుల నుంచి బయట పడింది. ఇప్పుడు దాని పాత కేసులన్నీ బయటకు వచ్చేట్లుగా ఉన్నాయి. అదే జరిగితే కేసులు కోర్టుల్లో పోరాడగలిగిన వివిధ రంగాల ప్రముఖులు కనీసం మూడువేల మంది ఉంటారని అంచనా. అదే జరిగితే వందల కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని తప్పించుకొనేందుకే పత్రిక మూత. కుంభకోణం వివరాలు బయటకు వచ్చిన తరువాత ముందుగా ఎవరైనా ఆధారాలను ధ్వంసం చేయకుండా చర్యలు తీసుకుంటారు. మర్డోక్‌ యంత్రాంగం ఫోన్‌ ట్యాపింగ్‌ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు గత కొద్ది రోజులుగా కంప్యూటర్లనుంచి సమాచారం మొత్తాన్ని తొలగిస్తున్నది.కొన్ని కోట్ల ఇమెయిల్స్‌, ఇతర సమాచారాన్ని ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు.
బ్రిటన్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తరువాత అమెరికాలో కూడా అదే తరహా అక్రమాలకు పాల్పడినట్లు బయటపడింది. న్యూయార్క్‌ నగరంలోని ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసిన ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాల ఫోన్‌ నంబర్లను సేకరించి వారి సంభాషణలను దొంగచాటుగా విన్నట్లు వచ్చిన ఫిర్యాదులపై అక్కడి ఎఫ్‌బిఐ విచారణకు ఆదేశించింది.
'మర్డోక్‌ ఎల్లపుడూ అధికార పక్షం వైపే ఉండాలని కోరుకుంటాడు. అతనెప్పుడూ ఓడిపోయిన వారితో ఉండాలని కోరుకోడు' అని అతని జీవిత చరిత్రను రాసిన విలియమ్‌ షాక్రాస్‌ పేర్కొన్నాడు. తనతో పాటు పత్రికలో రాతలు కూడా ఎటుతిరిగితే అటే తిరగాలని ఆదేశించటంతో 'ది ఆస్ట్రేలియన్‌' అనే పత్రిక జర్నలిస్టులు నిరసనగా సమ్మెకు దిగారు. సమ్మెకు దిగిన వారు ఎర్ర జెండాలు పట్టుకున్న కిరాయి వ్యక్తులని మర్డోక్‌ నిందించాడు. అమెరికాలో న్యూయార్క్‌ పోస్ట్‌ అనే పత్రికను కొనుగోలు చేసినపుడు కూడా ఇలాగే జరిగింది. లండన్‌లోని తన పత్రికల్లో సిబ్బంది తాను చెప్పినట్లు వినాలి తప్ప చట్టాలు గిట్టాలు అంటే కుదరవని ప్రకటించిన నిరంకుశుడు మర్డోక్‌. ముద్రణా విభాగ కార్మికులను దెబ్బతీసేందుకు రహస్యంగా ఒక ముద్రణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ యూనియన్‌లేకుండా చూశాడు. రెగ్యులర్‌ ప్రెస్‌ కార్మికులు సమ్మెకు పూనుకోవటంతో వాటిని మూసివేసి ఆరువేల మందిని ఇంటికి పంపి యూనియన్‌లేని ప్రెస్‌ ద్వారా పత్రికలను ముద్రించాడు.
మర్డోక్‌ మద్దతు కోసం పాకులాడటంలో లేబర్‌, టోరీ పార్టీలకు తేడాలేదు. అందుకే అధికారంలో ఉన్న టోరీ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ కుంభకోణ తీవ్రతను తగ్గించేందుకు తన వంతు పాత్రను పోషిస్తున్నాడు.' నిజం ఏమిటంటే దీనిలో మనం అందరం ఉన్నాం, మీడియా, రాజకీయవేత్తలు, నాతో సహా అన్ని పార్టీల నాయకులు దీనికి బాధ్యులే'. అని వ్యాఖ్యానించాడు. ఇది నిజంగా హృదయంలోంచి వచ్చిందైతే వెంటనే పదవికి రాజీనామా చేసి ఉండేవాడు. పొదుపు చర్యల పేరుతో విశ్వవిద్యాలయాల ఫీజులను కామెరాన్‌ సర్కార్‌ విపరీతంగా పెంచింది. దాన్ని వ్యతిరేకించిన విద్యార్థులు పెద్ద ఆందోళన చేశారు. వారిని పోలీసులతో కొట్టించి జైల్లో పెట్టిన గూండాలుగా చిత్రించిన కామెరాన్‌ మర్డోక్‌ వంటి నేరగాళ్లను ప్రోత్సహించటంలో తాము కూడా ఉన్నామని చెప్పుకొనేందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఇదే వర్గనీతి.

Note : article from prajasakti.daily

Monday, July 18, 2011

మర్డోక్‌ మాఫియా జర్నలిజం

దాదాపు నాలుగు వందల సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాపితంగా పలువురు సంపాదకులు, యజమానులు సమకూర్చిన పత్రికల విశ్వసనీయతను నలభై సంవత్సరాల కాలంలో తలెత్తుకోలేనంతగా దెబ్బతీసిన దుష్టశక్తి రూపర్ట్‌ మర్డోక్‌. ఎక్కడ తిరిగితే నాకేం నా దొడ్లో ఈనటం ముఖ్యం అని తలచే బాపతు మర్డోక్‌. ఏం చేస్తారో నాకనవసరం సంచలనాత్మక వార్తలతో నా పత్రికలు, టీవీ ఛానళ్లు లాభాలు సంపాదించాలి, ప్రపంచమంతటా నా సామ్రాజ్యం విస్తరించాలని ఆదేశించిన తరువాత జర్నలిస్టులు,ప్రచారం కోసం తహతహలాడే అధికార రాజకీయ నాయకులు, అయితే నాకేంటి అనే పోలీసు అక్రమార్కులు కలిసి విలువల వలువలను విప్పేశారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు మర్డోక్‌గేట్‌ అక్రమాలు ఐరోపా, అమెరికా ఖండాలను గత రెండు వారాలుగా అనేక మలుపులు తిప్పుతున్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు గలవారి వ్యక్తిగత అంశాల వంటి వాటితో ప్రారంభించి చివరకు ఉగ్రవాదుల దాడులు, ఇతర సందర్భాల్లో మరణించిన వారిని కూడా వదల కుండా వేలాది కుటుంబాల దైన్య స్థితిని కూడా సొమ్ము చేసుకొనే హీన స్థాయికి మర్డోక్‌ కంపెనీలు దిగజారాయి. తొమ్మిది సంవత్సరాల క్రితం బ్రిటన్‌లో అపహరణకు గురై హత్యగావించబడిన 13 సంవత్సరాల బాలిక ఉదంతం ఇప్పుడు మర్డోక్‌ మెడకు చుట్టుకుంది. ఆమె చివరి సారిగా పంపిన వాయిస్‌ మెయిల్‌, ఈ మెయిల్స్‌ను ఆమె బాక్సునుంచి న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అనే మర్డోక్‌ పత్రికకు చెందిన జర్నలిస్టులు తొలగించారు. దాంతో ఆమె కనిపించకుండా పోయిందని అందరూ అనుకునేట్లు చేశారు. ఇది వెల్లడి కావటంతో దాదాపు నాలుగువేల మంది ప్రముఖుల ఫోన్లు, ఇమెయిల్స్‌ను అక్రమంగా వినటం, సమాచారాన్ని తస్కరించడం వంటివి చేశారని వార్తలు వస్తున్నాయి. తొలుత తమ సిబ్బంది అంతా పత్తిత్తులే అని బుకాయించిన మర్డోక్‌ అక్రమాల తీవ్రతను తగ్గించేందుకు చివరకు న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రికను మూసివేసి అక్రమాలను సహించేది లేదన్నట్లుగా ఫోజు పెట్టాడు. చివరకు సీసాలో బంధించిన దుష్టశ క్తి తన విశ్వరూపాన్ని ప్రదర్శించినట్లుగా కుంభకోణం తీవ్రత వెల్లడి కావటంతో తమ వారు చేసిన తప్పుడు పనుల తీవ్రత తనకు తెలియదని అందుకు క్షమాపణలు కోరుతున్నట్లు తన పత్రికల్లో పేజీల పేజీల ప్రకటనలు జారీ చేశాడు.


            లేబర్‌ పార్టీ మాజీ ప్రధాని గార్డన్‌ బ్రౌన్‌ కూడా మర్డోక్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు బలయ్యాడు. తనను పదవి నుంచి తప్పించటానికి పేరు మోసిన క్రిమినల్స్‌ను వినియోగించి సండే టైమ్స్‌ పత్రిక తన వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించిందని స్వయంగా చెప్పాడు. తమకు అవసరమైన సమాచారం ఇవ్వని వారికి లంచం ఇవ్వటం,లొంగనివారిని బ్లాక్‌ మెయిల్‌, వేధించటం, ఇలాంటి అక్రమాలకు పోలీసులకు లంచాలిచ్చి వారి నుంచి సమాచారం, సహకారం పొందటం మర్డోక్‌ నిత్య వ్యవహార శైలి. అక్రమాలకు పాల్పడేవారి సమాచారం సేకరించటంతో పాటు అలాంటి పనులకు అసలు వారినే ఉపయోగించుకోవటంలో కూడా ఘనుడు మర్డోక్‌. ఈ క్రమంలో అలాంటి అక్రమార్కులకు జర్నలిస్టుల ముద్రవేసి వారిని తన పత్రికల కాలమిస్టులుగా నియమించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సకల అవాంఛనీయ కార్యకలాపాలను నడిపించిన రెబెకా బ్రూక్స్‌ అనే మహిళా ఎడిటర్‌, అమెరికా నుంచి వెలువడే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ముద్రాపకుడు లెస్‌ హింటన్‌ శుక్రవారం నాడు రాజీనామా చేసి ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. మర్డోక్‌గేట్‌ వార్తలతో స్టాక్‌ మార్కెట్‌లో మర్డోక్‌ సంస్థల వాటాల రేట్లు పతనం కావటంతో మీడియా సామ్రాజ్యంలో ఏడుశాతం వాటా కలిగిన సౌదీ రాజ కుటుంబీకుడు ఒకరు రెబెకాను తొలగించాలని వత్తిడి చేసిన తరువాతే ఆమె రాజీనామా చేశారు. అమెకంటే ముందు సంపాదకుడిగా ఉన్న హింటన్‌ కూడా అనివార్యంగా అదేదారి పట్టాడు. ఈ వరుసలో వారికి సహకరించిన స్కాట్లండ్‌ యార్డ్‌ పోలీసు ఉన్నతాధికారులు ముగ్గురు, మర్డోక్‌ కుమారులు, చివరకు మర్డోక్‌కూడా ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మర్డోక్‌ పత్రికల జర్నలిస్టులు అక్రమాలకు పాల్పడుతున్నారని, అందుకు అవసరమైన సొమ్మును కూడా తానే మంజూరు చేశానని అయితే వాటి తీవ్రత తనకు తెలియదని మర్డోక్‌ కొడుకు బుకాయిస్తున్నాడు. తన మీడియా ద్వారా ఆస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికాల్లోని రెండు పార్టీల వ్యవస్థల్లో అధికార ప్రతిపక్షం రెండింటినీ మర్డోక్‌ ప్రభావితం చేస్తున్నాడు. ఎవరు గెలిచినా వారివెనుక చేరటం తన సంపదను పెంచుకోవటం అతగాడి స్వభావం. మూడు దేశాల్లోనూ మీడియాపై గుత్తాధిపత్యం కలిగి ఉన్నందున ఆయా పార్టీల వారు మర్డోక్‌ మద్దతు కోసం నానా గడ్డీ కరుస్తారు. అందువల్లనే సాక్షాత్తూ బ్రిటన్‌ ప్రధాని కామెరాన్‌ మర్డోక్‌ ఫోన్‌ట్యాపింగ్‌ అక్రమాలపై పార్లమెంటరీ కమిటీ విచారణకు ఆదేశించినా, అమెరికా ఎఫ్‌బిఐని రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించినా మర్డోక్‌ మాఫియాకు ఎలాంటి ఆటంకం ఉండదని అనేక మంది చెబుతున్నారు. దానికి నిదర్శనమా అన్నట్లు న్యూస్‌ఆఫ్‌ ది వరల్డ్‌ అక్రమాల వివరాలున్న కంప్యూటర్లను ఇంతవరకు లండన్‌ పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. ఈలోగా వాటిలోని సమాచారాన్ని, ఇతర ఫైళ్లను ధ్వంసం చేసేందుకు మర్డోక్‌ యంత్రాంగానికి వ్యవధి ఇచ్చారన్నది స్పష్టం. మూల విరాట్టులను వదలి ఉత్సవిగ్రహాలను పట్టుకున్నట్లుగా సూత్రధారుల జోలికెళ్లకుండా పాత్రధారులుగా బయటపడిన వారిని ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు.
స్టార్‌ టీవీతో ప్రారంభమైన మర్డోక్‌ సామ్రాజ్యం మింట్‌ వంటి ఆంగ్ల పత్రికతో మన దేశంలో కూడా విస్తరించటం ప్రారంభమైన విషయం అంతగా తెలియదు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా కాపీ కొట్టటంలో తిరుగులేని సామర్ధ్యం ఉన్న కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు మన దేశంలో, రాష్ట్రంలో మర్డోక్‌ మాఫియా జర్నలిజాన్ని అమలు చేయటం అనేక ఉదంతాలలో గమనించవచ్చు. తమకు అనుకూలమైన వారికి బాకాలూదటం, లేనివారిని విస్మరించటం చూస్తున్నాము. ఇలాంటి శక్తులను ఒక కంట కనిపెట్టి అప్రమత్తం కాకపోతే లాభాలే ధ్యేయంగా ఈ రంగంలోకి ప్రవేశించిన వారు తెల్లవారేసరికి మరో మర్డోక్‌గా మారేందుకు మాఫియా జర్నలిజాన్ని మరింతగా విస్తరిస్తారని, మన ప్రజాస్వామ్య, పౌరహక్కులకు, సామాజిక వ్యవస్థకు ముప్పు తెస్తారని గ్రహించటం అవసరం.

Editorial From :  prajasakti

Friday, July 1, 2011

From 2G to KG:Where Does the Buck Stop?


THE government of the day does not own the natural gas from Krishna Godavari (KG) basin. It is a natural resource owned by the people of this country and the government is only the trustee. National resources are owned by the doctrine of public trust as held by the Supreme Court. Natural gas being one of the main sources of energy for production of power and fertilizer, higher price of gas means higher tariff from gas-based power plants and higher fertilizer subsidy. That is why the recently revealed CAG’s draft report very correctly categorises the loss on KG gas scam as “unquantifiable” unlike 2G scam where the quantification is more specific to the tune of Rs 1.76 lakh crore.

But the most glaring difference between these two cases is on the issue of accountability i.e. where does the buck stop in the KG gas scam? Let the facts speak for themselves.

GENESIS OF THE CASE 

Till recently gas production and marketing was entirely with the public sector and pricing was administered. This was opened up for private participation in the nineties. The New Exploration and Licensing Policy (NELP) was announced in 1997 and M/s RIL was awarded the contract in the first NELP round for operating KG basin, which has India’s largest gas discoveries. A Production Sharing Contract (PSC) was signed between the government and RIL, the contractor, to govern gas production and pricing. The opening of gas production and marketing to private sector resulted in dual pricing of gas: administered and market-linked. Administered Price was through “Administrative Pricing Mechanism” (APM), which comprised actual cost of production plus reasonable profit, determined by the government. Before the production and marketing of KG basin started in 2009, the pre-dominant part was covered by APM @ 1.83 US dollar/unit. Before the marketing of KG gas, market pricing was done for relatively small volumes by private operators which were in the field before NELP.

CAG’s draft report has actually vindicated one of the two major charges leveled by CPI(M) MPs against government-RIL nexus on KG gas viz the “gold plating” or “manipulating the development cost of the gas fields”. The other charge was regarding high price of Reliance gas @ 4.2 USD/unit fixed up in 2007 by an Empowered Group of Ministers, in spite of the fact that actual production cost of KG gas was 1.43 USD/unit, the APM cost of ONGC was 1.83 USD and most shockingly RIL itself had quoted 2.34 USD/unit to M/s NTPC, the Maharatna PSU, in response to an international competitive bidding in 2004. This issue of pricing of gas has not been dealt in CAG’s Draft report. 

CHRONOLOGY OF EVENTS 

  I.            The question was first raised in Rajya Sabha on December 12, 2006 by CPI(M) MPs late Chittabrata Majumdar and Tapan Sen. The government informed that M/s RIL-Niko consortium had submitted a development plan that envisaged increase in production from 40 to 80 mmscmd and increase in expenditure from 2.47 billion dollar to 8.84 billion dollar. It was immediately pointed out in a letter dated 21.12.2006 to minister of petroleum and natural gas by Tapan Sen, MP and a member of Standing Committee of Petroleum and Natural Gas that the expenditure per unit of production, which should come down with the increase in production due to economy of scale, had been inflated abnormally, warranting immediate intervention by the government.

                            II.            This was followed up with three letters dated 25.01.2007, 27.02.2007 and 12.03.2007. On April 30, 2007 a detailed letter was again sent to minister of petroleum and natural gas with copy to the prime minister about the likely impact of gold plating on price of natural gas. On 15.05.2007 in reply to a question in parliament, it was informed by the government that the revised capital investment has been approved by DGH.

                         III.            Three more letters dated 11.6.2007, 4.7.2007 and 13.7.2007 were sent by Tapan Sen to the prime minister directly for his intervention to stop gold plating and ensure that the price of natural gas is not arbitrarily increased. No action was taken other than mere acknowledgement of letters.

                        IV.            The prime minister and his office swung into action only when the then chief minister of Andhra Pradesh late Y S Rajasekhar Reddy raised a number of issues on KG basin gas, including the gold plating and pricing of gas in a series of three letters dated 16th, 29th & 30th June 2007. Some of issues raised by Reddy were common viz

a)     The proposed market discovery price of natural gas produced from KG basin @ $ 4.5 to $ 5/MMBTU would mean an increase of 256 per cent from the present APM prices.

b)    RIL has obtained bids from consumers with stranded assets and claim this to be market driven price forgetting its own bid to NTPC. This bid should be treated as market price because this price came through global competitive bidding.

c)     The government should monitor the investment by the contractors and have it scrutinized by independent and autonomous authority so that costs are not unduly inflated.

d)    It will also be necessary to constitute an independent autonomous regulatory authority to decide upstream pricing of gas.

                           V.            PM/PMO immediately referred these letters to a Committee of Secretaries headed by cabinet secretary which was assigned to give report on issues related to supply and pricing of gas.

This raises an immediate question – why did the PM/PMO selectively choose to refer only the three letters written by Andhra Pradesh CM to the Committee of Secretaries ignoring the letters from an MP, that too an MP who was a member of Parliamentary Standing Committee on Petroleum and Natural Gas? Were these letters that contained several facts and figures ignored only because he was neither a Congressman nor someone from civil society? Who is responsible for this sidelining of a people’s representative in parliament ?

REPORT OF  THE CABINET SECRETARY
The Committees of Secretaries met on 29.6.2007, 2.7.2007, 6.7.2007 and 10.7.2007. And on development cost of the gas field, as per available information, the cabinet secretary reported:

‘The accountability of Management Committee mechanism for approval of various costs needs to be enhanced. For this purpose, Ministry of Petroleum & Natural Gas would draw up guidelines and mechanisms with the approval of the government as large amounts of government revenue in profit share are involved. Effective audit mechanisms through C&AG or other reputed agencies would be put in place. It is noted here that under Article 25.5, “The government shall have the right to audit the accounting records of the contractor in respect of petroleum operations in the accounting procedure.” The government must, in consultation with the CAG, appoint an international auditor who has sufficient experience in the field of oil exploration and production.’

The report was sent to PMO. Did the prime minister/government consult CAG and appoint an international auditor? Who should be blamed for not taking any preventive step to stop the revenue loss, though cautioned repeatedly by CPI(M) MPs, AP chief minister and even the cabinet secretary? Where should the buck stop?

GAS PRICING FORUMULA
What did the cabinet secretary’s report say regarding the pricing formula offered by RIL as per which the “well-head” price (i.e. the price at the production point) was 4.33 dollar per barrel and the delivered price at the user end would be 4.76 to 5.98 dollar without taxes? It reportedly said “the RIL formula may be taken up for approval only after a policy is put in place. Prima facie the formula appears to suffer from several infirmities in respect of the formula employed and the bidding process.”

The above was based on the presentations by the ministry of fertilizers and NTPC/ministry of power, which specifically stated:
·        RIL price formula is flawed;
·        A delivery price beyond 5 dollar/unit will be prohibitive for fertilizer sector and every increase of 1 dollar will involve an additional Rs 2000 crore subsidy;
·        Gas price beyond 2.34 dollar will be prohibitive for power sector;
·        Pricing should be fixed by Petroleum & Natural Gas Regulatory Board after amendment in the Act;
·        It was not prudent to fix a price which will jeoparadise the NTPC's case wherein price of 2.34 dollar was arrived at after International Competitive Bidding.”

Not only that, the chairman & managing director of NTPC in a letter dated 24.8.2007 wrote to the chairman of EGoM:

“In continuation of the presentation I made on the gas pricing issue of Reliance Industries Limited for KG Basin with particular reference to NTPC contract, I would like to convey that implication of the price differential between gas price as delivered at Kawas/Gandhar as per NTPC Contract and RIL's proposed price, will be of the order of Rs 24,000 crore for the quantity contracted by NTPC during the entire contract period of 17 years. This aspect may also please be kept in view.”

Inspite of the above, the EGoM approved the price formula in a great haste on 12.9.2007 though the production of KG gas started only from 1.4.2009. The rate was slightly reduced from 4.33 dollar to 4.2 dollar/unit. Why this hurry when there were serious question marks on development cost, pricing formula, loss to NTPC, financial impact on fertilizer and power production? Who is answerable to the parliament on an issue concerning three ministries viz Petroleum & Natural Gas, Power and Fertilizer? A minister or a Group of Ministers or the prime minister?

WHY EGoM?
As outlined at the outset, gas pricing was mostly based on cost plus reasonable profit basis as per APM and there was no sacrosanct formula for pricing for non APM gas produced by private sector, which covered very small volumes before KG basin gas. Keeping this in perspective the "Integrated Energy Policy" document of August 2006, prepared by the Planning Commission, recommended:

"As long as there is shortage of natural gas in the country and the two major users of gas, namely fertilizer and power, work in a regulated cost plus environment, a competitive market determined price would be highly distorted. The prevailing regime of fertilizer subsidies & power sector subsidies would further amplify such distortions and cross subsides. In such a situation price of domestic natural gas and its allocation should be independently regulated on a cost plus basis including reasonable returns."

The prime minister is the chairman of the Planning Commission and there was a gas shortage in 2007 which continues till date. Then who decided to overrule the Planning Commission recommendation for “Cost Plus” pricing and went for a distorted market determined price through a fast-track EGoM?

And finally what was the rationale for forming an EGoM headed by external affairs minister to fix gas price when Energy Co-ordination Committee (ECC) headed by the prime minister and comprising ministers of Finance, Petroleum & Natural Gas, Power, Coal, deputy chairman of Planning Commission, chairman of Economic Advisory Council to PM, with principal secretary to PM as convener was already in place since July 2005. Need for rational pricing to promote inter fuel substitutions (in this case gas, coal and oil) is one of major issues before ECC. Still, why a separate EGoM? Is it a case of shirking responsibility or of willfully insulating oneself from another ‘G’ series scam? Who will answer? Obviously not Jaipal Reddy, Deora, Sibal or Digvijay Singh. WHERE?


***Article from Cpim.org  written   by  Dipankar Mukherjee