Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Tuesday, August 23, 2011

హజారే ఉద్యమంలో కొన్ని కోణాలు

అన్నా ఉద్యమాన్ని 22 మంది సభ్యుల కోర్‌కమిటీ నడిపిస్తోంది. ఇందులో కనీసం సగం మంది సభ్యులతో అన్నాకు ముఖ పరిచయం కూడా లేదన్నది వాస్తవం. ఈ కమిటీ కింద మరో 13 ఉప కమిటీలు వివిధ అంశాలపై కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. మీడియా, సమాచార విభాగం దేశవ్యాప్తంగా రోజుకు పది లక్షల మొబైల్‌ ఫోన్లకు, 20 లక్షల ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తోంది. ఇటువంటి వాటిలో ఆరెస్సెస్‌ చొరబడుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం దేశంలో రెండో స్వాతంత్య్రోద్యమం నడుస్తోందా ? అవినీతికి వ్యతిరేకంగా ప్రజా విప్లవం పెల్లుబికిందా ?? సంఫ్‌ు పరివార్‌ దీనిని సొమ్ము చేసుకోవాలని చూస్తోందా ??? ఈ ప్రశ్నలకు ఒక్కొక్కరి వద్దా ఒక్కో సమాధానముంది. ఏ సమాధానం సరైనదన్న విషయాన్ని కాలమే త్వరలో నిర్ణయించనుంది. అవునన్నా, కాదన్నా...ఇప్పుడు దేశంలో అవినీతి అతిపెద్ద చర్చనీయాంశం అయ్యింది. పెట్రోల్‌ ధరలు తగ్గించాలని దేశ ప్రజలందరూ నినదించవచ్చు..ప్రభుత్వం ఒక్కరోజులో తగ్గించనూ వచ్చు. వేతనాలు పెంచాలని, లాకౌట్లు ఎత్తివేయాలని కార్మికులు సమ్మె చేయవచ్చు...ప్రభుత్వాలు, యాజమన్యాలు తలొగ్గవచ్చు. ఇలా అత్యధిక శాతం ప్రజలు కొన్ని 'నిర్దిష్టమైన' డిమాండ్ల ఆధారంగా (నిత్య జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలపై) ఏకమవ్వడం..ఆందోళనల్లోకి రావడం సర్వ సాధారణం. అవినీతిని అంతమొందించాలని ' దేశ ప్రజలందరూ ' వీధుల్లోకి రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించేదే ! వ్యవస్థీకృతమైన అవినీతిని అరికట్టడం, ఒకటి రెండు చట్టాలతోనే సాధ్యమౌతుందని భావించడమూ అటువంటిదే. అన్నా హజారే దీక్ష రూపంలో ప్రస్తుతం దేశవ్యాపితంగా సాగుతోన్న ఆందోళనలోనూ పైకి కనిపించని వాస్తవాలు కూడా కొన్ని ఉన్నాయి. సయోధ్యకు ఇరుపక్షాలూ సిద్ధంగానే ఉన్న నేపథ్యంలో..అన్నా బృందం, కేంద్ర ప్రభుత్వం మధ్య నేడో, రేపో ఒక ఒప్పందం కుదరవచ్చు. ఈ సయోధ్యమాటున అవినీతి వ్యతిరేక ఉద్యమంలో దాగున్న కీలకాంశాలను మరుగున పడేయడం మాత్రం సాధ్యం కాదు.
కల్లోల కాంగ్రెస్‌
ప్రస్తుతం యుపిఎ 2 ప్రభుత్వం రెండు సంవత్సరాల వయసులోనే అపారమైన అవినీతి (అప్రతిష్ట) మూటగట్టుకుందనడంలో వివాదం లేదు. హాజారే, రామ్‌దేవ్‌బాబా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక 'ఉద్యమాన్ని' ఎదుర్కోవడంలోనూ తలపండిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ పసితనాన్ని ప్రదర్శించింది. హజారేబృందాన్ని లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా తయారీ కమిటీలోకి సభ్యులుగా తీసుకోవడం - ఆపాదమస్తకమూ హజారే అవినీతిపరుడేనని విమర్శించడం....రామ్‌దేవ్‌బాబాతో విమానాశ్రయానికి వెళ్లి చర్చలు జరపడం - దీక్షలో కూర్చున్న వ్యక్తిని అర్ధరాత్రి బలవంతంగా అరెస్టు చేయడం...ఇలా గత ఏప్రిల్‌ నుండీ కాంగ్రెస్‌ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఆగస్టు 16న హజారేను ఇంటి నుండి నేరుగా తీహార్‌ జైలుకు తరలించడం వీటికి పరాకాష్ట. ఇది ప్రజాస్వామ్య హక్కులపై అధికార పార్టీ నగంగా చేసిన దాడి. లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా కమిటీలోకి కొందరు వ్యక్తులను సభ్యులుగా తీసుకోవడం కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం..నాడు కాంగ్రెస్‌కు అప్రజాస్వామికంగానూ, పార్లమెంటును అగౌరవపర్చే చర్యగానూ అనిపించకపోవడం విడ్డూరం. అప్రజాస్వామిక డిమాండ్లతో అన్నా ఆందోళన చేస్తున్నారని విమర్శించే హక్కు ఇప్పుడు కాంగ్రెస్‌కు ఉందా అన్నదే ప్రశ్న. అవినీతి వ్యతిరేక ఉద్యమాలపై, వాటికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తులపై గత ఏప్రిల్‌ నుండీ కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ సూత్రబద్ధమైన, నిలకడైన వైఖరిని ప్రదర్శించలేదు. 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీ, ఇలా ఏపూటకాపూట బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నది. ఇంత జరుగుతున్నా అవినీతి అంశంపై కనీసం ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు. 'ఆర్థిక సంస్కరణల అమలు వల్లే దేశంలో అవినీతి పెరిగిందని కొందరు అంటున్నారు. ఇది అవాస్తవం. సంస్కరణలకూ, అవినీతికీ సంబంధం లేదు. ఇంకా కొన్ని రంగాల్లో సంస్కరణల కారణంగానే, అవినీతి తగ్గింది' అంటూ ప్రధాని మన్మోహన్‌ రెండ్రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్‌ జెండాను, ఎజెండానూ చెప్పకనే చెబుతున్నాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమం నేపథ్యలో సంస్కరణలకు ఎక్కడ అగౌరవం కలుగుతుందోనన్న ఆందోళన తప్ప...ప్రధాని ప్రకటనలో మరేమీ కనబడకపోవడం యాదృచ్ఛికం కాదు.
ఆరెస్సెస్‌ చొరబాటు యత్నాలు
గత ఏప్రిల్‌లో మొదటి సారి జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన ఆందోళనకన్నా ప్రస్తుత ఆందోళన విస్తృతి పెరిగింది. హజారే దీక్షలో చొరబడి దీనిని సొమ్ము చేసుకోవాలని ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తోంది. ఈ ఉద్యమంలో తమ శ్రేణులు పూర్తి స్థాయిలో, ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేత సునీల్‌ జోషి కొద్ది రోజుల క్రితం స్వయంగా చెప్పడం, ఎబివిపి ఆధ్వర్యంలో నడిచే 'ఇండియా అగైనెస్ట్‌ కరప్షన్‌' ఈ ఉద్యమంలో చొరబడడం దీనినే సూచిస్తున్నాయి. అన్నా ఉద్యమాన్ని 22 మంది సభ్యుల కోర్‌కమిటీ నడిపిస్తోంది. ఇందులో కనీసం సగం మంది సభ్యులతో అన్నాకు ముఖ పరిచయం కూడా లేదన్నది వాస్తవం. ఈ కమిటీ కింద మరో 13 ఉప కమిటీలు వివిధ అంశాలపై కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. మీడియా, సమాచార విభాగం దేశవ్యాప్తంగా రోజుకు పది లక్షల మొబైల్‌ ఫోన్లకు, 20 లక్షల ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తోంది. ఇటువంటి వాటిలో ఆరెస్సెస్‌ చొరబడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అలా అని అన్నా ఆందోళనలో ప్రజలెవరూ స్వచ్ఛదంగా పాల్గొనడం లేదన్నది దీనర్ధం కాదు. హజారే ఉద్యమంతో ఊపందుకున్న అవినీతి వ్యతిరేక వాతావరణం నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని బిజెపి ఇంకొకవైపు నుంచి ప్రయత్నిస్తున్నది. అదలా ఉంచితే అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు, కార్పొరేట్‌ ఉద్యోగులు, యువత, మధ్యతరగతి జీవులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడం ఆహ్వనించదగ్గ పరిణామమే.
పార్లమెంటు...ప్రజాస్వామ్యం
ఈ ఉద్యమం సందర్భంగా అన్నా బృందం లేవనెత్తిన డిమాండ్లకు సంబంధించిన కొన్ని అంశాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఫలానా గడువులోగా ఫలానా చట్టాన్ని రూపొందించాలని శాసించజూడడం అన్నా బృందం పట్టుబట్టడం విమర్శలకు ఆస్కారమిచ్చింది. అదే సమయంలో ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ...పార్లమెంటు అధికారమే అత్యున్నతమైనదని భీష్మించుక్కూర్చొన్న యుపిఏ ప్రభుత్వ ధోరణి ప్రజల ఆగ్రహం పెరగడానికి కారణమవుతున్నది. 'అవినీతి' అంశానికి నిర్దిష్టత్వం లేదు కాబట్టి దేశ కార్పొరేట్‌ రంగం కూడా అన్నా ఆందోళనకు మద్దతునిస్తున్నది. అన్నా బృందం ప్రస్తావిస్తున్న జన లోక్‌పాల్‌లో ప్రభుత్వ అవినీతి గురించి తప్ప కార్పొరేట్‌ అవినీతి గురించిన ఊసే లేకపోవడం గమనార్హం. ఇప్పుడు వెల్లువెత్తిన అవినీతి కుంభకోణాలన్నీ దాదాపు ఈ కార్పొరేట్‌ రంగం ప్రమేయంతో జరిగినవేనన్న విషయం మరువరాదు. రెండో దశ సంస్కరణలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ విఫలమయ్యిందన్న అసంతృప్తితో ఉన్న కార్పొరేట్‌ గణం... కూడా హజారే ఉద్యమానికి మద్దతు నిస్తున్నదనే వార్తలను కొట్టిపారేయలేం. మధ్యతరగతి స్పందిస్తుందన్న కారణం చెప్పి, అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కార్పొరేట్‌ మీడియా కల్పిస్తోన్న ప్రాధాన్యతా శ్రుతి మించుతోందనే చెప్పాలి. ఏడాది క్రితం ఇదే రామ్‌లీలా మైదానం నుండి ఇదే జంతర్‌మంతర్‌ వరకూ లక్షలాది అంగన్‌వాడీలు ప్రదర్శనగా వస్తే...' ట్రేడ్‌యూనియన్‌ ఆందోళనలతో ఢిల్లీ వాసులుకు ట్రాఫిక్‌ ఇక్కట్లు ' అంటూ లోపలి పేజీల్లో ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక వార్తను ఇచ్చింది. అదే పత్రిక ప్రస్తుతం అన్నా ఉద్యమంపై నిత్యం 8 పేజీలకు తగ్గకుండా వార్తలిస్తోంది. 'సంస్కరణలను కొనసాగించడంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం విఫలమౌతోంది. ఈ కారణంగా దేశంలో మధ్య తరగతి ఆకాంక్షలు, అభిలాషలు తీరడం లేదు. అందువల్లే దేశ మధ్యతరగతి అన్నా ఉద్యమానికి బాసటగా నిలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించకపోతే, కాంగ్రెస్‌ పుట్టి మునిగినట్లే' అని మరో ప్రముఖ ఆంగ్ల పత్రిక సంపాదకుడు రెండ్రోజుల క్రితం వ్యాసమే రాశారు !

**Article By D.JayaPrakash From prajasakti.com 

Tuesday, August 16, 2011

అమెరికా బాటలో ఫ్రాన్స్‌

అసలే ఐరోపాలో వేసవి, దానికి తోడు రుణ సంక్షోభ వేడిగాలులు పాలకపార్టీలకు మరింతగా చెమటలు పట్టిస్తున్నాయి. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా పరపతి పోయింది. తరువాత వంతు ఏ దేశానిది అవుతుందన్నది మదుపర్లలో ప్రశ్నార్థకంగా మారిన సమయంలో న్యూయార్క్‌, వాషింగ్టన్‌, నుంచి రుణ సంక్షోభం పారిస్‌ నగరానికి పాకింది. ఏ క్షణంలో అయినా దాని పరపతీ పతనం కానున్నదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సంక్షోభంలో ఉన్న ఐరోపాను ఆదుకొనేందుకు తాత్కాలిక సర్దుబాటు నిధి సమకూర్చే దేశాలలో జర్మనీ తరువాత స్థానంలో ఉంది ఫ్రాన్స్‌. అలాంటి దేశంలో పడిపోతున్న స్టాక్‌మార్కెట్‌ను నిలబెట్టేందుకు అధ్యక్షుడు సర్కోజీ పక్షం రోజుల ముందుగానే వేసవి విడిది నుంచి ఆగమేఘాల మీద పారిస్‌ చేరుకున్నాడు. లండన్‌ తగలడిపోవటం కూడా నిస్సందేహంగా సర్కోజీని కలవర పరిచి ఉంటుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తన తాజా నివేదికలో ఫ్రెంచి ఆర్థిక వ్యవస్థ పురోగమనం గురించి భరోసా ఇచ్చింది. రానున్న రెండు సంవత్సరాలలో తన ఆర్థిక వనరులను అది మరింతగా స్థిరపరుచుకుంటుందని చెప్పింది. ఇదొక ఎత్తయితే అమెరికా పరపతిని తగ్గించిన స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ సంస్థతో పాటు మరో రెండు ప్రముఖ సంస్థలు ఫ్రెంచి సర్కార్‌ బాండ్లు కొనటం సురక్షితమని చేసిన ప్రకటనల నేపథ్యంలో ఫ్రెంచి బాండ్ల ధరలు పెరిగాయి. అయితే ఉరుములేని పిడుగులా శుక్రవారం నాడు ఫ్రెంచి ప్రభుత్వ పది సంవత్సరాల బాండ్లపై రాబడి మూడు శాతం పడిపోయింది. ఈ పరిణామం జరిగిన కొద్ది సేపటికే ఏప్రిల్‌-జూన్‌ మధ్య ఫ్రెంచి ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పురోగతి లేక స్తంభించి పోయిందని, సర్కోజీ సర్కార్‌ చెబుతున్నట్లు ఏడాది కాలంలో రెండు శాతం కాదు 0.3శాతం మాత్రమే పెరుగుదల రేటు ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనాలను ప్రకటించారు. పులి మీద పుట్రలా తొలి మూడు మాసాలతో పోల్చితే వినియోగం రెండవ త్రైమాసికంలో 0.7శాతం పడిపోయిందని గణాంకాలు వెల్లడించాయి. అటు సూర్యుడు ఇటు పొడిచినా ఈ ఏటి లోటు బడ్జెట్‌ను 7.1 నుంచి 5.7శాతానికి, వచ్చే ఏడు 4.6శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యంలో ఎలాంటి మార్పులు లేవని అందుకు గాను బడ్జెట్‌ కోతలను విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెల్లవారే సరికి పరిష్కరించటానికి మంత్ర దండం లేదని కొన్ని పత్రికలు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. ఇదే జరిగితే అభివృద్ధి రేటు మరింత పతనం అవకతప్పదు. ఇతర ఐరోపా ధనిక దేశాలతో పోల్చితే ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద దేశీయ డిమాండ్‌ మీదే ప్రధానంగా ఆధారపడి ఉంది. కొత్త కార్ల కొనుగోలుకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను ఉపసంహరించగానే జనం కొనుగోళ్లను కూడా నిలిపివేశారు. ఈ పరిణామం సర్కోజీ సర్కార్‌ను కుదిపేస్తోంది. రుణభారాన్ని తగ్గించేందుకు, బడ్జెట్‌లోటును కుదించేందుకు చర్యలు తీసుకుంటామని ట్రిపుల్‌ ఏలతో ఉన్న తమ పరపతికి ఎలాంటి ఢోకా లేదని ప్రపంచాన్ని నమ్మించేందుకు అధ్యక్షుడు సర్కోజీ సర్కస్‌ ఫీట్లు చేస్తున్నాడు. దానిలో భాగంగానే ప్రభుత్వ బాండ్లను తక్కువ రేట్లకు విక్రయించటాన్ని పదిహేను రోజుల పాటు నిషేధించాడు. ఇటలీ, స్పెయిన్‌, బెల్జియం కూడా ఇవే చర్యలను తీసుకున్నాయి. ఇలాంటి పరిస్థితి మార్కెట్‌లో తలెత్తటం అంటే ప్రభుత్వ సమర్థతపై విశ్వాసం కోల్పోవటానికి సూచిక.

ఐరోపా యూనియన్‌లో జర్మనీ తరువాత ఫ్రాన్స్‌ పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు భావిస్తారు. అక్కడ నిరుద్యోగం 9.2శాతం కాగా, యువతలో అది 22.8శాతం కావటం గమనార్హం. ఫ్రాన్స్‌లో పెద్ద బ్యాంకుల్లో మూడవదైన సొసైటీ జనరల్‌ షేర్ల ధరలు జూలై రెండవ వారం నుంచి ఇప్పటివరకు 40శాతం పడిపోవటం ప్రమాద సూచిక. ఒక నిర్దిష్ట తేదీని నిర్ణయించి కంపెనీల వాటాలు, వస్తువుల ధరలపై లావాదేవీలు జరపటాన్ని ఆర్థిక పరిభాషలో డెరివేటివ్స్‌ అంటారు. ఇది పెద్ద జూదం. దీనిలో సొసైటీ జనరల్‌ది పెద్ద చేయి. అమెరికా సెక్యూరిటీల డెరివేటివ్స్‌ తనఖా లావాదేవీల్లో 67 వేల కోట్ల డాలర్లు పోగొట్టుకొని చేతులు కాల్చుకుంది. అయితే అమెరికా సర్కార్‌ ఆదుకోవటంతో అది నష్టాల నుంచి బయట పడింది. ఇప్పుడు ఫ్రెంచి సర్కార్‌ ఈ బ్యాంకును కాపాడేందుకు రంగంలోకి దిగింది. ఈ బ్యాంకే పోర్చుగల్‌, ఐర్లండ్‌, గ్రీస్‌, స్పెయిన్‌ సర్కార్లను ఆదుకొనేందుకు 1820 కోట్ల యూరోలు, ఫ్రెంచి సర్కారుకు 1920 కోట్ల యూరోల రుణం ఇచ్చింది. ఫ్రాన్స్‌లో రుణ సంక్షోభ ఛాయలు కనిపించటంతో వంద రూపాయల ఆదాయమైతే ఇప్పటికే 120 రూపాయల అప్పుల పాలైన ఇటలీ కూడా ఉలిక్కి పడుతోంది. రానున్న రెండు సంవత్సరాలలో 6,500 కోట్ల డాలర్ల మేరకు అదనంగా పొదుపు చర్యలు చేపట్టాలని శుక్రవారం నాడు బెర్లుస్కోనీ సర్కార్‌ నిర్ణయించింది. మతేతరమైన అనేక సెలవురోజుల రద్దు, స్థానిక సంస్థలకు ఎన్నికయ్యేవారి సంఖ్య పరిమితం చేయటం, పన్నులు పెంచటం వంటి చర్యలను ప్రకటించింది. సంక్షోభంలో ఉన్న గ్రీస్‌ను ఆదుకోవటం, మిగతా దేశాల పతనాన్ని ఎలా నిలబెట్టాలా అని మదన పడుతున్న ఐరోపా యూనియన్‌కు ఫ్రెంచి పరిణామం ఊహించని దెబ్బ. ఒక దగ్గర పడిన చిల్లుకు మాసిక వేసిన మరుక్షణమే మరోచోట పడిపోతోంది. దివాళాకోరు పెట్టుబడిదారీ విధానాలను, ప్రపంచాధిపత్యం కోసం యుద్ధాలను రుద్దుతున్న ధనిక దేశాలే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లుగా అమెరికా, ఐరోపా యూనియన్‌ సంక్షోభానికి ప్రపంచం కూడా మూల్యం చెల్లించాల్సి రావటమే ఆందోళన కలిగించే అంశం.

***Article From prajasakti Editorial  www.prajasakti.com

Sunday, August 14, 2011

చరిత్ర బురుజుపై స్వతంత్ర పతాక

ఎర్రకోటను మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ పాతఢిల్లీలో యమునానది ఒడ్డున 17వ శతాబ్దంలో నిర్మించాడు. లాల్‌ ఖిల్లా అప్పట్లో చక్రవర్తి కుటుంబ నివాసంగా వుండేది. చివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ను బ్రిటిష్‌వారు దేశ బహిష్కరణ చేసేవరకు అంటే 1857 వరకు మొఘలుల రాజధాని నగరం కూడా అదే. షాజహాన్‌ 1638లో ప్రారంభించిన ఈ కోట నిర్మాణం తొమ్మిదేళ్లపాటు సాగింది. ఔరంగజేబు, ఆ తర్వాత మొఘల్‌ పాలకులు కోటకు అనేక కొత్త అందాలు అద్దారు

 ఎర్రకోట పర్షియన్‌, యూరోపియన్‌, ఇండియన్‌ కళల కలబోతగా వుంటుంది. ఖిల్లా ప్రతి అంగుళంలోనూ కళాకారుల పనితనం కనిపిస్తుంది. భారతదేశంలోని అత్యంత ప్రధానమైన నిర్మాణాల్లో ఎర్రకోట ఒకటి. భవన నిర్మాణ కౌశలానికి, శక్తికి ఈ కోట నిదర్శనం. నిర్మాణంలోని ప్రతి అంశం ఎంతో కళాత్మకంగా వుంటుంది. ఈ కోట లోపలి స్థలము 6 లక్షల చదరపు గజాలుంటుంది. గోడల యెత్తు 35 గజాలు. కోట చుట్టూ 24 గజాల వెడల్పు, 20 గజాల లోతుగల కందకం తవ్వబడింది. ఈ కోట నిర్మాణానికి అప్పుడే 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. లోపలి భవనాల నిర్మాణానికి మరో 50 లక్షల రూపాయలైంది. కట్టడాల నిర్మాణం ఎంతో అందంగా, ఉన్నతంగా వుంటుంది. విశాలమైన భవనాలు, వాటి చుట్టూ అందమైన తోటలు, స్నానాల గదులు...రాచరికానికి నిలువెత్తు నిదర్శనంగా గోచరిస్తాయి. ఇంతటి అపురూపమైన కోట కాలక్రమంలో ఎన్నో దాడులకు గురై తన సౌందర్యాన్ని చాలా వరకు కోల్పోయిందనే చెప్పాలి. మహారాజసం వుట్టిపడే ఈ కోట ఒకప్పుడు మహాకవులు, కళాకోవిదులతో కళకళలాడిపోయేది. కవితా కళాకుసుమాలు వికసించేవి. ముస్లింల ఈద్‌ సందర్భంగా, హిందువుల దీపావళి వంటి పండుగల సందర్భంగా పాదుషాలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రజల ఆనందంలో పాలుపంచుకొనేవారు

మొఘల్‌ వంశపు చివరి రాజైన బహదూర్‌ షా 1837 సెప్టెంబర్‌ 27వ తేదీన ఢిల్లీ సింహాసనం అధిష్టించాడు. అయితే అప్పటినుంచే బ్రిటిషు ప్రభుత్వం అతని పతనానికి కుట్రలు పన్నసాగింది. ఎన్నో రాజకీయ, ప్రతికూల క్లిష్ట పరిస్థితుల్లో బహదూర్‌ పట్టాభిషేకం జరిగిందనుకోవాలి. 1857లో మొదటిసారిగా మీరట్‌లో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరవేయబడింది. సైన్యంలో బెంగాల్‌ ఆర్మీ రెజిమెంట్‌కు చెందిన సైన్యాధికారి మంగల్‌పాండే ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించి గొప్ప సంక్షోభాన్ని సృష్టించాడు. బ్రిటిషు సైన్యం ఆ అధికారిని హతమార్చి తిరుగుబాటును అణచివేయాలని చూసింది. కానీ అతను చనిపోయినా అతను రగిల్చిన తిరుగుబాటు జ్వాలలు చల్లారలేదు. మరింతగా భగ్గుమన్నాయి. తిరుగుబాటు సైన్యం ఎర్రకోటలోకి ప్రవేశించి బహదూర్‌షా ఆదేశాలను పాటించడానికి సిద్ధంగా వున్నామంది. లాల్‌ ఖిల్లాలో ప్రతి కీలక ప్రాంతంలోను ఆయుధధారులైన సైనిక కేంద్రాలను సన్నద్ధం చేశారు. పోరాటం కూడా ఉధృతం చేయబడింది. బ్రిటిష్‌ సైన్యం మరింత అప్రమత్తమై అణచివేతను కఠినంగా అమలు జరిపింది. ఆ పోరాటంలో మూడు వేల మందికి పైగా దేశభక్తులను ఉరితీశారు. వేలాదిమందిని కాల్చిచంపారు. లక్షలాదిమంది సైనికుల ప్రాణాలు ఫిరంగుల ధాటికి గాలిలో కలిసిపోయాయి. ఇటువంటి అనేక పోరాటాల చరిత్ర కలిగిన ఎర్రకోటను చూడగానే దేశభక్తులైన ప్రతి భారతీయుడి హృదయం అలనాటి చారిత్రక స్మృతులతో బరువెక్కిపోతుంది. ఉద్వేగభరితమౌతుంది.

వివిధ చారిత్రిక దశల్లో స్వతంత్రంకోసం పోరాడిన ఎందరో వీరులను, ఈ కోటలోనే బంధించి ఉరితీశారు. అజాద్‌ హింద్‌ ఫౌజ్‌పైన విచారణ జరిపిందీ ఇక్కడే. ఈ ఎర్రకోటపైనే బ్రిటిష్‌ పాలకుల పతాకం అనేక సంవత్సరాలు రెపరెపలాడి, భారత ప్రజల బానిస బతుకుల్ని అవహేళన చేసింది. ఎందరో దేశ భక్తులైన ధీరహృదయులు, కవులు, కళాకారులు, ప్రభువులు, బ్రిటిషు ప్రభుత్వ దారుణ శిక్షలకు గురై అమరవీరులయ్యారు. అయితే ఎర్రకోట మహోన్నత వైభవం మహోజ్వలంగా ప్రకాశించి దశదిశలను కాంతివంతం చేసిన రోజుల గురించి కూడా మనం చరిత్రలో చూస్తాం. సుదీర్ఘ కాలం పాటు ఈ కోట నుంచి వెలువడిన ఆజ్ఞలు యావత్‌ భారత దేశాన్ని శాసించాయి. దీని వైభవ ప్రాభవాలకు తల వంచని శక్తి ఏదీ ఆనాడు దేశంలో వుండేది కాదు. అలాంటి చోటనే 27 జనవరి 1858వ సంవత్సరంలో కడపటి భారత చక్రవర్తి, సుప్రసిద్ధ దేశభక్తుడు అయిన బహదూర్‌ షా జఫర్‌ ఒక సాధారణ నేరస్థుడిగా నిర్బంధితుడై బ్రిటిషు పరిపాలకుల ఎదుట విచారణకు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ కేసు విచారణ కోట భవనాల సముదాయంలోని ఒకప్పటి ఆయన న్యాయ దర్బారు 'దర్బారె ఖాస్‌'లో జరిగింది. ఇదే ప్రదేశంలో ఒకానొక రోజుల్లో జఫర్‌ ఆజ్ఞలు నిర్విఘ్నంగా అమలయ్యేవి. అలాంటి చోటనే జఫర్‌ నేరస్థుడుగా నిరూపించబడటం చరిత్ర గతికి ఒక తార్కాణం. బ్రిటిష్‌ పాలకులు ఆయనకు దేశ బహిష్కరణ శిక్ష విధించి రంగూన్‌ పంపారు. ఆ విధంగా 1862వ సంవత్సరంతో అక్కడే ఢిల్లీ సార్వభౌమత్వపు ఆఖరి వెలుగు కొడిగట్టిపోయింది.
బ్రిటిష్‌వారి కాలంలో కోటను ప్రధానంగా సైనిక శిబిరంగానే ఉపయోగించారు. స్వాతంత్య్రానంతరం కూడా 2003 వరకు కోటలో ప్రధాన భాగం భారత సైన్యం అధీనంలోనే వుంది. ఐరాస సాంస్కృతిక విభాగమైన యునెస్కో 2007లో ఎర్రకోటను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.


మువ్వన్నెల రెపరెపలు
 
మనదేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు చిహ్నమైన మువ్వన్నెల జండా గురించి చెప్పుకోవాలంటే... త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య. మన తెలుగువాడే. ఆయన సృజించిన జాతీయ పతాకంలో మూడు రంగులుంటాయి. కాషాయం, ఆకుపచ్చ, తెలుపు. ఈ మువ్వన్నెలు కేవలం మూడు రంగుల కలయికే కాదు. ఇది మన సంస్కృతి, ఐక్యత, సంప్రదాయాల కలయిక. జాతీయ జండా సైజు 3:2 వుండాలి. పై భాగంలో కాషాయం, కింది భాగంలో హరిత వర్ణం, మధ్యలో శ్వేత వర్ణం వుండాలి. మధ్య భాగంలో నీలి రంగులో అశోక చక్రం వుంటుంది. ఇందులో 24 గీతలుంటాయి. ప్రారంభంలో జాతీయ పతాకాన్ని గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం వంటి ప్రత్యేకమైన దినాల్లో మాత్రమే ఆవిష్కరించేవారు. తర్వాత అన్ని రోజుల్లోను మువ్వన్నెల పతాకాన్ని ఎగరేయవచ్చని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం, సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. గణతంత్ర దిన్సోతవం నాడు దేశ రాష్ట్రపతి సైనిక దళాల వందనం స్వీకరిస్తారు.
1948 ఆగస్టు 15వ తేదీన మొదటిసారిగా నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దేశ రాజధాని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచే స్వాతంత్య్రదినోత్సవం నాడు ఎర్రకోటపై జాతీయజండాను ఆవిష్కరించే సంప్రదాయం ప్రారంభమైంది. అలాగే దేశాధ్యక్షుని ముందర మన దేశ సైనిక ప్రతిభాపాటవాల ప్రదర్శన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఏటా ఒక దేశాధినేత ముఖ్య అతిథిగా పాల్గొంటారు.


పతాక నియమాలివే!

అయితే మువ్వన్నెల పతాకాన్ని అగౌరవపరచకుండా కొన్ని నియమనిబంధనలు పెట్టింది మన ప్రభుత్వం. వాటి ప్రకారం చిరిగిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకూడదు. జండాను తిరగవేసి ఎగరేయకూడదు. కార్లమీద పరవకూడదు. వ్యక్తిగత వస్త్రాలపై త్రివర్ణ పతాకాన్ని ముద్రించకూడదు. దిళ్లు, చేతి రుమాళ్లు, నేప్కిన్ల మీద మువ్వన్నెల జండాను కుట్టకూడదు. జండాపై ఎటువంటి అక్షరాలను రాయకూడదు. కేంద్రం అనుమతి లేకుండా వాహనాలపై ఎగరేయకూడదు. రైళ్లు, వాహనాల ముందు, వెనక తగిలించకూడదు. మూడు రంగుల బట్ట ముక్కలను కలిపి ఒక పతాకంలాగా చేయకూడదు. పతాకాన్ని నేల మీదగానీ, నీటిలోగానీ పడనివ్వకూడదు. ప్రభుత్వ, సైనిక అంత్యక్రియల సందర్భంలో మినహా మరెక్కడా ఉపయోగించకూడదు. కాళ్లతో తొక్కడం, తగలబెట్టడం కూడా చేయకూడదు. ఒకవేళ పతాకం పాడైపోతే దాన్ని సగౌరవంగా గంగాజలంలో వదిలేయడంగానీ, మట్టిలో పూడ్చిపెట్టడంకానీ చేయాలి.
పతాకావిష్కరణ ఎలా? ఎక్కడీ
మువ్వన్నెల జెండా ఎగరేసిన చోట దానికి ప్రత్యేక గౌరవ స్థానం కల్పించాలి. ప్రభుత్వ భవనాలపై ఎగరేసినప్పుడు సెలవు దినాలతో సంబంధం లేకుండా అన్ని రోజుల్లోను పతాకం రెపరెపలాడుతూనే వుండాలి. ఇందుకు సూర్యోదయ - సూర్యాస్తమయాలు, వాతావరణాలతో కూడా సంబంధం వుండదు. దేశాధినేతలు కాలం చేసినప్పుడు వారి గౌరవార్ధం జాతీయ పతాకాన్ని కొంతసేపు కిందికి దించుతారు. పతాకాన్ని ఎగరవేసేప్పుడుగానీ, దించేప్పుడుగానీ ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి. అలాగే పెరేడ్‌లో జాతీయ పతాకం వున్న వాహనం వస్తున్నప్పుడు కూడా గౌరవార్థం లేచి నిలబడాలి. హైకోర్టులు, సెక్రటేరియట్‌ కమిషనర్‌ కార్యాలయం, కలెక్టరేట్లు, జైళ్లు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు. అదేవిధంగా అంతర్జాతీయ సరిహద్దులు, కస్టమ్‌ పోస్టులు, చెక్‌ పోస్టులు, ఔట్‌ పోస్టులు, ఇతర ప్రత్యేక స్థలాల్లో కూడా జాతీయ పతాకాన్ని ఎగరేయవచ్చు. ఇవికాక విమానాశ్రయాలు, సరిహద్దు పహారా, అంతర్జాతీయ జలాల సమీపంలో వున్న లైట్‌ హౌస్‌లు దగ్గర కూడా ఎగరేయవచ్చు. దేశాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గవర్నర్లు, లెఫ్టెనెంట్‌ గవర్నర్ల అధికార నివాసాల్లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించవచ్చు. అదేవిధంగా దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఏదైనా సంస్థను సందర్శించినప్పుడు వారి గౌరవార్థం పతాకావిష్కరణ చేయవచ్చు. విదేశీ దేశాధినేతలు, యువరాజులు, రాజులు, ప్రధానమంత్రులు భారత దేశాన్ని సందర్శించినప్పుడు మన జాతీయ పతాకంతోపాటుగా సదరు ప్రముఖుల జాతీయ పతాకాన్ని కూడా ఆవిష్కరించవచ్చు. భారత దేశాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గవర్నర్లు, లెఫ్టనెంట్‌ గవర్నర్లు, ప్రధానమంత్రులు, క్యాబినెట్‌ మంత్రులు, స్పీకర్‌, భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మరికొందరు ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహనాలపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకునే అవకాశం వుంది. మన దేశ ప్రధాని, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఏదైనా ప్రత్యేక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్‌ బోగీలో జాతీయ పతాకాన్ని వుంచవచ్చు. ఈ పతాకం రైల్వే ప్లాట్‌ఫారమ్‌కు అభిముఖంగా వుండాలి.
ఒకరోజు దేశభక్తులు!
స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న కాలంలో జాతీయ జెండా ఎగరేయడం పెద్ద ధిక్కార చర్య. పోలీసుల కళ్లు గప్పి దేశ భక్తులు ఎలాగో పైకి ఎక్కేసి తూటాలు ఒళ్లు చీరేస్తున్నా జండా ఎగరేస్తుండేవారు. ప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ గర్వాల్‌లో ఆ విధంగా జెండా ఎగరేసిన ఘటన చాలా ఉత్తేజకరమైంది. ప్రీతిలతా వడేదార్‌ కూడా అలా ఎగరేస్తూనే పోలీసుల కాల్పులకు గురైంది. ఝండా వూంఛే రహా హమారా అన్నది ఒక పెద్ద నినాదం.
దేశ స్వాతంత్య్రం తర్వాత మాత్రం క్రమేణా జెండా పండుగ తీరు తెన్నులు మారిపోయాయి. ప్రజల దైనందిన జీవిత సమస్యలు పెరుగుతున్న కొద్ది ప్రభుత్వాలు అసంతృప్తి మూటగట్టుకున్న కొద్ది స్వాతంత్య్ర దినోత్సవం మొక్కుబడిగా మారిపోతున్నది. ఆ పోరాట కాలం నాటి త్యాగాలు ఆశయాలకు తిలోదకాలిచ్చిన పాలక వర్గ నేతలు ప్రజలలో నిరుత్సాహం నింపడంతో దేశ భక్తి సంప్రదాయాలకు కూడా ముప్పు ఏర్పడింది. ఇప్పుడు ఆగష్టు 15 అనేది అధికార లాంఛనాలకు రాజకీయ పటాటోపానికి ఆలవాలమై సజీవ చైతన్యం సన్నగిల్లింది.

ఆగష్టు 15 సందడి ప్రధానంగా పిల్లలదే. ఆ రోజు స్కూళ్లలో జెండా ఎగరేయడం, ఉపన్యాసాలు అలా వుంచితే ఆటలు పాటల పోటీలు వంటివి జరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యం మిఠాయిలు కనీసం చాక్లెట్లు పంచి పెడతారు.అసంఖ్యాకమైన పేద, మధ్య తరగతి పిల్లలకు ఇది కూడా అపురూపమే గనక 'జెండా పండుగ' అని మురిసిపోతుంటారు. చిన్న చిన్న జెండాలు కూడా చేతపట్టుకుని లేదా బాడ్జీలు పెట్టుకుని గొప్పగా భావించుకుంటారు.
ఇక నాయక గణాల విషయానికొస్తే జెండా ఎగరేయడం వారికి హోదాకు సంబంధించిన విషయం. కలెక్టర్లు పోలీసుల అధికారులతో పాటు మంత్రులు తము చూస్తున్న జిల్లాల్లో జెండా ఎగరేస్తారు. ప్రజా ప్రతినిధులు కూడా వారి ఉత్సాహాన్ని బట్టి జెండా వందనం ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ అధికార తతంగాలను పక్కనబెడితే ఆర్భాటాలకు హంగు దర్పాలకు ఆ సందర్బాన్ని వాడుకోవడం కద్దు. కారులు బారులు తీరించి వీలైనన్ని చోట్ల జండాలు ఎగరేస్తే తమ పట్టు చాటుకోవచ్చన్న ధోరణి చాలా పట్టణాలలో ఛోటా మోటా నాయకులకు పెరిగింది. పార్టీల వారిగా కూడా తాత్కాలిక దిమ్మలు ఏర్పాటు చేసి- అంటే డ్రమ్ములో ఇసుక పోసి మధ్యలో జెండా పాతి సాయంత్రం వరకూ సంరంభం చేస్తారు.ఈ ఒకరోజు దేశభక్తి ముగిశాక మరురోజు షరా మామూలే!
పాడవోయి భారతీయుడా!
పదిమందికి సంబంధించిన ఏ ఉత్సవమైనా పాటలు లేకపోతే అసంపూర్ణమే. స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా అనేక దేశభక్తి గీతాలు మార్మోగుతాయి. అన్నిట్లోకి ఎక్కువగా వినిపించేది పాడవోయి భారతీయుడా! అన్న శ్రీశ్రీ పాట. 'వెలుగు నీడలు' చిత్రంలోని ఈ పాట అర్థవంతంగానూ సమస్యల ప్రస్తావనతోనూ ఇప్పటికి నిత్యనూతనంగా విరాజిల్లుతున్నది. ఏ వీధిలో చూసినా ఆ పాటతోనే మొదలవుతుంది. మన సినిమాల్లో దేశభక్తి గీతాలు ఒకప్పుడు ఎక్కువగా వుండేవి. ఏదో ఒక వీలు చూసుకుని అలాంటి పాట జొప్పించేసేవారు. అంతర్నాటకాల రూపంలోనూ దేశభక్తి ప్రబోధం, గాంధీ నెహ్రూలను చూపించడం జరగుతుండేది. భారత మాతకు జేజేలు, మన జన్మభూమి బంగారు భూమి లాంటి పాటలు కూడా వినిపిస్తాయి. సినిమా పాటలను అటుంచితే దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన 'జయజయజయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి' అన్న పాట కూడా జాతీయ గీతంలాగే ప్రసిద్ధమైంది. నాడు తిలక్‌ మహాశయుని నోట మార్మోగిన నినాదంతో 'స్వాతంత్రమే నా జన్మహక్కని చాటండి' వంటి పాటలు కూడా ఆ రోజున వినిపిస్తాయి. ఘంటసాల గానం చేసిన పద్యాలు 'అమ్మా సరోజినీ దేవి' వంటివి కూడా వేస్తుంటారు. ఇటీవలి కాలంలోనైతే వందేమాతరం గీతం రహ్మాన్‌ కట్టిన రాగంలో మార్మోగుతుంటుంది. 'పుణ్యభూమి నా దేశం నమోనమామి' మరీ తప్పనిసరి. భారతీయుడు చిత్రంలోనూ జండా ఎగరేసే సన్నివేశంతో పాటు స్వాతంత్ర దిన సంబరాలను చిత్రించే పాట కూడా వీటిలో ఒకటిగా వినిపిస్తుంది. ఎన్‌డిఎ హయాంలో కార్గిల్‌ తరహా దేశభక్తి దశలోనూ 'ఖడ్గం, జై' వంటి చిత్రాల్లో మరో తరహా దేశభక్తిని గుప్పించే పాటలుంటాయి. అన్నిటినీ మించి 'అల్లూరి సీతారామరాజు' పాటలు, 'భలేతాత మన బాపూజీ' వంటి పాటలు కూడా ఆ రోజున వింటాము. రేడియోలోనూ టీవీల్లోనూ తెల్లవారక ముందునుంచి చెవుల తుప్పు వదిలిపోయేలా ఇలాంటి పాటలే దంచి కొట్టడం అనివార్యం. చంద్రునికో నూలుపోగులా దేశానికి ఆగష్టు 15న అందించే నివాళి ఇది.


*********Article From Prajasakti Written By K.Sahil  www.prajasakti.com





Thursday, August 11, 2011

మండుతున్న బ్రిటన్‌

ఇటీవల లండన్‌లో పోలీసులు మార్క్‌ డగ్గన్‌ అనే 29 సంవత్సరాల ఆఫ్రో కరీబియన్‌ యువకుడ్ని కాల్చి చంపటంతో ప్రారంభమైన అల్లర్లు మూడు రోజుల్లో బ్రిటన్‌ అంతటికీ విస్తరించాయి. లండన్‌లో ప్రారంభమైన నిరసన దావానలంలా ఆ దేశంలోని ఇతర నగరాలకు పాకింది. మంగళవారంనాడు బర్మింగ్‌హాం, లివర్‌పూల్‌, బ్రిస్టల్‌, నాటింగ్‌హామ్‌, మాంచెస్టర్‌ తదితర నగరాల్లో నిరసనలు దొమ్మీలు, లూటీల రూపం తీసుకున్నాయి. ఒక్క లండన్‌ నగరంలోనే మంగళవారం నాడు 16 వేల మంది పోలీసులను దించారు. సోమవారం విధుల్లో ఉన్న వారి సంఖ్యకు ఇది దాదాపు మూడు రెట్లు. దేశవ్యాప్తంగా పన్నెండు వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు.వందలాది కేసులు నమోదు చేస్తున్నారు. మార్క్‌ డగ్గన్‌ను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన పోలీసులు అతడే తమపై కాల్పులు జరిపాడని బుకాయించడంతో దక్షిణ లండన్‌లో కొద్దిమంది యువతీ యువకులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసన ప్రారంభించారు. ఆ చిన్న నిరసనను సైతం పోలీసులు సహించకుండా తీవ్ర నిర్బంధం ప్రయోగించారు. ఇది ప్రజాగ్రహానికి కారణమై నిరసనలు పెల్లుబికాయి. క్రమంగా అల్లర్లు, ఘర్షణలు స్థాయికి చేరాయి. కొన్నిచోట్ల లూటీలు సైతం సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో, నిరసనల్లో యువతే అధికంగా ఉన్నారు. వారిలో శ్వేతజాతీయులు గణనీయంగా ఉన్నారని పోలీసులు సైతం చెబుతున్నారు. అంటే వీటిని జాత్యహంకారానికి సంబంధించిన అల్లర్లుగా చెప్పడం ముమ్మాటికీ తప్పు. కానీ కార్పొరేట్‌ మీడియా రోజురోజుకూ ఆ నిరసనోద్యమాన్ని జాత్యహంకార అల్లర్లు, లూటీలుగా ప్రచారం చేస్తోంది. మంగళవారం నాడు బర్మింగ్‌హాంలో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. షహజాద్‌, హారీహుస్సేన్‌ సోదరులు తన మిత్రుడైన ముసావెర్‌ ఆలీతో కలిసి తమ నివాస ప్రాంతంలో ఉండగా ఒక శ్వేతజాతీయుడు కారును వేగంగా నడుపుతూ వారిని ఢకొీట్టడంతో ముగ్గురూ మరణించారు. వారు రోడ్డుకు అడ్డంగా గానీ, మార్గ నిరోధకంగా గానీ లేనే లేరని పోలీసు అధికారులు కూడా నిర్ధారించారు. ఆ శ్వేతజాతీయుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు కానీ అరెస్టు చేయలేదు. మీడియా చేసిన దుష్ప్రచారంతో కూడా కొంతమంది ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతుండవచ్చు.

           ప్రతిష్టాత్మకమైన లండన్‌ ఒలింపిక్స్‌ 2012 ద్వితీయార్థంలో జరగనున్నాయి. ఒక్క ఏడాది ముందు ఇంత విస్తృత స్థాయిలో ఘర్షణలు సాగడం తీవ్రమైన విషయం. బ్రిటన్‌ ప్రతిష్టకు ఇది దెబ్బే! ప్రస్తుతం బర్మింగ్‌హాంలో భారత్‌, ఇంగ్లండ్‌ టీమ్‌ల మధ్య క్రికెట్‌ టెస్ట్‌ జరుగుతోంది. ఘర్షణలతో ఆట ఆగలేదు. అయితే ఇలాంటి అల్లర్లే భారత్‌లో జరిగి ఉంటే ఇంగ్లండ్‌ టీమ్‌ మూటాముల్లె సర్దుకొని పోయేవారన్న భారతీయ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ మాట అక్షర సత్యం. 2008లో ముంబయి దాడులు జరిగిన సందర్భంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌ చర్యనుబట్టే గవాస్కర్‌ అలా వ్యాఖ్యానించి ఉండవచ్చు. ఇప్పుడు బ్రిటన్‌లో మన క్రీడాకారులు నిబ్బరంగా ఉండడం మంచి విషయం. ఈ నిరసనల సెగకు ఇటలీలో సెలవులు 'అనుభవిస్తున్న' బ్రిటన్‌ దేశాధ్యక్షుడు డేవిడ్‌ కామెరాన్‌ పర్యటనను కుదించుకొని వెనక్కి వెళ్లారు. ప్రస్తుతం వేసవి సెలవులయినప్పటికీ పరిస్థితిని చర్చించడానికి అత్యవసరంగా పార్లమెంట్‌ సమావేశాన్ని గురువారం జరపనున్నారు. పెట్టుబడిదారీ దేశాలన్నింటా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల కారణంగా ప్రజా సంక్షేమం నానాటికీ అడుగంటుతోంది. అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ఆదర్శ ప్రాయమైనదిగా చెప్పబడే బ్రిటన్‌ వైద్య రంగంలో సైతం సంక్షేమానికి కోతపెట్టడానికి టోరీ ప్రభుత్వం సిద్ధపడింది. ఇతర రంగాల్లోనూ సంక్షేమ వ్యయాన్ని కత్తిరిస్తున్నారు. 2015 నాటికి ప్రభుత్వ వ్యయంలో 8 వేల కోట్ల పౌండ్లు (ఆరు లక్షల కోట్ల రూపాయలు) కోత విధించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే కత్తిరింపులు మొదలయ్యాయి. మార్క్‌ డగ్గన్‌ను కాల్చి చంపిన దక్షిణ లండన్‌లోని టోటెన్‌హాం ప్రాంతంలో యువజన సర్వీసులకిచ్చే బడ్జెట్‌లో 75 శాతం కోతపెట్టారు. ఆ ప్రాంతంలో నిరుద్యోగిత 20 శాతం నమోదయ్యింది. సంక్షేమ బడ్జెట్‌ కోత పడడంతో యువతీ యువకుల్లో అసంతృప్తి విపరీతంగా పెరిగింది. బ్రిటన్‌ ప్రజల్లో ముఖ్యంగా యువతలో అసంతృప్తి జ్వాలలు రగలడానికి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అసంతృప్తులను, అసమ్మతులను అణిచివేసేందుకు ఉపయోగించే పోలీసుల్లోనూ అసంతృప్తి చోటు చేసుకుంటోంది. పొదుపు చర్యల్లో భాగంగా టోరీ ప్రభుత్వం రానున్న నాలుగు సంవత్సరాల్లో 34 వేల పోలీసు ఉద్యోగుల పోస్టులను రద్దుచేయ నిర్ణయించింది. పోలీసు బడ్జెట్‌లో 20 శాతం కోత విధించింది. మీడియాను సైతం టోరీ పాలన వదిలిపెట్టలేదు. ఆ దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థ అయిన బిబిసికి ప్రభుత్వం నుంచి ఇచ్చే కేటాయింపులకు కోతపెట్టింది. అందుకు నిరసనగా గడిచిన రెండు నెలల్లోనే బిబిసి పాత్రికేయులు రెండుసార్లు సమ్మె చేశారు. ఇలా బ్రిటన్‌లోని వివిధ వర్గాలు, తరగతులకు చెందిన ప్రజానీకం ప్రభుత్వ చర్యలతో అసంతృప్తి చెందాయి. అదే చినుచినుకు చేరి మహా ప్రవాహంలా మారిన రీతిన ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో అల్లర్లు, ఘర్షణల రూపంలో నిరసనోద్యమాలు సాగుతున్నాయి. పోలీసు బలంతోనూ, అధికార మదంతోనూ నిరసనలను టోరీ ప్రభుత్వం అణిచివేయవచ్చు. కానీ ప్రజల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా మిగిలిపోతుంది. నిరసనలకు మూల కారణమైన ఉదారవాద ఆర్థిక విధానాలను అక్కడి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. లేదా కనీసం ఆ వేగాన్ని తగ్గించాలి. అప్పుడే బ్రిటన్‌లో మంటలు చల్లారుతాయి. కాకపోతే చింకి గుడ్డకు మాసికలు వేస్తే దానిపక్కనే మరో చిరుగు పడుతుందన్న తీరున ఆ సమాజం అతలాకుతలం అవుతుందని బ్రిటన్‌ పాలకులు అలాంటి విధానాలను తలకెత్తుకొన్న దేశాల ఏలికలు గుర్తెరగాలి.

*****Article From Prajasakti Paper www.prajasakti.com

Tuesday, August 9, 2011

స్కాములోరి సామ్రాజ్యాలు




స్వాములమని ఇంకా మాట్లాడితే సాక్షాత్‌ భగవత్‌ స్వరూపులమని తమకు తామే ముద్ర వేసుకుని పూజా పీఠాలధిష్టిస్తున్నారు. సొంత సామ్రాజ్యాలు సృష్టించుకుంటున్నారు. అమాయకుల నమ్మకాలతో ఆటలాడుకుంటున్న ఇలాంటి ఆషాడభూతుల అసలుసిసలు అవతారాలు ఒక్కొక్కటే బట్టబయలవుతున్నాయి. నిత్యానందుని అత్యానంద రహస్యాలు ఆమూలాగ్రం వెల్లడై అతగాడు అత్తగారింటిని సందర్శించవలసిన గతి పట్టింది. వచ్చాక మళ్లీ భక్తాభినేత్రి రంజితతో కలసి రసవత్తర గురు పూర్ణిమ దృశ్యంలో దర్శనమివ్వడం వేరే సంగతి. అంతకు ముందే కల్కి భగవానుని కళంకిత గాధలు వెలుగు చూశాయి. అంతు తెలియని మానసిక స్థితిలో అపసవ్య అవస్థలో అమాయకులెందరో ఆ సాలెగూడులో చిక్కిన ఉదంతాలు టీవీలలో ప్రసారమయ్యాయి. వీటన్నిటినీ మించి బాబాలకు బాబాగా దేవేంద్ర వైభవంలో మునిగితేలిన పుట్టపర్తి సాయిబాబా జబ్బుపట్టి ఆస్పత్రి పాలవడం, ఆశ్రమంలోని అపార సంపదలు తరలిపోవడంపైన భక్త జనాలే గగ్గోలు పెట్టారు గాని ఏలిన వారు వేలు కదల్చలేదు. బాబా అవసానదశ నుంచి అంత్యక్రియల వరకూ కూడా ఆ విచారం కన్నా వివాదమే ప్రధానమైపోయింది. బయటివారి సంగతి అటుంచి బాబా బంధువర్గాలు కూడా గగ్గోలు పెడుతుంటే సర్కారు వారు మాత్రం ఆఖరు వరకూ మీన మేషాలు లెక్కించి అంతా అయిపోయాక రంగంలోకి దిగామనిపించారు. అక్కడ గూడుపుఠానీ జరుగుతుందని భక్తులు కూడా వాపోక తప్పలేదు. భక్తి కొద్దీ వారు ఇదంతా బాబాకు సంబంధం లేదని అనుకోవచ్చు. అంతటి వ్యక్తి ఆంతరంగికులను అమాయకంగా ఎంచుకుంటాడా అని ఆలోచించలేకపోవచ్చు. కాని అదే అసలైన ప్రశ్న. ఏతావాతా తేలేదొక్కటే! స్వీయ సామ్రాజ్యాలను తలపించే స్వామీజీల ఆశ్రమాలు అనేక రకాల అవాంఛనీయ శక్తులకు, అవినీతిపరులకు ఆశ్రయాలుగా మారుతున్నాయి. చెదురుమదురుగా గాక అన్ని చోట్లా అందరి విషయంలో ఇదే తంతు. స్వాములకూ స్కాములకూ అవినాభావ సంబంధం ఎవరూ కాదనలేని సత్యం. ఒకప్పుడు హేతువాదులు లేదా నాస్తికులు, కాదంటే కమ్యూనిస్టులు మాత్రమే చెప్పే విషయాలు ఇప్పుడు మీడియాలో రోజూ పుంఖానుపుంఖాలుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు స్వాముల స్కాముల లీలా విలాసాలు మచ్చుకు కొన్ని...
70, 80 ఏళ్ల కిందటి వరకూ ఆది శంకరాచార్యులు స్థాపించిన పీఠాల అధిపతులూ, రామకృష్ణమఠాలు నిర్వహించే స్వాములు లాంటి కొద్దిమంది ధర్మ ప్రచారకులుండేవారు. వారు కూడా దైవభక్తినీ, ధర్మాచరణను మాత్రమే బోధించేవారు. కానీ ఈనాడు అనేక పీఠాలూ మఠాలే కాదు, అనేకమంది కలియుగ దేవుళ్లు అవతారమెత్తి ధార్మిక జీవనాన్ని శాసిస్తుండడం చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. విచిత్రమేంటంటే 12,96,000 సంవత్సరాల కాలపరిమితి గల త్రేతాయుగంలో రామావతారమొక్కటే ధరించినట్లుగా పేర్కొనబడింది. పరశురాముడు కూడా శ్రీరాముడు జన్మించిన తర్వాత తన అవతార అవసరం తీరిందంటాడని రామాయణంలో చెప్పబడింది. 8,64,000 సంవత్సరాల కాల పరిమితిగల ద్వాపరయుగంలో కృష్ణావతారమొక్కటే చెప్పబడింది. కలియుగంలో కూడా ఐదు వేల సంవత్సరాలలో ఒక్క దేవుడూ అవతరించలేదు కానీ గత 150 ఏళ్లలో అనేక దేవుళ్లు జన్మించారనీ, వాళ్లు భక్తులకు మోక్షసామ్రాజ్యాన్ని కాక, భక్తుల క్షణిక బాధలూ, తాత్కాలిక సమస్యలూ తీర్చారనీ ప్రచారం జరుగుతుండడం ఈ శతాబ్ది ప్రత్యేకతగా గుర్తింపు పొందుతోంది.
కోవూరు నుంచి జెవివి వరకూ

70 లలో అబ్రహాం టి.కోవూరు అనే శ్రీలంక హేతువాద డాక్టరు సత్యసాయిబాబాను తన ముందు మహిమలు నిరూపించవలసిందిగా సవాలు చేశాడు. కాని బాబా స్పందించలేదు. ప్రభుత్వాలూ ప్రశ్నించలేదు. క్రమేణా టీవీ మీడియా వచ్చిన తర్వాత బాబా మహిమలు మానేసి దాన ధర్మాలు మొదలెట్టారు. అది కూడా ప్రజా ధనమే మరి. ఇటీవల చాలా కాలంగా జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు మహిమల బండారం బయటపెడుతున్నారు. బాబాలు, స్వాములు చేసేవన్నీ మరింత బాగా చేసి చూపిస్తూ ఇదంతా హస్త లాఘవమేనని నిరూపిస్తున్నారు. దురదృష్టం ఏమంటే వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు.
పరంపర.. తామర తంపర
వీరిలో షిర్దీసాయిబాబా వారసులుగా చెప్పుకుంటున్న పుట్టపర్తి సత్య సాయిబాబా, పెనుగొండ కాళేశ్వర్‌, కర్నూలు బాలసాయి బాబా మరియు దత్తాత్రేయుని అపరావతారంగా చెప్పబడుతున్న గణపతి సచ్చిదానంద స్వామి, విష్ణుమూర్తి పదవ అవతారంగా తనను తాను ప్రకటించుకున్న కల్కి భగవాన్‌ ఉరఫ్‌ విజయకుమార్‌, కృష్ణుని అవతారంగా చెప్పుకుంటున్న స్వామి సుందర చైతన్య, ప్రకాశం జిల్లా రామదూత స్వామి... ఇలా అనేకమంది ''భగవత్‌ అవతారమూర్తులు'' మన రాష్ట్రంలోనే అవతరించడం తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. వీరందరూ అతి సామాన్య, పేద కుటుంబాల్లో జన్మించారు. కానీ ప్రస్తుతం వేల కోట్ల రూపాయల ఆస్తులతో సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. హత్యలు, మానభంగాలు, కబ్జాలు ఇలా అనేక నేరారోపణలు వీరిమీదున్నాయి. చాలావరకు నిరూపితమయ్యాయి కూడా. కొన్ని నేరాలను తమ పరపతితో విచారణ స్థాయిలోనే తొక్కేయగలిగారు. వీరు భగవంతుని అవతారమూర్తులని పిలుద్దామా? అంటే కొన్ని దశాబ్దాల కాలంలోనే ఈ విశాల భూగ్రహంపై ఇంతమంది అవసరం ఏం వచ్చిందన్న ప్రశ్న ఉదయిస్తుంది. అదీగాక వీరందరూ జీవించి ఉన్న సమయంలోనే ధర్మ సంస్థాపన జరగకపోగా నేరాల తీవ్రత, నేరస్థుల చిట్టా రోజురోజుకీ పెరుగుతోంది. మరి వీరి అవతార ప్రయోజనమేంటి? పోనీ స్వాములు, యోగులు, సన్యాసులు అనుకుందామా అంటే డబ్బు, బంగారం, ఆస్తులున్న సన్యాసులను చూస్తేనే మహా పాపమనీ, ఆ పాపం పోగొట్టుకోడానికి కట్టుకున్న బట్టలతోనే స్నానం చేయాలనీ ''యాజ్ఞవల్క్య స్మృతి'' వంటి స్మృతులు ఘోషిస్తున్నాయి. కాబట్టి వీరు సన్యాసులూ కారు. వీరి ''లీల''లను కొన్నింటిని పరిశీలిద్దాం.


కర్నూలు బాలసాయిబాబా ఈయన మొదట్లో రికార్డింగ్‌ డ్యాన్సర్‌. బాలసాయిగా అవతారమెత్తాక ఈయన ఆస్తి వందల కోట్లలోకి చేరింది. ఈయన నడిపే స్కూళ్లలో ఉచితంగా చదువు చెప్తారని ప్రచారం. కానీ పిల్లల నుండి 40 వేల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తారు. హైదరాబాద్‌లోని భూ ఆక్రమణ కోర్టు ఇతన్ని భూ కబ్జాదారునిగా నిర్థారించింది. చెక్‌ పవర్‌ తన దగ్గరే అట్టిపెట్టుకున్న ''భగవాన్‌'' ఈయన.

 కాళేశ్వర్400 గదులతో కూడిన అన్ని వసతులూ ఉన్న బ్రహ్మాండమైన ఆశ్రమం ఈయనది. ఈ ఆశ్రమంలోని సిబ్బంది జీతాల ఖర్చే నెలకు పది లక్షల రూపాయలుంది. ఒక భక్తురాలి పట్ల అమర్యాదగా ప్రవర్తించి చెప్పుదెబ్బలు తిన్నాడు. 2005లో పెళ్లి చేసుకున్నాడు. ఆస్తుల విలువ కొన్ని కోట్ల రూపాయలు

 సుందర చైతన్యానంద స్వామి స్వగ్రామం నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం. చిన్నతనంలో కనీసం సైకిల్‌ కూడా లేని పరిస్థితి నుండి ఈనాడు అనేక ఎ.సి కార్లున్న పరిస్థితికి ఎదిగిపోయాడు. కబ్జాల్లో చెయ్యి తిరిగినవాడు. దళితుల గుడిసెలను కూడా వదిలిపెట్టని కబ్జావీరుడు. ధవళేశ్వరంలో ఆ కబ్జాను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన అఖిల పక్ష కమిటీ కార్యకర్తలను గూండాలతో కొట్టించే ప్రయత్నం చేశాడు. ఉపన్యాసాలు చేసేటప్పుడు నెమలి పింఛం పెట్టుకుని భక్తులు తనని శ్రీకృష్ణావతారుడుగా భావించాలంటాడు. భక్తులతో ఒకసారి బంగారు కిరీటం పెట్టించుకుని, బంగారు మురళిని బహుమతిగా అందుకున్నాడు. అయితే ద్వాపరయుగ కృష్ణుడికీ, సుందర చైతన్యానందుడికీ గల ప్రధానమైన తేడా ఏమిటంటే శ్రీకృష్ణుడ్ని ఎంత బంగారంతోనైనా సత్యభామ తూచలేకపోయింది. ఒకే ఒక్క తులసిదళంతో అది సాధ్యమైంది. కానీ మన అపర శ్రీకృష్ణుడు భక్తులకు ఒక్కో తులసిదళం ఇచ్చి వెయ్యి రూపాయలు వసూలు చేశాడు. ఇలా కొన్ని వేల తులసిదళాలు భక్తులకిచ్చి కొన్ని లక్షల రూపాయలు ఆర్జించాడు

 గణపతి సచ్చిదానంద ఈయన పాద దర్శనానికి వెయ్యి రూపాయలు, పాద పూజకు కనీసం 20 వేలు, గృహ ప్రవేశానికి వస్తే మినిమమ్‌ 50 వేలు, అమెరికాలోనైతే పాద పూజకు వేల డాలర్లు వసూలు చేశాడు. ఒక దశలో తన పాదుకలను పంపి ఫీజు వసూలు చేశాడు. ఈయన ప్రస్తుత ఆస్తి వెయ్యికోట్లు.



కల్కి భగవాన్‌ ఉరఫ్‌ విజయకుమార్‌ ఈయన తనను తాను విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కిగా ప్రకటించుకున్నాడు. ఈయన దర్శనానికి ఐదు వందల రూపాయలు, దీక్షకు 50 వేలు, పాదం చూస్తే వెయ్యి రూపాయలు, పాద పూజకు ఐదు వేలు, మాట్లాడేందుకు వేలకు వేలు వసూలు చేశాడు. మూలమంత్రం అంటూ ఒక మంత్రాన్ని సృష్టించి దాన్ని లాకెట్‌లో పొదిగి, ఆ లాకెట్‌ని భారతీయులకు 50 వేలు, విదేశీయులకు లక్ష రూపాయలకు అమ్మాడు. చిత్తూరు జిల్లా, వరదయ్యపాలెం మండలం, బత్తలవల్లం గ్రామంలో మూడు వందల కోట్ల రూపాయలతో గోల్డెన్‌ టెంపుల్‌ నిర్మించాడు. ప్రస్తుత ఆస్తి విలువ వేల కోట్లలో ఉంది. ఈ ఆశ్రమంలో స్వామీజీ ఇచ్చే ద్రవం తాగిన ఆశ్రమవాసులు అచేతనావస్తలో అయోమయంగా మాట్లాడుతున్న దృశ్యాలు టీవీలలో ప్రసారమై ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈయన భూములు విపరీతంగా ఆక్రమించుకోవడంతో భూ పోరాటాలు కూడా జరిగాయి.అయితే ఇప్పటికీ దీనిపై ప్రభుత్వ చర్య శూన్యం.

రామదూత స్వామి ఈయన ఆశ్రమం నెల్లూరు ప్రకాశం మధ్య ఉంది. ఈయన భూకబ్జాదారుడని స్థానిక తహసీల్దారు కలెక్టరుకు నివేదిక పంపించాడు కూడా. అయినా నాటి కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప, నాటి డిజిపి అరవిందరావు ఈయనను దర్శించి పాదాభివందనాలు, సాష్టాంగ నమస్కారాలు చేయడం ఎవరికీ అంతుచిక్కని విషయం.
సర్కార్ల సహకారం!
అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నా ఆశ్రమాల అధిపతులు శిష్య పరివారంతో సహా వైభోగంలో తులతూగడానికి ప్రభుత్వాధినేతలు పాలక వర్గ ప్రముఖుల కుమ్మక్కు ప్రధాన కారణం. చిన్నాచితకా నేరాలకే అమితమైన ప్రచారం ఇచ్చే ప్రభుత్వం, పోలీసులు ఈ బాబాలు, స్వాముల సామ్రాజ్యాల జోలికి పోరు. సాయిబాబా ఆశ్రమంలో అయిదు హత్యలు జరిగినా దానిపై అధికారిక దర్యాప్తు గాని విచారణ గాని లేకపోగా రాజ్యాధినేతగా వున్న శంకర్‌ దయాళ్‌ శర్మ అది చిన్న విషయమని తేల్చేశారు! బాబా ఆరోగ్యపరిస్థితిపై అనేక ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి తటపటాయించింది. వెళ్లిన మంత్రులు ట్రస్టు నిర్వాహకులకే వంత పాడారు తప్ప తమ వంతు బాధ్యత నిర్వహించలేదు. ఇప్పుడు అనివార్యంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నా జరగాల్సిన నష్టం జరిగే పోయింది. లోగడ నగ సన్యాసిని మంగమ్మవ్వ ఓ హత్య కేసులో జైలు పాలైంది. తమిళనాడులో ప్రేమానంద అనే స్వామి కూడా అంతే. అమెరికా వెళ్లిన స్వామి రజనీష్‌ (ఓషో) అక్కడి పోలీసుల దాడి తట్టుకోలేక ఇక్కడకు పరుగెత్తుకొచ్చాడు. నీళ్ల స్వాములు, నిమ్మకాయల స్వాములు, వుమ్మేసే స్వాములు... ఎందరెందరో జన విజ్ఞాన వేదిక ధాటికి చిత్తయిపోయారు. ఈ బడా స్వాములు అలా చిక్కకుండా తప్పించుకోవడానికి కారణం ప్రభుత్వ అండదండలే. పాలక వర్గ ప్రముఖులు పనులు జరిపించుకోవడానికి ఈ ఆశ్రమాలను ఉపయోగించుకుంటారు. అక్కడ చట్టాలు పని చేయకుండా అడ్డుకుంటారు. ఇప్పుడు దేశంలో నల్లడబ్బు గురించి ఇంత చర్చ జరుగుతున్నది గాని బాబా ఆశ్రమంలో గుట్టలు పడిన సంపద ఎవరిదనే దానిపై మాత్రం సమాచారం లేదు. దేశ విదేశీయులు ఇష్టానుసారం సంచరించే అలాంటి చోట సంఘ వ్యతిరేక శక్తులు తలదాచుకునే అవకాశాలను ఎవరూ తోసి పుచ్చలేరు. ఆధ్యాత్మికంగా ప్రతిష్టాత్మకమైన కంచి ఆశ్రమ స్వామి జయేంద్ర సరస్వతి అరెస్టు సందర్భంలో వినవచ్చిన కథనాలు కంపరం పుట్టించాయి. ఏదో కారణంతో జయలలిత ప్రభుత్వం నాడు అంత కఠినంగా వ్యవహరించింది గాని అది అరుదైన ఘటన. ఆమెకు స్వయంగా చాలా మూఢత్వం వుంది. అవినీతి వ్యవహారాలతో నిన్న గద్దె దిగిన యెడ్యూరప్ప ముందు స్వామీజీనే సందర్శించారు. నెల్లూరు జిల్లాలోని రామదూత ఆశ్రమానికి కూడా ఆయన తరచూ వస్తుంటారు. తులాభార చక్రవర్తిగా పేరొందిన మన మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కూడా బాబాలు స్వాముల చుట్టూ తిరుగుతుండే వారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, పోలీసులు, శాస్త్రజ్ఞులు ఆఖరుకు అత్యున్నత నేతలుగా వుండాల్సిన ప్రధాన మంత్రులు రాష్ట్రపతులు కూడా రాజ్యాంగ విలువలను కాలదన్ని బాబాల ముందు మోకరిల్లుతుంటే సామాన్య ప్రజలు వారి చుట్టూ చేరడంలో ఆశ్చర్యం ఏముంటుంది? ప్రజల చైతన్యాన్ని మొద్దుబార్చి పోరాటాల్లోకి రాకుండా చేసేందుకు కర్మ సిద్ధాంతం లాగే బాబాలు కూడా బాగా ఉపయోగపడతారు గనకే పాలకులు వారిని నెత్తిన పెట్టుకుంటారు. ఆపైన తమ అక్రమాలకూ ఉపయోగించుకుంటారు. ప్రశ్నించేవారిని ప్రోత్సహించకపోగా అణగదొక్కుతారు. అంతర్జాతీయ శక్తులు కూడా ఆ విషయంలో వెనకబడవు. వెరసి ఇదొక విష వలయం అంటే తప్పు కాదు.
పుట్టపర్తి సాయిబాబా తనకు తాను భగవంతునిగా ప్రకటించుకున్న ఈ బాబా చనిపోయిన తర్వాత, ఈయన నెలకొల్పిన ట్రస్టు సభ్యులు, బాబా డబ్బునుగానీ, బంగారాన్ని గానీ ముట్టుకునేవారు కాదనీ, విరాళాలన్నీ చెక్కుల రూపంలో ఉంటాయనీ, డబ్బు స్వీకరిస్తే రసీదు ఇచ్చేవారనీ ప్రకటించారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన బెడ్‌రూంలో దాదాపు క్వింటాల్‌ (వంద కేజీలు) బంగారం, కోట్ల రూపాయల నగదు కనిపించింది. ట్రస్ట్‌ సభ్యులు రసీదులు లేని, కోట్లాది రూపాయల బంగారం, నగదు అక్కడ ఎందుకు ఉందనే ప్రశ్నకు జవాబు చెప్ప లేదు. మీడియా కూడా సత్యసాయి నివాస గృహం నుండి అక్రమంగా తరలిపోతున్న ధనాన్ని ఎవరు బయటికి పంపారనే విషయం పైనే కేంద్రీకరించింది కానీ, అసలు సాయి నివాసంలో ఎందుకుందనే విషయంపై దృష్టి సారించలేదు.
అంతేకాదు, రిజర్వ్‌ బ్యాంకు సూత్రాల ప్రకారం ప్రైవేటు వ్యక్తుల వద్ద బంగారం ఎక్కడ్నుండి వచ్చిందనే వివరాలు, రసీదులు లేకుండా కిలోలు, క్వింటాళ్ల లెక్కన బంగారం ఉండకూడదు. కానీ వంద కేజీల బరువున్న సుందర చైతన్యానంద బంగారంతో తులాభారం తూగినా, పుట్టపర్తి సత్యసాయిబాబా వద్ద దాదాపు క్వింటాల్‌ బంగారం లెక్కల్లో లేనిది ఉన్నా రిజర్వ్‌ బ్యాంకు కానీ, ప్రభుత్వం కానీ ఎంక్వయిరీ చేయించిన దాఖలాలు లేవు. అంటే ఈ స్వాములూ, బాబాల ఆశ్రమాలు వారి స్వంత సామ్రాజ్యాలా? వారి నెవరూ సోదా చేయకూడదా?
ఈ భగవాన్‌లు, స్వాములలో కొందరు తమ భారీ నిల్వ ధనంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నారు. కాబట్టి వారిని గౌరవించాలనీ, కీర్తించాలనీ కొందరు అంటుంటారు. ఇదే పరిస్థితి బాబాలు మన అమాయక భక్తుల విషయంలోనూ జరుగుతోంది. కబ్జాదారులు, మోసగాళ్లు.... బాబాలు, స్వాముల అవతారాలు ఎందుకు ఎత్తుతున్నారు? అన్న ప్రశ్నకు ఒక టీవీ చానల్‌ ప్రసారంలో ఒకరు ఇచ్చిన సమాధానం మీ ముందుంచుతాను.
''ఒక కొలనులో కొన్ని చేపలుండేవి. వాటిని తినడానికి ఓ కొంగ వచ్చింది. రోజల్లా ఆ నీళ్లల్లో ప్రయత్నించినా ఒక్క చేపా దానికి దొరకలేదు. అప్పుడది సమీపంలో వున్న తన గురువుగారి దగ్గరకు వెళ్లి తనకు చేపలు దొరికే మార్గం చెప్పమని అడిగింది. ఆ గురువుగారు నీవు రేపు కాషాయ వస్త్రాలు ధరించి వెళ్లు. నీ దగ్గరకే చేపలు వస్తాయి'' అని చెప్పారు. గురువు గారు చెప్పినట్టే చేసి కొంగ కడుపు నిండా చేపలను ఆరగించిందట. ఇదీ కాషాయ వస్త్రాల రహస్యం. అందుకే నిపుణులైన మోసగాళ్లు కాషాయ వస్త్రాలు ధరించి ప్రజల ముందుకు వస్తున్నారు. అమాయకులైన ప్రజలు వారి వలలో పడి తమ సర్వస్వం సమర్పించుకుంటున్నారు.
ఈ సందర్భంలో ఒక విషయం స్పష్టం చేయాలి. కాషాయం ధరించిన వాళ్లంతా మోసకారులు కాదు. ఎవరైతే సామాన్యమైన మెజీషియన్లు చేసే మేజిక్కులను తాము కూడా చేసి అవి తమ మహిమలని ప్రకటించుకుంటారో, ఎవరైతే దర్శనానికి కూడా రేట్లు నిర్ణయిస్తారో, ఎవరైతే వందల..వేల కోట్లలో ఆస్తులు సంపాదించి సన్యాస ధర్మాన్ని అతిక్రమిస్తారో, ఎవరైతే తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తాము చనిపోయే వరకు చెక్‌ పవర్‌ కూడా వదులుకోరో వారిని మోసగాళ్లగా ప్రజలు గుర్తించాలి.
మూఢత్వమే మార్కెట్‌!
ఆధునిక యుగంలో కూడా ఎందుకీ మూఢత్వం? చదువుకున్న వారు కూడా మోసకారి స్వాముల వెంట ఎందుకు పడుతున్నారు? వంటి ప్రశ్నలు తరచూ ఎదురవుతుంటాయి. విద్యలో విజ్ఞానాన్ని రంగరించే బదులు దేనికదిగా చెబుతూ మూఢత్వాన్ని ప్రోత్సహించే విధానాలు ఇందుకు ముఖ్య కారణం. అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్‌ ప్రయోగించే ఉపగ్రహ నమూనాను దైవ దర్శనానికి తీసుకువెళ్లడం నిజానికి సైన్సుకే గాక రాజ్యాంగ లౌకిక స్వభావానికి కూడా విరుద్ధం. అయినా అవన్నీ షరా మామూలుగా జరిగిపోతున్నాయి. పాలకులకు ప్రజల మూఢత్వం కావాలి తప్ప చైతన్యం కాదు.దాన్ని పెంచేందుకే సహకరిస్తారు తప్ప తగ్గించేందుకు సిద్ధపడరు. ఇప్పుడు నడుస్తున్న ప్రపంచీకరణ వాస్తవంలో మార్కెట్‌తత్వంతో పాటు మత ఛాందసాన్ని కూడా ఎగదోస్తుంది. అంతర్జాతీయ సామ్రాజ్యవాదాన్ని గురించి తెలుసుకోకుండా స్థానికత పేరిట అంధ విశ్వాసాలలో జనం కూరుకుపోవడం వారికి చాలా అవసరం. అలాగే వారి మార్కెట్‌ సూత్రాలకు ఏదీ అతీతం కాదు గనక మూఢత్వాన్ని భక్తి విశ్వాసాలను కూడా మార్కెట్‌ సరుకుగా మార్చుకుని సొమ్ము చేసుకుంటారు. బాబాలు తమ ప్రచారం తామే చేసుకునే రోజుల నుంచి ఇప్పుడు మెగా ఈవెంట్స్‌గా జరిపే స్థితికి వచ్చారంటే అదే కారణం. ఒకప్పుడు హరేరామ హరే కృష్ణ ఉద్యమం మన దేశంలో గాక పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయిన సంగతి మర్చిపోరాదు. వినోదం పొందడానికి విలాసంగా గడపడానికి కూడా వారికి ఈ ఆశ్రమాలు ఉపయోగపడతాయి. విదేశీయులు వస్తే అది అదనపు ఆకర్షణగా భావించి మన దేశంలోని అమాయక ప్రజలు కూడా ఎగబడతారు.
చిన్న చిన్న స్వాముల నుంచి వేలకోట్ల రూపాయలార్జించిన బడాస్వాముల వరకూ, వీరికి భక్తులెందుకు ఏర్పడుతున్నారు? కొంత మందికి మానవాతీత శక్తులుంటాయనే కథలను పసితనం నుంచి అమ్మలు, బామ్మలు, పాఠ్యపుస్తకాలు నూరిపోయడమే స్వాములను మానవాతీత వ్యక్తులుగా నమ్మడానికి ప్రధాన కారణం. పాఠ్యపుస్తకాలలో శాస్త్రీయ అవగాహనను పెంచే అంశాలే వుండడం లేదు. పైగా ఉన్నత విద్యావ్యవస్థలో జ్యోతిషం, వాస్తు వంటి అశాస్త్రీయ అంశాలు కోర్సులుగా ప్రవేశ పెట్టబడ్డాయి. దానితో ప్రజలలో అశాస్త్రీయ ఆలోచనా విధానం బాగా ముదిరిపోయింది. ''ఈశాన్య మూలన బరువు వుంటే ధన నాశం'' అని ఒక వాస్తువాది అంటే నమ్మడమే గానీ ఈశాన్య మూలన వుండే కర్రకు, మన ఇంట్లో ధనాన్ని నాశనం చేసే శక్తి ఎలా వస్తుంది? అని హేతుబద్ధంగా ఆలోచించే శక్తి నశించింది. అందుకే నిన్నటి దాకా బిందెల చిల్లులకు మాట్లు వేసుకుని బతికిన వ్యక్తి నేడు నీళ్ల స్వామి అవతారమెత్తి, ప్రజల రోగాలు పోగొట్టే శక్తిగలవాడంటే నమ్మి విద్యాధికులతో సహా నీళ్ల చెంబులతో అతని ముందు క్యూ కట్టారు. నిన్న సినిమా హాళ్ల ముందు బ్లాకులో టికెట్లు అమ్మిన వ్యక్తి నేడు బాబా అవతారమెత్తి ఆశీర్వదిస్తున్నాడంటే శిరస్సు వంచారు. కాబట్టి ఈనాడు నలుగురైదుగురు బాబాలు, స్వాముల బండారం బయటపెడితే, వారి సొంత సామ్రాజ్యాల పెరుగుదల ఆగిపోతుంది. అంతే. రేపు మరో నలుగురైదుగురు స్వాములు 'అవతరిస్తారు'. ప్రజలు వారిని అనుసరిస్తారు. వీరి 'ప్రమాదం' నుంచి ప్రజలు బయటపడాలంటే విద్యార్థి దశ నుంచే పిల్లల మనస్సులలో శాస్త్రీయ అవగాహనా బీజాలు నాటాలి. ప్రకృతి సూత్రాలకతీతంగా ఎవ్వరూ ఏ పనీ చేయలేరని వివరించాలి. అశాస్త్రీయ అంశాల బోధనను నిలిపివేయాలి.
ఒక మోసకారి బాబాదో, కబ్జాస్వామిదో బండారాన్ని సైన్సు ఉద్యమకారులు బయటపెట్టినప్పుడు, ఆ ప్రయత్నం హిందూ మతం మీద దాడిగా భావించుకొని కొందరు ఆవేశపూరితులౌతున్నారు. సైన్సుఉద్యమకారులు హిందూ మతం మీదే దాడిచేస్తారనీ, ఇతర మతాలకు చెందిన మోసగాళ్ల జోలికి పోరనీ ఆరోపిస్తున్నారు. హైదరాబాదులో ఎంతోమంది ముస్లిం మతానికి చెందిన నకిలీ బాబాలు దొరికిపోయారు. సైన్సుఉద్యమకారులు బలంగా వున్న చోట ముస్లిం, క్రిస్టియన్‌ మతాలలోని మోసగాళ్ల బండారాలను కూడా బయటపెడుతున్నారు. కింది ఉదాహరణను పరిశీలించండి.
''అమెరికాలో దైవదూతగా ప్రచారం పొందిన మావియన్‌ సెలోలార్‌ బొంబాయి, మద్రాసులలో విజయవంతంగా పర్యటనలను ముగించుకొని కలకత్తాలో అడుగుపెట్టారు. ఆయన రాకకు పత్రికలలో కనీవినీ ఎరుగని ప్రచారం లభించింది. చెవుడు, మూగతనంతో బాధపడుతున్నవారిని తక్షణం నయం చేస్తాననే వాగ్దానంతో నగరంలోని పార్క్‌ సర్కస్‌ మైదానంలో ఆయన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆయన తన అసమాన వాక్చాతుర్యంతో వేలాదిమందిని ఆకట్టుకున్నారు. అయితే సైన్సుఉద్యమకారులు రంగప్రవేశం చేసి ఆయన బూటకాన్ని బట్టబయలుచేసే వరకే అదంతా సాగింది. సైన్సుఉద్యమకారులు అకస్మాత్తుగా వేదికపైకి ఎక్కి సెలోలార్‌ అప్పుడే నయం చేశానని చెబుతున్న ఒక వ్యక్తిని చుట్టుముట్టారు. తరచి తరచి ప్రశ్నించిన మీదట అతను అసలు చెవుడు లేదా మూగ కాదని తేలింది. దాంతో ఆగ్రహావేశులైన ప్రజలు సెలోలార్‌పై రాళ్లు రువ్వడంతో ఆయన వాటి నుంచి ఎలాగో తప్పించుకున్నారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించి అక్కడి నుంచి పంపివేసింది.''

(లేఖా రతనాని, కవితా షెట్టి, టి.ఎన్‌.గోప కుమార్‌, సరితా రారులు ఇండియా టుడే లో వ్రాసిన వ్యాసం నుంచి)
ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, శివసేనలు బలంగా వున్న బొంబాయిలో సెలోలార్‌ బండారం బయటపడలేదు. అసలు అక్కడ ఆ ప్రయత్నమే జరగలేదు. సైన్సుఉద్యమకారులు బలంగా వున్న కలకత్తాలో అతని బండారం బయటపెట్టబడింది. మార్క్సిస్టు ప్రభుత్వం ఆ మోసగాడిని రాష్ట్రం నుంచి బయటకు పంపేసింది. ఇదీ అసలు విషయం.
భగవత్‌ స్వరూపులను విమర్శిస్తే వారి భక్తుల మనోభావాలు గాయపడతాయని ఇటీవల కొందరు అంటున్నారు. పురాణాల ప్రకారం చూసినా భగవంతుడికేే భక్తులుంటారు. భగవత్‌ స్వరూపులను అనుసరించేవారిలో చాలా మంది అమాయకంగా మోసగాళ్లను నమ్ముతున్నారు. కాబట్టి ఆ అమాయకులను ఆత్మహత్యా సదృశ్యమైన మార్గం నుంచి తప్పించి, మోసగాళ్ల బారి నుంచి బయట పడవేయడం ప్రతి ఒక్క పౌరుని కర్తవ్యం. కాబట్టి భగవత్‌ స్వరూపుల మోసాలను, కబ్జాలను బయట పెట్టడాన్ని, వారి భక్తుల మనోభావాలను గాయపరచడం కానే కాదు. రాజ్యాంగంలో 51ఎ (హెచ్‌) అధికరణం కూడా ఆ కర్తవ్యాన్ని నిర్దేశిస్తోంది. ఇన్ని భాగోతాలు బయటపడిన తర్వాతనైనా ఈ స్వాములు, బాబాలు, భగవత్‌ స్వరూపుల మాయా సామ్రాజ్యాలను విచ్ఛిన్నం చేయడం ప్రతి ఒక్క దేశ భక్తుడి బాధ్యత. అంతకు మించి ప్రభుత్వాల బాధ్యత.


***Article From Prajasakti Daily
Written By K.L.KanthaRao  http://www.prajasakti.com/




Tuesday, August 2, 2011

గాడిద-ఏనుగు పోరు

పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటంగా మారినట్లు ప్రపంచ ధనిక దేశాల విన్యాసాలున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలను గమనంలో ఉంచుకొని అమెరికాలోని పాలక ప్రతిపక్షాల బడ్జెట్‌కోత, దేశ రుణపరిమితిపై వేస్తున్న ఎత్తులు జిత్తులు చివరకు ప్రపంచంలో దేనికి దారితీస్తాయో తెలియని అయోమయంలోకి నెడుతున్నాయి. చిత్రమేమంటే అవసరం లేని ఆయుధాలు కొని ఐరోపాలోని పేద దేశమైన గ్రీస్‌ దివాళా తీస్తే ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకున్న అమెరికా కూడా ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లు ప్రపంచ దేశాలన్నింటికీ పొదుపు చర్యలు తీసుకోవాలని బోధించే అమెరికా ఇప్పుడు తమ అప్పు భారాన్ని తగ్గించుకొనేందుకు ఎలాంటి పొదుపు చర్యలు తీసుకోవాలో తేల్చుకోలేక కొట్టుమిట్టాడుతోంది. ఆగస్టు రెండవ తేదీలోగా ఈ సమస్యపై ఏదో ఒక పరిష్కారానికి రాని పక్షంలో ప్రభుత్వ బిల్లు చెల్లింపులు నిలిచిపోతాయి. ఈ స్థితిని చూసి యూరోపియన్లు దివాళాకు సిద్దంగా ఉన్న మా పోర్చుగల్‌కు అమెరికాకు తేడా ఏంటట అని జోకులు వేస్తున్నారు. అనేక ఇతర దేశాలపై ప్రభావం చూపుతుందన్న జ్ఞానం, బాధ్యత లేకుండా అమెరికాలోని గాడిద-ఏనుగు(రిపబ్లికన్‌-డెమోక్రటిక్‌ పార్టీల గుర్తులు) దెబ్బలాడుకుంటున్నాయని చైనా వార్తా సంస్థ సిన్హువా ఘాటుగా స్పందించింది. రుణ ఊబిలో అమెరికా కూరుకుపోతే చైనా, ఇతర దేశాలు ఎందుకు అంతగా ఆందోళనకు గురికావాలని ఎవరైనా అడగవచ్చు. ఒకనాడు ప్రపంచంపై పెత్తనం చలాయించిన బ్రిటీష్‌ పౌండు స్థానాన్ని అమెరికన్‌ డాలర్‌ ఆక్రమించింది. దాంతో డాలర్‌పే పరమాత్మ అన్నట్లు పరిస్థితి తయారైంది. ఇప్పుడా ఆ డాలరే ఆరు దశాబ్దాలలో తొలిసారిగా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నపుడు డాలర్లను కలిగి ఉన్నవారికి,దానిపై ఆధారపడిన వారికి ఆందోళన లేకుండా ఎలా ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే అధికంగా చైనా ఇప్పుడు 1.16లక్షల కోట్ల డాలర్లతో అమెరికన్‌ బాండ్లు కొనుగోలు చేసింది. ఒక వేళ తన కరెన్సీ విలువను అమెరికా తగ్గించినా, బరితెగించి దివాలా ప్రకటించినా మునిగిపోయేది ప్రపంచమే. సంక్షోభ ఊబిలో మునిగి ఉన్న తమను రక్షిస్తుందని భావిస్తున్న అమెరికాయే రుణ ఊబిలో దిగబడితే తమ గతేం కానని ఐరోపా యూనియన్‌ దేశాలు బావురుమంటున్నాయి. ప్రపంచ ద్రవ్య మార్కెట్ల పట్ల తమకూ బాధ్యత ఉందన్న స్పృహతో అమెరికన్‌ రాజకీయ పక్షాలు వ్యవహరించాలని జర్మన్‌ ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు చేజేతులా తాను సృష్టించిన సంక్షోభానికి తాను బలౌతూ ప్రపంచాన్ని కూడా బలితీసుకుంటున్న అమెరికాలో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. సకల రోగాలున్న రోగికి ఒకదానికి మందిస్తే మరొక రుగ్మతకు దారి తీస్తుందన్న మాదిరి పరిస్థితి తయారైంది. ఇప్పుడున్న ఉద్దీపన పథకాలు, సంక్షేమ పథకాలను కొనసాగిస్తే రుణభారం పెరుగుతుంది. దాన్ని అదుపులో ఉంచటానికి ఉద్దీపన, సంక్షేమ పథకాలకు కోతపెడితే ఇప్పుడున్న ఒకశాతం అభివృద్ధి రేటు మైనస్‌లో పడుతుంది. దీనిలో ఏది జరిగినా అధికారంలో ఉన్న బరాక్‌ ఒబామా రెండవసారి ఎన్నికయ్యే అవకాశం ఉండదు. ధనికుల రాయితీలు తగ్గించకుండా సంక్షేమ పథకాలపై కోత పెట్టించటం ద్వారా ఒబామాను ప్రజలనుంచి దూరం చేసి తాము గద్దెనెక్కాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు చూస్తున్నారు. అందుకోసం రెండుపార్టీలు గత నెల రోజులుగా ఆడుతున్న చెలగాటం ప్రపంచానికి ప్రాణసంకటంగా మారుతోంది. ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్న ప్రతిపక్ష రిపబ్లికన్లు ఆమోదించిన ఒక ఫార్ములా తీర్మానాన్ని 24 గంటలలోపే డెమొక్రాట్లు మెజారిటీ ఉన్న సెనేట్‌ తోసి పుచ్చింది. రెండు సభలలోనూ కొందరు రిపబ్లికన్లు అధికార పార్టీతో చేతులు కలిపారు.
నిజంగా అమెరికా అంత ప్రమాదంలో ఉందా? అలాంటపుడు ఇప్పటికీ అది ప్రపంచ అగ్రరాజ్యంగా ఎందుకుంటోందని కొందరికి సందేహం రావచ్చు. సంక్షోభం, సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ఆర్థికంగా, మిలిటరీ, రాజకీయంగా అమెరికా ఇప్పటికీ అగ్రరాజ్యంగానే ఉంది. దాని ఆధిపత్యానికి ముప్పుతెచ్చే సమస్యల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. అందువల్లనే గాడిద-ఏనుగు పార్టీలు రెండూ కూడా ఎంతసేపటికీ సామాన్యుల సంక్షేమ పథకాలకు ఏమేరకు కోతపెట్టాలనే దానిపై కీచులాడుకుంటున్నాయి తప్ప ఆఫ్ఘన్‌, ఇరాక్‌, లిబియాలపై దాడులు, దురాక్రమణలకు, ప్రపంచంలో ఇతర చోట్ల అగ్గి రాజేసేందుకు చేస్తున్న మిలిటరీ ఖర్చు తగ్గించటం గురించి ఏమాత్రం ఆలోచించటం లేదు. రానున్న పది సంవత్సరాలలో సంక్షేమ పథకాలకు కోత పెట్టి పొదుపు చేయాలని చూస్తున్న మొత్తం కంటే యుద్ధ ఖర్చు రెండింతలుంది. పోనీ ఆ యుద్ధం ద్వారా ఏమైనా సాధించిందా అంటే తన కంపెనీల ఆయుధాలు అమ్ముకోవటం, చవకగా ఇరాక్‌ నుంచి చమురును కొట్టేయటం తప్ప సామాన్య అమెరికన్లకు ఒరిగిందేమీ లేదు. ఉగ్రవాదంపై పోరు పేరుతో ఆప్ఘనిస్తాన్‌లో చేస్తున్న దాడులు ఉగ్రవాద ప్రమాదాన్ని మరింత పెంచాయే తప్ప తగ్గించలేకపోయాయని ఒసామా బిన్‌లాడెన్‌ హత్యానంతర పరిణామాలు కూడా స్పష్టం చేశాయి. అన్నమైతే నేమిరా సున్నమైతే నేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లు అమెరికా ఆర్థిక వ్యవస్థలో సంక్షోభాలు తలెత్తిన ప్రతిసారీ నష్టపోయింది సామాన్యులు తప్ప కార్పొరేట్‌ కంపెనీలు కాదు. తాజా సంక్షోభంలో అమెరికాలో దాదాపు 50లక్షల మంది తమ కొంపాగోడు కోల్పోయారు తప్ప వారికి అప్పులిచ్చి తిప్పలకు గురిచేసిన బ్యాంకర్లు లక్షల కోట్ల డాలర్ల ప్రభుత్వ ఉద్దీపన పథకాలతో అపరిమిత లాభాలు ఆర్జించారు. వారికి సంక్షోభం వరంలా పరిణమించింది. ఇప్పుడు కూడా అలాంటి వారే రెండుపార్టీల వెనుక చేరి సామాన్యుల నెత్తిన శఠగోపం పెట్టించేందుకు చక్రం తిప్పుతున్నారు.
సోమవారంలోగా సమస్య పరిష్కారంగాకపోతే అమెరికాలో ఏమౌతుంది? చికాగో నగరంలో వచ్చే గురువారం నాడు అట్టహాసంగా తన 50వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకొనేందుకు అధ్యక్షుడు ఒబామా సిద్ధం అవుతున్నాడు. నిజంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా అలా చేస్తారా? గడువులోగా తాను చెప్పిన విధంగా పార్లమెంట్‌ రాజీకి రాకపోతే రాజ్యాంగంలోని పద్నాల్గవ సవరణ కత్తిని ఉపయోగించేందుకు సిద్ధం అవుతున్నాడు. దాని ప్రకారం ప్రభుత్వ రుణ పరిమితిపై అధ్యక్షుడి నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించే అవకాశం ఉండదు. ఎన్నికలలో రుణాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకొనేందుకు ప్రతిపక్ష రిపబ్లికన్లు ఒబామాను ఆ స్థితికి నెడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షం సహకరించని కారణంగా కత్తి ఝళిపించక తప్పలేదని ఒబామా కూడా ఎన్నికల్లో చెప్పుకుంటాడని వేరే చెప్పనవసరం లేదు. ఏమైనా అమెరికాలోని అధికార,ప్రతిపక్షపార్టీలు రెండూ కలిసి సామాన్య అమెరికన్లు, ప్రపంచ దేశాలను కష్టాల పాల్జేస్తున్నాయి.
article From : prajasakti daily