Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Wednesday, July 3, 2013

గోదారిలో 'తేల్‌' పడింది

కొందరు ఏం మాట్లాడినా సంచలనమే, ఏమన్నా జోకే! కార్మిక నాయకుడు, మంచి మనిషి అంజయ్యగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో దినపత్రికల వాళ్లకు రోజుకో ఆహ్లాదకర విషయం అందుబాటులో ఉండేది. ఆయన ఏ మాట మాట్లాడినా అందులో ఓ తమాషాని వెదుక్కునేవారు.
ఒకసారి ఆయన 'గోదారిలో తేల్‌ పడింది' అన్నారు. కొందరికి ఏమీ అర్థం కాలేదు. గోదావరిలో తేలు పడితే ఒక ముఖ్యమంత్రి ప్రకటన చేయాలా? అనుకున్నారు. కొందరు ఆయన పెంచుకున్న తేలు పడిందేమోనని అనుకుని ఉండవచ్చు కూడా. అయినా తాను పెంచుకునే తేలును గోదావరి దాకా ఎందుకు తీసుకుపోయినట్టు?
తీరా చూస్తే గోదావరిలో చమురు పడిందని తెలిసింది. 'తేల్‌' అంటే ఉర్దూలో నూనె కదా అని తరువాత అనుకున్నారు. అంతా నవ్వుకున్నారు హాయిగా. రెండు భాషలు కలిపి మాట్లాడితే ఇదే ప్రమాదం. ఆయన ఏది చేసినా అంతే. ఇంకోసారి అమెరికా పర్యటన అనంతరం హైదరాబాదుకొచ్చి 'అమెరికా ఎంతగానో అభివృద్ధి చెందింది. అక్కడ రైతులు కూడా 'ఇంగ్లీష'్‌ మాట్లాడుతున్నారు' అని ఆయన చెప్పినట్టు రాశారు. ఏమైనా ఆ డైలాగుకు కొద్దిసేపు నవ్వుకోవచ్చు. సెల్లు ఫోనులున్న ఈ రోజుల్లో గనుక ఆయన ఉండి ఉంటే మన ఎస్సెమ్మెస్సు జోకులన్నీ ఆయన మీదే ఉండేవేమో?
తరువాత అన్న రామారావు గారు కొన్ని సంవత్సరాలు అందర్నీ అలరించారు. ఇక వారి గురించి కూడా చెప్పుకుంటూ పోతే కథానాయకి 'తేలు'కు కోపమొచ్చి మనల్ని కుట్టవచ్చు!
అందుకే తేలు విషయానికొద్దాం. తేలంటే అందరికీ భయమే. పట్టణాలు, నగరాల్లో నివసించేవారికి అవి పరిచయం లేదు కాని పల్లెల్లో అవి మామూలే. ఎర్ర తేలనీ, నల్ల తేలనీ అవి కుట్టినప్పుడు వాటి తీవ్రత అక్కడివారే చెప్పాలి. 'అసలు కొంతమంది మాట్లాడుతూ ఉంటే నాకు తేళ్లూ, జెర్రులూ వళ్లంతా పాకినట్లుంది' అనేవారూ ఉన్నారు. ఎండ్రకాయలు, రొయ్యలు ఇలా ఆ తెగకు చెందిన వాటి రూపమే అలా ఉంటుంది. వాటి కాళ్లు, కొండ్లు భయపెడతాయి. వాటి బంధువులే అయినా ఎండ్రకాయలు, రొయ్యలను మాత్రం బాగా తింటారు అది వేరే విషయం.
తేలంటే 'నిస్సిం ఎజికిల్‌' రాసిన 'తేలు కుట్టిన రాత్రి' అన్న ఆంగ్ల పద్యం గుర్తొస్తుంది. అందులో ఓ తల్లికి తేలు కుట్టడం, భూత వైద్యుడొచ్చి ఏవేవో మంత్రాలు చెప్పటం, ఇంకా ఇతర మూఢాచారాలు బాగా కనిపిస్తాయి. ఎవరో పసరు పూస్తారు. అయినా ఉపశమనము ఉండదు. ఇదంతా పూర్వ జన్మలో చేసుకున్న పాప ఫలమని ఒకరు చెబుతారు. రాత్రంతా నిద్రలేని ఆమెకు సూర్యోదయాన నొప్పి కొద్దిగా తగ్గుతుంది. ఇక గండం గడచినట్టే. ఆ తల్లి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. తనకు తగ్గినందుకు కాదు, తన పిల్లల్ని కుట్టకుండా తేలు తనని కుట్టినందుకు! పిల్లలపై తల్లి ప్రేమ అటువంటిది. స్వార్థరహితం.
ఇప్పుడో గోదావరి, కృష్ణా బేసిన్‌లో 'తేలే' కాదు, సహజ వాయువూ పడింది. మనల్ని తల్లిలా కాపాడవలసిన మన ప్రభుత్వాలు వాటిని తీసుకుపోయి బాగా చమురు దాహమున్న వ్యాపార స్తులకిస్తున్నాయి. అది ఎంత తాగినా తీరని దాహం. తాగే కొద్దీ పెరుగుతుంది. ఏమంటే రకరకాల లెక్కలు చూపిస్తున్నారు. ఇదేమని అడిగే దిక్కే లేదు. ఉన్న దిక్కు కొందరు నిలదీసినా లోపల అందరూ మిలాఖతు. కాబట్టి అక్కడ బలం చాలటం లేదు.
పెరట్లో పండిన కూరగాయలు ఉచితంగా దొరుకుతాయి కదా! మన దగ్గర దొరికితే ధర తగ్గుతుందని మనమ నుకుంటే పిచ్చోళ్లమే! అలా తగ్గదు. మీకు బొత్తిగా వ్యాపార సూత్రాలు తెలియవంటారు. జీవితంలో మీరు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా చాలా ఉందంటారు. మీరు ఎప్పుడు బాగుపడతారంటారు. ఇలా ఉంటే 'దేశమేగతి బాగు పడునోరు' అంటారు. 'అలా కావాలంటే ముందు మేము బాగు పడవలెనోరు' అని సూచన కూడా వస్తుంది.
సహజ వాయువును మింగే పెద్ద అనకొండ పడిందక్కడ. అది దాన్నంతా మింగి తిరిగి మనకే అమ్ముతుందట. అదీ సంగతి! ప్రభుత్వమే ఆ పని చేస్తే పోలా? అమ్మో అంత పెట్టుబడి కావద్దూ? ఇక్కడ పెట్టుబడి కంటే పుట్టుబడి ముఖ్యం. అందుకే వాటి జోలికి పోదు ప్రభుత్వం.
ఆ అనకొండను ఒకాయన ఆడిస్తుంటాడు. అది తల ఊపుతూ ఉంటుంది. ఇదంతా చూసే వాళ్లకు కనిపించే దృశ్యం. కానీ జరిగేది ఇంకొకటి. అనకొండ తన తలను ఊపిన విధంగానే ఈ పెద్ద మనిషి స్వరం వాయిస్తున్నట్టు నటిస్తాడు.
గోదావరిలో తేలుకిచ్చిన ఆర్భాటం ఈ అనకొండ విషయంలో కొందరివ్వటం లేదెందుకని మీకు అనుమానం రావచ్చు. తేలు చిన్నది కాబట్టి భయపడి ఉండరు. అనకొండ ఎంతో పెద్దది కదా అందుకే జంకుతున్నారు.
ఈ నవయుగ అనకొండకు నదులే కాదు, సముద్రాలు కావాలి. అప్పుడది అందులో ఉన్న చేపలు, తిమింగలాలు, సొర చేపలు ఇలా వానపాముల వరకూ అన్నింటినీ తినేస్తుంది. తినటమే కాదు దానికి జీర్ణశక్తి అధికం. అలా బలాన్నంతా విషం రూపంలో నింపుకుని ఇతర జీవాల్ని చంపేస్తుందది.
'కష్టాల్ని మనందరం పంచుకుందాం, లాభాల్ని మాత్రం మేం నంజుకుంటాం' ఇది అనకొండ సూత్రం. అది బలిసి బలిసి కాళీయునిలా తయారవుతుంది. దాన్ని మధనం చేయడానికి ఒక్క కృష్ణుడు సరిపోడు. ప్రజలందరూ రావాలి. అది మాత్రం తప్పదు. దాని పడగపై బాది విషాన్నంతా కక్కించే రోజులు ఎంతో దూరంలో లేవు. ఆ విషంలోనే దాన్ని పెంచి పోషించినవారూ కొట్టుకుపోతారు. అప్పుడు వారికి ఏ 'ఆధారమూ' ఉండదు!
అప్పుడు గోదావరిలోని 'తేల్‌' చవగ్గా దొరుకుతుంది.

Article By : జంధ్యాల రఘుబాబు from prajasakti

Thursday, April 18, 2013

శాఖాహార పులి ...


ఒకానొక అడవి. ఆవు, పులి కథలోనిదే.
ఒక పులి, అదీ ఆ కథలో ఉన్న పులి వంటిదే. ఒక ఆవు, అదీ ఆ ... పులి వేటకని బయలుదేరింది. ఒక ఆవు కనిపించింది. ఎగిరి దాన్ని తినబోయింది. ఇంతలో ఆవు తనను తినవద్దని వేడుకుంది. 'ఇంటివద్ద నా చిన్న కొడుకు పాల కోసం చూస్తుంటాడు, వాడికి పాలిచ్చి, ఓ సారి ముద్దాడి బంధువులకు అప్పగించి వస్తాను' అని వేడుకుంది.
పులి మొదట ఒప్పుకోలేదు. 'నీవు తిరిగి వస్తావని నమ్మకమేంటి. నన్ను నేనే నమ్మను, నిన్నెలా నమ్మాలి' అని అడిగింది.
'నేను అసత్యాలు చెప్పను, చెప్పిన మాట తప్పను. నన్ను నమ్ము లేదా ఇప్పుడే తినేసేరు' అంది ఆవు.
అనుమానంతోనే పులి ఒప్పుకుంది. ఆవు వెళ్లిపోయింది. గోవు రాకపోతే అదే అదనుగా తీసుకుని తనకు ఇష్టమైనన్ని ఆవుల్ని తినవచ్చని లోపల అనుకుంది. చెప్పిన మాట ప్రకారం ఆవు తిరిగి వచ్చేసింది.
పులి కళ్లలో గ్లిసరిన్‌ వేసుకున్నట్టు కన్నీళ్లు కారాయి. 'నీవు మాట ప్రకారం వచ్చావు. నా మనసు కరిగించావు. నిన్ను వదిలేస్తున్నాను. వెళ్లు, నీ కొడుకుతో హాయిగా ఉండు' అని వెనక్కు పంపింది.
కథ అక్కడితో ఆగిపోతే ఇప్పటి వరకూ చదివిన దాంట్లో కొత్తేమీ లేదు. ఆపై సాగే కథలోనే కొత్తదనం.
మరుసటి రోజు పులి అడవిలోని జంతువులన్నింటినీ సమావేశపరిచింది. క్రితం రోజు జరిగిన 'ఆవు- పులి' కథ వివరించింది.
'నిన్నటి నుంచీ నా మనసు మారిపోయింది. ఒక ఆవు నన్ను మార్చివేసింది. నాకు వైరాగ్యమొచ్చేసింది. ఇక ఆవులను గానీ, ఇతర జంతువులను గానీ చంపి తినే గుణం నాలో నశించింది. అలాగని తినకుండా బతకలేను. అందుకే నేను చనిపో వాలనుకున్నాను. ఈరోజు రాత్రి కనిపించే ఆ కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసు కుంటాను. ఎవ్వరూ నన్ను ఆపటానికి ప్రయత్నిం చవద్దు'. 'నేను చనిపోయాక నా కథ పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా పెడతారు' అని మరొక్కసారి కళ్లనిండా నీరు తెప్పించింది.
జంతువులన్నీ తమ కళ్లలో కూడా నీరు తుడుచుకున్నాయి, రాకున్నా!
ఇక తమకు ప్రాణ భయం లేదని జింకలు, ఆవులు, మేకలు, ఇతర శాఖాహార జంతువులు ఆనందపడితే, అడవిలోని జంతువులన్నీ తమకేనని నక్క, తోడేలు, హైనా లాంటి జంతువులు మహదానందపడ్డాయి.
ఇంతలో ఓ ముదుసలి భల్లూకం ముందుకొచ్చి 'ఆత్మహత్య మహా పాపం, అందుకే నీవు మాంసాహారం మానేసి దుంపలు, గడ్డి లాంటి శాఖాహారం తిని జీవితం చాలించు' అని సలహా ఇచ్చింది.
ఈ సలహా నచ్చి జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి.
పులికి మహదానందంగా ఉంది. తనకు ఇంతలా ప్రచారం వస్తుందని ఊహించనే లేదు. 'ఇదే అదనుగా రాజుగా ఉన్న సింహాన్ని తొలగించి నేను రాజునై పోవచ్చు. తరువాత మళ్లీ మాంసాహారం మొదలెట్టవచ్చు' అనుకుంది లోలోపల.
తనకు శాఖాహారం సేకరించటం తెలియదు కాబట్టి రోజూ ఏదైనా ఒక జంతువు శాఖాహారాన్ని తీసుకురావలసిందిగా జంతువుల్ని కోరింది. జంతువులు కూడా సరేనన్నాయి.
చెప్పిన మాట ప్రకారమే చేశాయి. ప్రతి దినమూ పులికి శాఖాహారాన్ని తీసుకుపోయి ఇవ్వసాగాయి. కొత్తగా శాఖాహారాన్ని తింటున్న పులి బాగా నున్నగా తయారయింది. జంతువులకు శాఖాహారాన్ని తినమని ఎప్పుడూ చెప్పే సత్యజీవి 'చూశారా మాంసాహారం మానేస్తే ఎన్ని లాభాలో' అని తన ప్రచారం ఎక్కువ చేసింది.
కొన్ని రోజులకు అడవిలోని జంతువులు తగ్గినట్టు కనిపించింది. ఎవరికి వారు తమ జాతిని లెక్కపెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి. తమాషాగా శాఖాహారం తీసుకెళ్లిన జంతువులే మాయమైనట్టు జంతువుల సర్వేలో తేలింది. చూస్తే పులి మాంసాహారిగా ఉన్నప్పుడే తమకు నష్టం తక్కువగా ఉందని తేల్చేశాయి.
తమను ఈ విధంగా మోసం చేసిన పులిని మట్టుబెట్టాలని జంతువుల సమావేశం నిర్ణయించింది. అలాగే చేశాయి కూడా ...
తమ 'ఆవు- పులి' కథను ఈ విధంగా మార్చిన పులికి పట్టిన గతిని చూసి ఆవు నవ్వుకుంది, లోలోపల ...
అధికారం కోసం పులి 'గడ్డి' కరవచ్చేమో కానీ 'ఆహారంగా' మాత్రం తినదు. మాంసమే కావాలి!

** Article by  -- జంధ్యాల రఘుబాబు
From prajasakti news paper

Thursday, March 7, 2013

అగ్నియోధునికి అశ్రుతర్పణ

వెనిజులా వేగుచుక్క, ప్రత్యామ్నాయ శక్తుల చైతన్య పతాక హ్యూగో చావేజ్‌ అస్తమయం మాటలకందని విషాదం. నాలుగోసారి దేశాధ్యక్షుడుగా అప్రతిహత విజయం సాధించిన ఆ అచంచల యోధ రెండేళ్ల కాన్సర్‌ పోరాటంలో కన్నుమూయడం నమ్మక తప్పని నిజం. ఈ విషాద వార్త దేశాల సరిహద్దులకు అతీతంగా ప్రజాస్వామ్య ప్రియులు, స్వాతంత్ర పిపాసులందరిలోనూ శోకాన్ని రగిలించింది. ఎందుకంటే చావేజ్‌ ఒకానొక చారిత్రిక దశలో దిశా నిర్దేశం చేసిన ధీరుడు, ధీశాలి. సోవియట్‌ విచ్ఛిన్నానంతరం ప్రజాచైతన్యం, ప్రతిఘటన అన్నవి మటుమాయమై పోతాయని ఆశపడిన దుష్టశక్తుల దురాశలను దునుమాడుతూ అతి బలమైన అమెరికా సామ్రాజ్యవాదాన్ని అతి దగ్గర నుంచి సవాలు చేసిన సాహస సేనాని. సమర్థ పాలకుడు.

చిల్లర వ్యాపారంలాటి రంగాల్లో ఇండియా విదేశీ పెట్టుబడులను అనుమతించడం లేదని అగ్రరాజ్యాధినేత ఒబామా పెదవి విరవడం ... ప్రధాని అసమర్థ సాధకుడని, విషాద యోగి అని అమెరికా మీడియా తీసిపారేయడం ... ప్రపంచ కార్పొరేటింగ్‌ సంస్థలు ఇండియా స్థానాన్ని దిగువకు నెట్టడం ... అన్యధా శరణం నాస్తి అన్నట్టు అమెరికా ఆదేశాలను అమలు చేసేందుకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆఘమేఘాల మీద పరుగులు పెట్టడం మొన్నటి ముచ్చటే. ఇలాటి ప్రపంచంలో ఒకడు ... మన కన్నా చాలా చిన్నదైన దేశ పాలకుడు ... అమెరికాకు అతి సమీపస్తుడు ... నిన్నమొన్నటి దాకా అంకుల్‌ శ్యాం పెరటిదొడ్డిగా వారి కీలుబొమ్మలైన సైనిక పాలకుల చేతిలో నలిగిన, మెలిగిన చరిత్రకు వారసుడు ... ఐరాస సమావేశంలో ఆ అమెరికా అధినేతనే భూతంగా వర్ణించిన ఏకైక నాయకుడు చావేజ్‌. ప్రపంచ బ్యాంకు ఆదేశాల బాటలో దివాళా ఎత్తుతున్న దేశాలకు ప్రత్యామ్నాయం చూపుతూ మరెక్కడా లేనంత వేగంగా, తీవ్రంగా ప్రజా నుకూల విధానాలు అమలు చేసిన పరిపాలకుడు చావేజ్‌. సైద్ధాంతిక పరిభాషలో కమ్యూనిస్టు కాక పోయినా కామ్రేడ్లకు ప్రపంచమంతటా కొత్త ఊపిరి పోసిన సహ చరుడు చావేజ్‌. ఒకే ఒక్కడు అనిపించుకున్న క్యూబా అధినేత ఫైడల్‌ కాస్ట్రో సరసన మరొకడుగా నిలిచే అర్హత సంపాదించుకున్న ధీమంతుడు చావేజ్‌.
ప్రపంచీకరణ యుగంలో వనరులను ప్రైవేటు పరం చేయడం రివాజుగా మారితే చావేజ్‌ అందుకు పూర్తి భిన్నమైన విధానాలు అమలు చేశాడు. చమురు సంపన్నమైన వెనిజులా బడా సంస్థల కల్పవృక్షంలా ఉండే స్థితిని చావేజ్‌ మార్చేశాడు. ఆ వనరులను పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చి ప్రజలకు అంకితం చేశాడు. విస్తృత స్థాయిలో భూ సంస్కరణలు అమలు చేసి పేదలకు భూమిని పంచాడు. ప్రతిచోటా ఉద్యోగ భద్రత పోతుంటే వెనిజులాలో పని గంటలు వారానికి 44 నుంచి 40కి తగ్గించడమే గాక ఇంకా అనేక సరికొత్త హక్కులు కల్పించాడు. 1999-2010 మధ్య వెనిజులాలో దారిద్య్రం 21 శాతం తగ్గిందని ఐక్యరాజ్యసమితి కమిషన్‌ అభినందనలు పొందాడు. నిరక్షరాస్యత నిర్మూలించి ఉచిత ఆరోగ్య వసతి కూడా కల్పించేందుకు చర్యలు మొదలెట్టాడు. తాను సైనిక నేపథ్యం నుంచి వచ్చినా, అమెరికా వత్తాసుతో నడిచే సైనిక కుట్రలకు తావులేకుండా ప్రజా స్వామ్యాన్ని విస్త రించాడు. అందుకే 1998లో మొదటి సారి ఎన్నికైన చావేజ్‌ను 2002లో కూల దోయడానికి సైన్యం ద్వారా కుట్ర జరిగితే వమ్ము చేసి దమ్ము చూపించాడు. తర్వాత దాదాపు ఏడెనిమిది సార్లు రెఫరెండంలు, రకరకాల ఎన్నికలు, రాజ్యాంగ రూపకల్పన, ఇలా ఏదో ఒక రూపంలో ప్రజల ఆమోదం పొందుతూ జైత్రయాత్ర సాగిస్తున్నాడు.
క్యూబాను దుర్మార్గ దిగ్బంధం చేయజూసే అమెరికా ఆంక్షలను తోసిపుచ్చి అగ్రజుడు కాస్ట్రోను అనుజుడుగా ఆదుకున్నాడు. భారత దేశంతో సహా అన్నిచోట్లా అభ్యుదయ శక్తులకు తోడైనాడు. సద్దాం హుస్సేన్‌ను కలుసుకుని సంఘీభావం చెప్పివచ్చాడు. చైనాతో చెలిమి చేశాడు. తనకు నచ్చని నాజర్‌, కాస్ట్రో, అరాఫత్‌, సద్దాం, వంటివారందరిపైనా దాడిచేసినట్టే చావేజ్‌పైనా అమెరికా మీడియా సహాయంతో విష ప్రచారం సాగించింది. ఈసారి ఆయన ఓడిపోవడం ఖాయమనీ, కొద్ది పాటి తేడాతో నెగ్గినా చేయగలిగింది ఉండదనీ శాసనార్థాలు పెట్టింది. ఒక్కసారిగా అమెరికా పత్రికలు, చానెళ్లు చావేజ్‌పై చేయని దుష్ప్రచారం లేదు. ఆయనను ఓడించేందుకు వెనిజులా పెట్టుబడిదారులు, చమురు మాఫియాలు, అమెరికా హంగుదారులు ప్రతీఘాత ప్రతిపక్షాలు అందరూ కలసి 30 పార్టీల కూటమిగా ఏర్పడి కాప్రిల్‌ అనే మితవాదిని నిలబెట్టి ఓడించాలని విఫలయత్నం చేశాయి. ఇన్నిటినీ తట్టుకుని అశేష జనాదరణతో అఖండ విజయం సాధించిన చావేజ్‌ ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా లేకుండా ప్రాణాంతక కాన్సర్‌తో పెనుగులాడాల్సి వచ్చింది. అందుకోసం క్యూబాలో చికిత్స, కాస్ట్రోతో సాన్నిహిత్యం ఆయనను ఆఖరి వరకూ సజీవ స్ఫూర్తిగా నిలిపాయి. అయినా చివరకు ఆ వ్యాధి ఆయన ప్రాణాలు బలిగొనకుండా వదల్లేదు.
చావేజ్‌ చారిత్రిక పాత్రకు స్పష్టమైన భూమిక ఉంది. సామ్రాజ్యవాద, నయా ఉదారవాద ఎదురు దాడికి వ్యతిరేకంగా పెల్లుబికిన ప్రజావెల్లువ ఫలితంగానే వెనిజులాతో సహా అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో ప్రజా ప్రభుత్వాలు ఆవిర్భవించాయి. దీన్నే 'పింక్‌ వెల్లువ- వామపక్షం వైపు మలుపు' అని పిలుస్తున్నారు. వీటి మనుగడ గొప్ప సానుకూల పరిణామం. ఈ పరిణామ క్రమానికి స్ఫూర్తిగా నిలిచిన హ్యూగో చావేజ్‌ కన్నుమూయడంతో ఈ క్రమాన్ని అడ్డుకోవడానికి సామ్రాజ్యవాద శక్తులు నిస్సందేహంగా కుట్రలు తీవ్రం చేస్తాయి. ఇప్పటికే ఆ కుటిల పన్నాగాలు మొదలైనట్టు కనిపిస్తుంది. ఆయనే చెప్పినట్లు విప్లవం ఏ ఒక్క వ్యక్తిపైనో ఆధారపడి ఉండదు. చావేజ్‌కు అశ్రుతర్పణ చేస్తూనే ఆయన ఆఖరి వరకూ అడ్డుకున్న ఆధిపత్య శక్తుల ఆటకట్టించడం ఇప్పుడు అవశ్య కర్తవ్యం. ఆయనకు అదే అసలైన నివాళి. 

Note : Taken From Prajasakti Editorial
visit : అగ్నియోధునికి అశ్రుతర్పణ prajasakti.com