Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Wednesday, April 25, 2012

నయా పోకడల మోజులో నవతరం


శాస్త్రీయ దృక్పథానికి భిన్నమైన ఆలోచనా ధోరణే అసలైన ట్రెండుగా చెలామణి అవుతున్న పరిస్థితి నేడు కనిపిస్తోంది. 'మార్కెట్‌ సంస్కృతి' తీసుకొస్తున్న నయా పోకడల మోజుతో, కెరీరిస్టు ధోరణితో యువతలో ప్రశ్నించే తత్వం, ఆత్మస్థయిర్యం, సామాజిక స్పృహ కనుమరుగవుతున్నాయి. చదువులో, మీడియాలో, ఆయా రంగాల్లో ఎక్కువగా ఫోకస్‌ అవుతున్న పెట్టుబడిదారి కట్టు కథనాల ప్రభావానికి టీనేజర్లు ఆకర్షితులవుతున్నారు. అదే అసలైన లైఫ్‌ స్టయిల్‌ అన్న భ్రమలకు లోనవుతున్నారు.
కెరీరిజం భ్రమల్లో, నయా పోకడల ఆకర్షణలో యువతలో అసలైన సామర్థ్యం కనుమరుగవుతోంది. మీడియా కూడా అతికొద్ది మందికి ఉపయోగపడే వాటినే ఎక్కువగా ఫోకస్‌ చేస్తోంది. మెజార్టీ యువతకు ఉపయోగపడే విషయాలను విస్మరిస్తోంది. 'వేణు చదువులో ధిట్ట. ఎప్పుడూ ఫస్టు క్లాసులో పాసయ్యేవాడు. కానీ డిగ్రీ దాకా చదివి ఆపేశాడు. ఫలితంగా టీచర్‌ కావాలన్న కల నెరవేరనే లేదు' ఎందుకని అడిగితే 'బి.ఇ.డి. చేసేందుకు రెండు లక్షలు కట్టలేక' అని బదులిచ్చాడు. రెండు లక్షలు పెద్ద విషయమేం కాదని కొందరు భావించొచ్చు. కానీ రెండువేలు కట్టేందుకు నానా అవస్థలు పడేవారే ఎక్కువ శాతం వున్నారు. అదే ప్రభుత్వ బి.ఇ.డి. కళాశాలల్లో ఫ్రీ అడ్మిషన్‌ వుండి వుంటే... 'వేణు మాత్రమే కాదు. అలాంటి ఇంకెందరికలో సాకారమౌతుంది. కానీ అలా చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవు. కొంతమందికి ఖరీదుతో కూడుకున్న ఉన్నతమైన చదువులు చదివేందుకూ, ఆ తర్వాత విదేశాలకు వెళ్లేందుకు కార్పొరేటు సంస్థల ద్వారానో, బ్యాంకుల ద్వారానో లోన్లో, రాయితీలో కల్పిస్తుంది. ఇక్కడ ఉన్నత వర్గాల కొమ్ము కాస్తుంది.

చదువు 'కొంటూ' ఉన్నత స్థితికి ఎదిగే పరిస్థితి పేద, మధ్య తరగతి యువతలో ఉండట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గనుక పరిశీలిస్తే కనీసం పదోతరగతి వరకు చదివేందుకే అష్టకష్టాలు పడాల్సిన దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారి శాతం ఎక్కువే. వలసెళ్లిన తమ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కాయిన్‌ బాక్సులో వేసేందుకు రెండు ఒక్కరూపాయి బిళ్లలకోసం ఇబ్బందిపడే యువతీ యువకులు ఆంధ్రప్రదేశ్‌లోని ఏ మారుమూల గిరిజన తండాకెళ్లినా, గూడేనికెళ్లినా, గ్రామాల్లోని దళిత వాడల్లోకెళ్లినా కన్పిస్తారు. ఇలాంటి వారి బతుకుల్లో వెలుగు పూలు పూయించే ఆర్థిక విధానాలూ, ప్రభుత్వ పాలసీలూ ఉండవు. ఉన్నా అవి ఏ కొద్దిమందికో మాత్రమే ఉపయోగ పడుతుంటాయి. దీనివెనుకనున్న మూల కారణాలు వెలికి తీసే ప్రయత్నం కూడా చేయని కొన్ని ప్రసార సాధనాలు అతికొద్ది మంది ధనిక వర్గాల జీవన పరిస్థితులను ఆకాశానికెత్తేస్తుంటాయి. అవి వాస్తవాలుగా నమ్మించేందుకు, యువతను భ్రమల్లో ముంచేందుకు ప్రయత్నిస్తుంటాయి.

నూటికి 90 శాతం యువతరం లైఫ్‌ స్టయిల్‌ను ప్రతిబింబించే బతుకు చిత్రం ఎక్కడా కనిపించదుగానీ ఏ కొద్దిమందో అనుభవిస్తున్న భోగ భాగ్యాల గురించి మాత్రం అద్భుతంగా ఫోకస్‌ చేస్తుంటారు. 'పబ్‌ కల్చర్‌ గురించీ, కొత్తకొత్త ఫ్యాషన్‌ల గురించీ 'బైక్‌ రేస్‌' గురించీ, పెద్దపెద్ద బిజినెస్‌ చదువుల గురించీ పత్రికల్లో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో కవరేజీ చూస్తే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని యువతను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వాస్తవానికి ఒక్క గంటకు తక్కువలో తక్కువ ఐదారువేలు ఖర్చుపెట్టి పబ్బుల్లో ఎంజారు చేసే స్థోమత ఎంతమంది యువతకుంటుంది? లక్షల్లో అడ్మిషన్‌ ఫీజలు చెల్లించి చదువు'కొనే' పరిస్థితి ఎందరికుంటుంది? రకరకాల బైకులు కొనే స్థోమత, రేసింగ్‌లో పాల్గొనే ఆసక్తి ఎవరికుంటుంది? వేలల్లో ఖరీదు చేసే ఫేస్‌ క్రీములు ఏ మధ్య తరగతి యువత కొనగలదు? బిల్‌గేట్స్‌లాగో, టాటాబిర్లాలాగో గొప్పవాళ్లు కావాలన్న కలలు కనాలని చెప్పే మాటలు ఎవరికి ఉపయోగపడతాయి? అంటే... సమాజంలోని కొంతమంది ధనికవర్గాలు అనుసరిస్తున్న పోకడలనే ఈతరం యువత మొగ్గుచూపుతున్న ట్రెండుగా ప్రచారం కల్పిస్తోంది పెట్టుబడిదారీ మీడియా. కానీ అత్యధిక శాతం వున్న పేద, మధ్య తరగతి యువత జీవన చిత్రాన్ని ప్రతిబింబించేది, ప్రతిభను వెలికి తీసేది, ఏదీ ప్రచారానికి నోచుకోవట్లేదు. కార్పొరేట్‌ ప్రతిభ ధాటికి సామాన్య యువత ప్రజ్ఞ పనికి రాకుండా పోతోంది. కారణం.... పెట్టుబడుల కట్టుకథల భావనలు యువత మెదళ్లను రకరకాలుగా ప్రభావితం చేస్తున్నాయి. పత్రికల ద్వారా, సినిమాల ద్వారా, ప్రకటనల ద్వారా, ఇంటర్నెట్‌ ద్వారా ఇవి విస్తరిస్తున్నాయి.

నేడు చాలా సంస్థలు, కంపెనీలు తాము మెరిట్‌ ప్రకారమే అవకాశాలు కల్పిస్తామంటున్నాయి. ప్రతిభకు, అర్హతలకు, కమ్యూనికేషన్‌ స్కిల్సుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇంతకీ మెరిట్‌ అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? సాధిస్తే వస్తుందా? అలా అయితే అందరూ ఎందుకు సాధించట్లేదు? ఇక్కడా ఓ కారణం ఉండే ఉంటుందన్న అనుమానం అక్కర్లేదు. కచ్చితంగా వుంటుంది. నేడు మెరిట్‌గా చెలామణి అవుతున్న వారంతా అవి సాధించడానికి కావలసిన ఆర్థిక పరిస్థితులూ, ప్రోత్సాహం, ఇతర కారణాలు అనుకూలించిన వారే ఎక్కువశాతం ఉంటున్నారు. అంటే... అనుకూల వాతావరణం వుంటే మెరిట్‌ ఎవరైనా సాధిస్తారు. కానీ నేడా పరిస్థితి ఉన్నవారు సమాజంలోని నాన్‌మెజార్టీ ధనికవర్గమే కాబట్టి మెరిట్‌ క్రెడిట్‌ అంతా వారికే దక్కుతోంది. అలాంటప్పుడు మెరిట్‌ ప్రకారం కొలువులన్నప్పుడు అవి ఏ వర్గ యువతకు దక్కుతున్నాయో చెప్పనక్కర్లేదు. ఇలాంటి అంతరాలు సమసిపోవాలంటే అందరికీ మెరిట్‌ సాధించే ఆర్థిక స్థోమత చేకూర్చగల ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఇప్పుడున్నవన్నీ అవి కావుకదా! అందుకే మెరిట్‌ వెనుక ఉన్న వాస్తవ ప్రతిభ తొక్కివేయబడుతోంది.

నేడు కెరీర్‌కు అత్యంత ప్రాధాన్యతే కాదు, ప్రచారమూ అలాగే లభిస్తోంది. అది వ్యక్తి ఉన్నతికీ, సమాజానికీ ఉపయోపడేదైనంత వరకు ఇబ్బంది లేదు. కానీ దాని పేరుతో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వ్యాపారమయమౌతున్నాయి. చివరికీ కెరీరిజం మోజులో వాస్తవానికి దూరంగా, సామాజిక స్పృహలేని వారిగా యువతరం తయారవుతోంది. ఉన్నతమైన కెరీర్‌ ప్రారంభించాలనుకుంటే అందుకు సంబంధించిన కోర్సులు చదవాలి. అవి చదవాలంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలించాలి. అనుకూలించినా అవకాశం దక్కాలి. అంటే... లక్షలతో ముడిపడి ఉన్నప్పుడు? కనీసం మూడుపూటలా తిండికిలేని కుటుంబం నుంచి వచ్చిన యువతీ యువకులు తమ కలను ఎలా సాకారం చేసుకోగలరు? ఐఐఎం, ఐటిఐ, ఇంజనీరింగ్‌, యానిమేషన్‌ లాంటి కెరీర్లో ఎలా ప్రవేశించగలరు? ఇవన్నీ కార్పొరేట్‌ సంస్థ చేతుల్లో ఉన్నప్పుడు సామాన్య యువత ఎలా చదువు 'కొనగలదు' అదే ప్రభుత్వాధీనంలో ఉంటేనో, ప్రభుత్వ సహకారం ఉంటేనో, ప్రజలందరి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే విధానాలు అమలైతేనో సామాన్యులు కూడా తమ లక్ష్యం నెరవేర్చుకోగలరు. కానీ ఇక్కడ ఒక పథకం ప్రకారమే కొద్దిమందికి ఉపయోగపడే పాలసీలే మన పాలకులు ప్రవేశపెడుతున్నప్పుడు ఉన్నతమైన కెరీర్‌ అనేది సామాన్య యువత రంగుల కలగానే మిగులుతోంది.

అప్పటి ట్రెండునుబట్టి నడ్చుకోవాలి? లేకపోతే అది నామోషీగా ఫీలయ్యే వారెక్కువ. మరి నేటి ట్రెండ్‌ ఏంటి? వాస్తవంగా ఎక్కువమంది అనుసరించేదో, ఎక్కువమంది జీవన పరిస్థితిని ప్రతిబింబించేదో అసలైన ట్రెండ్‌! కానీ మీడియా ప్రచారం పుణ్యమా అని బయట మాత్రం వేరేలా అర్థం చేసుకుంటున్నారు. పేద, మధ్యతరగతి యువతరం పోకడలను, వారి బతుకు చిత్రాలను పట్టించుకోవట్లేదు. కానీ కొంతమంది ఉన్నత వర్గాలవారు అనుసరించే, అనుకరించే, అనుభవించే జీవన విధానాన్నీ, వినోదాన్నీ అదే సర్వస్వమైనట్లు, అదే అందరికీ శిరోధార్యమైనట్లు, అదే అసలైన ట్రెండ్‌ అయినట్లు ప్రచారం కల్పిస్తోంది. ఫ్యాషన్‌ పోకడలు, పబ్‌కల్చర్‌, వెస్ట్రన్‌ కల్చర్‌, మదర్స్‌డేలు, ఫాదర్స్‌డేలు, బర్త్‌డేలు, ఫ్రెండ్‌షిప్‌డేలు, లవర్స్‌ డేలు, కొద్దిమంది ఉన్నత వర్గాల విలాసవంతమైన జీవన విధానాలు.... ఇవే నేడు ట్రెండుగా చెలామణి అవుతున్నాయి. తాజ్‌, ఒబెరారు రెస్టారెంట్ల యజమానులు కూడా ఒకప్పుడు హోటల్లో పనిచేశారు. ఎంతో కష్టపడి పైకొచ్చారు. (హోటల్లో జీవితాంతం పనిచేసినా' ఒక్క తాజ్‌ హోటల్‌ నిర్మాణానికి కావాల్సిన డబ్బులు కూడబెట్టడం కష్టం) ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తికి సొంత ఇల్లు కూడా లేదు. (చెవిలో పువ్వులు పెట్టడమంటే ఇదే), సోనియాగాంధికీ కారు లేదు. (కొనుక్కునే ఆర్థిక పరిస్థితి లేకనా?) ఇలాంటి విషయాలు కూడా కొన్ని సైకాలజీ గ్రంథాల్లో ప్రస్తావిస్తూ వారి మంచితనాన్ని ఆదర్శంగా తీసుకొమ్మంటారు.

ఒక గొప్ప వ్యాపారవేత్తను ఆదర్శంగా తీసుకొనో, పారిశ్రామికవేత్తను రోల్‌మోడల్‌గా తీసుకొనో, లేకపోతే అమితాబ్‌ బచ్చన్‌ లాంటి వారి విజయాలను వరుసబెట్టి చెబుతూ మీరూ అలా ఎదగండనో చెబుతుంటారు. అలా ఎదిగేందుకు సంకల్పం, కృషి, పట్టుదల, తపన, సాధన, లక్ష్యం ఉండాలని గట్టిగా చెబుతుంటారు. కానీ అలా ఎదగాలంటే అందుకు తగిన పరిస్థితులు ఎందుకు ఉండట్లేదు? ఆర్థిక పరిస్థితులు అందరికీ ఎందుకు అనుకూలించట్లేదు? ఈ వ్యవస్థలో ఉన్న లోపాలేమిటి? అన్న విషయాలు ఎక్కువ శాతం యువత మొగ్గు చూపుతున్న 'కెరీరిస్టు' 'పర్సనల్‌ స్కిల్స్‌, ఇతర సైకాలజీ గ్రంథాల్లో ఉండట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే అవి ఉన్న వ్యవస్థలోనే ఉన్నత స్థితికి ఎదిగేందుకు కావాల్సిన మాటలు చెబుతాయి. (అవి ఆచరణ సాధ్యమో కాదో మాత్రం పట్టించుకోవు) అంతేతప్ప వ్యవస్థలో సమూల మార్పునకు, సమిష్టి తత్వానికి కావలసినదేదీ అందులో ఉండట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి మానసిక దౌర్భల్యుల్ని తయారు చేయడమో, భ్రమలు కలుగ జేయడమో చేస్తున్నాయి. కానీ నయా పోకడల ముసుగులో విస్తరిస్తున్న అంతరాల సమాజాన్నీ, దుర్భర వ్యవస్థనూ మార్చే ఆచరణ సాధ్యమైన చైతన్య స్థాయిని కల్పించట్లేదు. అందరికీ విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలను కల్పించే సరైన మార్గం చూపట్లేదు.

** article from prajasakti  prajasakti.com

Sunday, February 5, 2012

ఇరాన్‌ పై కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

 
ఇరాన్‌ తన రివల్యూషనరీ గార్డ్స్‌ను సన్నద్ధంగా ఉంచింది. వైమానిక దళాన్ని అప్రమత్తం చేసింది. గత డిసెంబర్‌ నుండి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. దాడి చేస్తే గట్టిగా బుధ్ధి చెబుతామని అమెరికా, ఇజ్రాయిల్‌ను హెచ్చరించింది.ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం తగదని చైనా, రష్యా పేర్కొన్నాయి. ఇటువంటి చర్యలు ఇరాన్‌ను తిరిగి చర్చలకు ఒప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఆటంకం కలగజేస్తాయని అవి పేర్కొన్నాయి.
ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరు కుంటున్నాయి. యుద్ధం అనివార్యం అంటూ అమెరికా, దాని ప్రధాన మిత్రపక్షమైన ఇజ్రాయిల్‌ రోజూ ఇరాన్‌ను హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇరాన్‌పై మరింత కిరాతకమైన ఆంక్షలను విధించాలని అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు ఏకపక్షంగా నిర్ణ యించాయి. ఇరాన్‌ చమురు, గ్యాస్‌ ఎగుమతులను భారీగా దెబ్బతీసే విధంగా పాశ్చాత్య దేశాల కూటమి ఆంక్షలు విధించింది. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ చమురు, గ్యాస్‌ ఎగుమతుల పైనే ప్రధానంగా ఆధారపడి ఉంది. ఐఎఇఎ తాజా నివేదిక విడుదలైన అనంతరం ఒబామా ప్రభుత్వం ఇరాన్‌పై మరింతగా ఒత్తిడి పెంచసాగింది. ఇరాన్‌ రహస్యంగా యురేనియాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని రహస్యంగా నిర్వహి స్తోందని ఎటువంటి సాక్ష్యాధారాలు సమర్పించ కుండానే ఐఎఇఎ తన నివేదికలో పేర్కొంది.. ఒక సంవత్సర కాలంలో ఇరాన్‌ చేతిలో అణ్వాయుధం ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి లియోన్‌ పనెట్టా డిసెంబర్‌ చివరి వారంలో పేర్కొన్నారు. ఇరాన్‌ ఈ రెడ్‌లైన్‌ను దాటడాన్ని ఎన్నడూ అనుమతించ బోమని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని పరిష్కరిం చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోగలమని పేర్కొన్నారు. తన అణు కార్యక్రమం శాంతియుత సైనికేతర ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించిందని ఇరాన్‌ స్పష్టంగా ప్రకటిస్తూనే ఉంది. అప్రకటిత అణ్వాయుధ దేశమైన ఇజ్రాయిల్‌ దాడి చేస్తామని ఇరాన్‌ను పదేపదే హెచ్చరిస్తోంది. అణ్వాయుధాలు గల అమెరికా నౌకలు, జలాంతర్గాములు పర్షియా గల్ఫ్‌లో సంచరిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలో కదన రంగంలో దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి. పొరుగున ఉన్న బహ్రెయిన్‌, కతార్‌లలో అమెరికా పెద్ద ఎత్తున సైనిక స్థావరాలను నిర్మించుకుంది. ఏ సమయంలోనైనా అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉంది. ఇరాన్‌పై దాడి చేసి పాము తలను తొలగించాలని అయెరికాపై సౌదీ అరేబియా రాజు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వికిలీక్స్‌ వెల్లడించింది.
అసాధారణ స్థాయికి చేరుకున్న హిస్టీరియా
ఐఎఇఎ అందించినట్లుగా చెబుతున్న సాక్ష్యాధారాలను ఇరాన్‌ ఖండిస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీల కుట్రగా అభివర్ణిం చింది. విదేశాంగ విధానంపై పత్రికలో ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇదే సమయమని మాథ్యూ కోన్రింగ్‌ పేర్కొన్నాడు. ఆ వ్యాస రచయిత అమెరికా రక్షణ మంత్రికి ఇటీవలి కాలం వరకు ప్రత్యేక సలహాదారునిగా ఉన్నాడు. అమెరికా పకడ్బందీగా దాడి చేస్తే ఇరాన్‌ అణు స్థావరాలను ధ్వంసం చేయవచ్చునని ఆయన సలహా ఇచ్చాడు. గల్ఫ్‌ ప్రాంతం మొత్తానికి ఇబ్బంది కలిగించకుండా దాడి చేయవచ్చునని సూచించాడు. ఇరాన్‌ వ్యతిరేక హిస్టీరియా ఇటీవలి మాసాల్లో అమెరికాలో అసాధారణ స్థాయికి చేరుకుంది. అమెరికాలో సౌదీ అరేబియా రాయబారిని హత్య చేసేందుకు కాంట్రాక్టును మెక్సికోకు చెందిన ఒక డ్రగ్‌ కార్టెల్‌కు ఇరాన్‌ అధికారులు ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. న్యూయార్క్‌లో జరిగిన 9/11 దాడుల వెనక ఇరాన్‌ ఉందని ఫెడరల్‌ జడ్జ్‌ రూలింగ్‌ ఇచ్చారు. ఇరాన్‌ అల్‌ ఖైదాకు ఈ డాడులను నిర్వహించేందుకు ప్రత్యక్షంగా సహాయ మందించిందని ఆయన పేర్కొన్నారు.
చమురు ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామి దేశాల్లో ఒకటైన ఇరాన్‌ తాజా పరిణామాల నేపథ్యంలో తన ఉనికికి ముప్పు రానున్నదని ఆందోళన చెందడం సహజం. కొత్త ఆంక్షలను అమలు చేస్తే హార్మజ్‌ జలసంధిని మూసివేస్తామని ఇరాన్‌ మిలిటరీ ఉన్నత శ్రేణి నాయకులు హెచ్చరించారు. పర్షియా గల్ఫ్‌ ప్రాంతంలో ఉన్న ఈ జలసంధి ద్వారా చమురు అంతర్జాతీయంగా రవాణా అవుతుంది. హార్మజ్‌ జలసంధి పొడవు 6.4 కిలోమీటర్లు. ఇరాన్‌, ఒమన్‌ మధ్య గల్ఫ్‌ ముఖ ద్వారంగా ఉంది. ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే ముడి చమురులో మూడవ వంతు ఇరుకుగా ఉండే ఈ జలసంధి ద్వారా రవాణా అవుతుంది. కతార్‌ నుండి లిక్విఫైడ్‌ గ్యాస్‌ సరఫరా హార్మజ్‌ జలసంధి ద్వారానే జరుగుతుంది.
పశ్చిమ దేశాలు క్రమంగా విస్తరించుకుంటూపోతున్న ఆంక్షల కారణంగా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే బాగా దెబ్బతింది. డిసెంబర్‌ 31న ఒబామా కొత్తగా ఆంక్షలు విధించారు. ఇరాన్‌ కేంద్ర బ్యాంక్‌తో లావాదేవీలు జరిపే కంపెనీలపై చర్య తీసుకుంటామని ఈ కొత్త శాసనం నిర్దేశించింది. భారత్‌ వంటి దేశాలు ఇరాన్‌ నుండి చమురు దిగుమతి చేసుకోకుండా చూడటం ఈ చట్టం ఉద్దేశంగా ఉంది. ఇరాన్‌ చమురులో ఎక్కువ భాగం చైనా, భారత్‌కు రవాణా అవుతుంది. ఇయు 18 శాతం మాత్రమే దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్‌ చమురు రంగంపై ఆంక్షలు విధిస్తే ఒక్క బొట్టు చమురు కూడా హార్మజ్‌ జలసంధి నుండి రవాణా కాదని ఇరాన్‌ ఉపాధ్యక్షుడు మహ్మద్‌ రేజా రహిమి హెచ్చరించారు. డిసెంబర్‌ నెల చివర్లో ఇరాన్‌ సైన్యం హార్మజ్‌ జలసంధి సమీపంలో పది రోజుల పాటు సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసాల్లో భాగంగా వైమానిక దళం జలాంతర్గాములను సముద్రంలో ముంచేసింది. నౌకలు రాకుండా ఈ జలసంధిని మూసివేయడం చాలా తేలికైన విషయమని ఇరాన్‌ నౌకాదళాల అధిపతి అడ్మిరల్‌ హబీబుల్లా సయ్యారి మీడియాకు చెప్పారు. జలమార్గాలపై ఇరాన్‌కు పూర్తి నియంత్రణ ఉందని పేర్కొన్నారు. పశ్చిమ దేశాలు ఇరాన్‌పై ఆంక్షలు విధించడానికే కృతనిశ్చయంతో ఉన్నాయని స్పష్టమవుతోంది. ఈ విషయంలో అవి వెనకడుగు వేసేందుకు సుముఖత చూపడం లేదన్నారు. తన కీలక ప్రయోజనాలు పరిరక్షించుకునేందుకు రక్షాత్మక వ్యూహాలను అనుసరించ గలదని రివల్యూషనరీ గార్డ్స్‌ డిప్యూటీ కమాండర్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ హుస్సేన్‌ సలామీ చెప్పారు. తమపై దాడి చేస్తే అమెరికాకు చెందిన 32 స్థావరాలను ధ్వంసం చేస్తామని ఇరాన్‌ ఇంతకు ముందు హెచ్చరించింది. ఇరాన్‌తో యుద్ధం వస్తే చమురు ధర ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చ రించారు. తన అణు కార్యక్రమంపై తిరిగి చర్చలు జరిపేందుకు ఇరాన్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు కొత్తగా ఆంక్షలు విధించిన తరువాత ఇరాన్‌ సైన్యం ఉపరితలం నుండి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణిని పరీక్షించింది. రాడార్లకు ఇది చిక్కదు. మొట్టమొదటి అణు ఇంధన రాడ్‌ను తమ శాస్త్రవేత్తలు నిర్మించినట్లు ఇరాన్‌ జనవరి 1న ప్రకటించింది. సహజసిద్ధమైన యురేనియం గల రాడ్స్‌ను ఇరాన్‌ కీలకమైన అణు రియాక్టర్‌లో అమర్చారు.
సైన్యం నుండి ముప్పు
హార్మజ్‌ జలసంధిని మూసివేస్తామని ఇరాన్‌ చేసిన హెచ్చరికపై అమెరికా తీవ్రంగా ప్రతిస్పందించింది. రెండు యుద్ధనౌకలను జలసంధి వైపు పంపించింది. ఈ జలసంధిలో నౌకాయానం జరిపేందుకు గల హక్కును హరించే ఎటువంటి చర్యను క్షమించబోమని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. సైనిక దళాన్ని వినియోగించే ప్రమాదంతోపాటు అమెరికా, ఇజ్రాయిల్‌ గత రెండు సంవత్సరాలుగా ఇరాన్‌ సైంటిఫిక్‌ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులపై దృష్టి సారించాయి. వారిని కిడ్నాప్‌ చేసేదుకు, హతమార్చేందుకు, ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్‌ మిలిటరీ, పౌర స్థావరాలపై ఉగ్రవాద దాడులు జరిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత రెండు సంవత్సరాల్లో ఇద్దరు అణు శాస్త్రవేత్తలను హతమార్చారు. వారు కారులో ప్రయాణిస్తుండగా వారి కారును పేల్చివేశారు. ఇరాన్‌ అణు ఇంధన సంస్థ ఛైర్మన్‌ ఫెరేదౌన్‌ అబ్బాసీ దావానీ కారుపై కూడా ఇదే విధంగా బాంబు దాడి జరిగింది. రివొల్యూషనరీ గార్డ్‌ స్థావరంలో నవంబర్‌ 12న జరిగిన పేలుడులో 17 మంది మృతి చెందారు. అందులో ఇరాన్‌ క్షిపణి కార్యక్రమ రూపకర్త జనరల్‌ హసన్‌ తెహెరాని మొఘద్దమ్‌ కూడా ఉన్నారు. ద్రోణ్‌ నుండి క్షిపణిని ప్రయోగించి ఉండవచ్చునని నిపుణులు పేర్కొన్నట్లుగా న్యూయార్క్‌టైమ్స్‌ వెల్లడించింది. గత నవంబర్‌లో సంభవించిన మరో పేలుడు కారణంగా ఇస్ఫహాన్‌ నగరానికి సమీపంలోని యురేనియం శుద్ధి చేసే కర్మాగారం దెబ్బతిందని పశ్చిమ దేశాల మీడియా వెల్లడించింది. ఇరాన్‌ మీడియాలో మాత్రం ఈ పేలుడు గురించిన సమాచారం లేదు. ఈ విధ్వంస చర్య తమ ఘనతేనని ఇజ్రాయిల్‌, అమెరికా అధికారులు పేర్కొన్నారు.యువ అణు శాస్త్రవేత్త, నటాంజ్‌ యురేనియం కేంద్రంలో ఉప అధిపతి ముస్తాఫా అహ్మది రోషన్‌ హత్య వెనుక సిఐఎ హస్తం ఉందని ఇరాన్‌ అధికారులు ఆరోపించారు. ఆయన కారు తలుపుకు అయస్కాంత బాంబును అమర్చడం ద్వారా పేల్చివేశారని పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద చర్య వెనుక సిఐఎ హస్తం ఉందని నిరూపించేందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఇరాన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ హత్యను ఖండించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి, భద్రతా మండలికి ఇరాన్‌ విజ్ఞప్తి చేసింది. 2010లో ఇరాన్‌ అణు స్థావరాలకు స్టక్‌నెట్‌ కంప్యూటర్‌ వైరస్‌ను అమెరికా, ఇజ్రాయిల్‌ ప్రయోగించాయి. పరిశ్రమల్లో ఉపయోగించే కంప్యూటర్లను కూడా ఈ వైరస్‌ దెబ్బతీసింది. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వైరస్‌ను అవి ప్రయోగించాయి. ఇరాన్‌ గగనతలంలో సాయుధ ద్రోణ్‌ విమానాల విహారానికి ఒబామా ప్రభుత్వం అనుమతించింది. అమెరికాకు చెందిన ఆర్‌కు 170 సెంటినెల్‌ స్టీల్త్‌ ద్రోణ్‌ను గత డిసెంబర్‌లో ఇరాన్‌ దింపేసిన తరువాత అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 50 వేల అడుగుల ఎత్తున ప్రయాణించగల ద్రోణ్‌ అమెరికా విమానాల్లో అత్యంత ఆధునికమైంది. ఈ విమానాన్ని ఇరాన్‌ ప్రదర్శనలో పెట్టింది. దీనిని వెనక్కు పంపాలని అమెరికా చేసిన డిమాండ్‌ను ఇరాన్‌ తోసిపుచ్చింది. ద్రోణ్‌ ఇరాన్‌ గగనతలంలో నిఘా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అవి ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాదులపై ప్రయోగించడానికి ఉద్దేశించినవి కావు. యుద్ధం ముప్పును ఇరాన్‌ కూడా తేలికగా తీసుకోవడం లేదు. తన రివల్యూషనరీ గార్డ్స్‌ను సన్నద్ధంగా ఉంచింది. వైమానిక దళాన్ని అప్రమత్తం చేసింది. గత డిసెంబర్‌ నుండి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. దాడి చేస్తే గట్టిగా బుధ్ధి చెబుతామని అది అమెరికా, ఇజ్రాయిల్‌ను హెచ్చరించింది.ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం తగదని చైనా, రష్యా పేర్కొన్నాయి. ఇటువంటి చర్యలు ఇరాన్‌ను తిరిగి చర్చలకు ఒప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఆటంకం కలగజేస్తాయని అవి పేర్కొన్నాయి.

***** Article From  PRAJASAKTI  NEWS Paper Link www.prajasakti.com written by యొహానన్‌ చామరపల్లి