మొన్న ఇరాక్... నిన్న ఆఫ్ఘనిస్తాన్... నేడు  లిబియా... ప్రపంచ రక్షకుడిగా చెప్పుకుంటున్న అమెరికా తాజాగా లిబియాను  భక్షించింది. ప్రపంచ పోలీసు అవతారమెత్తి తనకు ఎదురు తిరిగే దేశం పాలిట  విలన్గా మారడం అమెరికా ఆనవాయితీ. ఆ ఆనవాయితీని నిజం చేస్తూ 42 ఏళ్లుగా తన  కంట్లో నలుసుగా ఉన్న లిబియా అధినేత కల్నల్ గడాఫీని పాశవికంగా వెంటాడి,  వేటాడి హత్య చేసింది. గ్లోబలీకరణ... ప్రపంచీకరణ పేరుతో మరో గ్లో'బలి'కి  పాల్పడింది. లిబియాలో ఉన్న అపార చమురు సంపదపై కన్నేసిన అమెరికా దాని మిత్ర  పక్షాలు ఆ దేశాన్ని కబళించాయి. అంతటితో ఊరుకోకుండా ఆ దేశాన్ని ఎప్పటికీ తన  చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు అధ్యక్షుడు గడాఫీని బలి తీసుకుంది.
తమ  దేశంలోని ఆర్థిక మాంద్యం, నిరుద్యోగాన్ని పరిష్కరించలేని అమెరికా  ప్రపంచంలోని ఇతర దేశాల సమస్యలను పరిష్కరిస్తానని బయలుదేరింది. మానవ  హక్కులను కాపాడతాననే నెపంతో తనకు కంటగింపుగా ఉన్న దేశాలపైకి బాంబుల వర్షం  కురిపిస్తూ లక్షలాది మందిని బలి తీసుకుంటోంది. అమెరికా పెత్తనాన్ని  వ్యతిరేకించిన లిబియా అధ్యక్షుడిగా గడాఫీని నాటో దళాల ముసుగులో అదును చూసి  చంపేసింది. అంతటితో ఊరుకోకుండా ప్రపంచంలోనే అతి నాణ్యమైన చమురు సంపదను  కొల్లగొట్టడానికి రంగం సిద్ధం చేసింది. 42 ఏళ్లుగా చెప్పుకోదగ్గ జీవన  ప్రమాణాలతో విలసిల్లుతున్న లిబియన్లను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి  ప్రణాళిక రచించింది. 27 ఏళ్లకే అధికారం చేపట్టి 42 ఏళ్లు అప్రతిహతంగా  పరిపాలించిన గడాఫీ లిబియాను ఆఫ్రికాలోనే అత్యంత ధనిక దేశంగా నిలిపాడు.  1969లో రక్తపాత రహిత తిరుగుబాటుతో ఈ పోలీసు అధికారి లిబియా గద్దెనెక్కాడు.  యునెస్కో లెక్కల ప్రకారమే లిబియాలో అక్షరాస్యత శాతం 83. యువకుల్లో 99.9  శాతం మంది అక్షరాస్యులు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్ఓ)  లెక్కల ప్రకారం వైద్య సేవలందించడంలో ఆఫ్రికాలోనే లిబియా అగ్రస్థానంలో ఉంది.
 ఇటలీ వలస రాజ్యంగా...
ఇటలీ వలస రాజ్యంగా...
వేలాది  సంవత్సరాల క్రితం లిబియాలోని 90 శాతం భూమి సహారా ఎడారితోనే నిండి ఉంది.  భౌగోళిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 8000 బిసి నుండే ఇక్కడ జనజీవనం  కొనసాగింది. ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. ఎడారిలో  అక్కడక్కడ పారే చిన్న వాగులు, కాలువలను ఆధారం చేసుకొని లిబియన్లు వ్యవసాయం  కొనసాగించేవారు. రాళ్లపై పెయింటింగ్కు అక్కడి పర్వతాలు చారిత్రక  నిదర్శనంగా నిలిచాయి. 1000 బిసిలో ఫెజాన్ ప్రజలను గిరిజనులుగా  పరిగణించేవారు. 500 బిసి నుండి 500 ఎడి మధ్య కాలంలో స్థానిక పాలనలో ఉంది.  తూర్పు ప్రాంత ప్రజలు, సహారా ప్రాంతంలో స్థిరపడిన ప్రజలు రావడంతో లిబియా  నాగరికతను సంతరించుకుంది. ఫియోనిసియన్లు లిబియన్లతో తొలుత వ్యాపార  లావాదేవీలు నిర్వహించారు.
లిబియా తీర ప్రాంతమైన ఓయె,  లిబ్దాV్ా, సబ్రతా నగరాలు కలిసి ప్రస్తుత ట్రిపోలీ (మూడు నగరాలు)గా  రూపాంతరం చెందింది. ఇటలీ ఆక్రమించుకున్న తర్వాత 1912 - 27 మధ్యకాలంలో  లిబియాను ఇటాలియన్ ఉత్తర ఆఫ్రికాగా పిలిచారు. 1927-34 మధ్యకాలంలో  ఇటాలియన్ సైరేనైకా, ఇటాలియన్ ట్రిపోలిటానియా అనే రెండు ప్రాంతాలుగా  విభజించబడింది. ఈ రెండు ప్రాంతాలు ఇటలీ ప్రభుత్వ పాలనలో ఉండేవి. ఆ కాలంలో  లక్షా 50 వేల మంది ఇటాలియన్లు (లిబియా జనాభాలో 20 శాతం) ఇక్కడ  స్థిరపడ్డారు. సైరేనైకా, ట్రిపోలిటానియా, ఫెజాన్ అనే మూడు ప్రాంతాలను  కలిపి లిబియాగా 1934లో ఇటలీ స్థిరీకరించింది. లిబియా రెండు ప్రపంచ యుద్ధాల  సమయాల్లోనూ ఇటలీ ఆధీనంలోనే ఉంది. 1943-51 మధ్యకాలంలో ట్రిపోలిటానియా,  సైరేనైకాలు బ్రిటిష్ పాలనలో ఉన్నాయి. ఫెజాన్ను ఫ్రాన్స్ ఆధీనంలో  ఉంచుకున్నది.
951లో స్వాతంత్య్రం
లిబియాకు  జనవరి1, 1952లోపు స్వాతంత్య్రం ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి నవంబర్ 21,  1949లో తీర్మానం చేసింది. దానికి అనుగుణంగానే డిసెంబర్ 24, 1951లో  లిబియాకు స్వాతంత్య్రం వచ్చింది. యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ లిబియాకు  రాజుగా ఇద్రిస్ నియమితులయ్యాడు. లిబియా రాజ్యాంగం ప్రకారం రాజు ఇద్రిస్  పాలనలో లిబియా నేషనల్ అసెంబ్లీతో పాటు ఒక అధ్యక్షుడు (మహ్మద్ అబ్దులాస్  ఎల్ ఆలెమ్), ఇద్దరు ఉపాధ్యక్షులు (ఒమర్ ఫేక్ షెనిబ్, అబూబకర్ అహ్మద్  అబూబకర్) నియమితులయ్యారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి లిబియా ఉత్తర  ఆఫ్రికాలో నిరుపేద గిరిజన దేశంగానే ఉండేది. ఇది ఆఫ్రికాలో నాలుగో పెద్ద  దేశం, ప్రపంచంలో 17వ పెద్ద దేశం. సాంప్రదాయకంగా లిబియా ట్రిపోలిటానియా,  ఫెజాన్, సైరేనైకా అనే మూడు ప్రాంతాలు కలిగి ఉంది. 1951లో స్వాతంత్య్రం  పొంది యునైటెడ్ లిబియన్ కింగ్డమ్గా అవతరించింది. 1959లో చమురు  నిక్షేపాలు బయటపడిన తర్వాత లిబియా శుద్ధమైన చమురు నిక్షేపాలు గల పదవ  అతిపెద్ద దేశంగా, పెట్రోలియం నిక్షేపాలు గల 17వ అతిపెద్ద దేశంగా  ఘనతకెక్కింది. 1963లో దానిపేరును కింగ్డమ్ ఆఫ్ లిబియాగా మార్చారు.  1969లో జరిగిన రక్తపాత రహిత విప్లవంలో కల్నల్ గడాఫీ అధికారాన్ని  చేజిక్కించుకున్నాడు. తర్వాత దేశం పేరును లిబియన్ అరబ్ రిపబ్లిక్  (అల్-జమూరియా అల్ అరబియా అల్-లిబియా)గా మార్చాడు. గడాఫీ కొన్ని  సోషలిస్టు విధానాలను అవలంభించడంతో ఆ దేశాన్ని 1977-86 మధ్య కాలంలో  'సోషలిస్ట్ పీపుల్స్ లిబియన్ అరబ్ జమాహిరియా' అని, 1986-2011 మధ్య  కాలంలో 'గ్రేట్ సోషలిస్ట్ పీపుల్స్ లిబియన్ అరబ్ జమాహిరియా' అని  పిలిచారు. ఇప్పుడు కొత్తగా అధికారం చేపట్టిన నేషనల్ ట్రాన్సిషనల్  కౌన్సిల్ (ఎన్టిపి) 'లిబియన్ రిపబ్లిక్' అని మార్చారు.
దేశం : లిబియా
రాజధాని : ట్రిపోలి
అధికారిక భాష : అరబిక్
స్వాతంత్య్రం  పొందింది : ఫిబ్రవరి 10, 1947 (ఇటలీ నుండి ఐక్యరాజ్య సమితి ట్రస్టీషిప్లో  యునైటెడ్ కింగ్డమ్ @ ఫ్రాన్స్ల ఆధీనంలోకి మారింది)
డిసెంబర్ 24 1951 (యునైటెడ్ కింగ్డమ్ & ఫ్రాన్స్ ఆధీనం నుండి కూడా స్వాతంత్య్రం పొందింది)
జనాభా : 66 లక్షలు
విస్తీర్ణం : 17,59,541 చదరపు కిలోమీటర్లు
ప్రధాన ఆదాయ వనరు : చమురు
కరెన్సీ : దీనార్
రాష్ట్రాలు : ట్రిపోలిటానియా, బర్కా, ఫెజాన్ప్రధాన నది : మన్మేడ్ నది (సహారా ఎడారిలో)
 గడాఫీ పాలన...
గడాఫీ పాలన...
1959లో  చమురు నిక్షేపాల వెలికితీతతో అతిపేద గిరిజన దేశం అకస్మాత్తుగా ఆఫ్రికాలోనే  అత్యంత ధనిక దేశంగా అవతరించింది. చమురు విక్రయంతో ప్రభుత్వ ఆదాయం భారీ  స్థాయిలో పెరిగింది. ప్రభుత్వ ఆదాయం పెరగడంతో ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు  ఇద్రిస్ భోగభాగ్యాల్లో మునిగిపోయాడు. ప్రజా సంపదను సొంతానికి వాడుకుంటూ  ప్రజల పేదరికాన్ని పట్టించుకోలేదు. పాలన స్థంభించింది. లిబియాలో  ఇంజనీరింగ్ ప్రాజెక్టులను, ఆ దేశానికి ఆయుధాలను బ్రిటన్ ఎక్కువగా సరఫరా  చేసింది. అమెరికా కూడా లిబియాలో అతిపెద్ద ఎయిర్బేస్ను ఏర్పాటు చేసింది.  అమెరికా, బ్రిటన్ దోపిడీలు పెరగడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.  సెప్టెంబర్ 1, 1969లో 27 ఏళ్ల యువ మౌమ్మర్ గడాఫీ నేతృత్వంలో చిన్న  మిలిటరీ అధికారుల గ్రూపు తిరుగుబాటు చేసింది. గడాఫీని ''సోదర నాయకుడు,  తిరుగుబాటుకు మార్గదర్శకుడు''గా పేర్కొన్నారు. రాజు ఇద్రిస్  ప్రతిఘటించకుండానే పాలనాధికారాలను గడాఫీ బృందానికి అప్పగించాడు. గడాఫీ  పాలనా పగ్గాలు చేపట్టగానే దేశంలో మార్పులు చేపట్టాడు. రేడియో,  టెలివిజన్లను ప్రభుత్వ ఆధీనం చేశాడు. ప్రధానంగా కంపెనీలను,  విద్యావ్యవస్థలను ప్రభుత్వపరం చేశాడు. చమురును జాతీయం చేశాడు. 1977లో  లిబియాను 'సోషలిస్టు పీపుల్స్ లిబియన్ అరబ్ జమాహిరియా'గా ప్రకటించాడు.  దేశంలో గల 66 లక్షల మందికి ఉచిత విద్య, వైద్యంతో పాటు నిత్యావసర వస్తువులు  ఉచితంగా అందించాడు. చదువుపై ఆసక్తి ఉండాలే కాని లిబియాలో ప్రోత్సాహానికి  కరువులేదు. విదేశాల్లో చదవాలనుకునే వారందరికీ అయ్యే ఖర్చును ప్రభుత్వమే  భరిస్తుంది. అయితే తాము సంపాదించిన జ్ఞానాన్నంతా మళ్లీ దేశాభివృద్ధికే  వెచ్చించాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తారు. లిబియన్లు ఆస్పత్రి మెట్లు  ఎక్కిననాటి నుండి ఇంటికి వెళ్లే వరకూ చిల్లి గవ్వ కూడా చెల్లించాల్సిన  అవసరం లేదు. ఎంతటి అనారోగ్యమైనా ప్రభుత్వమే భరిస్తుంది. విదేశాల నుండి  మందులు, వైద్యులను తెప్పించి మరీ సేవలు అందిస్తుంది. కరెంటు బిల్లులు  చెల్లించాల్సిన అవసరం లేదు. అవసరార్థం డబ్బులు కావాల్సి వస్తే లిబియా  బ్యాంకులు వడ్డీ లేని రుణాలు అందిస్తాయి. యువతీ యువకులు పెళ్లి చేసుకుంటే  50 వేల డాలర్లు బహుమతిగా ఇస్తుంది. ఇల్లు కొనుక్కుని స్థిరపడేందుకు ఆర్థిక  సహాయం కూడా చేస్తుంది. వ్యవసాయం చేయాలనుకునే వారికి భూమి, అవసరమైన  పనిముట్లు, విత్తనాలు సమకూర్చి అండగా నిలుస్తుంది. కారు కొనుక్కువాలనుకునే  వారికి సగం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. భారత్ నుండే కాదు  అగ్రరాజ్యాలుగా చెలామణి అవుతున్న అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాల  ప్రజలు కూడా ఉద్యోగాల కోసం పొట్ట చేతబట్టుకొని ఇతర దేశాలకు వలస వెళ్తారు.  కానీ ఒక్క లిబియా పౌరుడు కూడా ఇతర దేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లిన సందర్భం  లేదు. పైపెచ్చు ఇతర దేశస్తులను ఉద్యోగం కోసం ఆ దేశానికే వలస వెళ్తారు. ఇదీ  లిబియా ప్రత్యేకత. ఆఫ్రికా దేశాల్లో లిబియా ఒక స్విట్జర్లాండ్ వంటిదని  ఇటలీ జర్నలిస్టు వైవోన్ పేర్కొన్నారు.
లిబియాను 'ధనిక మధ్య  తరగతి ఆదాయం' గల దేశంగా ప్రపంచ బ్యాంకు కూడా కొనియాడింది. అప్పులేని దేశం  లిబియా. 1980 వచ్చే సరికి ధనిక దేశాల సరసన నిలిచింది. ఇటలీ, సింగపూర్,  దక్షిణ కొరియా, స్పెయిన్, న్యూజిలాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే  లిబియాలోనే జిడిపి వృద్ధిరేటు ఎక్కువగా ఉంది. లిబియన్లను ప్రపంచంలోనే  అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత గడాఫీకే దక్కింది.
మరి వ్యతిరేకత ఎందుకు..?
లిబియాలో  తన కీలుబొమ్మ రాజు ఇద్రిస్ను తొలగించి గడాఫీ అధికారం చేపట్టగానే  అమెరికాకు వ్యతిరేకమైన చర్యలు చేపట్టాడు. అధికార పగ్గాలు చేపట్టగానే  అమెరికన్, బ్రిటన్ సైనిక స్థావరాలను తొలగించాడు. అంతర్జాతీయ వేదికలపై  అమెరికా పెత్తనాన్ని సవాలు చేశాడు. చమురు సంపద విలువను తెలియజెప్పి దీన్ని  ఇతర దేశాలు కొల్లగొట్టుకోకుండా కాపాడాల్సిన బాధ్యత తమదేనని లిబియన్లలో  నింపాడు. అలీనోద్యమంలో ముఖ్య పాత్రధారిగా ఉంటూ ఆఫ్రికా దేశాల ఐక్యత కోసం  పరితపించాడు. సోవియట్ రష్యా నేతృత్వంలోని సోషలిస్టు కూటమితో సన్నిహితంగా  ఉంటూ సామ్రాజ్యవాదాన్ని సవాల్ చేశాడు. తమ భూభాగం కోసం పోరాడుతున్న  పాలస్తీనా ప్రజలకు అండగా నిలిచాడు. ఇజ్రాయిల్ జాత్యాహంకారాన్ని  నిర్ద్వందంగా ఖండించాడు. ఇజ్రాయిల్ దాడులకు బలవుతున్న లెబనాన్కు మద్దతుగా  నిలిచాడు. అంతేకాదు ఇజ్రాయిల్తో ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సాదత్  శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల ఆగ్రహించి ఆ దేశంపై శతఘ్నులు, ఫిరంగులతో  దాడులు చేశాడు.
ఈ చర్యలే అమెరికాకు కంటగింపుగా మారాయి. 80వ  దశకంలో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, ఇంగ్లండ్ ప్రధాని మార్గరెట్  థాచర్లు తమ అభివృద్ధి నిరోధక ప్రయత్నాలకు అడ్డుగా నిలిచిన లిబియాతో ఘర్షణ  వైఖరి అవలంబించాయి. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ అమెరికా చేసిన పనిని  లిబియాపైకి నెట్టింది. యూరప్లో ఒక హోటల్పై దాడి, అమెరికా విమానం  కూల్చివేత వంటి ఆరోపణలు గడాఫీపై మోపి అతడిపై క్రిమినల్గా ముద్ర వేయడానికి  ప్రయత్నించాయి. 1986లోనే లిబియాపై, గడాఫీ నివాసంపై అమెరికా వైమానిక దాడులు  చేసి ఆయన పెంపుడు కూతుర్ని చంపేసింది. గడాఫీపై ఎన్నో హత్యాయత్నాలు జరిగాయి.  గడాఫీ లిబియాలో ఎన్నికలు జరపలేదని, అక్కడ ప్రజాస్వామ్యం లేదని, మానవ  హక్కులు మృగ్యమని అమెరికా ప్రచారం చేసింది. కార్పొరేట్ మీడియా దానికి  వంతపాడింది.
 సోవియట్ పతనంతో గడాఫీ వైఖరిలో మార్పు
సోవియట్ పతనంతో గడాఫీ వైఖరిలో మార్పు
సోవియట్  యూనియన్ పతనంతో గడాఫీ వైఖరిలో మార్పు వచ్చింది. విమానం పేల్చివేతకు  కారకుడైనట్లు ఆరోపిస్తున్న వ్యక్తిని అమెరికాకు అప్పగించాడు.  ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లను కబ్జా చేసుకున్న తర్వాత ఇరాన్, లిబియాలపై  అమెరికా దాడిచేస్తుందని ఎప్పుడో స్పష్టమైంది. అయితే గడాఫీ దౌత్య నీతితో  ఇంతకాలం నెట్టుకొచ్చాడు. 9/11 నిందితులలో ఒకడైన అబ్దెలఖిమ్ బెల్వద్జీని  మలేసియాలో 2003లో పట్టుకున్న అమెరికాకు చెందిన సిఐఎ మరుసటి ఏడాది లిబియాకు  అప్పగించింది. అతడ్ని కొంతకాలం జైల్లో ఉంచిన గడాఫీ తర్వాత ఉదారవాద దృష్టితో  విడుదల చేశాడు. అయితే బెల్వద్జీ అప్పటికే సిఐఎ ఏజెంటుగా మారినట్లుంది.  లిబియా ఇస్లామిక్ ఫైటింగ్ గ్రూప్ (ఎల్ఐఎఫ్జి) పేరుతో ఒక ఛాందస వాద  సంస్థను ఏర్పాటు చేశాడు. అల్ఖైదా అధినేత బిన్లాడెన్ను పెంచి  పోషించినట్లు బెల్వద్జీని కూడా అమెరికా పెంచి పోషించింది. అతడు గడాఫీపైనే  దాడికి దిగాడు. ఇస్లామిక్ ఉగ్రవాదంపై పోరాటమే తన ధ్యేమని చెప్పే అమెరికా  తన వత్తాసుతో పలికే నాటోను లిబియాలో దించాడు. నాటో కూటమి బెల్వద్జీ సంస్థకు  అండగా నిలిచి లిబియాలో వ్యతిరేకతను ప్రోత్సహించింది. అరబ్ దేశాల్లోని  సిరియా, ఈజిప్టుల్లో మాదిరిగా లిబియాలో కూడా తిరుగుబాటు దారులు  పురోగమించారు. అయితే గడాఫీ ఆయన కుమారుడు వారిని నిలువరించేందుకు  ప్రయత్నించారు. తిరుగుబాటు దారులు ఆక్రమించుకున్న రాజధాని ట్రిపోలీని, ఇతర  ప్రాంతాలను మళ్లీ తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు గడాఫీ దళం ప్రయత్నించింది.  అయితే అమెరికా కనుసన్నల్లో నడిచే ఐక్యరాజ్య సమితి ట్రిపోలీని 'నో ఫ్లై  జోన్'గా మార్చి 17న ప్రకటించింది. ఆ ప్రాంతాన్ని కాపాడే బాధ్యతను నాటో  దళాల ముసుగులో ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ కూటమిలోని సైనికులు తమకుతామే  స్వీకరించారు. ట్రిపోలీని కాపాడతామని వాగ్దానం చేసిన ఈ నాటో దళాలు లిబియాలో  గడాఫీ అనుకూల దళాలను తుదముట్టించే పనిలో పడ్డాయి. ఏప్రిల్ 20వ తేదీన  గడాఫీ నివాసాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో గడాఫీ తన స్వస్థలం  సిర్తేలో తలదాచుకోవాల్సి వచ్చింది. ట్రిపోలీని కాపాడతామని వచ్చిన నాటో  దళాలు గడాఫీని వెంటాడి, వేటాడి హత్య చేయడం వారి దుర్మార్గానికి నిదర్శనం.  గడాఫీ మరణం తర్వాత లిబియాలో శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయని, మానవహక్కులు  వర్థిల్లుతాయని భావించలేం. మాజీ సోషలిస్టు దేశాలతోపాటు ఆఫ్ఘనిస్తాన్,  ఇరాక్లో అమెరికా నమ్మిన బంటైన పాకిస్తాన్లో ఎలాంటి పరిస్థితులున్నాయో మనం  చూస్తూనే వున్నాం.
 
 నాటో దళాలు
నాటో  (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) ఏప్రిల్ 4, 1949లో  ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్లో ఉంది.  ప్రధానంగా అగ్రదేశాల రాజకీయ ప్రయోజనాలను కాపాడే సంస్థ ఇది. అమెరికాకు  చెందిన సైనికాధికారులు నేతృత్వంలోకి నాటో వెళ్లాక వివిధ దేశాల్లో నాటో దళాల  రాజకీయ జోక్యం మరీ పెరిగింది. నాటోపై ప్రపంచ దేశాలకు నమ్మకం పోయింది. నాటో  దళం తొలిసారి యుగోస్లావియాలో జోక్యం చేసుకుంది. 1991-95 మధ్యకాలంలో నాటో  బోస్నియాలో సైనిక చర్యను చేపట్టింది. 1999లో యుగోస్లావియాలోనూ జోక్యం  చేసుకుంది. 9/11 నాడు తమ దేశంపై జరిగిన దాడులను 19 నాటో సభ్య దేశాలపై  జరిగిన దాడిగా గుర్తించాలని అమెరికా తీర్మానం చేయించింది. 9/11ను సాకుగా  చేసుకున్న అమెరికా తన శత్రు దేశాలపై దాడులకు నాటోను పావుగా  ఉపయోగించుకోనారంభించింది. ఆఫ్ఘనిస్తాన్లో జోక్యం చేసుకొని తాలిబన్లను  మట్టికరిపించి అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవరకూ నాటో దళం ఆ  దేశంలో తిష్టవేసింది. ఇరాక్లోని చమురు సంపదపై కన్నేసిన అమెరికా సద్దాం  హుస్సేన్ను క్రూరంగా చంపి ఆ దేశంలోనే తమ నమ్మిన బంటును నియమించుకుంది.  ఇప్పుడు లిబియాలోనూ తిరుగుబాటు దళాలకు మద్దతుగా ఆ దేశ రాజధాని ట్రిపోలీని  నో-ఫ్లై జోన్గా ప్రకటించి ఆ నగరాన్ని కాపాడేందుకు మాత్రమే అక్కడికి  వెళ్తున్నట్లు చెప్పింది. కానీ గడాఫీని హత్యచేసి తిరుగుబాటు దళాలు  చంపినట్లు అబద్ధాలు ఆడింది. అమెరికా నేతృత్వంలో ఏ దేశంలోనైనా అక్రమంగా  ప్రవేశించి అక్కడి అమాయక ప్రజలను దారుణంగా చంపడమే పనిగా నాటో దళాలు  పెట్టుకున్నాయి. ఇది అంతర్జాతీయ ఉగ్రవాది అమెరికాకు నమ్మినబంటుగా  వ్యవహరిస్తూ ఇతర దేశాల విశ్వాసాన్ని కోల్పోయాయి. నాటోలో ఏప్రిల్ 2009న  కొత్తగా అల్బేనియా, క్రొయేషియా చేరాయి. డిసెంబర్ 16, 2002లో కుదిరిన  బెర్లిన్ ప్లస్ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఎక్కడైనా సంక్షోభం  తలెత్తితే స్వతంత్య్రంగా జోక్యం చేసుకునే హక్కు నాటోకు ఉంది. ఈ ఒప్పందం  నాటో, యూరోపియన్ దేశాల మధ్య కుదిరింది. నాటో 28 దేశాల కూటమి అయినా అందులో  అమెరికా 43 శాతం, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలు 15 శాతం  చొప్పున సైనిక శక్తి కలిగి ఉన్నాయి.
యువతలో అసంతృప్తి
లిబియాను  గడాఫీ అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలబెట్టి అందరి మన్ననలు పొందాడు.  అయితే ఇటీవల యువతరం ఆయనపై అసంతృప్తిని పెంచుకుంది. లిబియాలో కీలకమైన  విభాగాల్లో విదేశీ ఉద్యోగస్తులే ఉన్నారు. ఎంత ఉన్నత విద్యను అభ్యసించినా  ఉద్యోగం దొరకడం కష్టమైంది. దీంతో కొత్త తరం ప్రజల్లో నిరుద్యోగిత  పెరిగింది. లిబియన్ యువకుల్లో చాలా మంది తమ కారును ట్యాక్సీగా మార్చి  జీవించాల్సి వచ్చింది. ఉన్నత చదువులు చదివిన తమకు ఉద్యోగాలు లభించడం లేదన్న  అసంతృప్తి వాళ్లలో పెరిగింది. యువతలోని ఈ బలహీనతను బెల్వద్జీ నేతృత్వంలోని  లిబియా ఇస్లామిక్ ఫైటింగ్ గ్రూప్ (ఎల్ఐఎఫ్జి) సొమ్ముచేసుకుంది.  యువతలో మతోన్మాదాన్ని నింపి గడాఫీకి వ్యతిరేకంగా ఉసిగొల్పింది. వాళ్లకు  అమెరికా వెన్నుదన్నుగా నిలిచింది.
ఇక కుక్కలు చింపిన విస్తరే...
అమెరికా  విష కౌగిలిలో లిబియా ఇక కుక్కలు చింపిన విస్తరిగా మారనుంది. నేషనల్  ట్రాన్సిషనల్ కౌన్సిల్ (ఎన్టిసి) పేరుతో ఆ దేశంలో అమెరికా కీలుబొమ్మ  ప్రభుత్వం ఏర్పాటైంది. ఆఫ్రికాలోనే అత్యంత ధనిక దేశంగా ఓ వెలుగు  వెలుగుతున్న లిబియా ప్రధాన వనరు చమురు. ఈ చమురును అమెరికా, ఫ్రాన్స్,  ఇంగ్లండ్లు ఎగరేసుకుపోవడం మాత్రం ఖాయం. 99.9 శాతం విద్యావంతులు గల ఆ దేశ  ప్రజలు తమ దేశంలోనే పరాయివాళ్లుగా బతకాల్సి వస్తుంది. ప్రజలందరికీ అన్నీ  ఉచితం పేరిట ఒక విధమైన సోషలిజం పరిఢవిల్లుతున్న లిబియాలో అమెరికా మెల్లగా  తన పెట్టుబడిదారీ విధానాన్ని చొప్పించడానికి వెనకాడదు. లిబియాను కూడా తన  మార్కెట్గా మార్చుకొని అక్కడి సహజవనరులను కొల్లగొట్టుకొని పోయేందుకు రంగం  సిద్ధం చేసుకుంది. గడాఫీ బతికుండగానే ఇంగ్లండ్ ప్రధాని కామెరూన్,  ఫ్రాన్స్ అధ్యక్షుడు సర్కోజీ లిబియాకు వెళ్లి తమ కాంట్రాక్టులకు  సంబంధించిన విషయాలపై ఒక ఒప్పందానికి వచ్చారు. లిబియాపై వచ్చే ఆదాయం అగ్ర  రాజ్యాల మధ్య స్నేహాన్ని పెంచుతుందా లేక వారి మధ్య వైరుధ్యాలను మరింత  పెంచుతుందా అనేది చూడాలి.
*
Article from prajasakti Daily written by Md.Hassan Sharif. visit www.prajasakti.com